మంత్రిమండలి
తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక వసతులను అభివృద్ధి చేసే భారత్ ఔద్యోగిక వికాస్ యోజన (భవ్య)కు మంత్రివర్గం ఆమోదం
రూ. 33,660 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక పార్కుల అభివృద్ధి
వికసిత భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేలా తయారీ రంగ వృద్ధి ద్వారా
పెద్ద ఎత్తున ఉద్యోగాలు, పెట్టుబడులు, అవకాశాల కల్పన
భవ్య: ఆత్మనిర్భర భారత్ ద్వారా వేగవంతమవుతున్న భారత్ వృద్ధి ప్రయాణం
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 4:05PM by PIB Hyderabad
పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా చరిత్రాత్మకమైన అడుగు వేస్తూ.. భారత్ ఔద్యోగిక వికాస్ యోజన (భవ్య)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ.33,660 కోట్ల నిధులను కేటాయించారు. దేశవ్యాప్తంగా తక్షణ వినియోగానికి సిద్ధంగా ఉన్న ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగిస్తారు.
అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, భారతదేశ అభివృద్ధి గాథను ముందుకు నడిపించేలా దేశ తయారీ సామర్థ్యాలను వెలికి తీయడమే ఈ పథకం లక్ష్యం.
వికసిత్ భారత్ కోసం పారిశ్రామిక పునాది ఏర్పాటు:
జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి కార్యక్రమం (ఎన్ఐసీడీపీ) ద్వారా నిర్మించిన పారిశ్రామిక స్మార్ట్ సిటీలు సాధించిన విజయం ఆధారంగా భవ్యను రూపొందించారు. దీనిని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో అమలు చేస్తారు.
ఆమోదాల నుంచి కార్యకలాపాల ప్రారంభం వరకు: వ్యాపారంలో నూతన సౌలభ్యం
క్రమబద్ధీకరించిన ఆమోదాలు, సమర్థవంతమైన ఏకగవాక్ష వ్యవస్థలు, రాష్ట్రాల నేతృత్వంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన సంస్కరణలతో నియంత్రణల సడలింపు, వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడమే భవ్య పథకం ప్రధానోద్దేశం.
వినియోగానికి సిద్ధంగా ఉన్న ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక వ్యవస్థలను ఈ పథకం అందిస్తుంది. దీనివల్ల పరిశ్రమలు తమ ఆలోచనను వేగంగా, నిశ్చయంగా ఉత్పత్తి రూపంలోకి తీసుకువస్తాయి. ముందస్తు అనుమతులు పొందిన భూమి, సిద్ధంగా ఉన్న మౌలిక వసతులు, ఏకీకృత సేవల ద్వారా పెట్టుబడిదారులకు ప్రారంభ దశలో ఎదురయ్యే అవరోధాలను భవ్య గణనీయంగా తగ్గిస్తుంది.
ఈ పథకం ద్వారా, 100 నుంచి 1000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తారు. దిగువ పేర్కొన్న అంశాలకు ఎకరాకు ఒక కోటి రూపాయల వరకు ఆర్థిక సహకారం లభిస్తుంది:
-
ప్రధాన మౌలిక వసతులు (అంతర్గత రహదారులు, భూగర్భ సౌకర్యాలు, డ్రైనేజి, సాధారణ శుద్ధి సౌకర్యాలు, ఐసీటీ, పరిపాలనా వ్యవస్థలు)
-
విలువ ఆధారిత మౌలిక వసతులు (సిద్ధంగా ఉన్న ఫ్యాక్టరీ షెడ్లు, అవసరాలకు తగినట్లుగా నిర్మించిన యూనిట్లు, పరీక్షా కేంద్రాలు, గోదాములు)
-
సామాజిక మౌలిక వసతులు (కార్మికుల గృహాలు, అదనపు సౌకర్యాలు)
ఇప్పటికే ఉన్న వ్యవస్థలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుసంధానం, ఏకీకరణకు బాహ్య మౌలిక సదుపాయాల కోసం ప్రాజెక్టు వ్యయంలో 25 శాతం వరకు మద్దతు లభిస్తుంది.
అత్యంత నాణ్యమైన, సంస్కరణ ఆధారితమైన, పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న ప్రతిపాదనలను మాత్రమే ముందుకు తీసుకెళ్లేలా పోటీ విధానంలో ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు.
భవిష్యత్తు అవసరాలకు తగిన, సుస్థిరమైన, సమర్థవంతమైన పారిశ్రామిక పార్కులు:
భవిష్యత్తుకు తగిన, సుస్థిరమైన వ్యవస్థలుగా ఈ పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దుతారు:
-
ఎలాంటి అవరోధాలు లేని బహుళ విధ రవాణా అనుసంధానాన్ని, చివరి మైలు వరకు సమర్థవంతంగా చేరుకొనే వీలును కల్పించేందుకు పీఎం గతిశక్తి సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది.
-
సమీకృత భూగర్భ సౌకర్యాలతో పాటు హరిత ఇంధనం, సుస్థిరమైన వనరుల ఏర్పాటు. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ తవ్వకాల అవసరం లేకుండా సమర్థవంతమైన నిర్వహణకు, ఆటంకాలు లేని పారిశ్రామిక కార్యకలాపాలకు వీలు కలుగుతుంది.
వివిధ రంగాల్లో విశ్వసనీయతకు హామీ ఇస్తూ, లోపాలను తగ్గిస్తూ, ఉత్పాదకతను విస్తరించేలా పారిశ్రామిక మౌలిక వసతులకు సంబంధించి నూతన ప్రమాణాలను ఈ పార్కులు ఏర్పాటు చేస్తాయి.
ప్రాంతాల వారీగా ఉద్యోగాలు, పెట్టుబడులు, ఆర్థిక ప్రగతికి ప్రోత్సాహం
తయారీ, సరకు రవాణా, సేవల రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలను, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని భవ్య పథకం కల్పిస్తుందని, అదే సమయంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈ పథకం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలవుతుంది. తద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది ఉపాధి అవకాశాలు కల్పించి, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తుంది.
క్లస్టర్ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహిస్తూ.. పరిశ్రమలు, పంపిణీదారులు, సేవా సంస్థలు ఒకే చోట ఉండేలా చేసి దేశీయ సరఫరా వ్యవస్థలను భవ్య పథకం బలోపేతం చేస్తుంది. అలాగే ప్రాంతీయ పారిశ్రామికీకరణను ప్రోత్సహిస్తుంది. లక్షలాది మంది ప్రజలకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది.
ఈ పథకం లబ్ధిదారులు:
-
ప్రాథమిక లబ్ధిదారులు: సిద్ధంగా ఉన్న పారిశ్రామిక వసతుల కోసం చూస్తున్న తయారీ యూనిట్లు, ఎంఎస్ఎంఈలు, అంకుర సంస్థలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు.
-
ద్వితీయ లబ్ధిదారులు: కార్మికులు, సరకు రవాణా సేవలందించేవారు, సేవారంగంలోని సంస్థలు, స్థానిక సమాజాలు.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో భవ్య ఆమోదం ఒక పరివర్తనాత్మక ముందడుగును సూచిస్తుంది. ఇది దేశీయంగా ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. ఎగుమతులను పెంచుతుంది. పటిష్టమైన, సమ్మిళితమైన, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తుంది.
ఎన్ఐసీడీసీ గురించి:
వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఆధ్వర్యంలో జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ (ఎన్ఐసీడీసీ) పనిచేస్తుంది. ఇది తయారీ రంగంలో పోటీతత్వాన్ని పెంచడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధిని కల్పించడానికి అంతర్జాతీయ స్థాయిలో నూతన పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం 13 రాష్ట్రాలలో 20 ప్రాజెక్టులను ఎన్ఐసీడీసీ అమలు చేస్తోంది.
వినియోగానికి సిద్ధంగా ఉన్న ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులు అనే ఆలోచన ఆధారంగా ఎన్ఐసీడీసీ చేపట్టే కార్యక్రమాలు తయారయ్యాయి. ఇవి తక్షణమే ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యవస్థలను అభివృద్ధి చేస్తాయి. వీటిలో భూమి, సౌకర్యాలు, అనుమతులు, మౌలిక వసతులను ముందుగానే అభివృద్ధి చేస్తారు. ఫలితంగా భూసేకరణ లేదా మౌలిక వసతుల నిర్మాణంలో ఎలాంటి జాప్యం లేకుండా వీలైనంత త్వరగా కార్యకలాపాలను పరిశ్రమలు ప్రారంభిస్తాయి.
***
(రిలీజ్ ఐడి: 2242008)
సందర్శకుల సూచీ సంఖ్య : : 42
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada