ఉప రాష్ట్రపతి సచివాలయం
గొప్ప అధికారం అంటే అది ఓ పెద్ద బాధ్యత కూడా: న్యూఢిల్లీలో 18వ సివిల్ సర్వీసుల దినోత్సవ నిర్వహణ సందర్భంగా అధికారులతో ఉపరాష్ట్రపతి
సివిల్ సర్వీసుల్లో మహిళల సంఖ్య పెరుగుతుండడం నారీశక్తి సత్తాతో పాటు మారుతున్న మనస్తత్వాలకు దర్పణం
సేవా తీర్థ్, కర్తవ్య భవన్లు కర్తవ్యం, సేవ, జాతీయ నిబద్ధతలకు ప్రతీకలు
పరిపాలనలో విభిన్న ప్రావీణ్యాలు అవసరం.. నియామక విధానాల్లో సంస్కరణలు తేవాలంటూ రాష్ట్రాలకు ఉపరాష్ట్రపతి విన్నపం
నాడు పోస్టు చేయడమైనది:
21 APR 2026 3:17PM by PIB Hyderabad
పద్దెనిమిదో సివిల్ సర్వీసుల దినోత్సవాన్ని న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ కీలకోపన్యాసాన్నిచ్చారు.
దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న సివిల్ సర్వీసు అధికారులతో పాటు రిటైరైన సివిల్ సర్వీసు అధికారులకు కూడా ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారతదేశ తొలి హోం మంత్రి హోదాలో సర్దార్ వల్లభాయి పటేల్ ఢిల్లీలో పరిపాలన సర్వీసుల్లో శిక్షణ పొందిన అధికారులను ఉద్దేశించి ప్రసంగించి ఇప్పటికి 79 సంవత్సరాలైన సంగతిని శ్రీ రాధాకృష్ణన్ గుర్తుచేశారు. అప్పట్లో పటేల్... సివిల్ సర్వీసు అధికారులను ‘‘భారత్కు సుదృఢకవచం’’ (స్టీల్ ఫ్రేం ఆఫ్ ఇండియా) అంటూ వర్ణించారు. ఈ వారసత్వాన్ని సివిల్ సర్వీసుల్లో పనిచేసిన అధికారులంతా నిలబెట్టారనీ, ప్రగతి బాటలో సమృద్ధి మార్గంలో దేశ పయనానికి వారు ఎంతగానో తోడ్పడ్డారనీ ఉపరాష్ట్రపతి అన్నారు. రాష్ట్రాల్లో సేవలందిస్తున్న సివిల్ సర్వీస్ అధికారులు జాతీయ ఏకతకీ, జాతీయ అఖండతకీ మహా దూతల వంటి వారని ఆయన కితాబిచ్చారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పది సంవత్సరాల్లో సాధించిన పరివర్తన పూర్వక ప్రగతిని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, ‘‘సబ్ కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’’ దృష్టి కోణాన్ని గురించి వివరించారు. సుమారు 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడం, పేదలకు 4 కోట్ల కన్నా ఎక్కువ ఇళ్లను నిర్మించడం, సరిహద్దు ప్రాంతాల్లోని పల్లెలను చైతన్య సమూహాలుగా అభివృద్ధి చేయడం సహా కీలక విజయాలను గురించి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. లాఖ్పతి దీదీలు, నమో డ్రోన్ దీదీల వంటి కార్యక్రమాల చలవతో అభివృద్ధిలో మహిళలు నాయకత్వ పాత్రను పోషిస్తున్నారని ఆయన తెలిపారు. అభివృద్ధి కోసం తపిస్తున్న జిల్లాల కార్యక్రమం, ఒక జిల్లా ఒక ఉత్పాదన వంటి ముఖ్య కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ, ఏ రాష్ట్రాన్ని గాని ఏ జిల్లాను గాని వెనుకపట్టున నిలిచిపోనివ్వ లేదన్నారు.
ప్రభుత్వ విధానాలను తూచా తప్పక సివిల్ సర్వీస్ అధికారులు అమలుచేస్తున్నారని ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ, ఈ విజయాల్లో వారి అంకిత భావం పాత్ర ఎంతో ఉందన్నారు. సబ్ కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ సిద్ధాంతాన్ని దేశంలో ప్రతి ఒక్కరు అనుభవంలోకి తెచ్చుకోవాలని శ్రీ రాధాకృష్ణన్ అన్నారు. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి భారత్ చేస్తున్న యాత్ర మరెంతో దూరం సాగాల్సి ఉందన్నారు. అందరికీ అభివృద్ధి ఫలాలు అందేటట్లు చూడడానికీ, ప్రభావాన్విత పరిపాలనను నిర్ధారించడానికీ వరుసలోని ఆఖరు లబ్ధిదారుపైన దృష్టిని కేంద్రీకరించాలనీ, తిరుగులేని నిబద్ధతనీ, న్యాయవర్తననీ అలవరుచుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి దృష్టికోణాన్ని ఉపరాష్ట్రపతి పునరుద్ఘాటిస్తూ, పౌరుల్లో ఎవ్వరూ అన్యాయానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత సివిల్ సర్వీసుల అధికారులదేనని స్పష్టం చేశారు.
సాంకేతికత త్వరత్వరగా మారుతున్న నేపథ్యంలో, సివిల్ సర్వీసుల అధికారులు నైపుణ్యాలకు సాన పెట్టుకోవడం మరవొద్దనీ, రాబోయే కాలం అవసరాలను గమనించి వాటిని తీర్చడానికి సన్నద్ధులు కావాలనీ ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. సామర్థ్యాలను పెంచుకోవడానికి ఐగాట్ కర్మయోగి వంటి వేదికలను ఉపయోగించుకోవడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలంటూ, సామర్థ్యాన్నీ, పారదర్శకతనీ మెరుగుపరుచుకోవడంలో, లబ్ధిదారుల చెంతకు చేరుకోవడంలో సాంకేతికతకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. సంక్షేమ పథకాలు దారి తప్పకుండా చూడడంలోనూ, సేవల అందజేతను మెరుగుపరచడంలోనూ సాంకేతిక పురోగతి తోడ్పడిందని వివరించారు. అర్హులైన లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ఎంతో శ్రద్ధగా రూపొందించాలంటూ ఆయన జాగ్రత్తలు చెప్పారు.
సివిల్ సర్వీసుల్లో సాధారణ సబ్జెక్టులపైనే పూర్తిగా ఆధారపడే కాలం ముగిసిందనీ, ప్రత్యేక సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిందనీ ఉపరాష్ట్రపతి తెలిపారు. పాలనను పటిష్ఠపరచడం కోసం ముందుచూపుతో కూడిన నియామక విధానాలను అవలంబించాలని రాష్ట్రాలను ఆయన కోరారు. కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎమ్ఎల్), న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లతో పాటు బ్లాక్చైన్ వంటి ఇప్పుడిప్పుడే వర్ధిల్లుతున్న సాంకేతికతలపై పట్టు సాధించాల్సిందిగా సివిల్ సర్వీసు అధికారులను ఆయన ప్రోత్సహించారు.
తమిళ ముని, కవి తిరువళ్లువర్ మాటలను ఉపరాష్ట్రపతి ఉదహరించారు. ధర్మబద్ధత సంపద తాలూకు అత్యున్నత స్థితి అనీ, దానిని వెన్నంటి భౌతిక సమృద్ధీ, నైతిక శక్తీ వస్తాయన్నారు. నిజమైన నాయకత్వం నైతిక ప్రవర్తనలోనే ఇమిడి ఉంటుందనీ, విశేషించి సవాళ్లను రువ్వే స్థితుల్లో అది వెలికివస్తుందనీ ఆయన అన్నారు. సహేతుక మార్గదర్శకత్వాన్ని అనుసరించడానికీ, అనుచిత ఒత్తిడికి లొంగిపోవడానికీ మధ్య తేడాను గమనించాలని చెబుతూ, అధికారులు ఏ కాలంలో అయినా సరే నిజాయతీనీ, నిష్పాక్షికతనీ కాపాడితీరాలని ఆయన కోరారు.
సివిల్ సర్వీసుల్లో మహిళల ప్రాతినిధ్యం అంతకంతకూ పెరుగుతున్నందుకు ఉపరాష్ట్రపతి సంతృప్తిని వ్యక్తం చేశారు. 2016లో మహిళల వాటా సుమారు 21 శాతంగా ఉండగా, 2025 పరీక్ష నాటికి దాదాపు 31 శాతానికి వృద్ధి చెందిందని తెలిపారు. ఇది మహిళా శక్తికి అద్దం పడుతోందనీ, సంఖ్యాత్మక మార్పు ఒక్కటే కాకుండా మనస్తత్వంలో కూడా చోటుచేసుకున్న మార్పు ఇదనీ ఆయన వర్ణించారు. నారీ శక్తి వందన్ అధినియంతో చట్టసభల్లో ఇదే విధమైన పురోగతి నమోదు కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సివిల్ సర్వీసుల పరీక్షల్లో ఎడతెగని పోటీ ఉందనీ, ఏటా 12-15 లక్షల మంది ఈ పరీక్షలు రాస్తుంటే సుమారు 1,000 మంది మాత్రమే ఎంపికవుతున్నారనీ ఉపరాష్ట్రపతి తెలిపారు. అధికారుల సమున్నత స్థితిని ఆయన గుర్తుచేస్తూ, దేశం పట్ల దేశ పౌరుల పట్ల వారికి ఉన్న బాధ్యతలు ఎంతటివో అనే స్పృహతో మెలగాలన్నారు. సవాళ్లను మరింత మెరుగైన పద్ధతిలో అర్థం చేసుకొని, వాటిని పరిష్కరించే ప్రక్రియలో సివిల్ సర్వీసుల అధికారులు కింది స్థా
యి అధికారులతో చక్కని అనుబంధాన్ని కలిగి ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
సేవా తీర్థ్నీ, కర్తవ్య భవన్నీ ఇటీవలే ప్రజలకు అంకితం చేసిన విషయాన్ని శ్రీ రాధాకృష్ణన్ గుర్తుకు తెస్తూ, ఇవి దేశ ప్రజలకు సేవ చేయడానికి, అంకితం కావడానికీ తిరుగులేని నిబద్ధతకు ప్రతీకలుగా నిలిచిఉన్నాయన్నారు. సివిల్ సర్వీసుల అధికారులు తమ కృషి ఫలితాలు సుదూర ప్రాంతాలకు కూడా అంది, పౌరుల జీవితాలను మార్చి, ఫిర్యాదుల్ని పరిష్కరించి, వారికి సాధికారతను సమకూర్చి, తద్వారా సమానత్వ, ఆత్మగౌరవ విలువలతో పాటు న్యాయాన్ని బలోపేతం చేసేటట్లు చూడాలని ఉపరాష్ట్రపతి కోరారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్ర, ప్రధానమంత్రికి రెండో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శక్తికాంత దాస్, కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టి.వి. సోమనాథన్, డీఏఆర్పీజీ కార్యదర్శి నివేదిత శుక్ల వర్మ, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2254229)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13