ప్రధాన మంత్రి కార్యాలయం
మార్చి 13-14 తేదీల్లో ప్రధానమంత్రి అస్సాం పర్యటన
రూ.47,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు, ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్న ప్రధాని
ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఫోర్-లేన్ హై-స్పీడ్ కారిడార్… షిల్లాంగ్-సిల్చార్ కారిడార్కు భూమిపూజ నిర్వహించనున్న ప్రధానమంత్రి
అస్సాంలో ప్రధాన రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు - అస్సాం మాల 3.0 భూమి పూజను నిర్వహించనున్న ప్రధాని
తేయాకు తోటల కార్మికులకు కార్మికులకు నివాస స్థల హక్కులు కల్పించే దిశగా చారిత్రాత్మక ఘట్టంగా నిలిచేలా, తేయాకు తోటల కార్మికులకు భూమి పట్టాలను పంపిణీ చేయనున్న ప్రధాని
ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే కోపిలి జల విద్యుత్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడంతో పాటు, నుమాలిగఢ్-సిలిగురి పైప్లైన్ సామర్థ్య పెంపు ప్రాజెక్టును, నార్త్ ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ ఫేజ్ 1ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
దేశవ్యాప్తంగా 9.3 కోట్లకు పైగా రైతులకు పీఎం-కిసాన్ పథకం కింద 22వ విడత నిధులను విడుదల చేయనున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 MAR 2026 5:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 13-14 తేదీల్లో అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కొక్రాఝర్, గువహటి, సిల్చార్ ప్రాంతాలలో రూ. 47,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజ, రైళ్ల ప్రారంభోత్సవం చేస్తారు.
మార్చి 13న, మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు కొక్రాఝర్లో రూ.4,570 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి భూమిపూజ, శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం సుమారు 5 గంటలకు గువహటిలో, దాదాపు రూ. 19,480 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు భూమిపూజ, ప్రారంభోత్సవం, జాతికి అంకితం కార్యక్రమాలు చేస్తారు.
మార్చి 14న, ఉదయం సుమారు 10:45 గంటలకు, ప్రధానమంత్రి సిల్చార్లో సుమారు రూ. 23,550 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు భూమిపూజ, జాతికి అంకితం చేస్తారు.
కొక్రాఝర్లో ప్రధాని పర్యటన
రూ. 3,200 కోట్లకు పైగా విలువైన భారీ రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ 'అస్సాం మాల 3.0' కు ప్రధానమంత్రి భూమిపూజ చేస్తారు. ఈ పథకం కింద, రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడానికి, జాతీయ రహదారులు - గ్రామీణ రోడ్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా 900 కిలోమీటర్లకు పైగా రహదారులను నిర్మించనున్నారు.
బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) ప్రాంతంలో సుమారు రూ. 1,100 కోట్ల పెట్టుబడితో నాలుగు ఫ్లైఓవర్లు, రెండు వంతెనలతో సహా ఆరు రహదారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి భూమి పూజ చేస్తారు. ఈ ప్రాజెక్టులు కొక్రాఝర్ జిల్లాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, అనుసంధానం, పర్యాటకం, వ్యవసాయ సౌలభ్యం, ఆరోగ్య సేవల అందుబాటు, గ్రామాల మధ్య రాకపోకల మెరుగుదలకు దోహదపడతాయి.
కొక్రాఝర్ జిల్లాలోని బాష్బరి వద్ద రైల్వే పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) వర్క్షాప్కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ వర్క్ షాప్ రైల్వే నిర్వహణ మౌలిక సదుపాయాలను పటిష్టం చేస్తుంది. నిర్వహణా సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
అస్సాంలోనూ, ఈశాన్య ప్రాంతంలోనూ కనెక్టివిటీని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి మూడు కొత్త రైలు సర్వీసులను కూడా ప్రారంభించనున్నారు. వీటిలో ఈశాన్య, దక్షిణ భారతదేశం మధ్య ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని అందించే కామాఖ్య-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, అస్సాం, పశ్చిమ బెంగాల్ మధ్య కనెక్టివిటీని పెంపొందించే గువహటి-న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్;, అస్సాం, త్రిపుర మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తూ ప్రయాణికులు, వ్యాపారులు, పర్యాటకులకు సులభతరమైన అంతర్రాష్ట్ర ప్రయాణాన్ని అందించే నరంగి-అగర్తల ఎక్స్ప్రెస్ ఉన్నాయి.
గువహటిలో ప్రధాని
తేయాకు తోటల ప్రధానమంత్రి భూ పట్టాలను పంపిణీ చేయనున్నారు, ఇది తేయాకు తోటల కార్మిక సమాజానికి నివాస స్థల హక్కులను కల్పించడంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. సురక్షితమైన భూ యాజమాన్యం నివాస భద్రతను మెరుగుపరుస్తుందని, సంస్థాగత రుణాలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి వీలు కల్పిస్తుందని, దీర్ఘకాలిక సామాజిక, ఆర్థిక పురోభివృద్ధిని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 9.3 కోట్లకు పైగా రైతులకు పీఎం-కిసాన్ పథకం l 22వ విడత నిధులను కూడా ప్రధానమంత్రి అస్సాం నుంచి విడుదల చేస్తారు. ఈ పథకం కింద, అర్హులైన రైతులకు రూ. 2,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.
దిమా హసావో, పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలలో ఉన్న కోపిలి హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. రూ. 2,300 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని పెంపొందించడమే కాకుండా, ఈ ప్రాంతంలో గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. గృహాలు, రైతులు , పరిశ్రమలకు నమ్మకమైన విద్యుత్ సరఫరాను అందిస్తుంది.
ఆయిల్ ఇండియా లిమిటెడ్కు చెందిన నుమాలిగఢ్-సిలిగురి ప్రొడక్ట్ పైప్లైన్ (ఎన్ఎస్పీఎల్) సామర్థ్య పెంపు ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. అదనపు పెట్రోలియం ఉత్పత్తుల తరలింపును సులభతరం చేయడం ద్వారా నుమాలిగఢ్ రిఫైనరీ సామర్థ్యాన్ని 3 ఎంఎంటీపీఏ నుంచి 9 ఎంఎంటీపీఏకి విస్తరించడానికి ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది. నార్త్ ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ ఫేజ్ ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఇది గువహటిని నుమాలిగఢ్, గోహ్పూర్, ఇటానగర్లతో అనుసంధానించే ఒక ప్రధాన పైప్లైన్ ప్రాజెక్ట్. దీనికి అదనంగా దిమాపూర్ వరకు విస్తరించిన బ్రాంచ్ లైన్ కూడా ఉంది. హైలకండి జిల్లాలోని పంచగ్రామ్ వద్ద నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్(ఎన్ఆర్ఎల్) కు చెందిన రైల్ - ఫెడ్ పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్ టెర్మినల్కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు ఈశాన్య ప్రాంతంలో ఇంధన మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేయడమే కాకుండా, జాతీయ ఇంధన భద్రతను మెరుగుపరుస్తాయి.
ప్రధానమంత్రి ఈ సందర్భంగా పలు ప్రధాన రైల్వే విద్యుదీకరణ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. వీటిలో సుమారు రూ.420 కోట్ల వ్యయంతో కూడిన రంగియా-ముర్కాంగ్సెలెక్ రైలు మార్గం విద్యుదీకరణ (558 కి.మీ.), దాదాపు రూ.1,180 కోట్ల వ్యయంతో కూడిన చాపర్ముఖ్-డిబ్రూఘర్ రైలు మార్గం విద్యుదీకరణ (571 కి.మీ.), సుమారు రూ.650 కోట్ల వ్యయంతో కూడిన బదర్పూర్-సిల్చార్, బదర్పూర్-చురైబారి రైలు మార్గాల విద్యుదీకరణ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు బ్రహ్మపుత్ర, బరాక్ వ్యాలీ ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరుస్తూనే, వేగవంతమైన, ఇంధన సమర్థవంతమైన, పర్యావరణపరంగా సుస్థిరమైన రైలు కార్యకలాపాలను సాధ్యం చేస్తాయి.
ఫర్కాటింగ్-తిన్సుకియా రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టుకు (194 కి.మీ.) కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. రూ. 3,600 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల రైలు మార్గం సామర్ధ్యం పెరిగి మరిన్ని ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ల నిర్వహణ కు వీలవుతుంది.
జల మార్గాలకు సంబంధించి, బిస్వనాథ్ జిల్లాలోని బిస్వనాథ్ ఘాట్, జోర్హాట్ జిల్లాలోని నీమతి వద్ద క్రూయిజ్ టెర్మినల్స్కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు, దిబ్రూఘర్లోని బోగీబీల్ వద్ద రీజినల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు ప్రధానమంత్రి భూమిపూజ చేస్తారు. ఇది ఈశాన్య ప్రాంతానికి ప్రధాన సముద్ర శిక్షణ, పరిశోధనా కేంద్రంగా సేవలందిస్తుంది. అలాగే, పాండు జెట్టిని ఎన్హెచ్-27తో అనుసంధానించే అప్రోచ్ రోడ్డును కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు
గువహటిలో పిఎం ఏక్తా మాల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఈ మాల్ అస్సాంకు, ఈశాన్య ప్రాంతానికి ఒక ప్రధాన వాణిజ్య పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఇందులో ‘ఒక జిల్లా - ఒక ఉత్పత్తి‘ వస్తువులు, జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు, అస్సాం, ఇతర రాష్ట్రాల హస్తకళలు, చేనేత వస్తువుల కోసం శాశ్వత స్టాల్స్ ఉంటాయి. ఈ సదుపాయంలో ప్రముఖ భారతీయ బ్రాండ్ల షోరూమ్లు, ఫుడ్ కోర్టులు, ఆధునిక సౌకర్యాలు, పార్కింగ్, డిజిటల్ కియోస్క్లు కూడా ఉంటాయి. ఇవి స్థానిక కళాకారులకు ఒక వేదికను అందించడంతో పాటు ప్రాంతీయ సంస్కృతి పరిశ్రమను ప్రోత్సహిస్తాయి.
సిల్చార్లో ప్రధాని
ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటి యాక్సెస్-కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ ఫోర్-లేన్ హై-స్పీడ్ కారిడార్ అయిన షిల్లాంగ్-సిల్చార్ కారిడార్ కు ప్రధానమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు రూ. 22,860 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ 166 కిలోమీటర్ల కారిడార్, మేఘాలయ, అస్సాం మధ్య కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ ప్రాజెక్ట్ గువహటి, సిల్చార్ మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ప్రయాణ సమయాన్ని 8.5 గంటల నుంచి న సుమారు 5 గంటలకు తగ్గిస్తుంది, తద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని, సరిహద్దు వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
సిల్చార్లోని క్యాపిటల్ పాయింట్ సమీపంలోని ట్రంక్ రోడ్డు నుంచి రంగీర్ఖారీ పాయింట్ వరకు (ఫేజ్-I), ఎన్హెచ్-306పై ఎలివేటెడ్ కారిడార్కు కూడా ప్రధానమంత్రి భూమిపూజ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ సిల్చార్లోని అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో ఒకటిగా ఉన్న ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది, మిజోరం, త్రిపుర, మణిపూర్ వంటి పొరుగు రాష్ట్రాలతో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. బరాక్ లోయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.
కరీంగంజ్ జిల్లాలోని పాతర్కండిలో కొత్త అగ్రికల్చర్ కాలేజీకి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ సంస్థ అస్సాంలో వ్యవసాయ విద్య, పరిశోధనా వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే, బరాక్ వ్యాలీ, పొరుగు ప్రాంతాల విద్యార్థులకు వారి ఇంటికి సమీపంలోనే ఉన్నత ప్రమాణాలతో కూడిన వ్యవసాయ విద్యను అందుబాటులోకి తెస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2239291)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7