నౌకారవాణా మంత్రిత్వ శాఖ
భారత జెండా కలిగిన ఎల్పీజీ వాహక నౌకలు 'శివాలిక్', 'నందా దేవి'కి చెందిన సిబ్బందితో మాట్లాడిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్
అత్యంత ప్రమాదకరమైన సముద్రయాన ప్రాంతంలో దాదాపు రెండు వారాల పాటు వేచి ఉండి అసాధారణమైన ధైర్యసాహసాలను ప్రదర్శించిన సిబ్బంది: సర్బానంద సోనోవాల్
సిబ్బందితో మాట్లాడిన కేంద్ర మంత్రి
నావికులను ‘ప్రపంచ వాణిజ్య అజ్ఞాత వీరులు’గా అభివర్ణించిన కేంద్ర మంత్రి
దేశానికి అంతరాయం లేని ఇంధన సరఫరా నిర్ధారిస్తూ ముంద్రా, కాండ్లా రేవులకు చేరుకున్న భారత జెండాలను కలిగిన ఎల్పీజీ నౌకలు
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 6:37PM by PIB Hyderabad
మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో కలిసి కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ (ఎంఓపీఎస్డబ్ల్యూ) మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్.. భారత జెండా కలిగిన ఎల్పీజీ వాహక నౌకలు 'శివాలిక్', 'నందాదేవి'కి చెందిన సాహస సిబ్బందితో ఈ రోజు మాట్లాడారు. కీలకమైన ఎల్పీజీ కార్గోను సురక్షితంగా చేరవేయడంలో వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అచంచలమైన కర్తవ్య దీక్షకు ఆయన దేశం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సంభాషణ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు- నౌకాయాన- జలమార్గాల శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథన్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) ఛైర్మన్ - మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ బీ.కె. త్యాగి పాల్గొన్నారు. వీరితో పాటు 'శివాలిక్' నౌక కెప్టెన్ సుఖ్మీత్ సింగ్, 'నందాదేవి' నౌక కెప్టెన్ ధీరజ్ కుమార్ అగర్వాల్, రెండు నౌకల సిబ్బంది పాల్గొన్నారు.
నావికులను ఉద్దేశించి మాట్లాడిన శ్రీ శర్బానంద సోనోవాల్.. అత్యంత ప్రమాదకరమైన సముద్ర వాతావరణంలో పనిచేస్తూనే దేశానికి కీలకమైన ఎల్పీజీ సరఫరాను సురక్షితంగా చేరవేసిన సిబ్బందికి ఈ కార్యక్రమం..‘దేశం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం’ వంటిదని పేర్కొన్నారు.
“శివాలిక్, నందాదేవి నౌకల సిబ్బంది ప్రదర్శించిన ధైర్యం, అంకితభావం, వృత్తి నైపుణ్యాన్ని గుర్తించడం ఎంతో గర్వకారణం. భారత ఇంధన భద్రతను బలోపేతం చేస్తూ అత్యంత కీలకమైన ఎల్పీజీ కార్గో సురక్షిత ప్రయాణాన్ని మీ కృషి సుగమం చేసింది" అని శ్రీ శర్బానంద సోనోవాల్ వ్యాఖ్యానించారు.
భద్రతాపరమైన ఆందోళనలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భారత్కు ప్రయాణాన్ని కొనసాగించే ముందు రెండు వారాల పాటు ఈ రెండు నౌకలు అత్యంత ముప్పుగల ప్రాంతంలోనే వేచి ఉన్నాయని మంత్రి అన్నారు. అటువంటి సవాలుతో కూడుకున్న పరిస్థితుల్లో కూడా సిబ్బంది అసాధారణమైన సంయమనం, అప్రమత్తత, వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించారని కేంద్ర మంత్రి కొనియాడారు.
పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో సముద్ర రవాణా కార్యకలాపాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుండగా.. భారత జెండాలను కలిగిన రెండు ఎల్పీజీ వాహక నౌకలు హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి మార్చి 16, 17 తేదీల్లో దేశానికి చేరుకున్నాయి. సుమారు 92,712 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో ఉన్న ఎంటీ శివాలిక్, ఎంటీ నందాదేవి నౌకలు.. శుక్రవారం (2026 మార్చి 13) తెల్లవారుజామున హార్ముజ్ జలసంధిని దాటాయి.
"ప్రపంచ వాణిజ్యానికి అజ్ఞాత వీరులు నావికులు. మీ ఇళ్లు, కుటుంబాలకు దూరంగా ఉంటూ అత్యవసర సరకును సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకునేలా మీరు చూస్తున్నారు" అని శ్రీ సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రపంచ సరఫరా గొలుసును కొనసాగించడంలో సముద్ర సిబ్బంది పోషిస్తున్న కీలక పాత్రను ఆయన ఈ సందర్భంగా ప్రధానంగా చెప్పారు.
పూర్తిగా భారతీయ నావికులతో నడుస్తున్న ఈ రెండు భారత జెండాలు కలిగిన నౌకల విజయవంతమైన ప్రయాణం దేశ సముద్రయాన సిబ్బందికి బలం, పట్టుదలను తెలియజేస్తోందని కేంద్ర మంత్రి అన్నారు.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయటం.. మన నావికుల భద్రత, గౌరవం, అంతర్జాతీయ గుర్తింపును నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాం" అని శర్బానంద సోనోవాల్ అన్నారు.
నావికుల అంకితభావం, సేవ వెనుక వారి కుటుంబాల మద్దతు ఒక ముఖ్యమైన అంశమని సోనోవాల్ తెలిపారు. రెండు నౌకల మాస్టర్లు, అధికారులు, సిబ్బందిని అభినందించిన ఆయన.. వృత్తి నైపుణ్యం, నిబద్ధతకు వారి విజయం ఒక ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు. వారి తదుపరి ప్రయాణాలు సురక్షితంగా సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నౌకల యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, ఆ ప్రాంతంలోని భారతీయ దౌత్య కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ స్వయంగా ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
సముద్ర వాణిజ్యానికి కలిగే కార్యాచరణ అంతరాయాలను తగ్గిస్తూ సముద్రయాన కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు ఓడరేవులు, జలమార్గాలు, సరకు రవాణా భాగస్వాములతో ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది. అవసరమైన చోట లంగరు ఛార్జీలు (యాంకరేజ్), నౌకాశ్రయ అద్దె (బెర్త్ హైర్), నిల్వ ఛార్జీలలో (స్టోరేజీ) రాయితీలు వంటి ఉపశమన చర్యలను అందించాలని ఓడరేవులకు సూచించింది.
సకాలంలో గ్యాస్ లోడ్ దించడం, ఇంధన సరఫరాను కొనసాగింపును నిర్ధారించడానికి ప్రధాన ఓడరేవులు ఓడలను ఒడ్డుకు చేర్చే (బెర్తింగ్) విషయంలో ఎల్పీజీ నౌకలను ప్రథమ ప్రాధాన్యతను ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆరు ఎల్పీజీ నౌకలు ప్రధాన భారతీయ ఓడరేవులకు చేరుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల వల్ల గల్ఫ్ ప్రాంతానికి వెళ్లలేక నిలిచిపోయిన నౌకలకు మన ఓడరేవులు సురక్షితమైన యాంకరేజ్ ప్రాంతాలను కల్పిస్తున్నాయి.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలు, సరకు రవాణా కంపెనీలు, ఇతర సముద్ర రంగ భాగస్వాములతో సన్నిహిత సమన్వయం చేసుకుంటూ సముద్రయాన తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ నావికుల సంక్షేమాన్ని కాపాడటం, భారతదేశపు సముద్ర లాజిస్టిక్స్ నెట్వర్క్ పటిష్ఠతను నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది.



***
(రిలీజ్ ఐడి: 2241542)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5