ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

బెంగళూరు వాతావరణం, ఇక్కడి పర్యావరణం ప్రత్యేకమైనవి, సాఫ్ట్‌వేర్-సేవల విషయంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ నగరం.. భారతీయ సాంస్కృతిక గుర్తింపును, ఆధ్యాత్మికతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నూతన శిఖరాలకు చేర్చింది: పీఎం

మన సమాజంలో ఇమిడి ఉన్న సహజ గుణమే సేవా పరమో ధర్మ (సేవ చేయడమే అత్యున్నతమైన ధర్మం): పీఎం

ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రజల జీవితాల్లో సహజ భాగంగా మారింది... ఇప్పుడు సామాజిక శక్తితో మరింత ముందుకు సాగుతోంది: పీఎం

మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత, సమాజం పట్ల స్పందించే గుణం ఉన్న యువతతోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది: పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 10 MAY 2026 2:20PM by PIB Hyderabad

కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికున్న పవిత్రత గురించి ప్రధాని తెలియజేశారు. వేద మంత్రాలతో చిన్నారులు స్వాగతం పలకడం, గణేశుని దర్శనం, శ్రీ శ్రీ రవి శంకర్ 70వ సంవత్సరం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాలతో ఈ ఉదయం ప్రత్యేకంగా మారిందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఈ క్షణాలన్నీ నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

పవిత్రమైన, గొప్పదైన ధ్యాన మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఇలాంటి అంకితభావంతో కూడిన సంస్థలకున్న ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి వివరించారు. నూతన మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘స్పష్టమైన సంకల్పం ఉన్నప్పుడు, సేవాభావంతో కర్తవ్యాన్ని పూర్తి చేసినప్పుడు, ప్రతి ప్రయత్నం ఆహ్లాదకరమైన ఫలితాలనిస్తుంది’’ అని శ్రీ మోదీ చెప్పారు.

బెంగళూరు విశిష్ట వాతావరణాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. బెంగళూరు నగరం సాఫ్ట్‌వేర్, సేవలకు మాత్రమే కాకుండా.. భారతీయ సాంస్కృతిక గుర్తింపును, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో అంతర్జాతీయంగా పేరుగాంచిందన్నారు. ‘‘ఈ నగరం ఆధ్యాత్మికతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నూతన శిఖరాలకు చేర్చింది’’ అని శ్రీ మోదీ చెప్పారు.

భారతీయ జీవన విలువల్లో అంతర్భాగమైన యోగా, ధ్యానం, ప్రాణాయామం మూలాలను ప్రధాని ప్రస్తావిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఆధ్యాత్మిక వారసత్వం చూపిస్తున్న ప్రభావాన్ని, అనేక సంస్థలకు అందిస్తున్న స్ఫూర్తి గురించి వివరించారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతీయ ఆధ్యాత్మిక విలువల వల్ల ప్రభావితమవుతున్నారు. ఈ ప్రాచీన విలువల నుంచే అనేక భారతీయ సంస్థలు స్ఫూర్తి పొందుతున్నాయి’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

ఈ ప్రాచీన ఆధ్యాత్మిక విలువల నుంచి స్ఫూర్తి పొంది 45 ఏళ్ల కిందట ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు శ్రీ శ్రీ రవి శంకర్ బీజం వేశారనీ, ఇప్పుడు అది పెద్ద మర్రి చెట్టులా ఎదిగిందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఇప్పుడు ఈ సంస్థ మన ముందు ఓ పెద్ద వట వృక్షంలా నిలబడి ఉంది. వేలాదిగా ఉన్న దాని కొమ్మలు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది జీవితాలను స్పృశిస్తున్నాయి’’ అని శ్రీ మోదీ వివరించారు.

భాషలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పూజా విధానాలతో కూడిన సుసంపన్నమైన భారతీయ వైవిధ్యం గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా చర్చించారు. ఇంతటి అందమైన వైవిధ్యాలన్నింటినీ ఐక్యంగా ఉంచుతున్నది ఏంటనే ప్రాథమిక ప్రశ్నను ఆయన సంధించారు. ‘‘మన కోసం కాకుండా ఇతరుల కోసం జీవించడమే దీనికి సమాధానం’’ అని చెప్పారు.

ఇతరులకు సేవ చేయడం పుణ్యమనీ, బాధను కలిగించడం పాపమన్న పురాణాల్లోని ప్రాచీన జ్ఞానాన్ని ఉటంకించారు. సేవ చేయడమే భారతీయ సమాజ సహజ గుణమని తెలియజేశారు. ‘‘మన సమాజంలో ఇమిడి ఉన్న సహజ గుణమే సేవా పరమో ధర్మః’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

మానవత్వం ద్వారానే భారతదేశంలో అనేక ఆధ్యాత్మిక ఉద్యమాలు వచ్చాయనీ, ఆర్ట్ ఆఫ్ లింగ్ చేపట్టే ప్రతి పనిలోనూ అదే స్ఫూర్తి ప్రతిబింబించడం పట్ల ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రయాణంతో ముడిపడిన ప్రతి స్వచ్ఛంద సేవకునికీ ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి చిత్తశుద్ధినీ, సేవాభావాన్నీ ప్రశంసించారు.

ఏ కార్యక్రమమైనా విజయవంతమవ్వాలంటే దానికి సామాజిక భాగస్వామ్యం తప్పనిసరనీ ముఖ్యమైన లక్ష్యాలను సాధించడానికి సామాజిక శక్తిని మేల్కొల్పడమే ప్రాథమికమనీ ప్రధానమంత్రి స్పష్టం చేశారు. రాజకీయ వ్యవస్థలు, ప్రభుత్వాలకన్నా సమాజానికే ఎక్కువ శక్తి ఉందనీ, దేశ నిర్మాణంలో చురుకైన సామాజిక భాగస్వామ్యం లేకపోతే ఏ పరిపాలన వ్యవస్థా విజయం సాధించలేదనే తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. దీనికి ఉదాహరణగా స్వచ్ఛ భారత్‌ను పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రజల జీవనశైలిలో ఒక భాగంగా మారిందనీ, సామాజిక శక్తితోనే ముందుకు సాగుతోందనీ శ్రీ మోదీ తెలియజేశారు. ‘‘ఇలాంటి ముఖ్యమైన ప్రతి కార్యక్రమానికి సామాజిక శక్తిని మేల్కొల్పడం అవసరం’’ అని స్పష్టం చేశారు.

దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సమష్టి పరిష్కారాన్ని కనుగొనడంలో సామాజిక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపడుతున్న కార్యక్రమాల్లో స్థిరంగా సమాజ శక్తిని ఉపయోగించుకోవడాన్ని అభినందించారు. మొక్కలు నాటే కార్యక్రమాలు, గ్రామీణ స్మార్ట్ విలేజ్ కేంద్రాలు, మహిళలు, గిరిజనుల సాధికార కార్యక్రమాలు లేదా ఖైదీల మానసిక ఆరోగ్య కార్యక్రమాలు ఇలా ఎలాంటి అభివృద్ధి పనిలోనైనా ఈ సంస్థ అనుసరిస్తున్న సామాజిక విధానాన్ని ప్రశంసించారు. ‘‘ఈ ప్రయత్నాలనీ దేశ, సమాజాభివృద్ధికి గణనీయమైన రీతిలో దోహదపడతాయి’’ అని శ్రీ మోదీ వెల్లడించారు.

యువత సాధికారతకు ప్రాధాన్యమిస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి అభినందించారు. శాస్త్రీయ పురోగతి, ఆవిష్కరణల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో వేగంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో ఈ అంశంపై దృష్టి సారించాల్సిన తక్షణావసరాన్ని వివరించారు. ఈ మార్పుల్లో భాగస్వామిగా మాత్రమే భారత్ తన స్థానాన్ని పరిమితం చేసుకోవడం లేదనీ, ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు, మౌలిక వసతుల విస్తరణ, అంకుర సంస్థల వ్యవస్థలు లాంటి అనేక రంగాల్లో అగ్రగామిగా ఉందని తెలియజేశారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉన్న భారతీయ యువత దేశ విజయానికి దోహదం చేస్తోందన్నారు. ‘‘ఈ మార్పుల్లో భారతదేశం భాగస్వామ్యానికే పరిమితమవకుండా.. అనేక రంగాల్లో అగ్రగామిగా ఉంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ విజయాలకు భారత యువతే కారణమంటూ.. ఆధునిక ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాన్ని వెతికేలా యువతకు సాయడటంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పాత్రను గుర్తించారు.

వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న ఇద్దరిని వెంటనే అనుసంధానించగల సాంకేతిక శక్తిని మెచ్చుకుంటూనే.. ప్రజలు తమతో తాము అనుసంధానమయ్యే సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత, సమాజం పట్ల స్పందించే గుణమున్న యువతను తీర్చిదిద్దడంపైనే భారత దేశ అభివృద్ధి భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలియజేశారు. ఆధ్యాత్మిక శ్రేయస్సు, మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం లాంటి అంశాలపై కృషి చేసే సంస్థలు.. అనుసంధానం, ఏకత్వ భావం, ఉమ్మడి బాధ్యతను పెంపొందించడంలోనూ, సాంస్కృతిక అవగాహనకు అవకాశాలను అందించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. ‘‘మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత, సమాజం పట్ల స్పందించే గుణమున్న యువతతోనే వికసిత భారత్ నిర్మితమవుతుంది’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

నూతనంగా ప్రారభించిన ధ్యాన మందిరం వేలాది మందికి శాంతిని, స్వస్థతను అందించే ప్రదేశంగా నిలుస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థ... దేశం పట్ల తన విధులను అద్భుతంగా నిర్వర్తిస్తోందని ఆయన అన్నారు. దేశ సంపూర్ణాభివృద్ధి కోసం వారి ముందు కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనలను ఉంచాలని భావిస్తున్నట్లు తెలిపారు.

దేశ సమగ్రాభివృద్ధికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు కీలకపాత్రను పోషించాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సహజ వ్యవసాయ పద్ధతులతో రైతులను అనుసంధానించడంపై దృష్టి సారించాలని ప్రధానమంత్రి కోరారు. సుస్థిరమైన వ్యవసాయాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపాల్లో ఒకటిగా ఆయన వర్ణించారు. భూమాతను రసాయనాల నుంచి రక్షించడమంటే అది ఆధ్యాత్మిక సాధన, పర్యావరణ పరిరక్షణ లాంటిదే అని తెలియజెప్పారు. ‘‘సహజ వ్యవసాయ విధానాన్ని అనుసరించడం, రసాయనాల నుంచి భూమాతను రక్షించడం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగే’’ అని శ్రీ మోదీ చెప్పారు.

‘‘ఏక్ పేడ్ మా కే నామ్’’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ప్రోత్సహిస్తూ.. పర్యావరణ పరిరక్షణను ఉన్నత జీవన విధానమనే తత్వంతో నేరుగా ముడిపెట్టారు. ఈ లక్ష్యం కోసం పునరుత్తేజంతో కృషి చేయాలని పిలుపునిస్తూ.. ‘‘పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటిదే’’ అని చెప్పారు.

‘‘పర్ డ్రాప్, మోర్ క్రాప్’’ పథకం ద్వారా రైతు సమాజాల్లో మెరుగైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తున్నామని ప్రధానమంత్రి తెలియజేశారు. సామాజిక సహకారం ఫలితాలను మెరుగుపరుస్తుందని చెప్పారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పనిని తక్షణమే చేపట్టాలనీ, జల సంరక్షణపై అవగాహనకు ఇదే సరైన సమయమనీ స్పష్టం చేశారు. ‘‘ప్రతి నీటిబొట్టునూ సంరక్షించడం కూడా ఆర్ట్ ఆఫ్ లివింగే’’ అని శ్రీ మోదీ చెప్పారు.

బాధ్యతాయుతమైన జీవన విధానం అనే ఈ దృక్పథాన్ని విద్యుత్ పొదుపు, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ నిర్మూలన, స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులకు ప్రోత్సహించడం లాంటి అంశాలకు విస్తరించారు. వీటన్నింటినీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ తత్వంతో అనుసంధానించారు. ప్రకృతితో సామరస్యంగా ఉంటూ.. బాధ్యతాయుతమైన, అవగాహనతో కూడిన జీవనాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ లైఫ్ కార్యక్రమం గురించి వివరించారు. ‘‘ప్రకృతితో సమతుల్యతను పాటించే జీవన శైలి కూడా ఆర్ట్ ఆఫ్ లివింగే’’ అని శ్రీ మోదీ చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి ప్రధానమైన అంశాలకు ఈ సంస్థ ప్రాధాన్యమిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ముగించారు.

***


(రిలీజ్ ఐడి: 2259545) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam