ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలను ఉద్దేశించి రాజ్యసభలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన ప్రపంచ దేశాల నౌకలు.. వాటిలో అధిక సంఖ్యలో భారతీయ సిబ్బంది... ఇది భారత దేశానికి ఆందోళన కలిగించే ఒక ప్రధానాంశం: పీఎం
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, భారత పార్లమెంటులోని ఎగువ సభ నుంచి శాంతి, చర్చలపై ఉమ్మడి స్వరాన్ని వినిపించటం అవసరం: పీఎం
గల్ఫ్ దేశాల్లో ఉన్న దాదాపు కోటి మంది భారతీయుల భద్రత, జీవనోపాధి అంశం కూడా భారత్ కు ఆందోళక కలిగించేదే: పీఎం
పశ్చిమాసియాలో మూడు వారాలుగాపైగా కొనసాగుతోన్న యుద్ధం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం: పీఎం
వాణిజ్య నౌకలపై దాడులు, హర్మూజ్ జలసంధి వంటి అంతర్జాతీయ జల మార్గాల్లో అంతరాయం కలిగించటం ఆమోదయోగ్యం కాదు: పీఎం
పౌరులు, పౌర మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణాకు సంబంధించిన మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించిన భారత్: పీఎం
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పశ్చిమాసియాలోని ప్రధాన దేశాధినేతలతో రెండు సార్లు ఫోన్లో చర్చలు: పీఎం
గల్ఫ్ దేశాలు సహా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాతో నిరంతరం సంప్రదింపులు: పీఎం
చర్చలు, దౌత్య చర్యల ద్వారా పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పటమే మన లక్ష్యం: పీఎం
ఉద్రిక్తతలు తగ్గించి, హర్మూజ్ జలసంధిని పునః ప్రారంభించటంపై జరిగిన చర్చలు: పీఎం
యుద్ధ వాతావరణంలోనూ భారత నౌకల సురక్షిత ప్రయాణానికి దౌత్యపరంగా నిరంతరం చర్యలు తీసుకుంటున్న భారత్: పీఎం
యుద్ధం మొదలైనప్పటి నుంచి సవాలుగా మారిన హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల ప్రయాణం.. క్లిష్ట పరిస్థితుల్లోనూ చర్చలు, దౌత్యపరమైన చర్యల ద్వారా మార్గాన్ని వెతికే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం: పీఎం
వీలైన ప్రతిచోటు నుంచి భారత్ కు చమురు, సహజ వాయువు సరఫరా అయ్యేలా చూడటమే మా ప్రయత్నం.. అలాంటి ప్రయత్నాల ఫలితాన్ని చూస్తోన్న భారత్: పీఎం
ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ముడిచమురు, ఎల్పీజీతో ఇటీవల భారత్ చేరుకున్న నౌకలు.. రాబోయే రోజుల్లోనూ ఈ దిశగా కొనసాగనున్న ప్రయత్నాలు: పీఎం
బలంగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక సూత్రాలు.. శరవేగంగా మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ప్రభుత్వం: పీఎం
ప్రతి ప్రభావాన్ని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలికంగా ఎదుర్కొనే వ్యూహాంతో సాగుతున్న ప్రభుత్వం: పీఎం
తగినంత ఎరువుల సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం: పీఎం
సంక్షోభ ప్రభావం రైతులపై పడకుండా నిరంతరం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం: పీఎం
ప్రతి సవాలు పరిష్కారానికి
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 3:37PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ, ఇవాళ రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మూడు వారాలుగా కొనసాగుతోన్న ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొందని, ఇది భారతదేశానికి కూడా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ ఘర్షణలు భారత వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తున్నాయని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల వంటి నిత్యావసరాల సరఫరాపై ప్రభావం చూపుతున్నట్లు పీఎం శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తూ, అక్కడ పనిచేస్తున్నారని.. వారి భద్రత, జీవనోపాధి ప్రధానంగా ఆందోళన కలిగించే అంశంగా మారినట్లు పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన విదేశీ నౌకల్లో అధిక సంఖ్యలో భారత సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. "ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత పార్లమెంటులోని ఎగువ సభ నుంచి శాంతి, చర్చలపై ఉమ్మడి స్వరాన్ని వినిపించటం అత్యంత అవసరం" అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేసారు.
ఘర్షణలు తలెత్తినప్పటి నుంచీ భారతదేశం చురుగ్గా చేపట్టిన దౌత్య ప్రయత్నాలను ప్రధానమంత్రి రాజ్యసభకు వివరించారు. పశ్చిమాసియా దేశాల అధినేతలతో వ్యక్తిగతంగా రెండు పర్యాయాలు టెలిఫోన్లో మాట్లాడానని తెలిపారు. అన్ని గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. సంప్రదింపులు, దౌత్యం ద్వారా ఈ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణే సంప్రదింపుల లక్ష్యమనీ, ఉద్రిక్తతలను తగ్గించడం, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడంపై ప్రత్యేకంగా చర్చలు చేపట్టామని ఆయన వివరించారు. ఈ అంశంలో భారత్ అనుసరిస్తున్న దృఢ వైఖరిని తెలియజేస్తూ.. వాణిజ్య నౌకలపై దాడులు, హర్మూజ్ జలసంధి లాంటి అంతర్జాతీయ సముద్ర మార్గాలకు ఆటకం కలిగించడం ఆమోదయోగ్యం కాదన్నారు. పౌరులు, ప్రజా మౌలిక వసతులు, విద్యుత్తు, రవాణా సంబంధిత మౌలిక సదుపాయాలపై జరిపే అన్ని దాడులను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలియజేశారు. ‘‘ఈ యుద్ధంలో మానవ జీవితాలకు ముప్పు వాటిల్లితే అది మానవాళి ప్రయోజనాలకు విరుద్ధం. అందుకే వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారాన్ని తీసుకురావాలని అన్ని పక్షాలనూ భారత్ కోరుతోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సంక్షోభ సమయాల్లో మనదేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న భారతీయుల భద్రతకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 3,75,000 మందికి పైగా భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకువచ్చామని వెల్లడించారు. వీరిలో ఒక్క ఇరాన్ నుంచే 1,000 మందికి పైగా ఉన్నారని, వారిలో 700 మందికి పైగా వైద్య విద్యార్థులు ఉన్నారని ప్రధాని తెలిపారు. తమ భూభాగంలో ఉన్న భారతీయులకు పూర్తి రక్షణ కల్పిస్తామని అన్ని దేశాలూ హామీ ఇచ్చినప్పటికీ.. దాడుల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. "బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూస్తున్నాం" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన హర్మూజ్ జలసంధికున్న వ్యూహాత్మక ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ఈ మార్గం ద్వారా ముడి చమురు, సహజ వాయువు, ఎరువుల రవాణా జరుగుతోందని ప్రధానమంత్రి అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ జలసంధి గుండా నౌకలు రాకపోకలు క్లిష్టంగా మారాయని పేర్కొన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ సాధ్యమైనప్పుడల్లా భారత్కు చమురు, గ్యాస్ దిగుమతులు చేరాలనే ఏకైక లక్ష్యంతో చర్చలు, దౌత్యం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు. ‘‘ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి ప్రయత్నాలకు ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. గడచిన కొన్ని రోజులుగా, వివిధ దేశాల నుంచి ముడిచమురు, ఎల్పీజీ నౌకలు భారత్కు చేరుకున్నాయి. భవిష్యత్తులోనూ ఈ దిశగా మా ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయి’’ అని ప్రధానమంత్రి తెలియజేశారు.
చమురు, గ్యాస్, ఎరువులు లాంటి అత్యవసర వస్తువులను రవాణా చేసే నౌకలు సురక్షితంగా మన దేశానికి చేరుకొనేలా భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. దీర్ఘకాలంలో ఎదురయ్యే ప్రమాదాల గురించి ప్రధానమంత్రి వివరించారు. ఈ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న అవాంతరాలు కొనసాగితే అది తీవ్రమైన పరిస్థితులకు దారితీయొచ్చన్నారు. ‘‘అందుకే గత కొన్నేళ్లుగా స్థిరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసే చర్యలను భారత్ వేగవంతం చేస్తోంది’’ అని శ్రీ మోదీ వివరించారు.
దశాబ్ద కాలంగా భారత్ చేపట్టిన వ్యూహాత్మక సన్నద్ధత గురించి ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. ప్రతి సంక్షోభమూ ఒక దేశానికున్న సంకల్ప శక్తిని, ప్రయత్నాలను పరీక్షిస్తుందన్నారు. ఇలాంటి సవాళ్లను తట్టుకోగలిగేలా గత పదకొండేళ్లలో స్థిరమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ఇంధన దిగుమతుల వైవిధ్యీకరణకు సంబంధించిన వివరాలను ఆయన పంచుకున్నారు. ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీను గతంలో 27 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే ప్రస్తుతం ఆ సంఖ్య 41 దేశాలకు పెరిగిందన్నారు. ఇలాంటి సంక్షోభ సమయాల కోసమే ముడి చమురు నిల్వలను ఏర్పాటుకు భారత్ ప్రాధ్యాన్యమిస్తోందని, సరిపడినంత పెట్రోలు, డీజిల్ నిల్వలు చమురు సంస్థల వద్ద ఉన్నాయని సభకు తెలియజేశారు. గత పదకొండేళ్లలో 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు అభివృద్ధి చేశామని, ఈ నిల్వలను 65 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చేర్చేందుకు పనులు కొనసాగుతున్నాయన్నారు. వీటితో పాటుగా భారత చమురు శుద్ధి సామర్థ్యాలను గణనీయంగా పెంపొందిస్తున్నామని తెలియజేశారు. ‘‘దేశంలో సరిపడినన్ని ముడి చమురు నిల్వలు, నిరంతరాయంగా సరఫరాను చేపట్టేందుకు ఏర్పాట్లు ఉన్నాయని ఈ సభకు, దేశానికి నేను భరోసా ఇవ్వాలనుకుంటున్నాను’’ అని ప్రధాని స్పష్టం చేశారు.
ఏదైనా ఒకే ఇంధన వనరులపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాన్ని వివరించారు. గృహావసరాల కోసం ఎల్పీజీతో పాటుగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ను కూడా సరఫరా చేసేందుకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేశారు. మునుపెన్నడూ లేని విధంగా పీఎన్జీ కనెక్షన్లకు సంబంధించిన పనులు గత దశాబ్దంలో కొనసాగాయి. ఇటీవలి కాలంలో వీటిని మరింత ముమ్మరం చేశారు. ‘‘అదే సమయంలో, దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు విస్తృత ప్రయత్నాలు కొనసాగుతున్నాయి’’ అని శ్రీ మోదీ తెలిపారు.
దేశాన్ని స్వావలంబనే లక్ష్యంగా.. ప్రతి రంగంలోనూ ఇతర దేశాలపై ఆధీనతను తగ్గించేందుకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. ప్రస్తుతం దేశానికి అవసరమైన ముడి చమురులో 90 శాతానికి పైగా విదేశీ నౌకల ద్వారానే రవాణా అవుతోందనీ, ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తితే దేశం మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. ఈ సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా దేశంలోనే నౌకల తయారీ కోసం దాదాపు రూ. 70,000 కోట్లతో భారీ మిషన్ను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. అంతేకాకుండా నౌకా నిర్మాణం, విచ్ఛిన్నం, నిర్వహణ, మరమ్మతుల సామర్థ్యాన్నీ వేగంగా పెంచుతోందని వివరించారు. కావాల్సిన ఆయుధాలను మనమే తయారు చేసుకునేలా రక్షణ రంగాన్ని పటిష్టం చేశామనీ, అలాగే ప్రాణ రక్షణ ఔషధాల తయారీకి అవసరమైన ఏపీఐ వ్యవస్థను అభివృద్ధి చేయడంతోపాటు అరుదైన ఖనిజాల దిగుమతులను తగ్గించడంలోనూ విశేష పురోగతి సాధించామనీ పేర్కొన్నారు. ‘‘ప్రతి కీలక రంగంలోనూ గొప్పగా స్వావలంబన సాధించడమే మన ముందున్న ఏకైక మార్గం. ఈ దిశగా ప్రతి రంగంలోనూ కీలక చర్యలు తీసుకుంటున్నాం’’ అని ప్రధానమంత్రి సభకు వివరించారు.
ఆర్థికంగా ప్రస్తుత సంక్షోభ ప్రభావాన్ని వివరిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను ఈ ఘర్షణ అతలాకుతలం చేసిందనీ, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి చాలా సమయం పడుతుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. ఈ దుష్ప్రభావం మన దేశంపై పెద్దగా పడకుండా చూసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బలమైన దేశ ఆర్థిక పునాదులు, వేగంగా మారుతున్న పరిస్థితులపై ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణ మనకు రక్షణ కవచంలా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు. దిగుమతులు, ఎగుమతులకు సంబంధించి సవాళ్లను ఎప్పటికప్పుడు సమీక్షించి, పరిష్కరించడం కోసం ఒక అంతర మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రధానమంత్రి సభకు తెలిపారు. కోవిడ్-19 విపత్తు సమయంలో అనుసరించిన విధానంలోనే.. సరఫరా వ్యవస్థలు, పెట్రోల్-డీజిల్, ఎరువులు, గ్యాస్, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై దూరదృష్టితో తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఏడు కొత్త అధికార బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. ఈ సమష్టి కార్యాచరణపై ప్రధానమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ‘‘సమన్వయంతో కూడిన ఈ సమష్టి చర్యల ద్వారా ఈ పరిణామాలను మనం మరింత సమర్థంగా ఎదుర్కోగలమన్న విశ్వాసం నాకుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు.
వ్యవసాయ రంగం గురించి మాట్లాడుతూ.. రాబోయే విత్తన కాలంలో రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోందని ప్రధానమంత్రి మోదీ హామీ ఇచ్చారు. అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ‘‘ప్రతి సవాలును ఎదుర్కోవడంలో ఈ దేశ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నేను మరోసారి భరోసా ఇస్తున్నాను. ఏ సంక్షోభం వల్ల కలిగే భారమైనా వారిపై పడకుండా చూసేందుకు మేం సంపూర్ణంగా కట్టుబడి ఉన్నాం’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
రాష్ట్రాల మండలిగా రాజ్యసభనుద్దేశించి మాట్లాడుతూ.. రాబోయే కాలం దేశానికి పెద్ద పరీక్షగా నిలవబోతోందనీ, అందులో విజయం సాధించాలంటే రాష్ట్రాల సహకారం ఎంతో అవసరమనీ ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పేదలు, కార్మికులు, వలస కూలీలపై సంక్షోభాల దుష్ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశమున్నందున.. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు సకాలంలో అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను శ్రీ మోదీ కోరారు. వలస కూలీలు ఎదుర్కొనే ఇబ్బందులను పరిష్కరించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలనీ, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగాలను ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఇలాంటి సమయాల్లో బ్లాక్ మార్కెట్లను నడిపేవారు, నిల్వలను అక్రమంగా దాచేవారూ ఎక్కువగా అవకతవకలక పాల్పడే అవకాశముందని కూడా ఆయన హెచ్చరించారు. అలాంటి ఫిర్యాదులు వస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ఎలాంటి అంతరాయమూ లేకుండా నిత్యావసర వస్తువులను సరఫరా చేయడం ప్రతి రాష్ట్రానికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. ఈ దిశగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు.
సహకార సమాఖ్య స్ఫూర్తిని చాటుతూ.. సంక్షోభం ఎంతటిదైనా సరే, బలమైన దేశ ఆర్థిక వృద్ధి ప్రస్థానానికి ఆటంకం కలగకుండా చూడాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. దీనికోసం అవసరమైన ప్రతి చర్యనూ, ప్రతి సంస్కరణనూ అత్యంత వేగంగా అమలు చేయాలని కోరారు. కోవిడ్-19 విపత్తు సమయంలో కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరు రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ.. పరీక్ష, వ్యాక్సినేషన్, నిత్యావసర వస్తువుల సరఫరా విషయంలో అంతరాయం కలగకుండా ఒక జట్టుగా సమన్వయంతో కలిసి పనిచేసిన తీరును ప్రధానమంత్రి గుర్తు చేశారు. అదే స్ఫూర్తి ఇప్పుడు కూడా దేశాన్ని నడిపించాలని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ, కేంద్ర ప్రభుత్వ సమష్టి కృషితో.. తీవ్రమైన ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని దేశం సమర్థంగా ఎదుర్కోగలుగుతుంది. ఒకే జట్టుగా కలిసి పనిచేస్తూ అదే స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి’’ అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.
గతంలో ఎదుర్కొన్న అనుభవాలతో పోలిస్తే ప్రస్తుత సంక్షోభం భిన్నమైనదనీ, దీన్ని పరిష్కరించుకోవాలన్నా కూడా అలాగే విభిన్నమైన మార్గాలను అనుసరించాల్సిన అవసరముందనీ ప్రధానమంత్రి శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘మనం ప్రతి సవాలునూ ఓపికతో, సంయమనంతో, ప్రశాంత చిత్తంతో ఎదుర్కోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
పరిస్థితులు క్షణక్షణానికీ మారుతున్నాయన్న ప్రధానమంత్రి.. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి దేశ ప్రజలంతా సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ యుద్ధం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు చాలా కాలం పాటు కొనసాగే అవకాశముందని హెచ్చరిస్తూనే, దేశానికి బలమైన హామీనిస్తూ... దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. సంసిద్ధతతో ఉంది. తగిన వ్యూహాలను రూపొందించుకుంటూ, ప్రతి నిర్ణయాన్నీ అత్యంత జాగరూకతతో తీసుకుంటోంది. ఈ దేశ ప్రజల సంక్షేమమే మాకు సర్వోన్నతమైనది. ఇది మన అస్తిత్వం. ఇది మన శక్తి’’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
***
(రిలీజ్ ఐడి: 2244747)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7