ప్రధాన మంత్రి కార్యాలయం
సైప్రస్ అధ్యక్షుడితో సంయుక్త మీడియా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
22 MAY 2026 3:14PM by PIB Hyderabad
గౌరవనీయులైన సైప్రస్ అధ్యక్షుడు,
ఇరుదేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులారా,
నమస్కారం!
శుభోదయం
సైప్రస్ అధ్యక్షుడు, వారి ప్రతినిధి బృందానికి భారతదేశానికి స్వాగతం పలకటం ఎంతో సంతోషంగా ఉంది. గౌరవ అధ్యక్షుడు గతేడాది సైప్రస్లో మాకు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు. భారతదేశం పట్ల మీకున్న ప్రత్యేకమైన స్నేహపూర్వక భావనకు ప్రతీకగా సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారంతో నన్ను గౌరవించారు.
పర్యటన సందర్భంగా మీ ఆప్యాయత, స్నేహం, భారతదేశంతో మీకున్న బలమైన అనుబంధాన్ని మేం మనస్ఫూర్తిగా అనుభూతి చెందాం. నేడు మీ భారత పర్యటన.. మన ఉమ్మడి ప్రయాణంలో మరో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.
మిత్రులారా,
భారత్, సైప్రస్ మధ్య స్నేహం ఎంతో బలమైనది. భవిష్యత్ దృష్టితో కూడినది. ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన వంటి విలువలతో ఉమ్మడి విశ్వాసమే భాగస్వామ్యానికి ఆధారం. మేం అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. ఈ సూత్రాలకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉంది. భవిష్యత్తులోనూ అలాగే ఉంటుంది.
భారత్, యూరప్ సంబంధాలు నేడు నూతన స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్న తరుణంలో సైప్రస్ కేవలం కౌన్సిల్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్ అధ్యక్ష దేశంగా మాత్రమే కాక, యూరప్ను భారత్తో అనుసంధానించే పెట్టుబడి ద్వారంగా ఆవిర్భవిస్తోంది.
మిత్రులారా,
భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అగ్ర 10 దేశాల్లో సైప్రస్ ఒకటి. గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుంచి భారత్లోకి పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయి. ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం మరింత బలపడింది. భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఎన్నో కొత్త అవకాశాలను సృష్టించింది. ఈ ఉత్సాహంతో రాబోయే ఐదేళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఉమ్మడి దార్శనికతను సాకారం చేసేందుకు నేడు మన విశ్వసనీయ సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్తున్నాం.
మిత్రులారా,
ఇరుదేశాల ఆర్థిక, సేవా రంగ కేంద్రాలను అనుసంధానించటం ద్వారా భారత్, సైప్రస్ మధ్య ఏర్పడిన ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం.. వాణిజ్యం, పెట్టుబడులకు సరికొత్త అవకాశాలను సృష్టిస్తుంది. ఇది సైప్రస్లోని మౌలిక సదుపాయాలు, ఇంధనం, వ్యవసాయ రంగాల్లో భారతీయ కంపెనీలకు నూతన అవకాశాలను కల్పిస్తుంది. భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న షిప్పింగ్, సముద్ర రవాణా పరిశ్రమల్లో మరింత పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది.
ప్రపంచ ఆర్థిక, సేవల కేంద్రంగా గిఫ్ట్ సిటీని మార్చాలనే ఆలోచనను సైప్రస్తో కలిసి మేం మరింత వేగవంతం చేస్తాం. ఇరుదేశాల ఆవిష్కరణలు, అంకుర సంస్థల వ్యవస్థల మధ్య అనుసంధానాన్ని పెంపొందిస్తాం.
మిత్రులారా,
మన సంబంధాల్లో రక్షణ, భద్రతా సహకారం కీలకమైనది. ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య సైనిక మార్పిడులు, శిక్షణా సహకారం పెరగటం సంతోషకరం. సైబర్, సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఇవాళ మేం నిర్ణయించాం. అంతేకాక ఇండో-పసిఫిక్ మహాసముద్రాలు, భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ వంటి కీలక కార్యక్రమాల ద్వారా పరస్పర అనుసంధానానికి మేం కలిసి పనిచేస్తాం.
మిత్రులారా,
సైప్రస్లో నివసిస్తున్న భారత నిపుణులు, విద్యార్థులు ఇరుదేశాల మధ్య ప్రజల సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ సంబంధాలను మరింత పటిష్ఠం చేసేందుకు త్వరలోనే సమగ్ర వలస, గమనశీలత భాగస్వామ్యంతో పాటు సామాజిక భద్రతా ఒప్పందంపై కలిసి పనిచేసేందుకు మేం అంగీకరించాం.
సంస్కృతి, ఉన్నత విద్యా రంగాల్లోనూ ఒప్పందాలపై నేడు మనం సంతకాలు చేస్తున్నాం. ఇవి ఇరుదేశాల మధ్య సాంస్కృతిక మార్పిడిని, పరిశోధన సహకారాన్ని మరింత బలపరుస్తాయి.
మిత్రులారా,
ముఖ్యమైన ప్రపంచ సమస్యలపై ఇవాళ మనం చర్చించాం. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు జరిగే ప్రయత్నాలకు, ఘర్షణలు త్వరగా ముగిసేందుకు మా మద్దతును కొనసాగిస్తాం. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావటం అత్యవసరం, ఆవశ్యకమని మేం భావిస్తున్నాం.
గౌరవనీయులారా,
భారత్, సైప్రస్ మధ్య బంధం కాలపరీక్షకు నిలిచి పటిష్ఠంగా కొనసాగుతోంది. భారత్-సైప్రస్ వ్యూహాత్మక భాగస్వామ్య ఏర్పాటుతో నూతనోత్తేజం, ఆశయాలు, వేగంతో మన సంబంధాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
మన మధ్య సహకారాన్ని ఉమ్మడి సృజనాత్మకతగా, భాగస్వామ్యాన్ని పరస్పర సంక్షేమంగా మార్చుకునేందుకు కలిసి పనిచేద్దాం.
భారత్, సైప్రస్ కలిసికట్టుగా సురక్షిత, సంపన్న, మెరుగైన భవిష్యత్తును నిర్మిస్తాయి.
ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం. అసలు ప్రసంగం హిందీలో ఇచ్చారు.
****
(రిలీజ్ ఐడి: 2264729)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5