ప్రధాన మంత్రి కార్యాలయం
కోటా ఎయిర్పోర్ట్ భూమిపూజ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
నాడు పోస్టు చేయడమైనది:
07 MAR 2026 3:58PM by PIB Hyderabad
కోటా, హడోతీ ప్రాంతానికి చెందిన నా మిత్రులందరికీ మరోసారి నమస్కారాలు!
వారం కిందటే.. రాజస్థాన్ను సందర్శించే అవకాశం నాకు లభించింది. పవిత్రమైన అజ్మేర్ నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. శంకుస్థాపనలు చేశాం. అదే కార్యక్రమంలో 21,000 మందికి పైగా రాజస్థాన్ యువతకు నియామక పత్రాలను అందించాం. అజ్మేర్ పర్యటన చేపట్టిన కొన్ని రోజుల వ్యవధిలోనే కోటాలో ముఖ్యమైన విమానాశ్రయ ప్రాజెక్టు పనులను ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. ఒక వారంలోనే రాజస్థాన్లో ప్రారంభమైన ఈ రెండు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు శక్తిమంతమైన సందేశాన్నిస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ ఎంత వేగంగా పురోగతి సాధిస్తుందో ఇవి చూపిస్తున్నాయి. అది మౌలిక వసతులు, యువతకు ఉద్యోగావకాశాలు, రైతులు, మహిళలకు పథకాలైనా లేదా ప్రతి రంగంలోనూ చేపడుతున్న కార్యక్రమాలైనా రాజస్థాన్లో వేగంగా పని జరుగుతోంది.
స్నేహితులారా,
కోటా, బుండి, బరాన్, జలావర్, మొత్తం హడోతీ ప్రాంతానికి కొత్త ఆశను, విజయాన్నిచ్చిన రోజు ఇది. దాదాపు రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ఆధునిక విమానాశ్రయం.. భవిష్యత్తులో ఈ మొత్తం ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ముఖ్యమైన ఎయిర్పోర్టు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా కోటా, హడోతీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
స్నేహితులారా,
2023 నవంబరులో కోటాకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలకు ఓ మాట ఇచ్చానని నాకు గుర్తుంది. విమానాశ్రయం అనేది కలగా మిగిలిపోదని, దానిని నిజం చేస్తామని నేను చెప్పాను. ఇప్పుడు కోటా విమానాశ్రయ నిర్మాణం ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైనందుకు నేను సంతోషిస్తున్నాను. ఇప్పటివరకు విమాన ప్రయాణానికి జైపూర్ లేదా జోద్పూర్కు కోటా ప్రజలు వెళ్లాల్సి వచ్చేది. దీనివల్ల సమయం వృథా అయ్యేది. అసౌకర్యం కలిగేది. ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతోంది. ఈ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైతే కోటా, పరిసర ప్రాంతాల్లో ప్రయాణం సులభతరమవుతుంది. వాణిజ్యం వేగంగా విస్తరిస్తుంది.
స్నేహితులారా,
విద్యా కేంద్రంగా మాత్రమే కాకుండా కోటా ప్రధాన విద్యుత్ కేంద్రంగానూ ఉంది. అణు, బొగ్గు, గ్యాస్, జలం ఇలా దాదాపు అన్ని శక్తి వనరుల నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన ప్రాంతమిది. వారసత్వ సంపదకు సైతం హడోతీ ప్రాంతం అంతే ప్రసిద్ధి చెందింది. కోటా కచోరీ రుచి, కోటా డోరియా చీరల అందం, కోటా రాయి, ఇసుక రాయికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక్కడి కొత్తిమీర, బుండీ బాస్మతీ బియ్యం సువాసన అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుంది. కష్టపడే తత్వానికి, ఉత్పాదనకు, అసాధారణ సామర్థ్యానికి ఈ ప్రాంతం పేరుగాంచింది. ఇప్పుడు కోటాలో కొత్త విమానాశ్రయంతో ఈ అవకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి.
స్నేహితులారా,
వ్యాపారానికి, విశ్వాసానికి కూడా ప్రధాన కేంద్రంగా కోటా, హడోతీ ప్రాంతం ఉంది. శతాబ్దాలుగా, మధురాధీశ పీఠాన్ని, కేశవ్ రాయ్ పటన్ పుణ్యక్షేత్రాన్ని, ఖడే గణేశ్ మహారాజ్ను, గోదావరి బాలాజీ ధామ్ను సందర్శించడానికి దేశవిదేశాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తున్నారు. గరాడియా మహదేవ్ నుంచి కనిపించే చంబల్ ప్రాంతం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ముకుంద్రా హిల్స్, రామ్ఘర్ విష్ధారి లాంటి అభయారణ్యాలు వైల్డ్లైఫ్ పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతాన్ని మారుస్తున్నాయి. పెరిగిన విమాన అనుసంధానంతో దేశం, ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా యువతకు, వర్తకులకు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుంది.
స్నేహితులారా,
రవాణా అనుసంధానంలో కోటా వేగంగా పురోగతి సాధిస్తోంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కోటాలో ఉన్న రెండు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటవుతున్నాయి. కోటా, బుండి నుంచి వెళ్లే ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్ మార్గం ఈ ప్రాంతమంతా అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకువస్తుంది. ఢిల్లీ, వడోదరా, ముంబయి లాంటి పెద్ద నగరాలను ఇప్పుడు కొన్ని గంటల్లోనే చేరుకోవచ్చు. మెరుగైన రోడ్డు, రైలు మార్గాలతో కొత్త పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతాయి. ముఖ్యంగా వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా మారుతుంది. రోడ్డు, రైలు మార్గాలతో పాటుగా విమానయాన సౌకర్యంతో కోటా అభివృద్ధి వేగవంతమవుతుంది. హడోతీ ప్రాంతంలోనూ, పరిసర జిల్లాల్లోనూ ఈ కోటా విమానాశ్రయం కొత్త అవకాశాలను తీసుకువస్తుంది.
స్నేహితులారా,
ఈ ముఖ్యమైన ప్రాజెక్టు కోసం కోటా పార్లమెంట్ సభ్యులు శ్రీ ఓం బిర్లా నిరంతరాయంగా చేసిన కృషిని నేను అభినందించాలనుకుంటున్నాను. కోటా ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వారికి నూతన అవకాశాలను అందించడమే ఆయన స్థిర లక్ష్యం. అది విమానాశ్రయమైనా, ఐఐఐటీ నూతన ప్రాంగణమైనా లేదా రోడ్ల విస్తరణ అయినా కోటా అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. ఆయన ప్రయత్నాల వల్లే కోటాతో పాటు ఈ మొత్తం ప్రాంతమంతా అభివృద్ధిలో కొత్త వేగాన్ని చూస్తోంది.
స్నేహితులారా,
ఓం బిర్లా గొప్ప పార్లమెంటు సభ్యుడు మాత్రమే కాదు.. అసాధారణమైన లోక్సభ స్పీకర్ కూడా. రాజ్యాంగానికి ఆయన పూర్తిగా నిబద్ధుడు. పార్లమెంటరీ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారు. ఈ రోజు, ఆయన పార్టీకి, ప్రతిపక్షాలకు అతీతంగా తటస్థంగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను సభలో చూసినప్పుడు విద్యకు పేరుగాంచిన నగరానికి చెందినవారు కావడం.. ఆయన పోషిస్తున్న స్పీకర్ పాత్రను ప్రభావితం చేసిందేమో అనిపిస్తుంది. కుటుంబానికి పెద్దలా ఆయన అందరినీ కలుపుకొని వెళుతూ ఉంటారు. పార్లమెంటు సభ్యులందరి భావాలను, అభ్యర్థనలను ఆయన గౌరవిస్తారు. స్పీకర్గా ఎంపీలను గౌరవించే సహజ స్వభావం ఆయనది. అహంకారపూరితమైన, విఘాతం కలిగించే కొందరు వ్యక్తులు అప్పుడప్పుడూ ఆటంకం కలిగించేందుకు చూసినా, మర్యాదపూర్వకంగానే ప్రతి అంశాన్ని నిర్వహిస్తారు. ఎవ్వరినీ కించపరచరు. కఠినమైన మాటలను కూడా సహిస్తారు. ఎప్పుడూ ఆత్మీయంగా నవ్వుతూ ఉంటారు. అందుకేనేమో, ఆయన్ను సభలో అందరూ అభిమానిస్తారు.
స్నేహితులారా,
రవాణా సౌకర్యాలు మెరుగైనప్పుడు, అభివృద్ధి కూడా పెరుగుతుంది. గడచిన 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నిర్మించిన అనేక కొత్త విమానాశ్రయాలు వృద్ధికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. 2014కి ముందు దేశంలో 70 విమానాశ్రయాలు ఉండేవి. ఈ రోజు, ఆ సంఖ్య 160కి పైగా పెరిగింది. ఈ కొత్త విమానాశ్రయాలు విమానయానాన్ని సులభతరం చేశాయి. పర్యాటకాన్ని పెంపొందించాయి. యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాయి. ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేశాయి. ఢిల్లీ చుట్టుపక్కల సైతం హిసార్, హిండన్, జేవార్ లాంటి పలు కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటయ్యాయి. కొత్త ఎయిర్పోర్టులు, టెర్మినళ్లను నిర్మించినప్పుడు నూతన వ్యాపారాలు, సంస్థలు చిన్న నగరాలకు సైతం చేరుకుంటాయి. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి నూతన వేగాన్ని కోటాలో నిర్మించే కొత్త విమానాశ్రయం ఇస్తుందని నేను విశ్వసిస్తున్నాను.
స్నేహితులారా,
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలసి పనిచేసినప్పుడు, ఆలోచనలు స్పష్టంగా, సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు అభివృద్ధి వేగం అనేక రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు రాజస్థాన్లో జరుగుతున్నది అదే. అభివృద్ధి చెందిన రాజస్థాన్ కోసం ఏర్పాటైన ఈ బలమైన పునాది అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పానికి శక్తినిస్తుంది. సుసంపన్నమైన, బలమైన, అవకాశాలతో కూడిన రాజస్థాన్ నిర్మించడంలో మనందరం సమష్టిగా విజయం సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను. ఈ విశ్వాసంతోనే, శంకుస్థాపన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వందేమాతరం.
***
(రిలీజ్ ఐడి: 2236644)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7