భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ - 2026’, భారత అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన డాక్టర్ జితేంద్ర సింగ్


స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 2026 కింద సెప్టెంబర్ 12 నుంచి వారం రోజుల పాటు తీరప్రాంత పరిశుభ్రత కార్యక్రమాలు

ఈ ఏడాది డిసెంబర్ మూడో వారంలో పుణెలో జరగనున్న భారత అంతర్జాతీయ సైన్స్ ఉత్సవం గురించి కూడా చర్చించిన కేంద్రమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 MAY 2026 5:13PM by PIB Hyderabad

త్వరలో జరిగే స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ప్రచార కార్యక్రమం సన్నద్ధతపై ఈ రోజు జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధన, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు. అలాగే త్వరలో జరిగే భారత అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాల ఏర్పాట్లను కూడా మంత్రి విడిగా సమీక్షించారు. ఈ రెండు జాతీయ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి సంస్థల మధ్య స్పష్టమైన సమన్వయం ఉండాలని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

 

పృథ్వీ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో, సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు దేశవ్యాప్తంగా సాగే తీరప్రాంత పరిశుభ్రత ప్రచార ప్రణాళికను సమీక్షించారు. అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో పాటు భారత తీర రక్షణ దళం, సీమా జాగరణ్ మంచ్, పర్యావరణ సంరక్షణ గతివిధి, విభా, ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బయోటక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ ఎస్. గోఖలే, భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ డి. సెంథిల్ పాండియన్, శాస్త్రవేత్త డాక్టర్ జగ్వీర్ సింగ్ కూడా ఇందులో పాల్గొన్నారు.

 

కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖలు, విద్యా పరిశోధన సంస్థలు, జిల్లా యంత్రాంగాలు, యువజన సంఘాలు, స్థానిక వర్గాల క్రియాశీల భాగస్వామ్యంతో భారతదేశంలోని పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్ల తీరప్రాంతం వెంబడి వారం రోజుల పాటు పరిశుభ్రత కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. తీరప్రాంత సంరక్షణ, సముద్ర పర్యావరణ భద్రత పట్ల పెరుగుతున్న జాతీయ నిబద్ధతను ఈ ప్రచారం ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు.

సమావేశంలో ఒక ప్రదర్శన ద్వారా నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ సమన్వయం చేసిన రెండు వేల ఇరవై ఐదు ప్రచార పురోగతిని సమీక్షించారు. తీర ప్రాంతాల నుంచి 150 టన్నుల పైగా సముద్ర వ్యర్థాలను నమోదు చేయడంలో సహాయపడిన పౌర విజ్ఞాన వేదిక - సాగర్ యాప్ పాత్రను ఈ సమీక్షలో ప్రముఖంగా ప్రస్తావించారు. 

 

పృథ్వీ పథకం కింద చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమం శాస్త్రీయ పర్యవేక్షణను ప్రజా భాగస్వామ్యంతో అనుసంధానిస్తుందని, సముద్ర నీటి నాణ్యత అంచనా, సముద్ర వ్యర్థాల నిర్వహణ, తీరప్రాంత కోత వంటి ప్రమాదాల నివారణకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రయత్నాలకు తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రచార పరిధిని విస్తరించడానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, విద్యా సంస్థలు, స్వచ్ఛంద బృందాలు, పౌర సమాజ సంస్థలు మరింతగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

సుస్థిర నీలి ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను ప్రస్తావిస్తూ, భారత తీరప్రాంత కార్యక్రమాలు శాస్త్రీయ సంస్థలు, సాంకేతికతతో కూడిన భాగస్వామ్యంతో కొనసాగుతూ సమాజ ఆధారిత పర్యావరణ పరిరక్షణకు ఒక నమూనాగా మారుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

 

స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ ఉద్యమం దేశంలోని తీర ప్రాంతాల్లో సముద్ర వ్యర్థాలను శుభ్రం చేయడానికి, తగ్గించడానికి ఉద్దేశించిన 75 రోజుల అంతర్ మంత్రిత్వ శాఖల కార్యక్రమంగా 2022 లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సేవకులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, సామాజిక సంఘాల భాగస్వామ్యంతో ప్రతి ఏటా అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవ వారంలో భాగంగా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 2025లో ఈ ఉద్యమం సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు తీరప్రాంతాల్లో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో కొనసాగింది.

ఈ ఏడాది డిసెంబర్ మూడో వారంలో పుణెలో జరగనున్న భారత అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాల ఏర్పాట్లను కూడా మంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, ఆవిష్కరణలలో ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి శాస్త్రీయ సంస్థలు, ఆవిష్కర్తలు, విద్యార్థులు, యువ పరిశోధకుల సంఖ్యను పెంచే చర్యలపై ఆయన చర్చించారు.

****


(రిలీజ్ ఐడి: 2259425) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil