వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
లాజిస్టిక్స్, ఆవిష్కరణల్లో ప్రతిభ... లీప్స్-2025లోని 13 విభాగాల విజేతలను సత్కరించిన
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా లాజిస్టిక్స్ పనితీరును అంచనా వేసే లీడ్స్-2025 నివేదిక విడుదల
ప్రపంచ వాణిజ్యంలో మూడింట రెండొంతులు విస్తరించిన భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏలు)
12 నెలల్లోగా అమల్లోకి మరో ఐదు ఒప్పందాలు
జీసీసీ, కెనడా, చిలీ, మెక్సికో సహా ఇతర కీలక ప్రాంతాలతో వాణిజ్య చర్చలను ముందుకు తీసుకెళ్తున్న భారత్
ప్రపంచ ప్రతికూలతల్లోనూ రికార్డు స్థాయిలో 863 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించిన భారత్
ప్రస్తుత సంవత్సరానికి 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యం
లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపుతో మౌలిక సదుపాయాల వృద్ధి, సజావుగా సరుకు రవాణా, ప్రపంచస్థాయి సామర్థ్యాలకు ఊతం: శ్రీ పీయూష్ గోయల్
प्रविष्टि तिथि:
13 MAY 2026 8:33PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన లీప్స్ పురస్కారాలు-2025 ప్రదానోత్సవం, లీడ్స్ నివేదిక-2025 విడుదల కార్యక్రమంలో కీలక లాజిస్టిక్స్, ఎంఎస్ఎంఈలు, అంకురసంస్థలు, పలు రకాల సంస్థలు, ప్రత్యేక కేటగిరీలు సహా మొత్తం 13 విభాగాల విజేతలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ లీప్స్ పురస్కారాలతో సత్కరించారు.
లీప్స్ పురస్కారాలు-2025 వేడుకలో భాగంగా లీడ్స్-2025 నివేదికనూ శ్రీ గోయల్ విడుదల చేశారు. సీనియర్ ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల సంఘాలు, లాజిస్టిక్స్ భాగస్వాములు, అంకురసంస్థలు, ఎంఎస్ఎంఈలు, విద్యాసంస్థలు, మూల్యాంకన కమిటీల సభ్యులు, లాజిస్టిక్స్ రంగ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
లీప్స్ పురస్కారాలు-2025 ప్రధానోత్సవం, లీడ్స్ నివేదిక-2025 విడుదల కార్యక్రమాల సందర్భంగా శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ... గత మూడున్నరేళ్ల కాలంలో భారత్ తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏల) ద్వారా 38 అభివృద్ధి చెందిన, సంపన్న ఆర్థిక వ్యవస్థలతో ఒప్పందాలు చేసుకుందన్నారు. వాటిలో నాలుగు ఇప్పటికే అమలులో ఉన్నాయనీ, మరో ఐదు రాబోయే 12 నెలల్లో అమల్లోకి వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జపాన్, కొరియా, ఏషియాన్ దేశాలతో గతంలో కుదుర్చుకున్న ఎఫ్టీఏలతో పాటు... ఇప్పుడు ప్రపంచ వాణిజ్య, ఆర్థిక వ్యవస్థల్లో మూడింట రెండొంతులకు పైగా ఈ ఒప్పందాలు విస్తరించాయని కేంద్ర మంత్రి తెలిపారు.
చిలీ, మాల్దీవులు సహా పలు దేశాలు, ప్రాంతాలతో భారత్ చురుగ్గా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందనీ, ఈ రెండు ఒప్పందాలు ఈ ఏడాది చివరి నాటికి ఖరారయ్యే అవకాశం ఉందనీ శ్రీ గోయల్ తెలిపారు. ఒమన్, యూఏఈలతో పాటు ఖతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి ఆరు గల్ఫ్ దేశాల కూటమి అయిన గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)తోనూ చర్చలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య సంబంధాలు, మార్కెట్ ప్రవేశ అనుమతులకు అవకాశాలను విస్తరించేందుకు గానూ కెనడా, యూరేషియా, మెక్సికో, ఎస్ఏసీయూ, మెర్కోసూర్లతో భారత్ చురుగ్గా చర్చలు జరుపుతోందనీ కేంద్ర మంత్రి వివరించారు.
అధిక సుంకాలు, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్ వివాదం, పశ్చిమాసియా సంక్షోభం వంటి ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ... 2026 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 863 బిలియన్ డాలర్ల అత్యధిక ఎగుమతులను భారత్ సాధించిందని కేంద్ర మంత్రి శ్రీ గోయల్ తెలిపారు. ప్రపంచ వృద్ధి మందగించినప్పటికీ... భారత ఎగుమతులు వృద్ధి చెందుతూనే ఉన్నాయనీ, సేవల ఎగుమతులు సుమారు 8.5-9 శాతం వృద్ధిని నమోదు చేయగా, మొత్తం ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే దాదాపు 5 శాతం పెరిగాయని ఆయన పేర్కొన్నారు. పలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టిఏల) అమలు, మెరుగైన మార్కెట్ ప్రవేశ అనుమతుల అవకాశాల మద్దతుతో... ప్రస్తుత సంవత్సరానికి ప్రభుత్వం 1 ట్రిలియన్ డాలర్ల ఆకాంక్షాత్మక ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ఆయన అన్నారు.
పశ్చిమాసియా సంక్షోభం, మందగిస్తున్న ప్రపంచ వృద్ధి, ఇతర అంతర్జాతీయ అంతరాయాలనూ... తన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి, పోటీతత్వాన్ని బలోపేతం చేసుకోవడానికి, ఎగుమతి మార్కెట్లను విస్తరించుకోవడానికి అవకాశాలుగా భారత్ చూడాలని శ్రీ గోయల్ అన్నారు. లాజిస్టిక్స్, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, వ్యాపార ప్రక్రియల్లో నిరంతర మెరుగుదల వంటివి భారత్ తన ఎగుమతి సామర్థ్యాన్ని, విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి సహాయపడతాయని ఆయన స్పష్టం చేశారు.
భారత్ను ప్రపంచంతో పోటీపడేలా చేయడానికి లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడాన్ని తక్షణ జాతీయ కర్తవ్యంగా స్వీకరించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, నిరాటంకమైన లాజిస్టిక్స్ వ్యవస్థలు, వేగవంతమైన రవాణా, మెరుగైన డెలివరీ యంత్రాంగాలు మన సామర్థ్యాలను, ఉత్పాదకతను, పోటీతత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయని ఆయన తెలిపారు. లాజిస్టిక్స్ రంగ బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు రెండూ గణనీయ తోడ్పాటునందించాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నిరంతర పెట్టుబడులు, ఆవిష్కరణలు, అంకురసంస్థల-ఆధారిత పరిష్కారాలు, మెరుగైన సామర్థ్యాల ద్వారా భారత్ లాజిస్టిక్స్ ఖర్చులను మరింత తగ్గించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జీఎస్టీ, అనేక చట్టాలను నేరరహితం చేయడం, నిబంధనల సంబంధిత భారాన్ని తగ్గించడం, వ్యాపార ప్రక్రియలను సరళీకరించడం వంటి కార్యక్రమాలు దేశంలో మరింత నిరాటంకమైన లాజిస్టిక్స్, వ్యాపార నిర్వహణ వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతున్నాయనీ ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, అధిక దేశీయ డిమాండ్, యువ జనాభా, విభిన్న ఉత్పత్తులు-సేవల లభ్యత, పటిష్ఠమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి భారత్ బలాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్ ఏటా 14 లక్షల మంది ఎస్టీఈఎమ్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందనీ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు (జీసీసీలకు) కీలక గమ్యస్థానంగా మారిందన్నారు. ఇప్పటికే దాదాపు 1,700-1,800 జీసీసీలు పనిచేస్తున్నాయనీ, మరో 500 ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని శ్రీ గోయల్ తెలిపారు.
ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి, సమర్థమైన తయారీ, సేవల కోసం ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందని ఆయన అన్నారు. బహుళజాతి కంపెనీలు తమ ప్రపంచవ్యాప్త కార్యకలాపాలను విస్తరించుకోవడానికి భారత్లోని ప్రతిభావంతుల లభ్యతను, తక్కువ నిర్వహణ ఖర్చులను, పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థను సద్వినియోగం చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.
వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రస్తావిస్తూ... జన్ విశ్వాస్ బిల్లు ద్వారా ప్రభుత్వం దాదాపు 1,000 చట్టాలను నేరరహితం చేసిందనీ, తద్వారా సుమారు 42,000 నిబంధనల సంబంధిత భారాలను తగ్గించిందని శ్రీ గోయల్ అన్నారు. విధానాలను సరళీకరించడానికి, డేటాబేస్లను ఏకీకృతం చేయడానికి, మరిన్ని ప్రక్రియలను ఆన్లైన్కు మార్చడానికీ తదుపరి పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
అధికారిక సంప్రదింపులు, చర్చల్లో భౌతిక సమావేశాలు సహా డిజిటల్ సాంకేతికతలనూ సమతుల్యం చేసుకోవాల్సిన ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం వాణిజ్య చర్చలు, పాలనా ప్రక్రియల్లో భారత్ వీడియో అనుసంధానం, డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఎక్కువగా వినియోగించుకుంటోందని శ్రీ గోయల్ అన్నారు.
దేశ నిర్మాణానికి, ప్రపంచంతో పోటీపడేలా భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి సంబంధిత వర్గాలన్నీ సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర మంత్రి కోరారు. సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఖర్చులను తగ్గించడానికి, ఉత్పాదకతను పెంచడానికి చేసే ప్రతి ప్రయత్నం దేశాన్ని మరింత బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో దోహదపడుతుందని ఆయన అన్నారు.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ)... లాజిస్టిక్స్ వ్యవస్థ అంతటా శ్రేష్ఠత, ఆవిష్కరణలు, అత్యుత్తమ పద్ధతులను గుర్తించే ప్రధాన జాతీయ కార్యక్రమమైన లీప్స్-2025 (లాజిస్టిక్స్ ఎక్సలెన్స్, అడ్వాన్స్మెంట్ అండ్ పెర్ఫార్మెన్స్ షీల్డ్) పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించింది.
లాజిస్టిక్స్, సరుకు రవాణా వ్యవస్థ నిర్వహణలో నాయకత్వం, కార్యాచరణ నైపుణ్యం, ఆవిష్కరణలు, సుస్థిరతను ప్రదర్శించిన సంస్థలను గుర్తించేలా ఈ కార్యక్రమ నాల్గో ఎడిషన్ లీప్స్-2025ను రూపొందించారు. ఈ కార్యక్రమం మల్టీమొడాలిటీ, సామర్థ్యాల పెంపు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, సుస్థిర లాజిస్టిక్స్ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పీఎం గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్ విధాన దార్శనికతలకు అనుగుణంగా ఉంది.
ఈ సందర్భంగా డీపీఐఐటీ కార్యదర్శి శ్రీ అమర్దీప్ సింగ్ భాటియా మాట్లాడుతూ... ప్రపంచంతో పోటీపడేలా భారత్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంలో సమర్థమైన, పటిష్ఠమైన లాజిస్టిక్స్ వ్యవస్థ ప్రాముఖ్యతను స్పష్టం చేశారు. ఆవిష్కరణ, డిజిటలైజేషన్, సుస్థిరత, కార్యాచరణ నైపుణ్యం ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పరివర్తనను నడిపిస్తున్న సంస్థలను గుర్తించడానికి లీప్స్ (ఎల్ఈఏపీఎస్) ఒక ముఖ్యమైన వేదికను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
లీప్స్-2025 మూల్యాంకన ప్రక్రియను ఒక క్రమబద్ధమైన, పారదర్శక విధానం ద్వారా నిర్వహించారు. ఎమ్హెచ్ఏ పురస్కార పోర్టల్ (https://awards.gov.in/) ద్వారా 2025 అక్టోబర్ 13 నుంచి డిసెంబర్ 26 వరకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు.
డీపీఐఐటీ, లాజిస్టిక్స్ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన 2026 ఫిబ్రవరి 11, 12 తేదీల్లో లీప్స్-2025 కోసం నిపుణుల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం డీపీఐఐటీ కార్యదర్శి అధ్యక్షతన 2026 మార్చి 17న పురస్కార కమిటీ సమావేశం జరిగింది.
కీలక లాజిస్టిక్స్, ఎంఎస్ఎంఈలు, సంస్థలు, అంకురసంస్థలు, ప్రత్యేక కేటగిరీలు సహా మొత్తం 13 కేటగిరీల్లో అందిన దరఖాస్తులను మూల్యాంకనం చేసి నిపుణుల కమిటీ ముందు ప్రవేశపెట్టారు. షార్ట్లిస్ట్ చేసిన దరఖాస్తుదారులను పురస్కార కమిటీ మరింతగా మూల్యాంకనం చేసింది.
సాంకేతిక ఆవిష్కరణ, పర్యావరణ-సామాజిక-పరిపాలన (ఈఎస్జీ) పద్ధతులు, బహుళ రవాణా విధానాలు, జాతీయ లాజిస్టిక్స్ విధానానికి అనుగుణంగా ఉండటం, కార్యాచరణ సామర్థ్యం, భద్రత, పరిశోధన-అభివృద్ధి, లింగ వైవిధ్యం, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి సహకారం వంటి పారామితుల ఆధారంగా దరఖాస్తులను మదింపు చేశారు.
'లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ (లీడ్స్)-2025' నివేదికనూ శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు విడుదల చేశారు. ఇది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లాజిస్టిక్స్ పనితీరుపై డీపీఐఐటీ చేపట్టిన ఒక ప్రధాన మదింపు నివేదిక. ఇది దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఒక కీలకమైన ప్రామాణిక, సంస్కరణ సాధనంగా ఉపయోగపడుతుంది.
ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్, జాతీయ లాజిస్టిక్స్ పాలసీ కింద సమీకృత, డేటా ఆధారిత లాజిస్టిక్స్ సంస్కరణలపై ప్రభుత్వం కొనసాగిస్తున్న దృష్టిని లీడ్స్-2025 ప్రతిబింబిస్తుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పనితీరును అంచనా వేసుకోవడానికి, లోపాలను గుర్తించడానికి, లక్షిత లాజిస్టిక్స్ చర్యలకు ప్రాధాన్యమివ్వడానికి వీలు కల్పించడం ద్వారా ఈ విధాన ప్రణాళిక సహకార, పోటీ సమాఖ్యవాదానికి మద్దతునిస్తుంది.
లీడ్స్ ఏడో ఎడిషన్ అయిన లీడ్స్-2025... గత సంవత్సరాలతో పోలిస్తే మరింత కఠినమైన, మెరుగైన మూల్యాంకన పద్ధతిని అనుసరిస్తూ... భారత లాజిస్టిక్స్ రంగ పనితీరు అంచనాలో కీలక పరిణామాన్ని సూచిస్తుంది. లీడ్స్-2025 అంచనాలు పటిష్ఠతను, అమలు పర్యవేక్షణను బలోపేతం చేయడం కోసం కొలవగల, ఆధారాల ఆధారితమైన సూచికలకు అధిక ప్రాధాన్యమిస్తుంది. ఇందులో లక్ష్యాత్మక సూచికలకు దాదాపు 59 శాతం వెయిటేజీని కేటాయించారు.
దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్ వ్యవస్థల పరిణామ పురోగతిని మరింత మెరుగ్గా ప్రతిబింబించేందుకు లీడ్స్-2025 విధాన ప్రణాళిక తన మునుపటి మూడు-స్థాయిల వర్గీకరణ నుంచి మరింత సమగ్రమైన నాలుగు-స్థాయిల విధాన ప్రణాళికకు మారింది. ఈ సవరించిన విధాన ప్రణాళిక... లాజిస్టిక్స్ పనితీరును మరింత సూక్ష్మంగా అంచనా వేయడానికి వీలు కల్పిస్తుంది. లాజిస్టిక్స్ వ్యవస్థ అభివృద్ధిలోని వివిధ దశల్లో లక్ష్యాత్మక మెరుగుదల మార్గాలకు మద్దతునిస్తుంది.
కొత్త నాలుగు-స్థాయిల వర్గీకరణ
కొత్త నాలుగు-స్థాయిల వర్గీకరణ కింది విధంగా ఉంది:
-
ఆదర్శంగా నిలిచేవి: విధానం, మౌలిక సదుపాయాలు, సేవల పంపిణీ, నియంత్రణ అంశాల్లో నిరంతర శ్రేష్ఠతను ప్రదర్శిస్తూ... అత్యుత్తమ పనితీరు కనబరిచే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదర్శంగా నిలిచేవిగా పరగిణిస్తారు.
-
తీరప్రాంత రాష్ట్రాలు: తమిళనాడు
-
భూపరివేష్టిత రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్
-
ఈశాన్య రాష్ట్రాలు: మిజోరం
-
కేంద్రపాలిత ప్రాంతాలు: ఢిల్లీ
• అత్యుత్తమ పనితీరు కనబరిచేవి: అత్యుత్తమ పనితీరు సూచికల్లో బలమైన, స్థిరమైన ఫలితాలను ప్రదర్శించే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అత్యుత్తమ పనితీరు కనబరిచేవిగా ఉంటాయి.
o తీరప్రాంత రాష్ట్రాలు: గుజరాత్, కేరళ, మహారాష్ట్ర
o భూపరివేష్టిత రాష్ట్రాలు: హర్యానా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీహార్
o ఈశాన్య రాష్ట్రాలు: త్రిపుర, మేఘాలయ
o కేంద్రపాలిత ప్రాంతాలు: జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి
• వృద్ధిని వేగవంతం చేసేవి: ఇటీవలి సంవత్సరాల్లో గణనీయ అభివృద్ధి వేగాన్ని, స్పష్టమైన సంస్కరణల ధోరణిని ప్రదర్శించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వృద్ధిని వేగవంతం చేసేవిగా సూచిస్తారు.
• తీరప్రాంత రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్
• భూపరివేష్టిత రాష్ట్రాలు: రాజస్థాన్
• ఈశాన్య రాష్ట్రాలు: సిక్కిం
• కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్-నికోబార్ దీవులు
లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం, భారత సామర్థ్యాల బలోపేతం లక్ష్యంగా గల సంస్కరణలకు మద్దతుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా ఆధారాల ఆధారిత లాజిస్టిక్స్ ప్రణాళిక, పనితీరు పర్యవేక్షణ బలోపేతం దిశగా లీడ్స్ ఒక కీలక ముందడుగును సూచిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2260920)
आगंतुक पटल : 56