వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసే దిశగా భారత్లో పర్యటిస్తున్న చిలీ విదేశాంగ మంత్రి శ్రీ ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకెన్నా
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల బలోపేతంపై భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్తో చర్చించిన చిలీ విదేశాంగ మంత్రి
సీఈపీఏను త్వరగా పూర్తి చేయడం పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించిన ఉభయ దేశాలు
వాణిజ్య సౌలభ్యం, మార్కెట్ అనుమతి, పెట్టుబడి సహకారంపై చర్చలు
నాడు పోస్టు చేయడమైనది:
13 MAY 2026 4:55PM by PIB Hyderabad
ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార బలోపేతం లక్ష్యంగా చిలీ విదేశాంగ మంత్రి గౌరవ శ్రీ ఫ్రాన్సిస్కో పెరెజ్ మెకెన్నా నేతృత్వంలోని చిలీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ద్వైపాక్షిక చర్చల కోసం భారత్లో పర్యటిస్తోంది.
ఈ పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రాధాన్యతా రంగాల్లో ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్... చిలీ విదేశాంగ మంత్రితో చర్చించారు. భారత్-చిలీ ఆర్థిక సంబంధాల్లో స్థిరమైన వృద్ధిని ఇరుపక్షాలు గుర్తించాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, పరస్పర వ్యాపార సంబంధాలను విస్తరించడం పట్ల ఇరు దేశాలూ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించాయి.
భారత్, చిలీల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) దిశగా కొనసాగుతున్న సంప్రదింపులపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారించాయి. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల పూర్తి సామర్థ్యాన్ని సాధించడంలో సీఈపీఏ ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయి. దీనిని త్వరగా సాధించేందుకు కృషి చేయడం పట్ల తమ నిబద్ధతను వ్యక్తం చేశాయి.
చిలీ ప్రభుత్వ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల (ఎస్యూబీఆర్ఈఐ) ఉప మంత్రి శ్రీమతి పౌలా ఎస్టెవెజ్తో భారత వాణిజ్య శాఖ కార్యదర్శి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఈపీఏను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన విధానాలను చర్చించారు. ఈ సంప్రదింపుల్లో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సౌలభ్యం, మార్కెట్ ప్రవేశ అనుమతులు, పెట్టుబడుల ప్రోత్సాహం, సంస్థాగత ఆర్థిక సంబంధాల బలోపేతం వంటి అనేక విస్తృత అంశాలనూ చర్చించారు.
ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల ప్రముఖ వ్యాపార ప్రతినిధులు, పరిశ్రమ భాగస్వాముల భాగస్వామ్యంతో న్యూఢిల్లీ వేదికగా భారత్-చిలీ వ్యాపార విస్తృతస్థాయి సమావేశాన్నీ నిర్వహించారు. కీలక ఖనిజాలు, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయ సంబంధిత వ్యాపారం, మౌలిక సదుపాయాలు, ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ సేవలు, లాజిస్టిక్స్, అధునాతన తయారీ వంటి రంగాల్లో సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి ఈ రౌండ్టేబుల్ సమావేశం కీలక వేదికగా ఉపయోగపడింది.
భారత, చిలీ ఆర్థిక వ్యవస్థల మధ్య బలమైన ఆర్థిక సమన్వయాన్ని ఇరుపక్షాలూ స్పష్టం చేశాయి. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పటిష్ఠమైన సరుకు రవాణా వ్యవస్థలు, సుస్థిర అభివృద్ధి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన ప్రాముఖ్యతనూ ఇరు దేశాలు ఉద్ఘాటించాయి.
భారత్-చిలీ దేశాలు పరస్పర విశ్వాసం, ప్రజాస్వామ్య విలువలు, పెరుగుతున్న ఆర్థిక భాగస్వామ్యంతో కూడిన సామరస్యపూర్వకమైన, దీర్ఘకాలిక సంబంధాలను కలిగి ఉన్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో వేగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు... మరింత పటిష్ఠమైన, భవిష్యత్-ఆధారితమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని నిర్మించడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2260881)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5