ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
‘ఏబీ పీఏం-జేఏవై ఆటో అడ్జుడికేషన్ హ్యాకథాన్ షోకేస్ – 2026’ విజేతలను సత్కరించిన ఇండియా ఏఐ మిషన్, ఎన్హెచ్ఏ
ఆరోగ్య క్లెయిముల నిర్వహణలో ఆవిష్కరణాత్మక ఏఐ పరిష్కారాలు అందించిన తొమ్మిది మంది ఏఐ ఆవిష్కర్తలకు బెంగళూరు ఐఐఎస్సీలో లభించిన గుర్తింపు
నాడు పోస్టు చేయడమైనది:
13 MAY 2026 2:11PM by PIB Hyderabad
జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్హెచ్ఏ), బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సహకారంతో ‘ఏబీ పీఎం-జేఏవై ఆటో-అడ్జుడికేషన్ హ్యాకథాన్ షోకేస్ – 2026’ను ఇండియా ఏఐ మిషన్ నిర్వహించింది. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని 2026 మే 9న బెంగళూరులోని ఐఐఎస్సీలో సత్కరించింది. ప్రజారోగ్య బీమా రంగంలో ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ ప్రదర్శన ముగింపు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఎన్హెచ్ఏ, ఐఐఎస్సీ బెంగళూరు సహకారంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్లో క్లెయిముల పరిష్కారంలో వేగాన్ని, పారదర్శకతను, కచ్చితత్వాన్ని పెంపొందించడంతో పాటు మోసాలను గుర్తించే విధానాలను అన్వేషించడంపై దృష్టి సారించారు.
ఏఐ ఆధారంగా క్లెయిముల పరిష్కారాన్ని మార్చగలిగే సామర్థ్యం ఉన్న ఆవిష్కరణలు చేసిన వారిని జాతీయ ఆరోగ్య సంస్థ సీఈవో సునీల్ కుమార్ బర్నాల్; జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్హెచ్ఏ జాయింట్ సెక్రటరీ జ్యోతి యాదవ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ మిస్ శిఖా దహియా సత్కరించారు.
ప్రభుత్వ నిధులతో నడిచే అతి పెద్ద ఆరోగ్య హామీ పథకాల్లో ఒకటైన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) క్లెయిములు పరిష్కారంలో కీలకమైన, అధిక ప్రభావం చూపే మూడు సమస్యలకు పరిష్కారాలను ఈ హ్యాకథాన్ ఆహ్వానించింది. ప్రతిరోజూ1900కు పైగా చికిత్సా ప్యాకేజీల పరిధిలో పెద్ద సంఖ్యలో క్లెయిములను ఏబీ-పీఎం-జేఏవై పరిష్కరిస్తుంది.
హ్యాకథాన్ విజేతలు
సమస్య ప్రతిపాదన 1: క్లినికల్ డాక్యుమెంట్ వర్గీకరణ, ఎస్టీజీ అమలు
వివిధ రకాల ఆరోగ్య సంరక్షణ పత్రాలనుంచి తనంత తానుగా కీలక సమాచారాన్ని తీసుకోవడం, తప్పనిసరి దృశ్యాంశాలను గుర్తించడం, ఎన్హెచ్ఏ అందించిన ప్రామాణిక చికిత్స మార్గదర్శకాల (ఎస్టీజీ)కు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడం
· విజేత: శ్రీ వినయ్ బాబు ఉల్లి
· రన్నరప్: మిస్ ఖుషీ సింగ్
· సెకెండ్ రన్నరప్: శ్రీ విజయ్ బాలాజీ
సమస్య ప్రతిపాదన 2: రేడియాలజీ చిత్రం ఆధారంగా ఆరోగ్య స్థితి గుర్తింపు, నివేదికతో సరిపోల్చడం
ఎస్టీజీల పరిధిలో ఆధారాలుగా సమర్పించిన ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐల వంటి చిత్ర ఆధారిత చికిత్సలను ధ్రువీకరించడం, క్లెయిములను ఖచ్చితంగా, సమర్థంగా పరిష్కరించేందుకు నివేదికలతో సరిపోల్చడం
· విజేత: శ్రీ హరీష్ కుమార్
· రన్నరప్ : శ్రీ భరత్ వర్మ సంగరాజు
· సెకెండ్ రన్నరప్: శ్రీ అర్నాల్డ్ సచిత్
సమస్య ప్రతిపాదన 3: నకిలీ డాక్యుమెంట్లు, డీప్ఫేక్ల గుర్తింపు
క్లెయిములను సమర్పించినప్పుడు డిశ్చార్జి సమరీల్లో వివరాల తారుమారు, నకిలీ బిల్లులు, దొంగ గుర్తింపులు, ఏఐతో రూపొందించిన వాటితో సహా నకిలీ లేదా కృత్రిమంగా సృష్టించిన పత్రాలను గుర్తించడం.
· విజేత: శ్రీ ప్రవీణ్ శ్రీధర్
· రన్నరప్: శ్రీ నిఖిలేశ్వర రావు సులకే
· రెండో రన్నరప్ : శ్రీ సుమంత్ నాయుడు మత్తిరెడ్డి
విజేతలుగా నిలిచిన బృందాలకు వరుసగా రూ. 5 లక్షలు, రూ.3 లక్షలు, రూ. 2 లక్షలు అందజేశారు. ఎంపిక చేసిన పరిష్కారాలను భవిష్యత్తులో ఏబీ పీఎం-జేఏవైలో అమలు చేసేందుకు పరిగణిస్తామని అధికారులు తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2260697)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6