ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌-ఇజ్రాయెల్‌ సంయుక్త ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2026 7:44PM by PIB Hyderabad

శాంతి.. ఆవిష్కరణ.. శ్రేయస్సు దిశగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం

   భారత్‌-ఇజ్రాయెల్ దేశాల మధ్యగల సాన్నిహిత్యం, సద్భావన, ప్రగాఢ వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆయనతో పాటు సీనియర్ మంత్రులు, అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్లింది. ఈ సందర్భంగా 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌ చారిత్రక పర్యటనను, 2018లో ప్రధానమంత్రి నెతన్యాహు భారత పర్యటనను వారిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఈ పర్యటనలతో రెండు దేశాల మధ్య  భాగస్వామ్యం, సహకారంలో నవశకం ప్రారంభమైంది. తద్వారా అత్యాధునిక సాంకేతికతలు, సైబర్ భద్రత, వ్యవసాయం, జల నిర్వహణ, ఆరోగ్యం, వ్యవస్థాపన, రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో ద్వైపాక్షిక బంధం విశేషంగా పురోగమించడంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని “శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు దిశగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించేందుకు ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు.

సమష్టిగా ఉజ్వల భవిత వైపు పయనం

సాంకేతిక ఆవిష్కరణలు, వ్యవస్థాపన ద్వారా శాంతి, భద్రత, శ్రేయస్సు దిశగా పరస్పర ఆకాంక్షల సహిత బలమైన ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రధానమంత్రులు తమ సమష్టి దృక్పథాన్ని పునరుద్ఘాటించారు. భారత్‌-ఇజ్రాయెల్ సామర్థ్యాలు పరస్పర పూరకాలు కాగలవని వారిద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. సాంకేతికత, ఆవిష్కరణలలో ఇజ్రాయెల్‌ ప్రపంచ అగ్రగామి కాగా- ప్రతిభ, తయారీ నైపుణ్యం, వ్యవస్థాపన సామర్థ్యానికి కూడలిగా భారత్‌ పరిగణనలో ఉంది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ, సైబర్ భద్రత, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, వ్యవసాయం, జల నిర్వహణ, రక్షణ వేదికలు, అంతరిక్ష అన్వేషణ రంగాల్లో రెండు దేశాల ప్రగతిని ఏకీకృతం చేయడంపై తమ నిబద్ధతను ప్రధానమంత్రులు ఉద్ఘాటించారు. భారత్‌ సంకల్పించిన ‘ఆత్మనిర్భర, వికసిత భారత్-2047’ దార్శనికతను ఈ భాగస్వామ్యం బలోపేతం చేస్తుంది. అలాగే, భారత్‌-ఇజ్రాయెల్‌ సాంకేతిక రూపాంతరీకరణ, భాగస్వామ్య పురోగమనంలో తదుపరి దశకు ఉత్తేజాన్నిస్తుంది.

విధాన ప్రాథమ్యాలను విస్పష్ట ఫలితాలుగా రూపుదిద్దడంపై సమష్టి నిబద్ధతను స్పష్టం చేస్తూ, ప్రభుత్వాలు, వ్యాపారాల మధ్య, ప్రజల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక యంత్రాంగాల సంస్థాగతీకరణ ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రులు ప్రముఖంగా ప్రస్తావించారు.

రక్షణ.. భద్రత

రక్షణ సహకారంపై 2025 నవంబరు 4నాటి అవగాహన ఒప్పందం మీద హర్షం వ్యక్తం చేస్తూ, రెండు దేశాల మధ్య రక్షణ సహకారంలో పరిధి, స్థాయిరీత్యా గణనీయ వృద్ధి నమోదు కావడంపై ప్రధానమంత్రులిద్దరూ సంతృప్తి ప్రకటించారు. అంతేకాకుండా రక్షణ రంగంలో భవిష్యత్‌ సహకారంపై నిర్దిష్ట దృక్కోణానికి అనువుగా ఒక ప్రణాళికను ప్రకటించారు.

సాంకేతికత... ఆవిష్కరణ

కీలక, అత్యాధునిక సాంకేతిక (సీఈటీ) రంగాల్లో మరింత సహకారానికి మార్గాన్వేషణకు భారత్‌, ఇజ్రాయెల్‌ సాంకేతిక నైపుణ్య పరిపూరక బలాల మోహరింపుపై ప్రధానమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాల జాతీయ భద్రత సలహాదారుల నేతృత్వాన కీలక, అత్యాధునిక సాంకేతికతలపై కొత్త కార్యక్రమాలను కొనియాడారు. సముచిత సాంకేతిక పరిజ్ఞానాలలో రెండు దేశాల బలాలను ఇది సమన్వయం చేయడమేగాక నిర్దిష్ట, భవిష్యత్ భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని ఉభయపక్షాల అధికార యంత్రాంగాలకు పిలుపునిచ్చారు.

భారత శాస్త్ర-సాంకేతిక శాఖ, ఇజ్రాయెల్ ఇన్నొవేషన్ అథారిటీ సంయుక్తంగా అమలులోకి తెచ్చిన భారత్‌-ఇజ్రాయెల్ పారిశ్రామిక పరిశోధన-అభివృద్ధి-ఆవిష్కరణ నిధి (ఐ4ఎఫ్‌) పురోగమనాన్ని ప్రధానమంత్రులు సమీక్షించారు. రెండు దేశాల మధ్య పారిశ్రామిక సహకార విస్తృతిలో ఇది కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేశారు. రెండు దేశాల పరిశ్రమల మధ్య ప్రభావశీల సహకార విస్తరణ, నిధి సామర్థ్య సంపూర్ణ సద్వినియోగంపై కార్యాచరణ బలోపేతం మీద వారిద్దరూ అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగా పారిశ్రామిక రంగానికి మరింత చేరువ కావడం సహా అధిక-నాణ్యతగల సమష్టి పరిశోధన-అభివృద్ధి భాగస్వామ్యాలకు సౌలభ్యం కల్పించాలని నిర్ణయించారు.

భారత్‌లోని శాస్త్ర-సాంకేతిక విభాగం (డీఎస్‌టీ), ఇజ్రాయెల్‌లోని ఇన్నొవేషన్-సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో ‘ఇండియా-ఇజ్రాయెల్ జాయింట్ రీసెర్చ్ కాల్స్’ విజయవంతం కావడంపై ప్రధానమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. దీనికింద ఉభయ పక్షాల మధ్య వాటాను ప్రస్తుత 1 మిలియన్ డాలర్ల నుంచి 1.5 మిలియన్ల స్థాయికి పెంచడానికి వారిద్దరూ అంగీకరించారు. పరిశోధన సదుపాయాలు, సామగ్రి-పరికరాల సంయుక్త వినియోగం ద్వారా భారత-ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాల మధ్య సమష్టి పరిశోధనను ఇది ప్రోత్సహిస్తుంది, అలాగే శాస్త్రవేత్తల రాకపోకలకు వీలు కల్పిస్తుంది. ‘జాయింట్ రీసెర్చ్ కాల్‌’ కార్యకలాపాల సమన్వయంతోపాటు వాటిని మరింత విస్తృతం చేసేలా సంయుక్త శాస్త్రవిజ్ఞాన కమిటీని ఆదేశించడంపై ఉభయ పక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఇందులో భాగంగా "జాయింట్ కమిషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ"ని మంత్రిత్వశాఖ స్థాయికి ఉన్నతీకరించడంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. అలాగే భారత్‌తోపాటు ఇజ్రాయెల్‌లో వీలైనంత త్వరగా శాస్త్ర-సాంకేతికతపై ‘జేసీఎం’ను మంత్రిత్వశాఖ స్థాయిలో నిర్వహించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఆవిష్కరణలకు కీలక చోదక శక్తిగా విద్యా-పారిశ్రామిక సంబంధాల బలోపేతం ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు. ఉమ్మడి పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, వాణిజ్య భాగస్వామ్యాల విస్తృతి లక్ష్యంగా రెండు దేశాల పరిశోధకులు, పరిశ్రమ అగ్రగాములు, సాంకేతిక నిపుణుల మధ్య నిర్మాణాత్మక నెట్‌వర్కింగ్ సహా సహకారాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.

రెండు దేశాల మధ్య ఉమ్మడి ఆవిష్కరణ కార్యకలాపాల విస్తృతికి సంస్థాగత చేయూత ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రులు గుర్తించారు. ఈ సందర్భంగా భారత, ఇజ్రాయెల్ ఆవిష్కరణ వ్యవస్థల మధ్య సహకార పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలు, సాంకేతిక ధ్రువీకరణ ప్రక్రియలు, ప్రయోగాత్మక ప్రాజెక్టులు, ఉమ్మడి అభివృద్ధి కార్యకలాపాల సౌలభ్యం కల్పనకు ‘టెక్ గేట్‌వే’ విధానాల రూపకల్పన ఆవశ్యకత ఉందని వారు అంగీకరించారు.

ఆవిష్కరణలకు కీలక చోదక శక్తిగా కృత్రిమ మేధ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులు గుర్తించారు. ఈ రంగంలో ప్రతిభ, నైపుణ్య సహకార విస్తృతికి నిర్ణయించారు. కృత్రిమ మేధ నిపుణులు, పరిశోధన సంస్థలు, వినూత్న సంస్థల మధ్య సంబంధాల బలోపేతం దిశగా చట్రాల రూపలక్పన కృషిని వారు అభినందించారు. ఈ మేరకు రెండు దేశాలలో వృత్తిగత సహకారం, ఆవిష్కరణ కార్యకలాపాలకు నేతృత్వం దిశగా భాగస్వామ్య సౌలభ్యం కల్పించాలని నిర్ణయించారు.

కృత్రిమ మేధలో ఇజ్రాయెల్, భారత్‌ సాధించిన ప్రగతిని గుర్తిస్తూ, ఈ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం మీద సంతకం చేయడాన్ని ప్రధానమంత్రులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. అలాగే, రెండు దేశాల ప్రజల సంక్షేమార్థం ఈ వినూత్న సాంకేతికతలో సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని నిర్ణయించారు.

ఇజ్రాయెల్, భారత్‌ అంతరిక్ష పరిశోధన సంస్థలు, ‘ఐఎస్‌ఏ, ఇస్రో’ల మధ్య సహకారాన్ని ప్రధాన మంత్రులు స్వాగతించారు. ఇజ్రాయెల్ అంతరిక్ష ఆధారిత అంకుర సంస్థలు, కంపెనీలు తమ భారతీయ సహచరులతో భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునే దిశగా దీనికి గణనీయ సామర్థ్యం ఉందని వారిద్దరూ గుర్తించారు. ప్రపంచ అంతరిక్ష రంగంలో పురోగతి సాధనకు రెండు దేశాల అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించాలని నిర్ణయించారు. అలాగే ఉమ్మడి వెంచర్లు, ఆవిష్కరణ భాగస్వామ్యాలకు ప్రోత్సాహం, విజ్ఞాన ఆదానప్రదానం ప్రాధాన్యాన్ని వారు స్పష్టం చేశారు.

‘హొరైజన్ స్కానింగ్/స్ట్రాటజిక్ ఫోర్‌సైట్ మెకానిజం’ ఏర్పాటుపై సహకారం దిశగా ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటనపై సంతకాలు చేయడాన్ని వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. వ్యూహాత్మక ప్రణాళికలు, నిర్ణయాత్మకత కోసం డేటా, ఏఐ, నిపుణుల ఆలోచనల సమ్మేళనంతో సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ సహా సామాజిక రంగాలలో ఆధునిక ప్రపంచ ధోరణులను గుర్తించేందుకు ఈ యంత్రాంగం తోడ్పడుతుంది.

సైబర్‌ భద్రత

ప్రభుత్వ-ప్రైవేట్ రంగాలలో సైబర్ భద్రత పెంచడంపై నిబద్ధతను ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ఈ దిశగా రెండు దేశాల జాతీయ సైబర్ భద్రత అధికారుల మధ్య విస్తృత చర్చల అవసరాన్ని వారు స్పష్టం చేశారు. తదనుగుణంగా ఈ రంగంలో సహకారాన్ని మరింతగా విస్తరించేందుకు నిర్ణయించారు. అంతేకాకుండా సైబర్ భద్రతలో ద్వైపాక్షిక సహకారానికి మార్గనిర్దేశం, అమలు సంబంధిత ఉమ్మడి భవిష్యత్‌ ప్రణాళికను అమలు చేయడం కోసం బహుళ-వార్షిక వ్యూహాత్మక కార్యక్రమాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. ఇందులో ఇతరత్రా అంశాలు సహా మానవ సామర్థ్య వికాసం, సైబర్ భద్రత, ఏఐ, అనువర్తిత పరిశోధన, డిజైన్ ద్వారా భద్రత సూత్రాల ఏకీకరణ, సార్వత్రిక సమష్టి తక్షణ కసరత్తులు అంతర్భాగంగా ఉంటాయి. తమ సమగ్ర సైబర్ సహకార విస్తృతి, సంస్థాగతీకరణ ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, 2025 మార్చిలో ప్రారంభమైన ఇండియా-ఇజ్రాయెల్ సైబర్ విధాన చర్చలు  విజయవంతం కావడంపై వారు హర్షం ప్రకటించారు. మరో కీలక మలుపులో భాగంగా పైన పేర్కొన్న కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం భారత్‌లో ‘ఇండియా-ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ’ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రంపై సంతకాలు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

వాణిజ్యం.. పెట్టుబడులు.. అనుసంధానం

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సంపూర్ణ సామర్థ్య వినియోగం ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రులిద్దరూ స్పష్టం చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో రెండు దేశాల ఆర్థికశాఖ మంత్రులు 2025 సెప్టెంబరులో భారత్‌-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేయడాన్ని వారు అభినందించారు. పెట్టుబడిదారులలో విశ్వాసం పెంచడంతోపాటు ద్విముఖ పెట్టుబడులను ఇది మరింతగా ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా పెట్టుబడుల వినియోగం, స్వతంత్ర వివాద పరిష్కార యంత్రాంగం సంబంధిత విస్పష్ట చట్రం ద్వారా పారదర్శకత, అంచనా సామర్థ్యం, రక్షణకు భరోసా ఇస్తుంది.

స్వేచ్ఛా వాణిజ్య ప్రాంత (ఎఫ్‌టీఏ) ఒప్పందంపై చర్చల సంబంధిత చర్చనీయాంశాల పత్రంపై సంతకాలను వారు హర్షించారు. దీనికి అనుగుణంగా న్యూఢిల్లీలో తొలిదశ చర్చలకోసం సమావేశం నిర్వహించడాన్ని కొనియాడారు. రెండు దేశాల మధ్య ఈ ఒప్పంద సాకారం దిశగా తమ నిబద్ధతను నాయకులిద్దరూ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఈ ఒప్పందంపై సంతకాల దిశగా చర్చలను వేగిరపరచాలని సంబంధిత బృందాలను ఆదేశించారు.

ఆర్థిక సుస్థిరతకు పునరుత్థాన ఆర్థిక వ్యవస్థ ఓ కీలక మూలస్తంభమని నాయకులిద్దరూ స్పష్టం చేస్తూ ఆర్థిక-సైబర్ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని స్వాగతించారు. విధానాల సంయుక్త రూపకల్పన, రెండు దేశాల ఆర్థిక ‘కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్‌’ల ద్వారా అమలయ్యే బహుపాక్షిక ఆర్థిక-సైబర్ సిమ్యులేషన్ల పనితీరు ద్వారా ఆర్థిక-సైబర్ విజ్ఞాన ఆదానప్రదానంతో ఆర్థికావరణ వ్యవస్థ పునరుత్థాన సామర్థ్యం పెంపుపై ఈ సహకారం దృష్టి సారిస్తుంది.

భారత్‌ ఫిన్‌టెక్‌ విప్లవ పురోగమనాన్ని ప్రధానమంత్రి నెతన్యాహు ప్రశంసించారు. సౌలభ్య, ప్రత్యక్ష సరిహద్దు లావాదేవీలకు అంతర్జాతీయ నమూనాగా రూపొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. పరస్పర సామర్థ్య వికాసం, ఆర్థిక సంబంధాల బలోపేతం దిశగా ఇజ్రాయెల్ అమలు చేస్తున్న వేగవంతమైన చెల్లింపు వ్యవస్థతో యూపీఐ అనుసంధాన మార్గాన్వేషణకు ఉభయ పక్షాలూ అంగీకరించాయి.

రెండు దేశాల మధ్య సరిహద్దు చెల్లింపుల కోసం ‘ఎన్‌పీసీఐ’ (NPCI), ‘ఎంఏఎస్‌ఏవీ’ (MASAV) మధ్య అనుసంధానంపై పరిశీలన సహకారం దిశగా ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్, మసావ్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదరడాన్ని వారిద్దరూ స్వాగతించారు.

ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి చేర్చే దిశగా ప్రత్యక్ష విమాన సంధానాన్ని ఒక ప్రాథమిక పునాదిగా వారిద్దరూ పేర్కొన్నారు. దీనికి సంబంధించి టెల్ అవీవ్‌ నగరంలో ప్రధాన భారతీయ నగరాల మధ్య ప్రత్యక్ష విమానయాన సంధానాన్ని విస్తరించాలని వారు ఆకాంక్షించారు. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భారత, ఇజ్రాయెల్ విమానయాన సంస్థలకు పిలుపునిచ్చారు.

సన్నిహిత ఆర్థిక సహకార విస్తృతి కోసం భారత్‌-ఇజ్రాయెల్ మధ్య ఆర్థిక చర్చల ప్రారంభాన్ని ప్రధానమంత్రులిద్దరూ స్వాగతించారు.

ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాల రంగంలో.. ప్రత్యేకించి మెట్రో, రైలు, రోడ్డు, విమానాశ్రయాలు, డీశాలినేషన్ ప్లాంట్లు, వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాలు తదితరాలకు సంబంధించి ఇజ్రాయెల్‌లో ప్రధాన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నందున వాటిలో భారతీయ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు నాయకులిద్దరూ అంగీకరించారు.

టెల్‌ అవీవ్‌ నగరంలో 2025 నవంబరు నాటి ఇండియా-ఇజ్రాయెల్ ‘సీఈవో’ల వేదిక 4వ దఫా చర్చలు, వాణిజ్య సదస్సు విజయవంతం కావడంపై వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య అగ్రగాములు, ప్రభుత్వాధినేతల మధ్య అర్థవంతమైన సంభాషణలను ప్రశంసించారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకార బలోపేతం, కీలక రంగాలలో పెట్టుబడులు సహా సంయుక్త భాగస్వామ్య అవకాశాల కల్పనకు ఈ చర్చలు దోహదం చేశాయి. భారత్‌-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో ఈ సానుకూల వేగానికి మరింత ఉత్తేజమివ్వడంపై తమ నిబద్ధతను ఇద్దరు ప్రధానమంత్రులూ పునరుద్ఘాటించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ), ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ (ఐఐసీఏ)ల నడుమ మధ్యవర్తిత్వంపై అవగాహన ఒప్పందం కుదరడంపైనా వారు హర్షం వెలిబుచ్చారు. వాణిజ్య వివాదాల పరిష్కార సౌలభ్యం,  పెట్టుబడిదారులలో విశ్వాసం పెంపు దిశగా ఇదొక కీలక మలుపు కాగలదని వారు పేర్కొన్నారు.


వ్యవసాయం, నీరు, పర్యావరణ భద్రత

సుస్థిర అభివృద్ధిలో నీరు, వ్యవసాయంల కీలక పాత్రను గుర్తిస్తూ ప్రధానమంత్రి మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు... నీరు, వ్యవసాయంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నాల ప్రాముఖ్యాన్ని ధ్రువీకరించారు. ఈ భాగస్వామ్యం జల సంరక్షణ, మురుగునీటి శుద్ధి, వ్యవసాయం కోసం దాని పునర్వినియోగం, నీటి నుంటి లవణాల తొలగింపు, నీటి వినియోగ సంస్కరణలు, అధునాతన నీటి సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి గంగానది, ఇతర నదులను శుభ్రపరచడం వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తుంది.

భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో ఎమ్ఏఎస్‌హెచ్ఏవీ నేతృత్వంలో ఇజ్రాయెల్‌ వ్యవసాయ రంగంలో కొనసాగుతున్న సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడానికీ ప్రధానమంత్రులు అంగీకరించారు. ఈ బహుళ ప్రయోజన కార్యక్రమం లక్షలాది మంది భారతీయ రైతులకు శిక్షణలు... ప్రత్యేకమైన, వినూత్నమైన సాగు పద్ధతుల పరిచయం... విజ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఇప్పటికే పనిచేస్తున్న 35 వ్యవసాయ శ్రేష్ఠతా కేంద్రాలు సహా, భారత్ వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో సంయుక్తంగా పనిచేస్తున్న 8 కేంద్రాల పురోగతిని ప్రధానమంత్రులు వివరించారు. ఈ శ్రేష్ఠతా కేంద్రాల్లో ఇప్పటివరకు పది లక్షలకు పైగా భారతీయ రైతులు శిక్షణ పొందడం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇండియా-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ (ఐఐఎన్‌సీఏ)కు సంబంధించి ఐసీఏఆర్, ఎమ్ఏఎస్‌హెచ్ఏవీ మధ్య అవగాహన ఒప్పందాన్ని ఇరువురు ప్రధానమంత్రులు స్వాగతించారు. ఈ ఒప్పందం ఆవిష్కరణలు, పరిశోధనలను మరింత ముందుకు తీసుకువెళుతుంది. ఉత్పాదకతను పెంచుతుంది. వ్యవసాయంలో స్థిరమైన వృద్ధిని ప్రోత్సహిస్తుంది. వోల్కాని వ్యవసాయ పరిశోధన సంస్థలో భారత పరిశోధకులు వ్యవసాయ పరిశోధన కోసం 20 జాయింట్ ఫెలోషిప్‌లను ప్రారంభించడాన్నీ ఇరువురు నేతలు స్వాగతించారు.

మత్స్య, జలచరాల రంగంలో సహకారం గురించిన ఉద్దేశ ప్రకటనపై 2026 జనవరిలో సంతకం చేయడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ఈ రంగంలో ఉమ్మడి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు సహా పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి వారు అంగీకరించారు.

పర్యావరణం, వాతావరణ మార్పుల రంగంలో సహకారం ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. వాతావరణ పరిరక్షణ చర్యలపై వాటాదారుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం కోసం ద్వైపాక్షిక సంప్రదింపులు నిర్వహించడానికి అంగీకరించారు. సామర్థ్య నిర్మాణం, సాంకేతికతను పంచుకోవడం కోసం గల అవకాశాలను పరిశీలించడం, సర్క్యులర్ ఎకానమీని సంయుక్తంగా ప్రోత్సహించడం, జీవవైవిధ్య రక్షణ, పర్యావరణ కాలుష్య నివారణ వంటివి దీనిలో భాగంగా ఉన్నాయి.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, శాంతిని ప్రోత్సహించడం

సరిహద్దు ఉగ్రవాదం సహా అన్ని రూపాల్లో గల ఉగ్రవాదాన్ని, అన్ని రకాల ఉగ్రవాద వ్యక్తీకరణలను నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని సమగ్రమైన, సుస్థిరమైన విధానంతో ఎదుర్కోవడానికి నిర్ణయాత్మకమైన, సంఘటితమైన అంతర్జాతీయ ప్రయత్నాలకు వారు పిలుపునిచ్చారు. ఈ ఉమ్మడి సవాలుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ... రెండు శక్తిమంతమైన, సమర్థమైన ప్రజాస్వామ్య దేశాల నాయకులుగా ఈ ముప్పును ఎదుర్కోవడం పట్ల తమ సమష్టి సంకల్పాన్ని ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని, 2025 ఏప్రిల్ 22న భారత్‌లోని జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో గల పహల్గామ్‌లో భారతీయ పర్యాటకులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిని, 2025 నవంబర్ 10న న్యూఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రవాద ఘటనను వారు తీవ్రంగా ఖండించారు.

ప్రపంచ శాంతి, భద్రతలను కొనసాగించడం పట్ల తమ అచంచల నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులు పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన "గాజా సంఘర్షణ అంతం కోసం సమగ్ర ప్రణాళిక"ను వారు స్వాగతించారు. శాంతి ప్రక్రియ సహా ప్రాంతీయ పరిణామాలను ఇరువురు నేతలు చర్చించారు. చర్చలు, పరస్పర అవగాహన ద్వారా ఈ ప్రాంతంలో న్యాయమైన, శాశ్వతమైన శాంతి, భద్రత, నావిగేషన్, వాణిజ్య స్వేచ్ఛను స్థాపించాల్సిన అవసరాన్నీ స్పష్టం చేశారు.
పార్లమెంటరీ సహకారం

భారత్-ఇజ్రాయెల్ వంటి రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాల మధ్య అద్భుతమైన పార్లమెంటరీ సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని... లోక్‌సభ స్పీకర్, నెస్సెట్ స్పీకర్ సంతకం చేసిన అవగాహన ఒప్పందం ద్వారా భారత పార్లమెంటులో భారత్-ఇజ్రాయెల్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ ఏర్పాటును ఇరువురు నేతలు స్వాగతించారు.

ప్రజల మధ్య సహకారం

దేశాల మధ్య నిజమైన స్నేహం... సంస్కృతి, క్రీడల ద్వారా ప్రజల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తుందని ఇరువురు ప్రధానమంత్రులు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ సాంస్కృతిక, క్రీడల మంత్రిత్వ శాఖ సినీ రంగంలో భారత్‌తో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి కృషి చేస్తుంది. సృష్టికర్తల మధ్య సృజనాత్మకను పంచుకోవడం, సినిమాలు-సిరీస్‌లను సంయుక్తంగా నిర్మించడం, ఆయా దేశాల ప్రత్యేక సంస్కృతులను ప్రదర్శిస్తూ ఇరు దేశాల పరిశ్రమలు, ప్రేక్షకుల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం ఈ సహకారంలో భాగంగా ఉన్నాయి.

ఇజ్రాయెల్‌లోని భారతీయ కార్మికుల సహకారాన్ని ఇరువురు ప్రధానమంత్రులు గుర్తించారు. వారు తమ పని ద్వారా స్నేహ బంధాలను బలోపేతం చేస్తారని పేర్కొన్నారు. నిర్మాణ, సంరక్షణ రంగాల్లో భారతీయ కార్మికులకు సురక్షితమైన, భద్రతతో కూడిన రవాణాను సులభతరం చేయడంలో నవంబర్ 2023లో సంతకం చేసిన విధాన ప్రణాళిక ఒప్పందం, అమలు ప్రోటోకాల్‌ల ప్రాముఖ్యతనూ వారు గుర్తించారు. ఈ విషయంగా వాణిజ్యం, సేవలు, తయారీ, రెస్టారెంట్ వంటి రంగాలకు సంబంధించిన ప్రోటోకాల్‌లపై సంతకం చేయడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు.

కార్మికుల భద్రత, రక్షణ, చట్టపరమైన హక్కులను నిర్ధారించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రులు ప్రధానంగా ప్రస్తావించారు. డేటా సైన్స్, ఏఐ, హై-టెక్ వంటి ఉన్నతస్థాయి నైపుణ్యాల రంగాల్లో భారతీయ నిపుణులకు అవకాశాలను విస్తరించాల్సిన ప్రాముఖ్యాన్నీ వారు స్పష్టం చేశారు.

రాబోయే ఐదు సంవత్సరాల్లో 50,000 మంది వరకు భారతీయ కార్మికులు అదనంగా ఇజ్రాయెల్‌కు రావడానికి ఇరువురు నేతలు అంగీకరించారు. సంయుక్త సమన్వయ కమిటీ (జేసీసీ) కార్యాచరణను ఇరువురు నాయకులు సమీక్షించారు. కార్మికులకు సంబంధించిన అపరిష్కృత సమస్యలను చర్చించడానికి, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించడానికి జేసీసీ మరింత తరచుగా సమావేశం కావాలని ఆదేశించారు.
ఆరోగ్యం
2026లో సాధ్యమైనంత త్వరగా ఆరోగ్యంపై తొలి జేడబ్ల్యూజీని నిర్వహించాలని ఇరువురు ప్రధానమంత్రులు ఇరుపక్షాలకు పిలుపునిచ్చారు. ఆయా దేశాల్లోని సంస్థల మధ్య ఉత్తమ పద్ధతులు, సహకారాన్ని పంచుకోవడం ద్వారా ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆవిష్కరణలు, ఏఐ, డిజిటల్ పరివర్తనపై పరస్పర సహకారానికి ఇరువురు నాయకులు అంగీకరించారు.

విద్య- సురక్షిత భవిష్యత్తు

విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థలుగా భారత్-ఇజ్రాయెల్ దేశాలు విద్యా రంగంలో తమ సహకార ప్రయత్నాలను మరింతగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని... విశ్వవిద్యాలయాల మధ్య ఉమ్మడి కార్యక్రమాలు... విద్యార్థులు, అధ్యాపకుల రాకపోకలు... ఒక దేశ విశ్వవిద్యాలయాల్లో మరో దేశపు విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లను సులభతరం చేయడం ద్వారా సహకారాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఇరువురు ప్రధానమంత్రులు అంగీకరించారు. నలంద విశ్వవిద్యాలయం, జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. కృత్రిమ మేధ వినియోగం ద్వారా విద్యను ముందుకు తీసుకెళ్లడంలో సహకారంపై అవగాహన ఒప్పందాన్నీ వారు స్వాగతించారు. భారతీయ నైతిక విలువలతో ముడిపడిన... సుస్థిరమైన అభివృద్ధి కోసం 2030 ఎజెండాకు అనుగుణంగా ఉన్న... విద్యా వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా రూపొందించిన జాతీయ విద్యా విధానం-2020 గురించి ప్రధానమంత్రి శ్రీ మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వివరించారు.

భారత్-ఇజ్రాయెల్ విద్యా సహకార వేదిక (ఐ2ఐ ఫోరం) ఏర్పాటుకు భారత్-ఇజ్రాయెల్ అంగీకరించాయి. ఇది విద్య, పరిశోధనా సంస్థలు, విధాన నిర్ణేతలు, ఉన్నత విద్యా నిపుణులు, ఇరు దేశాల సంబంధిత వాటాదారుల ఉన్నత స్థాయి, కేంద్రీకృత చర్చల కోసం విశ్వవిద్యాలయ నేతృత్వంలోని వేదిక. ఈ ఫోరం భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య రొటేషన్ విధానం ఆధారంగా ప్రతియేటా సమావేశమవుతుంది.

నూతన ప్రపంచస్థాయి వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చడం

ప్రపంచ అనిశ్చితుల యుగంలో ఐ2యూ2 చతుర్ముఖ భాగస్వామ్యం వంటి పరివర్తనాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం పట్ల తమ నిబద్ధతను ఇరువురు ప్రధానమంత్రులు పునరుద్ఘాటించారు. ఈ విధాన ప్రణాళిక లోతైన భాగస్వామ్యం, వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణలను పెంపొందించడానికి... ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనకరమైన బలాలను పెంపొందించుకోవడానికి కీలక సాధనంగా పనిచేస్తుంది. భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్ (ఐఎమ్ఈసీ) గురించీ ఇరువురు నేతలు చర్చించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ, సుస్థిరతను, భాగస్వామ్య శ్రేయస్సును ప్రోత్సహించడానికి పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసిన ఇరువురు ప్రధానమంత్రులు... ఆ విధాన ప్రణాళికలో ఇజ్రాయెల్ పాత్రను అన్వేషించారు.

వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని సమర్థిస్తూ ఇరువురు ప్రధానమంత్రులు కింది నూతన ఒప్పందాలను స్వాగతించారు:

1)   కృత్రిమ మేధ (ఏఐ)లో సహకారం గురించిన ఎంవోయూ.

2) భారత్‌లో ఇండో ఇజ్రాయెల్ సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుపై లెటర్ ఆఫ్ ఇంటెంట్.

3) కృత్రిమ మేధ (ఏఐ) వాడకం ద్వారా విద్యను అభివృద్ధి చేయడంలో సహకారంపై భారత విద్యా మంత్రి, ఇజ్రాయెల్ విద్యా మంత్రి మధ్య అవగాహన ఒప్పందం.

4) 2026-2029 సంవత్సరాలకు భారత్-ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య సాంస్కృతిక వినిమయ కార్యక్రమం.

5) వ్యవసాయ పరిశోధన, విద్యలో సహకారం కోసం భారత్-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ అగ్రికల్చర్ (ఐఐఎన్‌సీఏ) ఏర్పాటు గురించి భారత్‌లోని న్యూఢిల్లీలో గల భారత వ్యవసాయ పరిశోధన మండలి, ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎమ్ఏఎస్‌హెచ్ఏవీ- అంతర్జాతీయ అభివృద్ధి సహకార సంస్థల మధ్య అవగాహన ఒప్పందం.

6) భూభౌతిక అన్వేషణ రంగంలో సహకారంపై భారత గనుల మంత్రిత్వ శాఖ... ఇజ్రాయెల్ ఇంధన, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం.

7) గుజరాత్‌లోని లోథాల్‌లో గల నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎమ్‌హెచ్‌సీ) అభివృద్ధి కోసం భారత నౌకాశ్రయాలు, జల రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ... ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ-అండర్ వాటర్ ఆర్కియాలజీ యూనిట్ మధ్య అవగాహన ఒప్పందం.

8) హారిజన్ స్కానింగ్ రంగంలో సహకారంపై ఇజ్రాయెల్ ఆవిష్కరణలు, సైన్స్-టెక్నాలజీ మంత్రిత్వ శాఖ... భారత ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం మధ్య ఉద్దేశ ప్రకటన.

9) భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ... ఇజ్రాయెల్ వ్యవసాయ, ఆహార భద్రత మంత్రిత్వ శాఖ, మత్స్య-ఆక్వాకల్చర్ శాఖ మధ్య మత్స్య-ఆక్వాకల్చర్ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం.

10) 4వ ఇండియా-ఇజ్రాయెల్ సీఈవో ఫోరం నివేదిక సమర్పణ.

11) ఇజ్రాయెల్ వాణిజ్య, సేవల రంగంలోని నిర్దిష్ట కార్మిక మార్కెట్ రంగాల్లో భారతీయ కార్మికుల తాత్కాలిక ఉపాధిని సులభతరం చేయడంపై ఇజ్రాయెల్-భారత ప్రభుత్వాల మధ్య ఒప్పందం కోసం ప్రోటోకాల్ C అమలు.

12) ఇజ్రాయెల్ తయారీ రంగంలోని నిర్దిష్ట కార్మిక మార్కెట్ రంగాల్లో భారతీయ కార్మికుల తాత్కాలిక ఉపాధిని సులభతరం చేయడంపై ఇజ్రాయెల్-భారత ప్రభుత్వాల మధ్య ఒప్పందం కోసం ప్రోటోకాల్ E అమలు.

13) ఇజ్రాయెల్ రెస్టారెంట్ రంగంలోని నిర్దిష్ట కార్మిక మార్కెట్ రంగాల్లో భారతీయ కార్మికుల తాత్కాలిక ఉపాధిని సులభతరం చేయడంపై ఇజ్రాయెల్-భారత ప్రభుత్వాల మధ్య ఒప్పందం కోసం ప్రోటోకాల్ D అమలు.

14) భారత్- ఇజ్రాయెల్ చెల్లింపు వ్యవస్థల అనుసంధానం (ఇజ్రాయెల్ చెల్లింపు వ్యవస్థతో యూపీఐ అనుసంధానం) కోసం ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఎమ్ఏఎస్ఏవీ మధ్య అవగాహన ఒప్పందం.

15) ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ (ఐఐసీఏ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) మధ్య సహకారంపై ఒప్పందం.

16) పరస్పర సహకారానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్‌సీఏ), ఇజ్రాయెల్ సెక్యూరిటీస్ అథారిటీ (ఐఎస్ఏ) మధ్య అవగాహన ఒప్పందం.

సృజనాత్మకత, సాంకేతికత, సహకారం, భాగస్వామ్య విజయం ద్వారా సునిర్వచిత భవిష్యత్తును నిర్మించడానికి విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థల ఆశయాలను ఉపయోగించుకునే శాశ్వత భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యాన్ని నిర్మించాలనే ఉమ్మడి దృక్పథంతో ఇరు దేశాల ప్రభుత్వాలు, పరిశ్రమలు, ప్రజల మధ్య ఉన్నత స్థాయి సంబంధాలను కొనసాగించడం పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు, భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2233362) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Odia , Kannada