ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంలోని సిల్చార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 14 MAR 2026 2:06PM by PIB Hyderabad

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

భారత్ మాతాకీ జై!

ప్రియమైన బరాక్ వ్యాలీ ప్రజలారా! మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను.

ప్రజాదరణ పొందిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, నా ప్రియమైన సోదరీసోదరులారా,

సంస్కృతి, ధైర్యం, ఉత్సాహం నిండిన బరాక్ లోయ కుటుంబాల మధ్యకు రావడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభవాన్నిస్తుంది. బరాక్ లోయకు ముఖద్వారంగా సిల్చార్‌ను పిలుస్తారు. చరిత్ర, భాష, సంస్కృతి, వ్యాపారం అన్నీ కలసి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక్కడ బెంగాలీ మాట్లాడతారు. అస్సామీ ప్రతిధ్వనిస్తుంది. ఇతర గిరిజన సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. ఈ వైవిధ్యాన్ని బలంగా మార్చుకుంటూ, సోదరభావం, సామరస్యంతో ఈ ప్రాంతాన్నంతా మీరు అభివృద్ధి చేస్తున్నారు. ఇది బరాక్ వ్యాలీకున్న అసమానమైన సామర్థ్యం.

మిత్రులారా,

సారవంతమైన బరాక్ నదీ మైదానాలు, ఇక్కడ ఉన్న టీ తోటలు, రైతులు, వాణిజ్య మార్గాలు, విద్యా కేంద్రాలు అన్నింటికీ ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నాం. ఈ ప్రాంతం అస్సాంతో పాటుగా మొత్తం ఈశాన్య ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్‌కు అనుసంధానిస్తోంది. 21వ శతాబ్దంలో బరాక్ లోయ ప్రాధాన్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీ ఆశీర్వాదాన్ని కోరుతూ ఇక్కడికి వచ్చాను. కొద్దిసేపటి క్రితమే, బరాక్ లోయ, ఈశాన్య ప్రాంతంలో రవాణా సదుపాయాలకు సంబంధించిన వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాం. శంకుస్థాపనలు చేశాం. అవి రహదారులైనా, రైల్వేలైనా లేదా వ్యవసాయ కళాశాలలైనా ఈ ప్రాజెక్టులన్నీ ఈశాన్య ప్రాంతానికి ప్రధాన సరకు రవాణా, వాణిజ్య కేంద్రంగా బరాక్ లోయను మారుస్తున్నాయి. ఇవి ఈ ప్రాంతంలో యువతకు అనేక ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు గాను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

స్వాతంత్ర్యం వచ్చిన అనేక దశాబ్దాల అనంతరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఢిల్లీకి, వారి హృదయానికి ఈశాన్య ప్రాంతాన్ని దూరంగా ఉంచాయి. ఈశాన్య ప్రాంతం గురించి కాంగ్రెస్ మరచిపోయింది. కానీ ఇప్పడు ప్రతిచోటా చర్చించుకునే విధంగా ఈశాన్య ప్రాంతాన్ని బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ విధానానికి ఈశాన్య ప్రాంతమే కేంద్రంగా ఉంది. ఆగ్నేయాసియాతో భారతదేశాన్ని అనుసంధానించే వారధిగా మారింది.

కానీ మిత్రులారా,

కాంగ్రెస్ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాన్ని విధికి వదిలేసినట్టుగానే, బరాక్ లోయను సైతం దురవస్థలోకి నెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బరాక్ లోయకు సముద్ర మార్గం నుంచి దూరం చేసేలా సరిహద్దును గీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఒకప్పుడు వాణిజ్య మార్గంగా, పారిశ్రామిక కేంద్రంగా పేరు గాంచిన ఈ ప్రాంతం నుంచి శక్తిని దూరం చేసింది. స్వాతంత్ర్యం అనంతరం దశాబ్దాల తరబడి పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు బరాక్ లోయ అభివృద్ధి గురించి చెప్పుకోదగిన విధంగా ఏమీ చేయలేకపోయాయి.

మిత్రులారా,

బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఈ పరిస్థితిని మారుస్తోంది. ఒకప్పుడు వాణిజ్య కేంద్రంగా విలసిల్లిన బరాక్ లోయకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు మేం నిరంతరం కృషి చేస్తున్నాం. ఈ దిశగా అతి ముఖ్యమైన బృహత్ చర్యను ఈ రోజు చేపట్టాం. సుమారుగా 24 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న షిల్లాంగ్-సిల్చార్ హైస్పీడ్ కారిడార్‌కు ఈ రోజు భూమి పూజ చేసుకున్నాం. ఎంత? 24 వేల కోట్ల రూపాయలు. ఎంత? 24 వేల కోట్ల రూపాయలు. ఎంత? ఎంత? ఎంత? కాంగ్రెస్ పార్టీ వారికి పెన్నూ, కాగితం ఇచ్చి 24 వేల కోట్లను రాయమని అడగండి. వారికి ఎన్ని సున్నాలు రాయాలో తెలియదు. కాంగ్రెస్ ఆలోచనలు ఎక్కడ ఆగిపోయాయో అక్కడే మా పని మొదలయింది. ఈశాన్య ప్రాంతంలో ఇదే మొదటి ప్రవేశ నియంత్రిత హైస్పీడ్ కారిడార్‌గా మారనుంది.

మిత్రులారా,

ఇది హైవే ప్రాజెక్టు మాత్రమే కాదు. ఏళ్ల తరబడి కొనసాగిన ఈశాన్య ప్రాంత ప్రజల ఎదురుచూపులకు ముగింపు. ఈ కారిడార్ ద్వారా సిల్చార్, మిజోరాం, మణిపూర్, త్రిపుర అనుసంధానమవుతాయి. ఈ రాష్ట్రాల సరిహద్దుల వెంబడి బంగ్లాదేశ్, మయన్మార్, ఆగ్నేయాసియాలోనే అతి పెద్ద మార్కెట్ ఉంది. మరో మాటలో చెప్పాలంటే.. ఉజ్వలమైన భవిష్యత్తుకు బరాక్ లోయ ఈ రోజు పునాదిని వేసుకుంటోంది. ఇది అస్సాం, ఈశాన్య ప్రాంత రైతులకు, యువతకు లబ్ధి చేకూరుస్తుంది. ఇంత గొప్ప రవాణా అనుసంధానంతో కూడిన ఈ ప్రాంతంలో పరిశ్రమలు బలోపేతమవుతాయి. పర్యాటకం పెరుగుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా భారత్‌లోని ప్రతి మూల మీతో సులభంగా అనుసంధానమవుతుంది.

మిత్రులారా,

దీర్ఘకాలంగా సిల్చార్‌లో మీరంతా ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. సిల్చార్ ఫ్లైఓవర్‌తో ఈ సమస్య తగ్గుతుంది. సిల్చార్ వైద్య కళాశాల, సిల్చార్ ఎన్ఐటీ, అస్సాం విశ్వ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుంది.

మిత్రులారా,

అస్సాంలో రైలు సౌకర్యంపై బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా, రైల్వేల విద్యుదీకరణకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. ఇప్పుడు 2,500 కి.మీ.లకు పైగా అస్సాం రైలు మార్గాన్ని విద్యుదీకరించాం. ఇప్పుడు ఇక్కడ వేగవంతమైన రైళ్లు నడుస్తాయి. ఇది స్వచ్ఛమైన బరాక్ లోయ పర్యావరణానికి ప్రయోజనం చేకూరుస్తుంది.

స్నేహితులారా,

అస్సాం అభివృద్ధి కోసం బరాక్ లోయ రైతులు, టీ తోటల్లో పని చేసే కార్మికులు గణనీయమైన కృషి చేశారు. రైతుల సంక్షేమం కోసం మా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిరంతరం అనేక చర్యలు తీసుకుంటోంది. నిన్న గువాహటి నుంచి తాజా విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని విడుదల చేశాం. ఇప్పటి వరకు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద లక్షల కోట్ల రూపాయలను రైతులు అందుకున్నారు. కేవలం అస్సాం రైతులకే 20 వేల కోట్ల రూపాయలు అందాయి. ఆలోచించండి, కేవలం పదేళ్లలోనే రైతుల ఖాతాల్లో 20 వేల కోట్ల రూపాయలను జమ చేశాం. పదేళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలించింది. అప్పటి ప్రధానమంత్రి సైతం అస్సాం నుంచే ఎన్నికయ్యారు. కానీ రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేకపోయారు. ఒక్క పైసా! మేం 20 వేల కోట్ల రూపాయలు ఇచ్చాం. నిన్న, బరాక్ వ్యాలీకి చెందిన వేలాది రైతుల ఖాతాలకు సైతం తాజా విడత కిసాన్ సమ్మాన్ నిధి చేరుకుంది. ఎన్నికల అనంతరం కూడా వారికి ఇవి అందుతూనే ఉంటాయి. రైతుల చిన్నపాటి వ్యవసాయ అవసరాలను తీర్చడంలో ఈ సొమ్ము బాగా ఉపయోగపడుతోంది.

స్నేహితులారా,

ఇప్పుడు బరాక్ లోయ పంటలకు మాత్రమే కాకుండా.. వ్యవసాయ విద్య, పరిశోధనలకు కూడా ప్రసిద్ధి చెందింది. బరాక్ లోయలోని పతర్కండీలో మొదటి వ్యవసాయ కళాశాల నిర్మాణం ఈ రోజు నుంచి ప్రారంభమవుతోంది. ఇది రైతులకు మేలు చేస్తుంది. అలాగే వ్యవసాయ అంకుర సంస్థల్లో పనిచేస్తున్న యువతకు తోడ్పాటును, ప్రోత్సాహాన్ని, అవకాశాలను అందిస్తుంది.

మిత్రులారా,

అభివృద్ధి పోటీలో వెనకబడిన వారికి ప్రాధాన్యమివ్వడమే బీజేపీ అనుసరించే సూత్రం. సరిహద్దు ప్రాంతాలను దేశంలో చిట్టచివరి ప్రదేశాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిగణించేవి. మేం సరిహద్దు గ్రామాలను ఈ దేశపు మొదటి గ్రామాలుగా భావిస్తున్నాం. అందుకే వైబ్రంట్ విలేజ్ కార్యక్రమం తదుపరి దశను కాచార్ జిల్లా నుంచే ప్రారంభించాం. బరాక్ లోయలోని అనేక  గ్రామాలను ఈ కార్యక్రమం మెరుగుపరుస్తుంది.

మిత్రులారా,

ఇక్కడ తేయాకు తోటల్లో పెద్ద సంఖ్యలో మిత్రులు పని చేస్తున్నారు. టీ తోటలతో అనుబంధం ఉన్న వేలాది కుటుంబాలకు భూమి హక్కులు అందించే చరిత్రాత్మక కార్యక్రమానికి అస్సాం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కుటుంబాల భవిష్యత్తును మార్చడానికి ఇదే గొప్ప ఆరంభం. భూమి పత్రాలను స్వీకరించడం ద్వారా ఈ కుటుంబాలకు భద్రత, గౌరవం లభిస్తాయి.

మిత్రులారా,

దయ చేసి కాస్త వెనక్కి జరగండి. ఇక్కడ స్థలం లేదు. మీరు ముందుకు రావొద్దు. దయచేసి వారిని దూరంగా ఉంచండి. వారు ఏ మాత్రం ముందుకు రాలేరు. నా అస్సాం సోదరీసోదరులు బాగా అర్థం చేసుకుంటారు. మీ ప్రేమ, మీ ఆశీర్వాదం గొప్ప శక్తినిస్తాయి. మీ అందరికీ ఇదే నా విన్నపం.

మిత్రులారా,

దాదాపు 200 ఏళ్ల నుంచి తేయాకు తోటల్లో అనేక తరాలుగా పనిచేస్తున్న వారి పోరాటాన్ని గుర్తించిన హిమంత ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. చూడండి, నా మాటలకు మేఘాలు కూడా గర్జించడం ప్రారంభించాయి. గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేసిన వారి పట్ల బీజేపీ ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది.

మిత్రులారా,

ఇది భూమి హక్కులకు సంబంధించినది మాత్రమే కాదు. దీని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలతో లక్షలాది కుటుంబాలు అనుసంధానమయ్యే వీలు కలుగుతుంది. గృహ నిర్మాణ పథకాలైనా, విద్యుత్, నీరు అయినా, గ్యాస్ పథకాలైనా వీటి నుంచి ఈ కుటుంబాలు పూర్తిస్థాయిలో లబ్ధి పొందుతాయి.

మిత్రులారా,

ఇటీవలి కాలంలో టీ తోటల్లో అనేక పాఠశాలలను బీజేపీ ప్రభుత్వం ప్రారంభించింది. చిన్నారులకు ఉపకార వేతనాలను అందిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలకు బాటలు వేస్తోంది. ఈ ప్రయత్నాలు తేయాకు తోటల్లోని యువతకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయి.

మిత్రులారా,

విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సేవల వసతులను అందించడానికే బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న అంశాలు. విద్య, ఆరోగ్య సేవల పట్ల కాంగ్రెస్ వహించిన నిర్లక్ష్యం కారణంగా అస్సాం చాలాకాలం ఇబ్బందులను ఎదుర్కొంది. ఇప్పుడు విద్య, ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా అస్సాం అభివృద్ధి చెందుతోంది. దీని నుంచి బరాక్ లోయ ఎంతో ప్రయోజనం పొందుతోంది. విద్య, ఆరోగ్య సేవలకు సంబంధించిన అనేక సంస్థలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి.

మిత్రులారా,

అస్సాం యువతను హింస, ఉగ్రవాదం అనే విష వలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బంధించింది. విభజించు-పాలించు విధానాలకు ప్రయోగశాలగా అస్సాంను కాంగ్రెస్ మార్చింది. ఇప్పుడు అస్సాం యువత ముందు విస్తృతమైన అవకాశాలున్నాయి. భారతదేశ సెమీకండక్టర్ రంగంలో ప్రధాన భూమిక పోషించేలా అస్సాం మారుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో అనుసంధానమైన వ్యవస్థ, ప్రతిభ ఇక్కడ అభివృద్ధి చెందుతోంది. ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. విస్తృతమైన మెడికల్ కళాశాలల వ్యవస్థ, ఎయిమ్స్, క్యాన్సర్ ఆసుపత్రులు ఇక్కడ నిర్మాణమవుతున్నాయి. అనేక త్యాగాలు, ప్రయత్నాల ఫలితంగా శాంతి, పురోగతి అనే ఈ కొత్త శకం ప్రారంభమైంది. ఇప్పుడు, అస్సాంను మళ్లీ పాత రోజుల్లోకి నెట్టేయాలనుకొనే ప్రతి శక్తిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.

మిత్రులారా,

సిల్చార్ వేదికగా అస్సాం ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్‌ అస్సాం నుంచి మీరు తరిమికొట్టారు. నేడు ప్రతి రాష్ట్రం కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతోంది. ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ ఓడిపోతోంది. భవిష్యత్తులో ఓటముల్లో సెంచరీని కాంగ్రెస్ సాధించబోతోంది. వరుసగా వస్తున్న నష్టాలతో అసహనంలో కూరుకుపోయిన కాంగ్రెస్ దేశంపైనే దాడికి పాల్పడుతోంది. దేశ ప్రతిష్ఠను దెబ్బ తీయడంలో  కాంగ్రెస్ నాయకులు నిమగ్నమై ఉన్నారు. ఢిల్లీలో విస్తృత స్థాయిలో జరిగిన ఏఐ సదస్సును మీరు చూశారు. ప్రస్తుతం, ప్రపంచమంతా కృత్రిమ మేధపై చాలా ఆసక్తిని కనబరుస్తోంది. ఈ సదస్సుకు విజయవంతంగా ఢిల్లీ ఆతిథ్యమిచ్చింది. ప్రపంచం నలుమూలల నుంచి నాయకులు, ప్రధాన సాంకేతిక సంస్థలు, సాంకేతిక దిగ్గజాలు ఢిల్లీకి వచ్చారు. ఈ సదస్సు ప్రతిష్ఠను దిగజార్చడానికి, కాంగ్రెస్ అర్థనగ్న ప్రదర్శన చేసింది. ఇంతకు మించి కాంగ్రెస్‌ ఏమీ చేయలేదు. ఈ అనాగరికమైన, అవమానకరమైన నిరసనను దేశం మొత్తం ఖండించింది. కానీ కాంగ్రెస్ రాజకుటుంబం దీన్ని ఓ ఘనకార్యంలా భావిస్తోంది. దేశ ప్రతిష్ఠను మసకబార్చేందుకు ప్రయత్నించిన వారిని వెనకేసుకు వస్తోంది. ఇలా దేశ వ్యతిరేకమైన పనులు చేసే కాంగ్రెస్ ఏ రాష్ట్రానికి మంచి చేయలేదు. అస్సాం యువత సంక్షేమం గురించి ఆలోచించలేదు.

మిత్రులారా,

ఇటీవలి కాలంలో, ప్రపంచవ్యాప్తంగా, మన పొరుగున సైతం యుద్ధ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. యుద్ధం వల్ల ఎదురయ్యే భయానక పరిస్థితుల గురించి మీకు తెలుసు. వాటిని మీరు రోజూ చూస్తూనే ఉన్నారు. యుద్ధం వల్ల ఎదురైన పరిస్థితుల ప్రభావం మన పౌరులపై వీలైనంత తక్కువగా ఉండేలా మా ప్రభుత్వం సాధ్యమైన అన్ని ప్రయత్నాలను చేస్తోంది. మన  ప్రజలపై యుద్ధ ప్రభావాన్ని తగ్గించేందుకే మేం ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ పాత్రను కాంగ్రెస్ పోషిస్తుందని ఆశించారు. కానీ, జాతీయ ఆసక్తులకు సంబంధించిన ముఖ్యమైన కార్యంలో కాంగ్రెస్ మరోసారి విఫలమైంది. దేశంలో ఆందోళనలను వ్యాప్తి చేయడానికి, దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు, ఆ తర్వాత మోదీని తిట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

మిత్రులారా,

అస్సాం విషయంలో కానీ, దేశం పట్ల కానీ కాంగ్రెస్‌కు ఎలాంటి దార్శనికత లేదు. అందుకే, పుకార్లను, అబద్ధాలను, మోసాన్ని తమ ఆయుధంగా వారు మలుచుకున్నారు. అబద్ధపు వీడియోలను తయారు చేసేందుకే వారు ఓ సంస్థను నడుపుతున్నట్టుగా ఉంది. భారత్ వేగంగా సాధిస్తోన్న అభివృద్ధిని ఓర్చుకోలేని ప్రపంచ శక్తులు, దేశ పురోగతి పట్ల సంతోషంగా లేని విదేశీ శక్తులు కొన్ని ఉన్నాయి. దురదృష్టవశాత్తూ వాటి చేతిలో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారింది. అందుకే అస్సాంలోని ప్రతి పౌరుడూ, యువత కాంగ్రెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిత్రులారా,

అస్సాం, బరాక్ లోయ రెండూ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతున్నాయి. తన భాష, సాహిత్యం, సంస్కృతితో బరాక్ లోయ ప్రసిద్ధి చెందింది. అభివృద్ధికి నూతన కేంద్రంగా బరాక్ లోయ మారే తరుణం ఎంతో దూరంలో లేదు.

మిత్రులారా,

మీ ఆశీర్వాదాలను అందించడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి మీరు వచ్చారు. రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దేవారు, అవకాశాల కోసం అన్వేషించేవారు, ఈ రోజు బరాక్ లోయలో, రేపు బోడో సమాజంలో, తేయాకు తోటల్లో పనిచేసే కార్మిక బృందాలు ఎక్కడ చూసినా రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ స్పష్టంగా తెలుసు. మాకు మీ ఆశీర్వాదాలు అందించేందుకు ఇంత పెద్ద సంఖ్యలో మీరంతా వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అభివృద్ధి  ప్రాజెక్టులకు గాను మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాతో కలసి చెప్పండి-

భారత్‌మాతాకీ జై!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

 

***


(రిలీజ్ ఐడి: 2240431) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Kannada