సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మరింత ఆకర్షణీయమైన రంగుల డిజైన్‌తో, తాజా గణాంకాలతో, చదవడానికి సులభమైన శైలిలో రూపొందించిన ప్రతిష్ఠాత్మక ‘భారత్ 2026 - ఏ రిఫరెన్స్ యాన్యువల్’ ను విడుదల చేసిన పబ్లికేషన్స్ డివిజన్

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 7:50PM by PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణల విభాగం (పబ్లికేషన్స్ డివిజన్) తన ప్రతిష్ఠాత్మక వార్షిక ప్రచురణ “భారత్ 2026 – ఏ రిఫరెన్స్ యాన్యువల్” తాజా సంచికను ఇంగ్లీష్, హిందీ భాషల్లో విడుదల చేసింది. పబ్లికేషన్స్ డివిజన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ భూపేంద్ర కైంతోలా ఈ రోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

 

 "భారత్ 2026 – ఏ రిఫరెన్స్ యాన్యువల్" పుస్తకం డిజైన్  ప్రెజెంటేషన్ పరంగా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. మొదటిసారిగా, పుస్తకం మొత్తాన్ని నాలుగు రంగులలో ముద్రించారు. పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా,  ఆకట్టుకునేలా ఉండటం కోసం, ఇందులోని విభాగాలు, అధ్యాయాలను వేర్వేరు రంగుల కోడింగ్‌తో రూపొందించారు. ఈ ప్రచురణలో రంగుల ఫోటోలు, ఇన్ఫోగ్రాఫిక్స్, తాజా ప్రామాణికమైన గణాంకాలతో పాటు, చదవడానికి సులభంగా ఉండేలా,  రిఫరెన్స్ అంశాల విలువను పెంచేలా ఆధునిక లేఅవుట్‌ను పొందుపరిచారు. మెరుగైన డిజైన్, నాణ్యమైన ముద్రణ ఉన్నప్పటికీ, పాఠకులందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం ధరను పెంచకుండా గత ఏడాది సంచికతో సమానంగా ఉంచారు.

ఈ సందర్భంలో, శ్రీ భూపేంద్ర కైంతోలా 'భారత్ 2026' ఎడిటింగ్, ప్రొడక్షన్, డిజైనింగ్‌లో పాలుపంచుకున్న మొత్తం బృందాన్ని అభినందించారు. విధుల్లో అంకితభావంతో సహకరించిన అనుబంధ సిబ్బందిని కూడా ఆయన ప్రశంసించారు. అంతేకాకుండా, ఈ పుస్తకం కోసం సమాచారాన్ని సేకరించడంలో పడ్డ అపారమైన శ్రమను, అలాగే సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి సమన్వయం చేయడంలో చూపిన నిశితమైన సంపాదకీయ నైపుణ్యాన్ని ఆయన కొనియాడారు. దీనివల్ల పుస్తకంలోని వాస్తవాలు కచ్చితంగా, స్థిరంగా, ఒకదానికొకటి అనుబంధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

 

భారత ప్రభుత్వ విధానాలు, సాధించిన విజయాలను ప్రముఖంగా తెలియజేయడానికి ఈ రిఫరెన్స్ పుస్తకాలు ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, 'భారత్ రిఫరెన్స్ యాన్యువల్' ప్రతి సంచిక ప్రచురణా రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని అన్నారు. ఈ పుస్తకానికి ఉన్న అపారమైన ప్రజాదరణను వివరిస్తూ, దేశాభివృద్ధిని అర్థం చేసుకోవాలనుకునే యువ పాఠకులే కాకుండా, భారతదేశం గురించి ప్రామాణికమైన సమాచారం కోసం వెతుకుతున్న విదేశీ పాఠకులు కూడా ఈ పుస్తకాన్ని విశేషంగా చదువుతారని ఆయన పేర్కొన్నారు. 

జాయింట్ డైరెక్టర్ శ్రీ హమీద్ హుస్సేన్, చీఫ్ ఎడిటర్ శ్రీ కుల్శ్రేష్ఠ కమల్, బిజినెస్ మేనేజర్ (ఇన్‌ఛార్జ్) శ్రీమతి ఇస్మీత్ కౌర్, హిందీ ఎడిషన్ ఎడిటర్ శ్రీమతి సీమా రాణి,  ఎడిటోరియల్, ప్రొడక్షన్ బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సమకాలీన డిజైన్,  అధికారిక రిఫరెన్స్ విలువ కలిగిన “భారత్ 2026 – ఏ రిఫరెన్స్ యాన్యువల్” కు పాఠకులు, పండితులు, పరిశోధకుల నుంచి  విస్తృత ప్రశంసలు లభిస్తున్నాయి. 

 

***


(రిలీజ్ ఐడి: 2239642) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Punjabi , Gujarati , Malayalam