రాష్ట్రపతి సచివాలయం
అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా అయిదు బిలియన్ల భోజనాల పంపిణీ పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన భారత రాష్ట్రపతి
దేశంలోని పిల్లలకు పోషకాహారం, నాణ్యమైన విద్య అందుబాటులో ఉండటం అత్యవసరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 1:15PM by PIB Hyderabad
అక్షయపాత్ర ఫౌండేషన్ 500 కోట్ల (5 బిలియన్) భోజనాల పంపిణీ పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నేడు (మార్చి 17, 2026) నిర్వహించిన వేడుకలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. విద్యా లక్ష్యాల సాధనలో భాగంగా 500 కోట్ల భోజనాలను అందించడం అక్షయపాత్ర ఫౌండేషన్ సాధించిన ఒక అద్భుతమైన విజయమని ప్రశంసించారు. ‘పోషణతో, విద్యతో కూడిన భారత్ నుంచి అభివృద్ధి చెందిన దేశం వైపు’ అనేది ఈ కార్యక్రమ ఇతివృత్తం. ఇది 2047 నాటికి ‘వికసిత్ భారత్’ను నిర్మించాలనే మన జాతీయ సంకల్పాన్ని సాకారం చేయడంలో ఆరోగ్యవంతమైన, విద్యావంతులైన సమాజం పోషించే కీలక పాత్రను తెలుపుతుందని రాష్ట్రపతి తెలిపారు.

మన పిల్లలకు సురక్షితమైన, ఉజ్వలమైన భవిష్యత్తును అందించడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, మనందరి ఉమ్మడి బాధ్యత అని రాష్ట్రపతి అన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ రంగం, సమాజంలోని ప్రతి విభాగం కలిసికట్టుగా కృషి చేసినప్పుడు మాత్రమే మనం రాబోయే తరానికి బలమైన పునాదిని వేయగలమని అన్నారు. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మంచి ఆరోగ్యం, పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం అందేలా మనం తప్పక చూడాలని.. ఈ ప్రాథమిక అంశాలే పిల్లల సమగ్ర వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు.


ఒక వ్యక్తి జీవితంలో లభించే అవకాశాలను నిర్ణయించేది, వారి విజయానికి బాటలు వేసేది విద్య మాత్రమేనని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇది సామాజిక మార్పునకు, సాధికారతకు ఒక ప్రభావవంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పిల్లలు పాఠశాలకు వెళ్లడం ప్రారంభించిన క్షణం నుంచే వారిలో సాధికారత, సామర్థ్యాల నిర్మాణ ప్రక్రియ రూపుదిద్దుకోవడం మొదలవుతుందని తెలిపారు. రోజువారీ జీవితంలోని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, బాధ్యతాయుతమైన, వివేకవంతులైన పౌరులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను, అనుభవాలను పాఠశాల పిల్లలకు అందిస్తుందని అన్నారు. గత 25 ఏళ్లుగా పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తూ, పిల్లలలో పోషకాహార లోప సమస్యను పరిష్కరించడానికి, వారు విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడానికి నిరంతరం కృషి చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్ను రాష్ట్రపతి అభినందించారు.

దేశ భవిష్యత్తు అయిన మన పిల్లలకు పోషకాహారం, నాణ్యమైన విద్య సులభంగా అందుబాటులో ఉండటం అత్యవసరమని రాష్ట్రపతి అన్నారు. గర్భిణీలకు, పిల్లలకు తగిన పోషణ, మెరుగైన ఆరోగ్య సేవలను అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం అనేక ముఖ్య కార్యక్రమాలను ప్రారంభించిందని ఆమె తెలిపారు. పీఎం పోషణ్ కింద అమలవుతున్న పాఠశాల మధ్యాహ్న భోజన కార్యక్రమం, తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపేలా చేయడంలో ఒక గొప్ప ప్రోత్సాహకంగా నిరూపితమైందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ఫలితంగా పాఠశాలల్లో పిల్లల నమోదు, హాజరు, చదువు కొనసాగించే వారి సంఖ్య పెరిగిందని అనేక అధ్యయనాల ద్వారా నిరూపితమైందని పేర్కొన్నారు. పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాలు, విద్యాపరమైన పనితీరులో కూడా గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. 2030 నాటికి పిల్లలందరికీ నాణ్యమైన, సమగ్ర విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ‘సమగ్ర శిక్షా అభియాన్’ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో అక్షయపాత్ర ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తున్నందుకు రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.

పిల్లలు కేవలం ఉచిత భోజన పథక లబ్ధిదారులు మాత్రమే కాదని, వారు దేశ ఉజ్వల భవిష్యత్తుకు రూపకర్తలని రాష్ట్రపతి అన్నారు. నేడు వారికి లభిస్తున్న పోషకాహారం.. మన దేశ మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడి వంటిదని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యవంతులుగా, విద్యావంతులుగా, ఉత్సాహవంతులుగా ఎదిగే ఈ పిల్లలే భవిష్యత్తులో దేశ శ్రామిక శక్తిగా మారి, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనలో కీలక పాత్ర పోషిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2241201)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13