రైల్వే మంత్రిత్వ శాఖ
పరిశ్రమల సమగ్ర సామర్థ్యం, నైపుణ్యాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కీలకం: శ్రీ అశ్వినీ వైష్ణవ్
· 2039-40 నాటికి 7,000 కిలోమీటర్లకు హైస్పీడ్ రైలు నెట్వర్కు విస్తరణ.. ఏటా 500 కి.మీ. నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం
· మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, సరుకు రవాణా రంగాల్లో ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడంపై నిర్వహించిన వెబినార్లో కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రసంగం
· వివాదాలను తగ్గించి, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మూడు కీలక సూత్రాలు: సమన్వయంతో సామర్థ్య విస్తరణ, బలమైన నాణ్యత ప్రమాణాలు, కాంట్రాక్టు సంస్కరణలు
· రైల్వే ప్రాజెక్టుల్లోని విభిన్న సంక్లిష్టతను వివరించిన కేంద్ర మంత్రి.. వాటి అమలులో ప్రత్యేక నైపుణ్యం, అనుభవం అత్యావశ్యకమన్న శ్రీ అశ్వినీ వైష్ణవ్
· ప్రభుత్వ ప్రాజెక్టుల్లో తక్కువ ధరలకే బిడ్లు వేయడం, న్యాయపరమైన వివాదాలను నివారించేలా.. కఠినతరమైన టెండర్ నిబంధనలు అవసరమన్న కేంద్ర మంత్రి... సబ్కాంట్రాక్టులను తగ్గించాలన్న శ్రీ అశ్వినీ వైష్ణవ్
నాడు పోస్టు చేయడమైనది:
03 MAR 2026 7:10PM by PIB Hyderabad
‘నిరంతర ఆర్థిక వృద్ధి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం: మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, సరుకు రవాణా’ అంశంపై ఈ రోజు నిర్వహించిన రెండో బడ్జెట్ వెబ్నార్నుద్దేశించి కేంద్ర రైల్వే, సమాచార - ప్రసార, ఎలక్ట్రానిక్స్ - సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రసంగించారు.
సమన్వయంతో కూడిన పద్ధతుల్లో సామర్థ్యాన్ని పెంపొందించడం, నాణ్యత, అర్హత ప్రమాణాలను బలోపేతం చేయడం, వివాదాలను తగ్గించి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా ఒప్పంద పత్రాలు (డాక్యుమెంటేషన్), కాంట్రాక్ట్ నిబంధనలను సంస్కరించడం... ఈ మూడు కీలక అంశాలను ఈ వెబినార్ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.
సమన్వయంతో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ
గత దశాబ్ద కాలంలో భారత రైల్వే వ్యవస్థ అపూర్వ వృద్ధిని సాధించిందని శ్రీ వైష్ణవ్ అన్నారు. దాదాపు 35,000 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాలను నిర్మించామనీ, జర్మనీలోని మొత్తం రైల్వే నెట్వర్క్ కన్నా ఇది ఎక్కువనీ వివరించారు. అలాగే దాదాపు 99 శాతం నెట్వర్కు (దాదాపు 55,000 కి.మీ)కు సంబంధించి విద్యుదీకరణ పూర్తయిందనీ.. జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్, డెన్మార్క్ దేశాల మొత్తం రైల్వే నెట్వర్క్లను కలిపి చూసినా ఇదే ఎక్కువనీ తెలిపారు.
ఇంతటి వేగవంతమైన విస్తరణ ఒక ముఖ్యమైన సవాలును మన ఎదుట నిలిపిందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న విస్తరణకు అనుగుణంగా పరిశ్రమల సామర్థ్యాన్నీ, వనరులనూ ఆ స్థాయిలో పెంపొందించడం ఆవవ్యకమన్నారు. రైల్వే అభివృద్ధి ప్రధానంగా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య భాగస్వామ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పరిధుల్లో అకస్మాత్తుగా వచ్చే హెచ్చుతగ్గులు పరిశ్రమల సన్నద్ధతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్నారు. అందువల్ల మౌలిక సదుపాయాల విస్తరణతోపాటు.. నైపుణ్యాభివృద్ధి, పర్యవేక్షణ, నాణ్యత ప్రమాణాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటివి కూడా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. పరిశ్రమ వర్గాల నుంచి వచ్చే సూచనలు భవిష్యత్ సంస్కరణల రూపకల్పనలో దోహదపడతాయన్నారు.
హైస్పీడ్ రైలు సంకల్పం, విప్లవాత్మక ప్రాజెక్టులు
హైస్పీడ్ రైలు అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ముంబయి - అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ను సవాలుతో కూడిన అభ్యసన దశగా మంత్రి పేర్కొన్నారు. గంటకు 160 కిలోమీటర్ల వేగానికి మించి రైళ్లను నడపడం వల్ల డిజైన్, కార్యాచరణలో సంక్లిష్టత విపరీతంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఐఐటీలు, పారిశ్రామిక భాగస్వాములు, రైల్వే ఇంజినీర్ల సహకారంతో భారత్ ఈ సవాళ్లను విజయవంతంగా అధిగమించింది. జపాన్ భాగస్వాములు మొదట్లో నెలకు రెండు కిలోమీటర్ల నిర్మాణాన్ని అంచనా వేయగా.. భారత్ నెలకు 15 కిలోమీటర్ల వేగంతో పనులు పూర్తి చేసింది. దీంతో భవిష్యత్తులోనూ కారిడార్ల నిర్మాణంలో పాలుపంచుకోవడానికి జపాన్ ఆసక్తి కనబరిచింది.
ఈ విజయం అందించిన స్ఫూర్తితో.. దాదాపు రూ. 16 లక్షల కోట్ల అంచనా పెట్టుబడితో 4,000 కిలోమీటర్ల మేర ఏడు కొత్త హైస్పీడ్ ప్యాసెంజర్ కారిడార్లకు గౌరవ ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి ప్రకటించారు. మరో పదేళ్లలో ఇవి పూర్తవుతాయన్నారు.
ఇందుకోసం ఏటా దాదాపు 500 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ముంబయి - అహ్మదాబాద్ కారిడార్తో సమానమైన పరిమాణం. మరో 3,000 కిలోమీటర్ల పనుల మంజూరుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తద్వారా 2039–40 నాటికి 7,000 కిలోమీటర్ల నెట్వర్కును లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా 15,000 నుంచి 21,000 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించాలని భావిస్తున్నారు.
ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే రైల్వేలు, పరిశ్రమలు, సరఫరా వ్యవస్థలు, పరికరాల తయారీదారులు, సేవలందించే సిబ్బంది, నిర్వహణ బృందాలు, సిగ్నలింగ్ నిపుణులు, రవాణా సామగ్రి తయారీదారులు, ప్రత్యేక ఎలక్ట్రికల్ కండక్టర్ల ఉత్పత్తిదారుల మధ్య సమన్వయంతో కూడిన కృషి ఆవశ్యకమని శ్రీ అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ సవాళ్లపై చర్చించడానికి ప్రత్యేక వర్క్షాప్లు నిర్వహించాల్సిందిగా ముఖ్య నిర్మాణ, డిజైన్ సంస్థలను ఆయన ఆహ్వానించారు.
నాణ్యత, అర్హత, టెండర్ నిబంధనల బలోపేతం
అర్హత ప్రమాణాలను కఠినతరం చేయడం, మితిమీరిన సబ్కాంట్రాక్టింగును తగ్గించడం అత్యవసరమని శ్రీ అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. టెండర్ నిబంధనలు సరళంగా ఉండడం వల్ల చాలాసార్లు 20 - 30 మంది బిడ్డర్లు పాల్గొంటున్నారనీ, ఫలితంగా అంచనా వ్యయం కన్నా 20 నుంచి 30 శాతం తక్కువకే బిడ్లు దాఖలవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పద్ధతులు చాలావరకూ ఖర్చులను తగ్గించుకోవడానికీ, వివాదాలకూ, రాజీలకూ కారణమవుతాయన్నారు.
సబ్కాంట్రాక్టులు 40 శాతానికి మించకుండా చూడాలని శ్రీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ప్రైవేటు రంగంలో క్లిష్టమైన ప్రాజెక్టుల్లో సాధారణంగా ఇది 20 నుంచి 30 శాతానికే పరిమితమై ఉంటుందని గుర్తుచేశారు. ప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగించాలనీ, వివాదాలను తగ్గించాలనీ చెబుతూ.. ప్రభుత్వ ప్రాజెక్టులు మరింత కఠినమైన నాణ్యత, జవాబుదారీ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
బహుముఖీన సంక్లిష్టతలు, సంబంధిత రంగంలో నైపుణ్యం ఆవశ్యకత
రైల్వే ప్రాజెక్టుల సంక్లిష్టతను వివరిస్తూ.. రహదారుల మాదిరిగా కాకుండా రైల్వే ప్రాజెక్టుల్లో ఆరు కీలకమైన అంశాలుంటాయని కేంద్ర మంత్రి వివరించారు:
· ట్రాక్ నిర్మాణం
· ఉపరితల విద్యుదీకరణ వ్యవస్థలు (వీటిని పవర్ గ్రిడ్లతో పోల్చవచ్చు)
· సిగ్నలింగ్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్కులు (టెలికాం మౌలిక సదుపాయాల వంటివి)
· స్టేషన్ అభివృద్ధి (పెద్ద రియల్ ఎస్టేట్ వ్యవస్థ వంటిది)
· రైలు ఇంజిన్లు, కోచ్ల నిర్వహణ కార్యకలాపాలు
· సమన్వయంతో కూడిన నిర్వహణ, పర్యవేక్షణ
కాంట్రాక్టుల కేటాయింపు కోసం ఆయా రంగాల్లో ప్రత్యేకానుభవం, నిర్దిష్ట పరిజ్ఞానం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు. పౌర విమానయాన, జల రవాణా రంగాల్లోనూ ఇలాంటి విధానాలు అవసరమని అభిప్రాయపడ్డారు. సంబంధిత నైపుణ్యం లేని సంస్థలు పనులు చేపడితే ప్రాజెక్టులు ఆలస్యం కావడం, వ్యయం పెరిగిపోవడం, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
పారిశ్రామిక సహకారం, భాగస్వాముల ప్రమేయం
బడ్జెట్ అనంతర వెబినార్లో విలువైన అభిప్రాయాలను పంచుకున్న పరిశ్రమ నిపుణులు, వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రాజెక్టు అమలు సంస్థలు, భాగస్వాములకు శ్రీ అశ్వినీ వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి సూచనలు ఈ రంగంలో సంస్కరణలకు పునాదిగా నిలుస్తాయన్నారు.
కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, శ్రీ సర్బానంద సోనోవాల్, శ్రీ కె. రాంమోహన్ నాయుడుతోపాటు ఓడరేవులు, నౌకాయానం, జలరవాణా, విద్యుత్, పౌర విమానయాన శాఖల కార్యదర్శులకు శ్రీ అశ్వినీ వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రకటనలకు అనుగుణంగా కీలక అంశాలపై చర్చించడానికి, వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి ఈ వెబినార్ ఒక ప్రభావవంతమైన వేదికగా నిలిచిందన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2235258)
సందర్శకుల సూచీ సంఖ్య : : 64