పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పదిహేడేళ్ల నాటి వన్యప్రాణి నేరం కేసులో దోషిగా తేలిన శహ్తుశ్ వ్యాపారి
సీబీఐ విచారించిన మొదటి వన్యప్రాణి సంబంధ నేరం.. వివిధ ఏజెన్సీల మధ్య పక్కా సమన్వయానికి నిదర్శనం
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 12:55PM by PIB Hyderabad
భారత వన్యప్రాణి సంబంధిత నేరాల నియంత్రణ ఆదేశాల్లో చరిత్రాత్మక ఆదేశం ఇది.. చట్టవిరుద్ధంగా శహ్తూశ్ శాలువాలను ఎగుమతి చేయడానికి ప్రయత్నించి, ‘వన్యప్రాణి పరిరక్షణ చట్టం-1972’ను అతిక్రమించారంటూ జైపూర్లోని ఒక చిత్రశాల యజమానిని దోషిగా న్యూఢిల్లీలోని ఓ న్యాయస్థానం నిర్ధారించింది. శహ్తుశ్ శాలువా తయారీకి.. టిబెట్లో సంచరించే కొమ్ముల జింక (పాంథలోప్స్ హాగ్సోనీ) వెంట్రుకలను ఉపయోగించారని తేలింది.
జైపూర్లోని ఇండియన్ ఆర్ట్ గ్యాలరీ యజమాని సయ్యద్ షాహిద్ అహ్మద్ కాశానీకి వ్యతిరేకంగా రావుజ్ ఎవెన్యూ జిల్లా న్యాయస్థానాల చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేటు 2026 మార్చి నెల 12న తీర్పును ప్రకటించారు. దీంతో, 2008లో నమోదైన కేసును ఎట్టకేలకు కొలిక్కి తీసుకువచ్చినట్లయింది.
టిబెట్లో కనిపించే కొమ్ముల జింక స్థానికంగా చిరూ పేరిట ప్రసిద్ధం. దీనిని వన్యప్రాణి (పరిరక్షణ) చట్టం-1972 లోని షెడ్యూలు I లో చేర్చారు. స్థానిక చట్టాల్ని అనుసరించి, దీంతో వ్యాపారం చేయడంపై కఠిన నిషేధాజ్ఞలను అమల్లోకి తెచ్చారు. సీఐటీఈఎస్లో పేర్కొన్న ప్రకారం, 1975 నుంచి శహ్తుశ్ శాలువాల వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. సీఐటీఈఎస్పై సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడా ఉంది.
వన్యప్రాణి నేర నియంత్రణ మండలి (డబ్ల్యూసీసీబీ), కేంద్ర పరిశోధక మండలి (సీబీఐ), భారత కస్టమ్స్, వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ (డబ్ల్యూఐఐ)లు కలిసికట్టుగా చక్కని సమన్వయంతో సుమారు 17 సంవత్సరాల పాటు ముందుకు సాగడం ఈ కేసు ప్రత్యేకత. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,290 శహ్తుశ్ శాలువాలు ఎగుమతికి సిద్ధంగా ఉన్నట్లు డబ్ల్యూసీసీబీ గుర్తించింది. 2009 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో సీబీఐకి చెందిన ఈఓయూ-వీ బ్రాంచిలో ఫిర్యాదును దాఖలు చేశారు. సీబీఐ ఆధ్వర్యంలో విచారణ జరిగిన వన్యప్రాణి సంబంధిత తొలి నేరం ఇది.
పశ్మీనా శాలువలను ఎగుమతి చేయాలంటే వన్యప్రాణి అధికారుల వద్ద నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాన్ని పొందాలి. ఈ కారణంగా ఉత్తర ప్రాంత డబ్ల్యూసీసీబీ ఇన్స్పెక్టర్ ఆరతీ సింగ్ ఎగుమతి సరకును పరీశీలించి, ఆ శాలువాలను శహ్తుశ్ ఉన్నితో తయారు చేశారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 41 శాలువాల రూపకల్పనలో టిబెట్ జాతి జింకల వెంట్రుకల్ని ఉపయోగించారని డెహ్రాడూన్లోని భారతీయ వన్యప్రాణి సంస్థ (డబ్ల్యూఐఐ) ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది. మొదటి దశలో 5 శాలువాల్లోనూ, రెండో దశ దర్యాప్తులో 36 శాలువాల్లోనూ ఆధారాలు లభించాయి.
డబ్ల్యూసీసీబీ (ఉత్తర ప్రాంతం) ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టరు శ్రీ రమేశ్ కుమార్ పాండే ఫిర్యాదు దాఖలు చేశారు. ఆయనే సీబీఐలో లాంఛనంగా ఫిర్యాదు సమర్పించడంతో పాటు, డబ్ల్యూఐఐకి ఫోరెన్సిక్ నమూనాలను పంపించే పనిని కూడా తీసుకున్నారు. శ్రీ పాండే ప్రస్తుతం ఏడీజీ వైల్డ్లైఫ్ గానూ, డబ్ల్యూసీసీబీలో డైరెక్టర్ (ఎక్స్-అఫీషియో)గానూ సేవలను అందిస్తున్నారు. ఈ కేసులో ఆయన పూర్తి స్థాయి సహకారాన్ని అందించారు.
శాలువాలను కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకొని, సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. జప్తు చేసిన శాలువాల గురించి డబ్ల్యూఐఐలోని వైల్డ్లైఫ్ ఫోరెన్సిక్ విభాగం నివేదికను ఇవ్వడంతో పాటు, టిబెట్కు చెందిన కొమ్ముల జింక వెంట్రుకల ఉనికిని కూడా గుర్తించారు. అప్పటి సీబీఐ అధికారి శ్రీ సంజయ్ దూబే దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. ఈయన సాక్ష్యాలను సేకరించడం మొదలు, న్యాయస్థానంలో వాదనల్లో పాలుపంచుకోవడం వరకు.. అన్ని వ్యవహారాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. డబ్ల్యూసీసీబీ ఇన్స్పెక్టర్ ఆరతీ సింగ్ సకాలంలో సరకును గుర్తించి, జప్తు చేయడంలో ముఖ్య పాత్రను పోషించారు. నిపుణులు అందించే సాక్ష్యాన్ని డబ్ల్యూఐఐకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.పి. గోయల్ సమకూర్చారు. ఇది న్యాయస్థానం ప్రశ్నల వేళ వాస్తవాన్ని నిర్ధారించడంలో తోడ్పడింది.
యంత్రాన్ని ఉపయోగించి తయారు చేసిన పశ్మీనాను ఢిల్లీ విక్రేత వద్ద నుంచి కొనుగోలు చేయడమే తన వంతని నిందితుడు తెలిపాడు. ఇది మినహా తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నాడు. నిందితుని తరఫు న్యాయవాదులు ఘటన జరిగిన స్థలంలో పరీక్షలపైనా, సాక్ష్యాల నిర్వహణపైనా ప్రశ్నలను సంధించారు. అయితే, ఆ అంశాలన్నింటినీ న్యాయస్థానం కొట్టివేసింది. డబ్ల్యూఐఐ అందించిన సాక్ష్యాల నివేదికలను సమర్ధించింది. నిర్దోషి అని చెప్పుకొంటున్న వాదనలతో నిందితుని ప్రవర్తన తులతూగడం లేదని పేర్కొంది. నిందితునికి సెక్షన్ 49బీ ((1)/51(1ఏ) కింద 3 సంవత్సరాల జైలుశిక్షనీ, రూ.50,000 జరిమానాతో పాటు సెక్షన్లు 40, 49ల కింద చెరో 2 సంవత్సరాల అదనపు కారాగార వాసాన్నీ (ఈ శిక్షలన్నీ ఏకకాలంలో వర్తిస్తాయి) విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది. స్వాధీనం చేసుకున్న శాలువాలను ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తారు.
ఈ కేసు శహ్తూశ్ దొంగరవాణా ఆరంభిక దశకు సంబంధించింది. దీని దర్యాప్తును డబ్ల్యూసీసీబీ కోరిన మీదట సీబీఐ చేపట్టింది. భారత్లో వన్యప్రాణి చట్టాల పటిష్ఠ అమలుకు ఒక ఏకీకృత దృష్టికోణాన్ని అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ కేసు స్పష్టం చేస్తోంది. అంతేకాక, ఒక దశాబ్ద కాలానికి పైగా దర్యాప్తు చేసే సామర్ధ్యం, పరిశోధన, ఫోరెన్సిక్స్, విచారణను కొనసాగించే సామర్థ్యం.. ఇవన్నీ కూడా ఇమిడి ఉండాలని ఈ కేసు చాటిచెబుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2252383)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13