ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా వన్యప్రాణుల సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ప్రధానమంత్రి పునరుద్ఘాటన..
ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
03 MAR 2026 8:56AM by PIB Hyderabad
ప్రపంచ వన్య ప్రాణి దినోత్సవాన్ని పాటించడం అంటే మన భూగ్రహాన్ని సమృద్ధం చేస్తున్న, మన అనుబంధ విస్తారిత వ్యవస్థలకు పోషణనిస్తున్న వన్యప్రాణుల్లోని అద్భుత వైవిధ్యాన్ని తలుచుకుంటూ పండుగ చేసుకోవడమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్ణించారు. ఈ రోజు వన్యప్రాణుల సంరక్షణ దిశగా పాటుపడుతున్న ప్రతి ఒక్కరి కృషిని గౌరవించడమే కాకుండా సంరక్షణ, మనుగడకు పూచీ పడే పద్ధతుల అనుసరణ, అభయారణ్యాల పరిరక్షణ.. వీటి విషయంలో మనం చూపుతున్న నిబద్ధతను పునరుద్ఘాటించే రోజు అని ఆయన అన్నారు.
ప్రపంచంలో అత్యంత అరుదైన వన్యప్రాణుల్లో కొన్నిటికి నిలయంగా నిలిచే అదృష్టం భారత్ సొంతమని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచంలో ఉన్న పులుల జనసంఖ్యలో 70 శాతానికి పైగా భారత్లోనే ఉన్నాయనీ, దీంతో పాటు ఒక కొమ్ము కలిగిన ఖడ్గమృగాలు ఎక్కడా లేనంత ఎక్కువగా ఇక్కడే ఉన్నాయనీ, ఆసియా ఏనుగులు గరిష్ఠంగా ఉన్నది భారత్లోనేననీ ఆయన గుర్తుకు తీసుకు వచ్చారు. ఠీవి ఉట్టిపడే ఆసియా సింహాలు ప్రపంచంలో ఒక్క భారత్లో మాత్రమే వర్ధిల్లుతున్నాయని కూడా ఆయన తెలిపారు.
వన్యజీవుల సంరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. వాటిలో అత్యుత్తమ అభ్యాసాల్ని ఇతర దేశాలతో పంచుకొనే ఒక అసాధారణ వేదికగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్సును ఏర్పాటు చేయడం ఒకటని ఆయన అన్నారు. ఇతర చర్యలలో.. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్టబాతు), ఘడియాల్ (చేపలను తినే మొసలి), స్లాథ్ బియర్ (ఫలాలు, చీమలు, చెదలను ఆహారంగా స్వీకరించే ఒక జాతి ఎలుగుబంటి)ల సంరక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు చీతాలకు కొత్త ఆవాసాన్ని కల్పించడం వంటివి భాగంగా ఉన్నాయన్నారు.
భారత సాంస్కృతిక సంప్రదాయాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ప్రాణులన్నిటి శ్రేయాన్నీ కాంక్షిస్తూ ప్రార్థనలు, వన్యజీవుల్ని సంరక్షించడం, వాటి పట్ల సహనశీల ప్రవర్తనను కలిగి ఉండాలన్న సందేశాలు మన ధర్మగ్రంథాల్లో పేర్కొన్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన
‘‘నిర్వనో వధ్యతే వ్యాఘ్రో నిర్వ్యాఘ్రం ఛిద్యతే వనమ్
తస్మాద్ వ్యాఘ్రో వనం రక్షేద్ వనం వ్యాఘ్రం చ పాలయేత్’’ అని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు.
అరణ్యాలు లేకపోతే పులులు అంతరించిపోతాయి. పులులే లేకపోతే అడవులను నరికేస్తారు. ఈ కారణంగా పులులు వనాలనీ, వనాలు పులులనీ సంరక్షించాలి. ఇది ప్రకృతిలోని పరస్పర ప్రగాఢ ఆశ్రితత్వాన్ని సూచిస్తోంది అనే సందేశాన్ని ఈ సుభాషితం మనకు అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ఎక్స్’లో శ్రీ మోదీ అనేక సందేశాలను పొందుపరుస్తూ -
‘‘ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం మన భూగ్రహాన్ని సమృద్ధం చేస్తున్న, మన అనుబంధ విస్తారిత వ్యవస్థలకు పోషణనిస్తున్న అద్భుత జంతుజాల వైవిధ్యాన్ని స్మరించుకొంటూ పండుగ చేసుకోవలసిందిగా సూచించే రోజు. ఇది వన్యప్రాణి సంరక్షణ దిశగా పాటుపడుతున్న ప్రతి ఒక్కరి కృషినీ గౌరవించే రోజు. మనం సంరక్షణ, స్థిరత్వ ప్రధాన ప్రయత్నాలు, అభయారణ్యాల నిర్వహణ.. వీటి పట్ల మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం. దీంతో మన వన్యజీవులు వర్ధిల్లుతూ ఉంటాయి.’’
‘‘భారతీయులమైన మనం మన దేశంలో ప్రపంచంలోని అత్యంత అసాధారణ వన్యజీవుల్లో కొన్ని మనుగడ సాగిస్తున్నాయన్న వాస్తవాన్ని తెలుసుకొని గర్విద్దాం. ప్రపంచంలోని పులుల సంతతిలో 70 శాతానికి పైగా భారత్లోనే ఉన్నాయి. ఒక కొమ్ము కలిగిన ఖడ్గమృగాలు అతి పెద్ద సంఖ్యలో జీవిస్తోందీ మన దేశంలోనే. అలాగే ఆసియా ప్రాంతపు ఏనుగులు ఎక్కువగా ఉన్నది కూడా భారత్లోనే. ఠీవి కల ఆసియా సింహాలు మనగలుగుతున్న ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం’’.
‘‘వన్యజీవుల సంరక్షణ కోసం ఎన్డీయే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వాటిలో తోటి దేశాలతో అత్యుత్తమ సంప్రదాయాలను పంచుకొనే ఉద్దేశంతో ఒక అసాధారణ వేదికగా ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయెన్స్’ను స్థాపించడం ఒకటి. ఇతర ప్రయత్నాల్లో.. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఘడియాల్, స్లాథ్ బియర్, చీతాలకు నూతన ఆవాస కల్పన వంటివి భాగంగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2234912)
సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam