పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
పార్లమెంటు ప్రశ్న: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 1:37PM by PIB Hyderabad
గతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో కొత్తగా ‘ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026’ చట్టాన్ని 27 జనవరి 2026న అధికారిక గెజిట్ ద్వారా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సవరించిన నిబంధనలు సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారుల బాధ్యత సూత్రాలను సమన్వయం చేస్తూ, వ్యర్థాల విభజన, సమర్థవంతమైన నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తాయి.
2026 ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం.. వ్యర్థాలను ఉత్పత్తి చేసే చోటే వాటిని తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, ప్రత్యేక శ్రద్ధ అవసరమయ్యే వ్యర్థాలుగా నాలుగు రకాలుగా విభజించడం తప్పనిసరి. పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే వారిని స్పష్టంగా నిర్వచించడమే కాకుండా.. విస్తరించిన భారీ వ్యర్థాల ఉత్పత్తిదారు బాధ్యతను నెరవేర్చాలని ఈ నిబంధనలు నిర్దేశించాయి. దీనివల్ల వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ధి పర్యావరణ హితంగా జరుగుతుంది. ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ధి, పారవేసే ప్రక్రియలతో సహా ప్రతి దశను పర్యవేక్షించడానికి కేంద్రీకృత ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశారు.
ఈ నిబంధనలు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, భారత ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలకు నిర్దిష్ట పాత్రలు, బాధ్యతలను అందిస్తాయి. సిమెంట్ ప్లాంట్లు, వ్యర్థాల నుంచి శక్తిని ఉత్పత్తి చేసే కేంద్రాలతో సహా పారిశ్రామిక కేంద్రాల్లో వ్యర్థాల నుంచి తయారైన ఇంధనాన్ని (ఆర్ డీఎఫ్) వినియోగించడం ద్వాదా ఇంధన ప్రత్యామ్నాయ రేటును ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి రాబోయే ఆరేళ్లలో 15 శాతానికి కి పెంచాలని ఈ నిబంధనలు వివరిస్తున్నాయి. ఘన వ్యర్థాల శుద్ధి, పారవేసే కేంద్రాల కోసం భూమి కేటాయింపును వేగవంతం చేయడానికి, అభివృద్ధి కోసం శ్రేణీకృత ప్రమాణాలను ఈ నిబంధనలలో పొందుపరిచారు. ఘన వ్యర్థాల శుద్ధి, పారవేసే కేంద్రాలు తమ నివేదికలను ఆన్లైన్లో సమర్పించడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధనల ప్రకారం వ్యర్థాల శుద్ధి కేంద్రాలు ఇకపై ఆడిటింగ్కు కూడా లోబడి ఉంటాయి.
పాతకాలం నాటి వ్యర్థాల పునరుద్ధరణ కోసం కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలు చేయాలని, ఘన వ్యర్థాలను భూమిలో పూడ్చడంపై ఆంక్షలను మరింత పటిష్టం చేయాలని కూడా ఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కొండ ప్రాంతాలు, ద్వీపాలలో ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేక నిబంధనలను కూడా ఇందులో చేర్చారు. ‘కాలుష్య కారకుడే చెల్లించాలి‘ అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేందుకు వీలుగా నిబంధనలను పొందుపరిచారు. ఈ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఏర్పాటు చేసింది.
ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ నేడు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2246916)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23