సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
గత ఐదేళ్లలో టీవీ కార్యక్రమాలు-ప్రకటనల నియమావళి కింద 140కి పైగా ఉల్లంఘనలపై చర్యలు
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 5:38PM by PIB Hyderabad
కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ల (నియంత్రణ) చట్టం-1995 కింద రూపొందించిన కార్యక్రమాల నియమావళి, ప్రకటనల నియమావళికి ప్రైవేట్ టెలివిజన్ ఛానెళ్లు కట్టుబడి ఉండాలి. కార్యక్రమాల నియమావళి ప్రకారం, కింది వాటిలో ఏవైనా కలిగి ఉన్న కార్యక్రమాన్ని ప్రైవేట్ టెలివిజన్ లో ప్రసారం చేయరాదు:
-
అశ్లీలత
-
మతాలు లేదా వర్గాలపై దాడి
-
మత సమూహాలను కించపరిచే దృశ్యాలు లేదా సంభాషణలు
-
మతతత్వ ధోరణులను ప్రోత్సహించే అంశాలు
-
ఏదైనా వ్యక్తిని వ్యక్తిగతంగా గానీ, లేదా దేశ సామాజిక, ప్రజా, నైతిక జీవనంలోని నిర్దిష్ట సమూహాలు లేదా వర్గాలను గానీ విమర్శించే, అపఖ్యాతి పాలు చేసే, నిందించే విషయం.
ఈ విషయాలతో పాటు... ప్రకటనల్లో అసభ్యకరమైన, అశ్లీలమైన, సూచనాత్మకమైన, విముఖతను కలిగించే, అభ్యంతరకరమైన ఇతివృత్తాలను లేదా చిత్రీకరణను నివారించాలని ప్రకటనల నియమావళి నిర్దేశిస్తుంది.
కార్యక్రమ-ప్రకటనల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక చట్టబద్ధమైన యంత్రాంగాన్నీ ఏర్పాటు చేసింది. ఈ మూడంచెల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ప్రైవేట్ ఉపగ్రహ టీవీ ఛానెళ్లు ప్రసారం చేసే కంటెంట్కు సంబంధించిన ఫిర్యాదులను కింది విధంగా పరిష్కరిస్తుంది:
స్థాయి-I: ప్రసారకర్త ద్వారా నేరుగా స్వీకరించి, పరిష్కరించేవి.
స్థాయి-II: ప్రసారకర్తల స్వీయ-నియంత్రణ సంస్థలు.
స్థాయి-III: కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటు.
ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లకు సూచనలు, హెచ్చరికలు, క్షమాపణ స్క్రోల్ ఆర్డర్లు, ప్రసార నిలిపివేత ఉత్తర్వులు మొదలైన వాటిని జారీ చేయడం ద్వారా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. కార్యక్రమ నియమావళిని, ప్రకటనల నియమావళిని పాటించేలా ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లకు మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సూచనలను జారీ చేస్తుంది.
గత 5 సంవత్సరాల్లో... కార్యక్రమ నియమావళి, ప్రకటనల నియమావళికి సంబంధించిన అన్ని ఉల్లంఘనల విషయంలో ఈ మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
పైన పేర్కొన్న వాటితో పాటు, ఇతర మీడియా వేదికల ద్వారా జరిగే ఉల్లంఘనలను అరికట్టడానికి ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలనూ తీసుకుంటుంది. వీటిలో ఇవి భాగంగా ఉన్నాయి:
ప్రింట్ మీడియా: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందించిన “పత్రికా ప్రవర్తనా నియమావళి”ని వార్తాపత్రికలు తప్పక పాటించాలి. ఇతర అంశాలతో పాటు ఈ నియమాలు నకిలీ, పరువు నష్టం కలిగించే, తప్పుదోవ పట్టించే వార్తల ప్రచురణను నియంత్రిస్తాయి. పీసీఐ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం, ఈ నియమాల ఉల్లంఘన ఆరోపణలపై మండలి విచారణ జరుపుతుంది. సందర్భాన్ని బట్టి సంబంధిత వార్తాపత్రిక, సంపాదకులు, పాత్రికేయులు తదితరులను హెచ్చరించడం, మందలించడం, తీవ్రంగా మందలించడం వంటి చర్యలు చేపట్టవచ్చు.
డిజిటల్ మీడియా: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు-2021 (ఐటీ రూల్స్-2021)... డిజిటల్ మీడియాలో వార్తలు, సమకాలీన విషయాలను ప్రచురించే ప్రచురణకర్తలు, ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రచురణకర్తల కోసం ఒక నైతిక నియమావళిని అందిస్తుంది. ప్రచురణకర్తలపై నైతిక నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం మూడంచెల సంస్థాగత యంత్రాంగాన్నీ ఇది అందిస్తుంది.
శ్రీ కళ్యాణ్ బెనర్జీ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ సమాచారాన్ని ఈ రోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా సమర్పించారు.
***
(రిలీజ్ ఐడి: 2247985)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9