శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సాధారణ ఊబకాయం కన్నా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవటం ఆరోగ్యానికి ప్రమాదకరం.. భారతీయుల్లో సన్నగా కనిపించే వారిలోనూ అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువ: డాక్టర్ జితేంద్ర సింగ్
మామూలుగా కనిపించే వ్యక్తుల్లోనూ పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవటం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ వంటి పలు సమస్యలకు అవకాశం: డాక్టర్ జితేంద్ర సింగ్
"గుండె సంబంధిత వ్యాధుల్లో స్థూలకాయం, లిపిడ్ నిర్వహణ"పై సమగ్ర పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
అవగాహన పెంపొందించటం, జీవనశైలి మార్పులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశాన్ని ప్రతిబింబించే పుస్తకం: డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
29 MAR 2026 5:08PM by PIB Hyderabad
సాధారణ ఊబకాయం కన్నా పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవటం అత్యంత ప్రమాదకరమని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాస్త్ర శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష విభాగాల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ముఖ్యంగా భారతీయుల్లో సన్నగా కనిపించే వ్యక్తుల్లోనూ అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. ఊబకాయంతో సంబంధం లేకుండా కేవలం పొట్ట దగ్గర పెరిగే కొవ్వు ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతుందని తెలిపారు.
"సీవీడీలో స్థూలకాయం, లిపిడ్ నిర్వహణలో పురోగతులు" సమగ్ర పాఠ్య పుస్తకాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొట్ట దగ్గర పేరుకుపోయే కొవ్వు, లావుగా కనిపించని వ్యక్తుల్లోనూ జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుందన్నారు. దీనివల్ల మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని చెప్పారు.
భారతీయుల శరీరతత్వం గురించి ప్రస్తావిస్తూ.. పురుషులు, మహిళల్లోనూ ఊబకాయం పెరుగుతున్నప్పటికీ, పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోవటం అత్యంత ఆందోళకరమని మంత్రి అన్నారు. ఇది ఇతర సమస్యలతో సంబంధం లేకుండా గుండె, జీర్ణక్రియ వ్యాధుల ముప్పును పెంచుతుందని చెప్పారు. సాధారణంగా ఊబకాయులు కావప్పటికీ, కేవలం పొట్ట భాగంలో మాత్రమే కొవ్వు పేరుకుపోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించి చికిత్స, నివారణా చర్యలు చేపట్టటం అవసరమని స్పష్టం చేశారు.
సకాలంలో, సందర్భోచితంగా ఈ పుస్తకం ఉన్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో పెరిగిపోతున్న ఊబకాయం సమస్యను పరిష్కరించాలన్న జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. నూనె వాడకాన్ని తగ్గించటం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి జీవనశైలి సంస్కరణలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం "వికసిత భారత్, స్వస్థ భారత్, ఊబకాయ రహిత భారత్" విస్తృత దార్శనికతకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.
పెరుగుతున్న వైద్య అవగాహన గురించి వివరిస్తూ.. ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ నిరోధకత, చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడటానికి, పొట్ట భాగంలోని కొవ్వుకు సంబంధాలున్నట్లు ఆధారాలున్నాయని మంత్రి తెలిపారు. యువతలో టైప్-2 డయాబెటిస్, గుండెపోటు, జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు పెరగటం.. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవటాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.
సమతుల్య ఆరోగ్య పద్ధతుల ప్రాముఖ్యతను డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. తగినంత సన్నద్ధత లేదా విశ్రాంతి లేకుండా చేసే వ్యాయామాల వంటి అశాస్త్రీయ ఫిట్నెస్ విధానాలు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయన్నారు. స్థిరమైన జీవనశైలి క్రమశిక్షణ, తగినంత నిద్ర, శాస్త్రీయ పద్ధతుల్లో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని చెప్పారు.
ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ హెచ్.కె. చోప్రా సంపాదకత్వంలో వెలువడిన ఈ పాఠ్య పుస్తకం.. భారత్, విదేశాలకు చెందిన 300 మందికి పైగా రచయితల నుంచి అత్యాధునిక పరిశోధనల సమాహారం. ఇది జీర్ణక్రియ చికిత్సలు, లిపిడ్ నిర్వహణ, డిజిటల్ ఆరోగ్యం, ఏఐ ఆధారిత వైద్య నిర్ణయ వ్యవస్థల్లోని పురోగతులను సమన్వయం చేస్తూ.. సాంప్రదాయ ప్రమాద కారక ఆధారిత నిర్వహణ నుంచి కచ్చితమైన నివారణ వైపు మార్పును సూచిస్తుంది.
సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి జీఎల్పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్లతో అభివృద్ధి చెందుతున్న చికిత్సలను ఈ పుస్తకం సమగ్రంగా వివరిస్తుంది. వీటితో పాటు స్టాటిన్లు, ఎజెటిమిబ్, బెంపెడోయిక్ యాసిడ్, పీసీఎస్కే9 ఇన్హిబిటర్లు, ఇంక్లిసిరాన్, అఫెరిసిస్, జన్యుపరమైన పరిష్కారాలతో లిపిడ్ను తగ్గించే వ్యూహాలు ఇందులో ఉన్నాయి. ఈ పురోగతులు గుండె సంబంధిత ఫలితాలను మెరుగుపరిచి, వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశముంది.
భారత్లో, ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు, మరణాలు పెరగటానికి ఊబకాయం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం వంటి ప్రధాన ఆరోగ్య సవాళ్లు ఈ పుస్తక పీఠికలో ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అవగాహన పెంచటం, నివారణ వ్యూహాలను రూపొందించటం, ఆధారాలతో కూడిన వైద్య విధానాల ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు.
2050 నాటికి భారత్లో ఊబకాయం విపరీతంగా పెరుగుతుందన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. దీర్ఘకాలిక ఆరోగ్య, ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు అవగాహనను పెంచటం, ముందస్తు పరీక్షలు నిర్వహించటం, ఆరోగ్య సంరక్షణకు నివారణ చర్యలను బలోపేతం చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు.
ఈ పుస్తకంలో 23 విభాగాలు, 172 అధ్యాయాలున్నాయి. ఇది పరిశోధనలకు, రోగులకు అందించే చికిత్సకు మధ్య వారధిగా ఉంటూ సమగ్రమైన, ఆధారాలతో కూడిన వైద్య వనరుగా నిలుస్తుంది. ఇది వైద్య సామర్థ్య పెంపునకు, వైద్య నైపుణ్యానికి, రోగుల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచటానికి గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు.
***
ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని ఒక ప్రామాణిక పుస్తకంగా తీసుకురావటంలో డాక్టర్ హెచ్.కె. చోప్రా, ఎడిటోరియల్ బృందం చూపిన విద్యాపరమైన నాయకత్వాన్ని, వారి కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు, సహచరులు.. డాక్టర్ వివేక కుమార్, డాక్టర్ ప్రవీణ్ చంద్ర, డాక్టర్ జేపీఎస్ సాహ్ని, డాక్టర్ మోనా భాటియా, డాక్టర్ అను గ్రోవర్, శ్రీకాంత్ భాటియా, ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
(రిలీజ్ ఐడి: 2246767)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10