ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 MAY 2026 10:26PM by PIB Hyderabad
ఓస్లోలో జరిగిన భారత్-నార్వే వాణిజ్య, పరిశోధన సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గౌరవ రాజు హాకాన్, నార్వే ప్రధానమంత్రి గౌరవ జోనాస్ గార్ స్టోర్ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఈ సదస్సుకు 50కి పైగా కంపెనీల సీఈలు.. నార్వే, భారత్లోని వాణిజ్య, పరిశోధన సంస్థలకు సంబంధించి 250 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. భారత్-ఈఎఫ్టీఏ వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చాక పెరుగుతున్న ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని ఈ సదస్సు స్పష్టం చేసింది.
ఉన్నత స్థాయి వాణిజ్య, పరిశోధన సదస్సుకు ముందుగా ఓస్లోలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రౌండ్టేబుల్ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశాలు ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు, నౌకాయాన సహకారం, బ్యాటరీలు, ఇంధన నిల్వ వ్యవస్థలు, డిజిటలైజేషన్, విద్యుద్దీకరణ, పవన విద్యుత్ అంశాలపై దృష్టి సారించాయి.
ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. టీఈపీఏ ఒప్పందం అమల్లోకి వచ్చాక ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టీఈపీఏ ఒప్పందం ద్వారా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని సాధించేందుకు, భారత్లో ఒక మిలియన్ ఉద్యోగాలను సృష్టించేందుకు ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని స్పష్టం చేశారు. భారతదేశ బలమైన వృద్ధి, జనాభా ప్రయోజనాలు, ప్రతిభ, ఉన్నత ఆశయాలు గల యువత, పటిష్ఠమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ వ్యవస్థ, పోటీతత్వ సమాఖ్యవాద స్ఫూర్తి గురించి వివరించారు. నీలి ఆర్థిక వ్యవస్థ, నౌకా నిర్మాణం, పర్యావరణహిత మార్పు, పునరుత్పాదక ఇంధనం, హెల్త్-టెక్, కీలక ఖనిజాలు, అంకుర సంస్థల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో నార్వే పెట్టుబడులను పెంచాలని ప్రోత్సహించారు.
భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పర్యావరణహిత మార్పు అజెండా గురించి ప్రధానమంత్రి మాట్లాడారు. విస్తృతమైన దేశం, పెరుగుతున్న ఇంధన అవసరాలు, వాతావరణ మార్పుల పట్ల ఉన్న నిబద్ధత, పునరుత్పాదక ఇంధనం, గ్రిడ్ మౌలిక సదుపాయాలు, గ్రీన్ హైడ్రోజన్, స్వచ్ఛ ఇంధన రంగాల్లోని వేగవంతమైన వృద్ధిని ఆయన ప్రస్తావించారు. స్వచ్ఛ ఇంధన రంగంలో పెట్టుబడులు, సముద్రయాన రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించటం, సుస్థిరత నెలకొల్పటం, వాతావరణ రంగంలో ఆర్థిక సహాయం వంటి అంశాల్లో ప్రపంచ నాయకత్వ పాత్రను పోషిస్తున్న నార్వేను అభినందించారు. ఇరుదేశాల వాణిజ్య వర్గాలు నూతన భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని, అభివృద్ధి చెందుతున్న సహకార రంగాలను గుర్తించి, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
ఈ సదస్సు సందర్భంగా భారత్, నార్వే కంపెనీలు, సంస్థల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి.
***
(రిలీజ్ ఐడి: 2262653)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam