కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
మే 7న దేశవ్యాప్తంగా వార్షిక ఆరోగ్య పరీక్షల ఉచిత పథకాన్ని ప్రారంభించనున్న కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
నూతన కార్మిక చట్టాల అమలు: ఈఎస్ఐసీ ఆధ్వర్యంలో కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 1:42PM by PIB Hyderabad
నూతన కార్మిక చట్టాల ప్రకారం.. 40 ఏళ్లు పైబడిన కార్మికుల కోసం దేశవ్యాప్తంగా వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని మే 7న కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలోని బసైదారాపూర్ ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో అధికారికంగా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా మరో 11 ఈఎస్ఐసీ ఆస్పత్రుల్లోనూ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు ఆయా రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా కార్మికుల గౌరవాన్ని పెంపొందించటం, సామాజిక భద్రతను బలోపేతం చేయటమే లక్ష్యంగా చేపట్టిన "శ్రమయేవ జయతే" వ్యవస్థలో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ అమలు ప్రక్రియ 29 కేంద్ర కార్మిక చట్టాలను నాలుగు సమగ్ర విభాగాలుగా ఏకీకృతం చేస్తూ తీసుకువచ్చిన నాలుగు నూతన కార్మిక చట్టాల విప్లవాత్మక సంస్కరణలపై ఆధారపడి ఉంది. నిబంధనల అమలును సులభతరం చేయటం, ఉపాధిని వ్యవస్థీకృతం చేయటం, సామాజిక భద్రతా పరిధిని మరింత విస్తరించటం ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం.
అసంఘటిత రంగ కార్మికులు, గిగ్, వివిధ రంగాల్లోని కార్మికులకు సామాజిక భద్రతను విస్తరించడమే కాక, సామాజిక భద్రతా నిధిని సామాజిక భద్రత కోడ్-2020 ఏర్పాటు చేస్తుంది. ఈఎస్ఐసీ ప్రయోజనాల పరిధిని పెంచుతుంది. కొత్త కార్మిక చట్టాల నిబంధనల ప్రకారం.. 40 ఏళ్లు పైబడిన కార్మికులకు వార్షిక ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఈఎస్ఐసీ ఆసుపత్రుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధులను ముందుగానే గుర్తించటం, నివారణ చర్యలు చేపట్టటం, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
రసాయనాలు, విషపూరిత పదార్థాలు, భారీ యంత్రాల నిర్వహణ వంటి ప్రమాదకరమైన పనులు చేసే కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు నిర్వహించటం తప్పనిసరి. కార్మికుల దీర్ఘకాలిక ఆరోగ్యం, సంక్షేమం కోసం ఆరోగ్య రికార్డుల నిర్వహణ, నిర్ణీత కాలవ్యవధిలో పర్యవేక్షణ కూడా ఈ కార్యక్రమంలో భాగం.
ఈ దేశవ్యాప్త కార్యక్రమం.. వృత్తిపరంగా ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయటంలో, భారతదేశ శ్రామిక శక్తికి సమగ్ర ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావటమే కాక, వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలోనూ కీలక ముందడుగుగా నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2258377)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7