ప్రధాన మంత్రి కార్యాలయం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రధానమంత్రి పర్యటన
నాడు పోస్టు చేయడమైనది:
15 MAY 2026 3:59PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అధికారిక పర్యటన చేపట్టారు. ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.
ఇద్దరు నాయకులు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా యూఏఈపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందనీ, ఆ దేశ నాయకత్వానికీ, ప్రజలకూ సంఘీభావం తెలియజేస్తోందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రాంతీయంగా శాశ్వత శాంతికీ, స్థిరత్వానికీ, ఇంధన, ఆహార భద్రతకు కీలకమైన హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా, నిరాటంకమైన నౌకాయానానికి హామీ ఇవ్వాలనే భారత దేశ స్పష్టమైన వైఖరిని కూడా తెలియజేశారు.
ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలను నాయకులు సమీక్షించారు. అలాగే ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఫిన్టెక్, మౌలికవసతులు, విద్య, సంస్కృతి, ప్రజా సంబంధాలతో సహా వివిధ రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవ్వడాన్ని స్వాగతించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నూతన శిఖరాలకు చేర్చేలా భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) సాధించిన విజయాన్ని వారు గుర్తించారు.
అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక ఇంధన భాగస్వామ్యాన్ని ఇరువురు నాయకులు ప్రశంసించారు. ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాలతో సహా భారతదేశ ఇంధన భద్రతలో ముఖ్యమైన భాగస్వామిగా యూఏఈ కొనసాగుతుంది. సమగ్ర ఇంధన భాగస్వామ్యం కోసం నూతన కార్యక్రమాలను ప్రోత్సహించాలని నాయకులిద్దరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదుబాయ్ నేషనల్ ఆయిల్ సంస్థ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం ఖరారవ్వడాన్ని వారు స్వాగతించారు. భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను 30 మిలియన్ బ్యారళ్లకు పెంచేందుకు, భారత్లో వ్యూహాత్మక గ్యాస్ రిజర్వులను ఏర్పాటు చేసే దిశగా కలసి పని చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందమిది. దీర్ఘకాల ఎల్పీజీ సరఫరా కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్), అబుదుబాయ్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ) మధ్య కుదిరిన ఒప్పందాన్ని కూడా వారు స్వాగతించారు.
యూఏఈ సంస్థలు భారత్లో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చేసిన ప్రకటనను ఇద్దరు నాయకులు స్వాగతించారు. వాటిలో ఎమిరేట్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఈఎన్డీబీ) ఆర్బీఎల్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 3 బిలియన్ అమెరికన్ డాలర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఐఎఫ్) భాగస్వామ్యంతో భారత్లో చేపట్టే ప్రాధాన్య మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో నేషనల్ అబుదుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ (ఏడీఐఏ) 1 బిలియన్ యూఎస్ డాలర్లు, సమ్మాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ 1 బిలియన్ యూఎస్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నాయి. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూనే.. భారతదేశ వృద్ధి ప్రయాణంలో యూఏఈ ప్రదర్శిస్తున్న దీర్ఘకాల అంకితభావాన్ని ఈ పెట్టుబడులు స్పష్టం చేస్తున్నాయి.
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో స్థిరమైన, బలమైన ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యం ప్రధానాంశం అని నాయకులు గుర్తించారు. గత పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సమగ్ర రక్షణ భాగస్వామ్య విధానంపై సంతకం చేయడాన్నివారు స్వాగతించారు. దీని పరిధిలో రక్షణ పారిశ్రామిక భాగస్వామ్యాన్ని, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, సైనిక విన్యాసాలు, నౌకా వాణిజ్య భద్రత, సైబర్ భద్రత, సురక్షితమైన కమ్యూనికేషన్లు, సమాచారం వినిమయంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు అంగీకరించారు.
ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా దిగువ పేర్కొన్న అదనపు ఒప్పందాలు నాయకుల సమక్షంలో ఖరారయ్యాయి.
· భారత ప్రభుత్వం ప్రారంభించిన నౌకావాణిజ్య అభివృద్ధి నిధి పథకం పరిధిలో వాడినార్లో ఆఫ్షోర్ ఫ్యాబ్రికేషన్తో సహా నౌకా మరమ్మతుల క్లస్టర్ నిర్మాణంలో కొచ్చిన్ షిప్యార్డ్, దుబాయి సంస్థ డ్రైడాక్స్ వరల్డ్ మధ్య అవగాహన ఒప్పందం.
· నౌకా మరమ్మతుల్లో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి కొచ్చిన్ షిప్ యార్డ్, డ్రైడాక్స్ వరల్డ్ దుబాయ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారీటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ (సీఈఎంఎస్) మధ్య త్రైపాక్షిక ఒప్పందం. ఇది నైపుణ్యాలున్న నౌకా శ్రామిక శక్తిని సమీకరించడానికి, శిక్షణ, ఉపాధి అందించడానికి అవసరమైన విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే భారతీయ నౌకా శ్రామిక శక్తి సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది, అదే విధంగా నౌకానిర్మాణం, మరమ్మతుల్లో నిపుణులకు కేంద్రంగా భారతదేశాన్ని మారుస్తుంది.
· భారత్కు చెందిన సీడాక్, యూఏఈకి చెందిన జీ-42 మధ్య 8 ఎక్సాఫ్లాప్ సూపర్ కంప్యూట్ క్లస్టర్ ఏర్పాటుకు నిబంధనల పత్రం.
మైత్రి (మాస్టర్ అప్లికేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ రెగ్యులేటరీ ఇంటర్ఫేస్) ఉపయోగించి వర్చువల్ వాణిజ్య కారిడార్ను కార్యాచరణలోకి తీసుకురావడాన్ని నాయకులిద్దరూ స్వాగతించారు. ఈ డిజిటల్ వ్యవస్థ ఇరు దేశాలకు చెందిన కస్టమ్స్, పోర్టు అధికారులను అనుసంధానించి, సరకు రవాణా సజావుగా సాగేలా చూస్తుంది. ఖర్చులను, రవాణా సమయాన్ని తగ్గించి మరింత సమర్థవంతమైన వాణిజ్యానికి వీలు కల్పిస్తుంది.
తనకు ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యం అందించిన అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్కు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో భారత్ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.
***
(రిలీజ్ ఐడి: 2261668)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam