యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
2026 ఆసియా క్రీడల సన్నాహాలను సమీక్షించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
దేశ క్రీడాకారులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ
ఐచి-నగోయా వేదికగా జరగనున్న ఈ క్రీడల్లో 40కి పైగా క్రీడా విభాగాల్లో 700 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీపడే అవకాశం
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2026 1:29PM by PIB Hyderabad
జపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న 2026 ఆసియా క్రీడల సన్నాహాలపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. జరగబోయే క్రీడా సమరానికి భారత్ సిద్ధంగా ఉన్న తీరును మంత్రిత్వ శాఖ,ఎస్ఏఐ, ఇతర భాగస్వామ్య సంస్థలు కేంద్రమంత్రికి వివరించారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో భారత అథ్లెట్లు రాణించడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.
2026 ఆసియా క్రీడల సన్నాహాల సమీక్ష కోసం 15 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ హరి రంజన్ రావు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష, ఆసియా క్రీడల ముఖ్య అధికారి డీ మిషన్ శ్రీ సహదేవ్ యాదవ్, డిప్యూటీ చీఫ్ డీ మిషన్ శరత్ కమల్ తదితరులు ఉన్నారు. శిక్షణ, రవాణా, క్రీడాకారుల సంక్షేమం, పోటీ సంసిద్ధతను క్రమబద్ధీకరించడానికి ఈ కమిటీ డిసెంబర్ 2025 నుంచి ఇప్పటికే నాలుగు సమావేశాలను నిర్వహించింది. ఈ కమిటీ క్రీడల్లో భారత్ నిర్వహించే ప్రచారానికి వ్యూహాత్మక ప్రణాళికను పర్యవేక్షిస్తోంది.
సమావేశంలో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమం, ప్రతిభకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ‘‘మా క్రీడాకారులే మా ప్రథమ ప్రాధాన్యత. శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ నుంచి రవాణా, కిట్, ఆహారం, వైద్య సంరక్షణ వరకు సాధ్యమయ్యే ప్రతి మద్దతును అందిస్తాం. దీనివల్ల వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా సిద్ధం అయ్యి, ఆసియా క్రీడల్లో తమ అత్యుత్తమ ప్రదర్శనను కనబరచగలరు. ఏ పరిస్థితిలోనూ వారు ఇబ్బంది పడకుండా పోటీలో పతకాల సంఖ్యను పెంచడంపైనే వారు దృష్టి సారించేలా చూడటమే మా లక్ష్యం’’ అని ఆయన పేర్కొన్నారు.
2026 ఆసియా క్రీడల్లో భారత్ కొత్త మైలురాళ్లను సాధించడంలో క్రమబద్ధమైన సన్నాహాలు, బలమైన మద్దతు వ్యవస్థలు, సకాలంలో ప్రణాళికల రచన కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇందుకు అన్ని పక్షాల మధ్య సమన్వయ కృషి అవసరమని అన్నారు.
సన్నాహాల్లో భాగంగా ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్) ఆసియా క్రీడల టెక్నికల్ హ్యాండ్బుక్ కోసం ఒక నోడల్ అధికారిని నియమించింది. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఆయా క్రీడా విభాగాల సాంకేతిక వివరాలపై క్రీడాకారులు, కోచ్లు, సహాయక సిబ్బందికి అవగాహన కల్పించడం వీరి బాధ్యత. క్రీడాకారులకు ఏకాగ్రతతో కూడిన శిక్షణ కోసం తగినంత సమయం ఇచ్చేలా జట్లను ముందే ఖరారు చేస్తారు. వైద్య బృందాలతో సహా సహాయక సిబ్బంది సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశాల్లో రవాణా సౌకర్యాల కోసం భారత రాయబార కార్యాలయాలతో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. శిక్షణ పర్యటనలు, పోటీల షెడ్యూల్ను ముందే ప్లాన్ చేసుకునే స్వేచ్ఛను క్రీడా సమాఖ్యలకు ఇచ్చారు. నిర్వహణ పరంగా సవాళ్లు ఉన్న క్రీడా విభాగాల కోసం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక సహాయక సిబ్బందితో మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ఆహారం, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో భాగంగా క్రీడలకు ముందే భారత్ లో అటువంటి పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకు చర్యలను పరిశీలిస్తున్నారు.
2026 ఆసియా క్రీడల్లో మొత్తం 700 మందికి పైగా భారతీయ ఆటగాళ్లు 40కి పైగా క్రీడా విభాగాల్లో పోటీపడతారని అంచనా వేస్తున్నారు. వ్యూహాత్మక ప్రణాళిక, అంకితభావంతో కూడిన సన్నద్ధత, అన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయంతో 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో సాధించిన 106 పతకాల చారిత్రాత్మక రికార్డును అధిగమించడమే దేశ ప్రధాన లక్ష్యం.
నేటి ఉదయం జరిగిన సమావేశంలో.. ఐచి-నగోయా ఆసియా క్రీడల ప్రత్యేకతను వివరించారు. ఈ క్రీడలు ఫైవ్-క్లస్టర్ (ఐదు సమూహాల) పోటీ నమూనాను అనుసరిస్తాయని,క్రీడాకారులందరూ ఒకే ఒలింపిక్ గ్రామంలో ఉండకుండా, వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఐచి, గిఫు, షిజువోకా, విమానాశ్రయం-ఎక్స్పో జోన్ వంటి క్లస్టర్లలో వేదికలు విస్తరించి ఉన్నందున దీని కోసం ప్రయాణం, రవాణా, వైద్య సహాయం, క్రీడాకారుల రికవరీ కోసం వివరణాత్మక ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు.
క్రీడల సమయంలో ఉండే బస పరిస్థితులకు ఆటగాళ్లు అలవాటు పడటానికి వీలుగా పాటియాలా, బెంగళూరులోని ఎన్ఏఐ ప్రాంతీయ కేంద్రాలలో ప్రత్యేక తాత్కాలిక కంటైనర్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల క్రీడల సమయంలో తాము ఉండబోయే కంటైనర్ తరహా నివాస ఏర్పాట్లపై ఆటగాళ్లకు ముందుగానే అవగాహన కలుగుతుంది. ఈ చర్య వల్ల క్రీడాకారులు ముందుగానే వాతావరణానికి అలవాటు పడతారని, పోటీ సమయంలో ఎటువంటి పరధ్యానం లేకుండా ఉంటారని అధికారులు తెలిపారు.
జనవరిలో భారత ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి బృందం జపాన్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన పర్యటనను కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ పర్యటనలో జపాన్లోని ప్రధాన పోటీ వేదికలు, క్రీడాకారుల వసతులు, రవాణా మౌలిక సదుపాయాలను వారు పరిశీలించారు. వీటి ఆధారంగా భారతీయ ఆటగాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రతి క్లస్టర్కు ప్రత్యేక రవాణా అధికారులు, వైద్య బృందాలు, సహాయక సిబ్బందిని కేటాయిస్తూ క్లస్టర్ వారీగా ప్రణాళికను అమలు చేస్తున్నారు.
క్రీడలకు ముందు వచ్చే నెలల్లో సన్నద్ధత సజావుగా సాగేలా క్రీడాకారులపై దృష్టి సారించే పలు చర్యలను చర్చించారు. వీటిలో భాగంగా క్రీడా బృందం కోసం ఒక ప్రధాన వైద్యుడిని నియమించడం, ప్రత్యేక ఎస్ఏఐ వంట సిబ్బంది సహాయంతో ఆటగాళ్ల కోసం భారతీయ ఆహార ఎంపికలను ఖరారు చేయడం, క్రీడాకారులకు వారి అధికారిక కిట్లు ముందే అందేలా చూడటం వంటివి ఉన్నాయి. వీటితో పాటు క్రీడా విభాగాల వారీగా ప్రదర్శన సమీక్షలు, జట్ల ఎంపికను ముందుగానే పూర్తి చేయడం, వైద్య, రికవరీ బృందాలతో సహా సహాయక సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాల ప్రాముఖ్యతను కూడా చర్చించారు.
తదుపరి కమిటీ సమావేశం మార్చి 20న జరగనుంది. ఆసియా క్రీడల సన్నాహాల్లో భారత్ నిర్ణయాత్మక దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో.. క్రీడా బృందం పరిమాణం, రవాణా, ప్రయాణ ఏర్పాట్లు, కార్యకలాపాల సంసిద్ధతపై ఆ సమావేశంలో తుది చర్చలు జరగనున్నాయి.


***
(రిలీజ్ ఐడి: 2235590)
సందర్శకుల సూచీ సంఖ్య : : 117