సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రసార రంగాన్ని మార్చేస్తోన్న డిజిటల్ రేడియో, డైరెక్ట్-టు-మొబైల్ సాంకేతికత
తక్కువ ఖర్చులో వినోదం, విద్యతో పాటు పటిష్ఠమైన కీలక సందేశాలను అందించటాన్ని సాధ్యం చేస్తోన్న ఈ సాంకేతికలు
డీఎల్టీ ప్లాట్ఫామ్ ద్వారా స్పామ్ కాల్స్ పై నియంత్రణను కఠినతరం చేసిన ట్రాయ్
తద్వారా వినియోగదారుల ప్రాధాన్యతలు, ఫిర్యాదుల పరిష్కారానికి వీలు కల్పిస్తోన్న ట్రాయ్
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 5:37PM by PIB Hyderabad
డిజిటల్ రేడియో, డైరెక్ట్-టు-మొబైల్ (డీటూఎం) సాంకేతికతలు స్పెక్ట్రమ్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఒకే ఫ్రీక్వెన్సీపై బహుళ ఛానళ్లను అందిస్తూ ప్రసారం రంగంలో (మాస్ కమ్యూనికేషన్) విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయి. తక్కువ ధరలో ఉచిత ప్రసార వ్యవస్థను డిజిటల్ రేడియో అందిస్తోంది. దీనిని మరింత విస్తరిస్తూ డీటూఎం సాంకేతికత ద్వారా సిమ్ కార్డు లేదా మొబైల్ డేటాతో సంబంధం లేకుండా నేరుగా మొబైల్ హ్యాండ్సెట్లకు వీడియో, ఆడియో, డేటాను ప్రసారం చేయొచ్చు. ఇది తక్కువ ఖర్చుతో కూడిన వినోదం, విద్య, అత్యవసర విపత్తు నిర్వహణ హెచ్చరికలను అందించడానికి ఒక బలమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
టీసీసీసీపీఆర్ (టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్) ప్రకారం వాణిజ్య సంస్థలకు సంబంధించిన అవసరం లేని సమాచారం (యూసీసీ) లేదా స్పామ్ కాల్లను ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నియంత్రిస్తోంది. యూసీసీని అరికట్టే లక్ష్యంతో ట్రాయ్ డీఎల్టీ (డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ) అనే బ్లాక్చైన్ ఆధారిత ప్లాట్ఫామ్ను తీసుకొచ్చింది. దీని ద్వారా వినియోగదారులు ప్రచార సందేశాలకు సంబంధించి తమ ఇష్టాయిష్టాలను నమోదు చేసుకోవచ్చు. బ్యాంకులు, బీమా కంపెనీలు, విమానయాన కంపెనీలు వంటి ప్రధాన సంస్థలతో (ప్రిన్సిపల్ ఎంటిటీస్) పాటు టెలిమార్కెటర్లు కూడా ఈ డీఎల్టీ ప్లాట్ఫామ్లో తప్పనిసరిగా నమోదు కావాలి. దీనితో పాటు నమోదు అయిన, నమోదు కాని టెలిమార్కెటర్లపై ఫిర్యాదు చేయడానికి ఈ ప్లాట్ఫామ్లో ఒక ప్రత్యేక ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది వివిధ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఫిర్యాదుల సమాచారాన్ని వేగంగా చేరవేస్తూ తగిన చర్యలు తీసుకోవడానికి సహకరిస్తుంది.
ఎప్పటికప్పుడు తగిన విధానపరమైన మార్గదర్శకాలను జారీ చేయడం ద్వారా ప్రసార రంగంలో వర్ధమాన సాంకేతికతలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది. బీఐఎన్డీ (బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్) అనేది ఒక కేంద్ర రంగ పథకం. దీని ద్వారా దూరదర్శన్, ఆకాశవాణిల మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం, మెరుగుపరచడం చేస్తున్నారు. ఈ పథకం కింద ప్రసార భారతి నిరంతరం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్లను నవీకరిస్తోంది. ఇందులో భాగంగా నెట్వర్క్ డిజిటలైజేషన్, సరికొత్త సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు.
శ్రీ రావు రాజేంద్ర సింగ్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ రోజు లోక్సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ వివరాలను అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2247978)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11