ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ఆధునిక, వికసిత ఢిల్లీ నిర్మాణానికి మేం కట్టుబడి ఉన్నాం; ఈరోజు ప్రారంభించిన ప్రాజెక్టులు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాయి. రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తాయి... నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి: ప్రధానమంత్రి
భారత ‘నారీ శక్తి’ ప్రతి రంగంలోనూ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది: ప్రధాని
ఢిల్లీ అభివృద్ధి కేవలం ఒక నగరం అభివృద్ధి మాత్రమే కాదు... ఇది మొత్తం దేశ ప్రతిష్టతో ముడిపడి ఉంది: ప్రధాని
ఈ రోజు ప్రారంభించిన కొత్త మెట్రో మార్గం రాజధానిలోని లక్షలాది మందికి, ముఖ్యంగా తూర్పు, ఈశాన్య ఢిల్లీ
ప్రజలకు ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తుంది. రోజువారీ ప్రయాణం మునుపటి కంటే ఇప్పుడు చాలా సులభం : ప్రధానవీధి
వ్యాపార మిత్రుల కోసం పీఎం స్వనిధి క్రెడిట్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది...ఇప్పుడు వారి జేబులోనే క్రెడిట్ కార్డు... అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 MAR 2026 3:18PM by PIB Hyderabad
దేశ రాజధానీ నగరం ఢిల్లీలో సుమారు రూ. 33,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఢిల్లీ అభివృద్ధికి కొత్త వేగాన్ని అందించడానికి మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం” అని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుల పరిధి మెట్రో నెట్వర్క్ విస్తరణ నుంచి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆధునిక నివాస సముదాయాల నిర్మాణం వరకు విస్తరించి ఉంది. "ఢిల్లీ ప్రజలు ఏడాది క్రితం కొత్త ఆశలు, కొత్త సంకల్పంతో ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఫలితం నేడు ఈ అభివృద్ధి పనుల్లో కనిపిస్తోంది" అని శ్రీ మోదీ చెప్పారు.
కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తూ, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కావడాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ విజయవంతమైన నాయకత్వంలో రాజకీయం, సైన్స్, క్రీడల వంటి రంగాలలో వారి శక్తి, ఆత్మవిశ్వాసం భారత అభివృద్ధి ప్రయాణాన్ని ఎలా ముందుకు నడిపిస్తున్నాయో వివరించారు. "రాజకీయం, పరిపాలన, సైన్స్, క్రీడలు లేదా సామాజిక సేవ ఏదైనా కావచ్చు, భారత మహిళా శక్తి ప్రతి రంగంలోనూ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారత ప్రజాస్వామ్యానికి ఢిల్లీ ప్రపంచ గుర్తింపు, శక్తి చిహ్నమని ప్రధాని ఉద్ఘాటించారు. నమో భారత్ రైలు, 375 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ చారిత్రక విస్తరణ వంటివి రాజధాని మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను ఆధునికీకరించడానికి, ప్రపంచానికి భారత ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పడానికి ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. "ఢిల్లీ ఎంత ఆధునికంగా, సౌకర్యవంతంగా, మెరుగైన రవాణా వ్యవస్థతో ఉంటే, భారత ఆత్మవిశ్వాసం ప్రపంచానికి అంత బలంగా కనిపిస్తుంది" అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
డబుల్ ఇంజిన్ పాలనలో జాతీయ రాజధాని ప్రాంతంలో ప్రతి రవాణా సదుపాయాన్ని క్రమపద్ధతిలో ఆధునికీకరిస్తున్నామని, దీనివల్ల ప్రతిరోజూ బస్సులపై ఆధారపడే లక్షలాది మంది ప్రజలకు కాలుష్య రహిత, సౌకర్యవంతమైన ప్రయాణం అందుతుందని ప్రధాని ఉద్ఘాటించారు. “ఇప్పటికే కేంద్రం అందించిన నాలుగు వేలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. గత ఒక్క ఏడాదిలోనే మరో 1,800 కొత్త బస్సులను ప్రవేశపెట్టాం. ఇందులో ఢిల్లీలోని కాలనీలు, పరిసర ప్రాంతాలకు చివరి మైలు వరకు రవాణా సౌకర్యాన్ని అందించే వందలాది 'దేవి బస్సులు' కూడా ఉన్నాయి" అని శ్రీ మోదీ పేర్కొన్నారు
జాతీయ రాజధాని ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రస్తుతం నిర్దేశిత లక్ష్యంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గతంలో నగరంలోకి ప్రవేశించాల్సి వచ్చే లక్షలాది వాహనాలను పెరిఫెరల్ ఎక్స్ప్రెస్వే విజయవంతంగా మళ్లించిందని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. 'యమునా నది పునరుజ్జీవం కోసం ఒక భారీ కార్యక్రమాన్ని ప్రారంభించాం, నదిని శుభ్రంగా ఉంచడానికి కోట్లాది రూపాయల విలువైన ప్రాజెక్టుల పనులు ఇప్పటికే కొనసాగుతున్నాయి' అని శ్రీ మోదీ తెలిపారు.
రాజధానిలో ప్రజల జీవన ప్రమాణాలను నిరంతరం మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గత ఏడాది కాలంలో అనేక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను మందిరాలను ఏర్పాటు చేయడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఢిల్లీలో ఆయుష్మాన్ పథకం అమలుతో, అటు పేదలు, ఇటు మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఉచిత వైద్య చికిత్సను, గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారని ప్రధాని పేర్కొన్నారు. సామర్థ్యంతో కూడిన నూతన శకాన్ని ప్రస్తావిస్తూ "ప్రస్తుత అభివృద్ధి నమూనా తక్షణ చర్యలు, స్పష్టమైన ఫలితాలపై దృష్టి సారిస్తుంది. ప్రాజెక్టులను ప్రణాళికా దశ నుంచి నుండి క్షేత్రస్థాయి అమలుకు అత్యంత వేగంగా మారుస్తుంది" అన్నారు.
ఈ కార్యక్రమానికి ముందు సరోజినీ నగర్ లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన అత్యాధునిక నివాస సముదాయాలను ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. "దేశ సంకల్పాలను నెరవేర్చడానికి అహర్నిశలు శ్రమించే వారికి సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన జీవన పరిస్థితులు అవసరం. ఈ కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఇదే" అని ఆయన చెప్పారు. వేలాది ఫ్లాట్లను లబ్ధిదారులకు అందజేస్తూ, ఈ ఆధునిక గృహాలు "కర్మయోగుల" జీవితాల్లో సరికొత్త ఆనందాన్ని, ఆశయాలను నింపుతాయని శ్రీ మోదీ ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ కేంద్రాల వరకు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని, ముఖ్యంగా పేద కుటుంబాలు, రైతులు, కార్మికులకు ఇవి ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పీఎం స్వనిధి యోజన’ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పును శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు. ఢిల్లీలోనే దాదాపు 2 లక్షలమంది వీధి వ్యాపారులు రూ. 350 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని పొందారని, తద్వారా వారు అధిక వడ్డీతో కూడిన అసంఘటిత రుణాల వలయం నుంచి విముక్తి పొంది, అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ వైపు మళ్లారని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సమ్మిళితం దిశగా చోటుచేసుకున్న ఈ చారిత్రాత్మక మార్పును వివరిస్తూ, ఒకప్పుడు కేవలం సంపన్నులకే పరిమితమైన క్రెడిట్ కార్డ్ సౌకర్యాలు, ఇప్పుడు వీధి విక్రేతల చిన్న వ్యాపారాలను బలోపేతం చేయడానికి కూడా అందుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. “పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్ పేదల ఆత్మగౌరవానికి ఒక కొత్త మాధ్యమంగా మారుతోంది. ఒకప్పుడు అట్టడుగున ఉన్నవారికి ఇప్పుడు ఈ ఆధునిక ఆర్థిక సాధనాలతో సాధికారత లభిస్తోంది” అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఒక అద్భుతమైన మైలురాయిని ప్రధానమంత్రి ప్రస్తావించారు. మూడు కోట్లమందిని లక్షాధికార మహిళలు (లఖ్పతి దీదీలు)గా తీర్చిదిద్దాలనే జాతీయ లక్ష్యాన్ని నెరవేర్చినట్లు ఆయన వెల్లడించారు. స్వయం సహాయ సంఘాల ద్వారా ప్రస్తుతం 10 కోట్లమందికి పైగా మహిళలు సాధికారత సాధించారని ఆయన తెలిపారు. ఈ మహిళలకు అవసరమైన పెట్టుబడి, బ్యాంకింగ్ వ్యవస్థలు, ప్రత్యేక శిక్షణను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, వారు ఆర్థిక సాధికారతను సాధించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రభుత్వం కృషి చేసిందని ప్రధాని పేర్కొన్నారు. “మనసోదరీమణుల విజయం మరో 3 కోట్ల మంది 'లఖ్పతి దీదీలను' సృష్టించాలనే కొత్త సంకల్పానికి స్ఫూర్తినిచ్చింది. మన నారీ శక్తి ఆశీస్సులతో ఈ లక్ష్యం తప్పక నెరవేరుతుందని నేను విశ్వసిస్తున్నా” అని శ్రీ మోదీ అన్నారు.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఒక సంప్రదాయ సంతాల్ గిరిజన ఉత్సవానికి విచ్చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమె పట్ల చూపిన అగౌరవంపై ప్రధానమంత్రి తన ఆవేదనను పంచుకున్నారు. అహంకారంతో ఉన్నవారు పతనమయ్యే ప్రాచీన రీతిని గుర్తుచేస్తూ, ఇలాంటి అహంకార రాజకీయాలను రాష్ట్ర ప్రజలు అంతిమంగా తిరస్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు. "రాష్ట్రపతి కార్యక్రమాన్ని బహిష్కరించడం, సరిగా నిర్వహించకపోవడం రాజ్యాంగాన్ని, ఈ దేశంలోని ప్రతి కుమార్తెను అవమానించడమే. అధికార గర్వంతో కూడిన ఇటువంటి అహంకారాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించరు" అని శ్రీ మోదీ హెచ్చరించారు.
ఢిల్లీని ఒక చారిత్రక నగరంగా అభివర్ణిస్తూ, ప్రస్తుతం ఈ నగరం "నవ భారత" ఆత్మవిశ్వాసం నిండిన ఒక కొత్త శకాన్ని వీక్షిస్తోందని, ఇది అభివృద్ధి చెందిన భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. జాతీయ లక్ష్యాల సంల్పాల సాధన కోసం దేశ ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలియజేస్తూ, సామరస్య భావనను, జాతీయతా భావననూ కలిగించారు. "నవ భారత సాధన లక్ష్యం మనల్ని ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి చెందిన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ఢిల్లీలోని ప్రతి కుటుంబం మరింత మెరుగైన, సంపన్నమైన జీవితాన్ని చూస్తుందని నేను నమ్ముతున్నాను" అని శ్రీ మోదీ అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2236890)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam