ప్రధాన మంత్రి కార్యాలయం
నెదర్లాండ్స్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 MAY 2026 3:51PM by PIB Hyderabad
నేడు నెదర్లాండ్స్లోని హేగ్ నగరంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా అక్కడకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రవాస భారతీయులు, భారతీయ మిత్రులు ఆయనకు ఎంతో ఉత్సాహంగా, ఘన స్వాగతం పలికారు.
ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ.. తనకు లభించిన ఉత్సాహభరితమైన, వైభవోపేతమైన స్వాగతం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. డచ్ సమాజ పురోగతికి ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఆయన కొనియాడారు. భారత్-నెదర్లాండ్స్ దేశాల మధ్య స్నేహబంధాన్ని బలోపేతం చేయడంలో వారు ఒక సజీవ వారధిగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. సురినామీ-హిందుస్తానీ సమాజానికి దేశంతో ఉన్న లోతైన, శాశ్వతమైన చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. తరతరాలుగా తమ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ, వేడుకగా జరుపుకుంటున్న వారి ప్రయత్నాలను ఆయన ఎంతగానో అభినందించారు. సాంకేతిక రంగంలో స్థిరపడిన పెద్ద సంఖ్యలోని భారతీయ నిపుణులు, అలాగే డచ్ విశ్వవిద్యాలయాలలో ముఖ్యంగా ఆవిష్కరణల విభాగాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం ఇరు దేశాల ప్రస్తుత భాగస్వామ్యానికి మరింత బలాన్ని చేకూరుస్తోందని చెప్పారు. వీటితో పాటు క్రీడా సంబంధాలు, ముఖ్యంగా క్రికెట్, హాకీ క్రీడలు ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలకు సరికొత్త ఉత్తేజాన్ని ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
భారత్-నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సహకారం నిరంతరం విస్తరిస్తోందని, ఇందులో సాంకేతికత, ఆవిష్కరణలు కీలక రంగాలుగా ఎదుగుతున్నాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య బలపడుతున్న వాణిజ్య, ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడుతూ.. ఐరోపాలో భారత్కు అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానాలలో నెదర్లాండ్స్ ఒకటని, అలాగే అత్యంత కీలకమైన పెట్టుబడి భాగస్వామి అని ఆయన గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు పక్షాలకు మరిన్ని సరికొత్త అవకాశాలను తెరుస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
2047 నాటికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చడమే లక్ష్యంగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి, పురోగతిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మౌలిక సదుపాయాలు, తయారీ రంగం, స్వచ్ఛ ఇంధనం, డిజిటల్ వ్యవస్థలలో విస్తృతమైన పురోగతిని వేగాన్ని, స్థాయిని ఆయన వివరించారు. ప్రపంచ వృద్ధికి, శ్రేయస్సుకు భారత్ తన వంతు సహకారాన్ని అందిస్తూనే, తన సొంత భవిష్యత్తును అత్యంత ఆత్మవిశ్వాసంతో తీర్చిదిద్దుకుంటోందని ఆయన చెప్పారు.
విదేశాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడికి భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రవాస సమాజానికి హామీ ఇచ్చారు. నెదర్లాండ్స్లో తాము గడించిన అనుభవాన్ని ఉపయోగించి, వికసిత్ భారత్ నిర్మాణంలో చురుగ్గా భాగస్వాములు కావాలని ఆయన వారికి పిలుపునిచ్చారు.
ఐరోపాలోని ప్రధాన భూభాగంలో అత్యధిక సంఖ్యలో భారతీయ సంతతి ప్రజలు నెదర్లాండ్స్లోనే నివసిస్తున్నారు. వీరిలో 2,00,000 మంది సూరినామీ-హిందుస్తానీ వర్గానికి చెందిన సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో సూరినామీ-హిందుస్తానీ ప్రవాసుల కోసం ఓసీఐ అర్హతను 4వ తరం నుంచి 6వ తరానికి సరళీకరించిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తుచేశారు. పీఎం పూర్తి ప్రసంగాన్ని చూసేందుకు ఈ లింక్ను క్లిక్ చేయండి.
***
(రిలీజ్ ఐడి: 2261833)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam