విద్యుత్తు మంత్రిత్వ శాఖ
భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్-2026లో భాగంగా రాష్ట్రాలు, యూటీల మంత్రులతో విద్యుత్ శాఖ మంత్రి అధ్యక్షతన సమావేశం
ఇంధన భద్రత ఈ సమావేశ ప్రధాన లక్ష్యం.. అవసరమైన సంస్కరణలను రాష్ట్రాలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు: శ్రీ మనోహర్ లాల్
2024-25 ఆర్థిక సంవత్సరానికి డిస్కంల వినియోగదారుల సేవా రేటింగ్స్, పంపిణీ సంస్థల ర్యాంకింగ్ నివేదికల విడుదల
నాడు పోస్టు చేయడమైనది:
20 MAR 2026 1:32PM by PIB Hyderabad
భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్-2026లో భాగంగా రెండో రోజున (20.03.2026) కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ అధ్యక్షతన దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది.
విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద నాయక్ సహ-అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్, పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్.. నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ (ఎంఎన్ఆర్ఈ) కార్యదర్శి శ్రీ సంతోష్ కుమార్ సారంగితో పాటు వివిధ రాష్ట్రాలు, యూటీలకు చెందిన ఇంధన శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ మనోహర్ లాల్ ప్రసంగిస్తూ.. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించటంలో బీఈఎస్- 2026 కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆర్థిక వృద్ధికి, మౌలిక సదుపాయాలకు విద్యుత్ అత్యంత ప్రాథమిక అవసరమని స్పష్టం చేశారు. 520 జీడబ్ల్యూకు పైగా నిర్దేశిత విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవటం, డిస్కంల పనితీరుని మెరుగుపరచటం, భారీగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ కొరతను గణనీయంగా తగ్గించటం వంటి భారత విజయాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయ ప్రయత్నాలుండాలని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇంధన భద్రత ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ, తలసరి విద్యుత్ వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని, పునరుత్పాదక ఇంధన వాడకాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. స్వచ్ఛమైన ఇంధన వనరుగా అణుశక్తిని గుర్తిస్తూ, శాంతి చట్టాన్ని ఈ దిశగా కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు.
చట్టపరమైన, పాలనాపరమైన సంస్కరణల అమలు విషయంలో రాష్ట్రాలకు కేంద్రం పూర్తి మద్దతిస్తుందని శ్రీ మనోహర్ లాల్ హామీ ఇచ్చారు.
విద్యుత్ రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధ పాత్రలను శ్రీ శ్రీపాద నాయక్ వివరించారు. స్మార్ట్ మీటరింగ్ ఇందుకు ముఖ్యమైన ఉదాహరణ అని తెలిపారు. భారతదేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం శిలాజయేతర ఇంధన వనరుల నుంచే వస్తుందని ఆయన చెప్పారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు రూపొందించిన నూతన ముసాయిదా జాతీయ విద్యుత్ విధాన ప్రాముఖ్యతను తెలిపారు.
ఇంధన భద్రతను బలోపేతం చేయటం, ముఖ్యంగా శిలాజయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచటంపై ఈ సమావేశం దృష్టి సారించింది. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు సమష్టి, సమన్వయ చర్యలు ముఖ్యమని విద్యుత్ శాఖ, ఎంఎన్ఆర్ఈ కార్యదర్శులు స్పష్టం చేశారు.
కీలక నివేదికల విడుదల
ఈ సమావేశం సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంల వినియోగదారుల సేవా రేటింగ్స్ (సీఎస్ఆర్డీ), పంపిణీ సంస్థల ర్యాంకింగ్ (డీయూఆర్) నివేదికలను విడుదల చేశారు.
డిస్కంల వినియోగదారుల సేవా రేటింగ్స్ (సీఎస్ఆర్డీ) నివేదిక
వినియోగదారుల సేవా డిస్కంల పనితీరును సీఎస్ఆర్డీ అంచనా వేస్తుంది. ఇందుకోసం ఖచ్చితమైన మీటరింగ్, బిల్లింగ్, సకాలంలో సమర్థవంతంగా ఫిర్యాదుల పరిష్కారం, పారదర్శకమైన విద్యుత్ ధరల నిర్ధారణ వంటి ప్రాథమిక ప్రమాణాలను ఇది నిర్దేశిస్తుంది. వినియోగదారుల సంతృప్తిని పెంచేందుకు, వివిధ విభాగాల మధ్య పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించటానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించటం ఈ నివేదిక లక్ష్యం. వినియోగదారుల కేంద్రీకృత సేవలను ఇది పరిశీలిస్తుంది. విద్యుత్ నిబంధనల ప్రకారం కీలక రంగాల్లో డిస్కంల పనితీరును ఇది అంచనా వేయడమే కాక, నియామాలను పాటిస్తూ, ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించి, అంచనా వేస్తుంది.
నివేదిక సమాచారం, వచ్చిన స్కోర్ల ప్రకారం.. డిస్కంలకు ఏడు గ్రేడ్లు.. ఏ+, ఏ, బీ+, బీ, సీ+, సీ, డీలో ఒకటి కేటాయిస్తారు. డిస్కంల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచటానికి, సేవా నాణ్యతలో నిరంతరం మెరుగుదల కనబరిచేందుకు ఈ గ్రేడింగ్ విధానాన్ని రూపొందించారు. మొత్తం 66 డిస్కంలను అంచనా వేయగా..6 డిస్కంలు ఏ+ గ్రేడ్, 21 డిస్కంలు ఏ గ్రేడ్, 27 డిస్కంలు బీ+ గ్రేడ్ను సాధించాయి.
అత్యుత్తమ గ్రేడ్లు సాధిస్తున్న సంస్థల సంఖ్య పెరగటం, మెరుగైన సేవల ద్వారా అధిక సంఖ్యలో వినియోగదారులు లబ్ధి పొందటం ద్వారా డిస్కంల పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు స్పష్టమవుతోంది. దేశీయంగా సానుకూల పురోగతికి ఇది సంకేతం. మరోవైపు తక్కువ గ్రేడ్లు (సీ, డీ) పొందుతున్న డిస్కంలు, వినియోగదారుల సంఖ్య తగ్గటం.. దిగువ స్థాయిలోనూ సానుకూల మార్పును సూచిస్తుంది.
పంపిణీ సంస్థల ర్యాంకింగ్ (డీయూఆర్) నివేదిక
దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును డీయూఆర్ సమగ్రంగా, పక్షపాతం లేకుండా అంచనా వేస్తుంది. గత నివేదికల ముఖ్యాంశాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక.. సంప్రదాయ పనితీరు సూచికలకే పరిమితం కాకుండా బహుముఖ మూల్యాంకన విధానాన్ని అనుసరిస్తుంది. సంస్థాగత సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వం, కార్యాచరణ సామర్థ్యం, సేవలందించే విధానం వంటి కీలక అంశాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయి. భారతదేశ దీర్ఘకాలిక ఇంధన పరివర్తన, అభివృద్ధి లక్ష్యాలకు మద్దతుగా.. ఆర్థికంగా నిలదొక్కుకోగలిగే, సమర్థవంతంగా పనిచేసే, వినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చే విద్యుత్ పంపిణీ వ్యవస్థను రూపొందించటానికి డీయూఆర్ కార్యక్రమం తోడ్పడుతుంది. మొత్తం 66 విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ ఏడాది డీయూఆర్ అంచనా ప్రక్రియలో పాల్గొన్నాయి.
DUR REPORT
CSRD REPORT
***
(రిలీజ్ ఐడి: 2243229)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15