వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సముద్ర ఆహార ఉత్పత్తుల రంగ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, మత్స్యకార శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తుల రంగం, ఎగుమతి వ్యవస్థను బలోపేతం చేసేందుకు విశాఖపట్నంలో రెండు రోజుల 'చింతన్ శివిర్' నిర్వహించనున్న కేంద్రం
సముద్ర ఆహార ఉత్పత్తుల రంగంలో విలువ ఆధారిత ఎగుమతులను పెంచేందుకు, ఎంఎస్ఎంఈలకు మద్దతిచ్చేందుకు పీఎల్ఐని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
సుస్థిర సాగు, ఎగుమతులను ప్రోత్సహించటం ద్వారా అండమాన్, నికోబార్, లక్షద్వీప్ దీవుల్లో ట్యూనా రంగాన్ని అభివృద్ధి చేయటంపై ప్రభుత్వ దృష్టి
అంతర్జాతీయ వాణిజ్య చర్చలు, ఎస్పీఎస్ నిబంధనల అమలు, రాష్ట్రాలు, యూటీల్లో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను పెంచేందుకు మత్స్య విభాగం, ఎంపీఈడీఏ చర్యలు
నాడు పోస్టు చేయడమైనది:
14 MAY 2026 6:26PM by PIB Hyderabad
భారతదేశ సముద్ర ఉత్పత్తుల రంగంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు, అంతర్జాతీయ ఎగుమతుల్లో దేశ పోటీతత్వాన్ని బలోపేతం చేయటానికి రూపొందించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ఇవాళ ఉన్నత స్థాయి సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. వాణిజ్య శాఖ, మత్స్య శాఖ, ఎంపీఎఫ్ఐ, డీపీఐఐటీ, ఎంపీఈడీఏ, ఈఐసీ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎగుమతి ప్రోత్సాహక కార్యకలాపాలను పీఎంఎంఎస్వై, అనుబంధ పథకాల లక్ష్యాలతో అనుసంధానించాల్సిన అవసరాన్ని ఈ సమావేశం స్పష్టం చేసింది.
విలువ జోడింపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉత్పత్తుల వైవిధ్యం, నాణ్యతా ప్రమాణాలు, మార్కెట్ విస్తరణ, లోతైన సముద్ర ప్రాంతంలో చేపల వేట, వాటాదారుల భాగస్వామ్యం ద్వారా సముద్ర ఆహార ఎగుమతుల వృద్ధిని పెంపొందించటానికి సమన్వయంతో కృషి చేస్తామని రెండు మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి.
ఇందులో భాగంగా జూన్ 5 నుంచి 6, 2026 వరకు విశాఖపట్నంలో రెండు రోజుల "చింతన్ శివిర్" కార్యక్రమాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఓఎఫ్పీఐ), సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎంపీఈడీఏ), జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్ఎఫ్డీబీ), కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ), రాష్ట్ర మత్స్య శాఖలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు, అంకుర సంస్థలు, మత్స్యకారులు, రైతులు, ఇతర పరిశ్రమల భాగస్వాములు పాల్గొంటారు.
అంతర్జాతీయ పోటీతత్వాన్ని మెరుగుపరచటం, ఎగుమతి మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం, సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణను ప్రోత్సహించటం, పరిశోధన, అభివృద్ధికి మద్దతివ్వటం, విలువ జోడింపును ప్రోత్సహించటం వంటి లక్ష్యాలతో సముద్ర ఆహార ఉత్పత్తుల రంగంలోని ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకమైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని అభివృద్ధి చేయాలని మత్స్య శాఖ యోచిస్తోంది.
భారతదేశ మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో విలువ జోడింపు ఉత్పత్తుల వాటాను గణనీయంగా పెంచటం, ప్రస్తుతమున్న సుమారు 1,200 మంది ఎగుమతిదారుల సంఖ్యను రాబోయే ఏళ్లలో 5,000కు విస్తరించటమే ప్రతిపాదిత ప్రణాళిక లక్ష్యాలు. దీనివల్ల ఎగుమతుల ఆదాయం పెరగటమే కాక, ప్రపంచ సముద్ర ఉత్పత్తుల విలువ వ్యవస్థలో భారత్ స్థానం మరింత బలోపేతం అవుతుంది.
అండమాన్ నికోబార్, లక్షద్వీప్లో ట్యూనా చేపల రంగాన్ని అభివృద్ధి చేయటంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ట్యూనా, ఇతర విలువైన సముద్ర ఉత్పత్తుల స్థిరమైన సేకరణ, ప్రాసెసింగ్, బ్రాండింగ్, ఎగుమతులను ప్రోత్సహించేందుకు నిర్దిష్టమైన చర్యలు చేపడతారు.
భారత ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకువచ్చేందుకు, మార్కెట్ పరిధిని విస్తరించేందుకు, వాణిజ్య భాగస్వామ్యాల బలోపేతానికి, వ్యాధుల్లేని ప్రాంతాలను గుర్తించేందుకు, మత్స్య విభాగం, ఎంపీఈడీఏ సంయుక్తంగా అంతర్జాతీయ మార్కెట్లకు వాణిజ్య ప్రతినిధి బృందాలను పంపనున్నాయి. ఎగుమతి రంగంలో అందరి భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఎంపీఈడీఏ, ఎన్ఎఫ్డీబీ కలిసి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎగుమతి సామర్థ్యాన్ని, మౌలిక సదుపాయాల్లోని లోపాలను సమగ్రంగా అంచనా వేస్తాయి.
ఆక్వాకల్చర్, సముద్రపు వేట రంగాల్లో శానిటరీ, ఫైటోశానిటరీ (ఎస్పీఎస్) సమస్యల పరిష్కారానికి సమగ్ర విధానం అవసరమని ఈ సమావేశం స్పష్టం చేసింది. ట్రేసబిలిటీ, నాణ్యత హామీ వ్యవస్థలు, వ్యాధిరహిత ప్రాంతాలు, అంతర్జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రాథమిక ఉత్పత్తి దశ నుంచే బలోపేత చర్యలు చేపడతారు. సముద్రపు ఆహార జాతులు, ఉత్పత్తులు జీఐ ట్యాగింగ్ పొందే అవకాశాలను కూడా పరిశీలిస్తారు.
పరీక్షలు, ధ్రువీకరణ, ఎగుమతి నిబంధనల అమలు సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రయోగశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తారు. ఇందులో భాగంగా లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.
సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, పునర్వినియోగానికి మత్స్యకారుల సహకారంతో ఎంపీఈడీఏ చేపట్టిన పైలట్ ప్రాజెక్టును మంత్రులు అభినందించారు. సముద్ర సంరక్షణను బలోపేతం చేసేందుకు, సుస్థిర మత్స్య సంపదకు మద్దతిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని అన్ని తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సుస్థిర మత్స్య సంపద అభివృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన నాణ్యతా వ్యవస్థలు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, మత్స్య సహకార సంఘాల భాగస్వామ్యాన్ని పెంపొందించటం ద్వారా భారతదేశాన్ని సముద్ర ఆహార ఎగుమతి కేంద్రంగా మార్చేందుకు నిబద్ధతతో ఉన్నట్లు ఇరు మంత్రిత్వ శాఖలు స్పష్టం చేశాయి. ఉపాధి కల్పనకు, మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చూడటం, తీర, ద్వీప ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధికి, భారతదేశ నీలి ఆర్థిక వ్యవస్థ సమగ్రాభివృద్ధికి ఈ కార్యక్రమాలు గణనీయంగా తోడ్పడతాయి.
***
(రిలీజ్ ఐడి: 2261244)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13