ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ప్రధానమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2026 8:56PM by PIB Hyderabad

ఇజ్రాయెల్ లో అధికార పర్యటనలో భాగంగా, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  2026, ఫిబ్రవరి 26న జెరూసలేంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహుతో అధికారిక చర్చలు జరిపారు. 

భారత్ - ఇజ్రాయెల్ భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని అంశాలపై వారు సమగ్రమైన చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని, స్నేహాన్ని ప్రతిబింబిస్తూ, ద్వైపాక్షిక సంబంధాలను శాంతి, ఆవిష్కరణ, అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య   స్థాయికి పెంచాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ స్థాయి పెంపు ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర ప్రయోజనాల కలయికకు, సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం ఇరు దేశాలకున్న ఉమ్మడి దార్శనికతకు చిహ్నంగా నిలుస్తుంది.

అన్ని రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతి పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ,  భద్రత, అంతరిక్షం, ఇంధనం, కీలక సాంకేతికతలు, సైబర్ భద్రత, విద్య, శాస్త్ర పరిశోధన,  ఆవిష్కరణల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలని అంగీకరించారు. వ్యవసాయం, నీటి నిర్వహణ, స్టార్టప్‌లు, ఫిన్‌టెక్, డిజిటల్ హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ఫార్మా రంగాలలో భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యానికి ఉన్న మార్పు సామర్థ్యాన్ని కూడా ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రజల రాకపోకల భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు చేపట్టిన కొత్త చొరవలను ఇరువురు నేతలు స్వాగతించారు.  ఇది ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. అలాగే, ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని  త్వరగా ఖరారు చేయాలని వారు పిలుపునిచ్చారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం, భారత్-ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్, భారత్-ఇజ్రాయెల్ వ్యవసాయ ఆవిష్కరణల కేంద్రం, భారత్-ఇజ్రాయెల్ పారిశ్రామిక పరిశోధన - అభివృద్ధి, ఇన్నోవేషన్ ఫండ్ వంటివి ఇరు దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక,  శాస్త్ర రంగాలలో సహకారాన్ని గణనీయంగా పెంచుతాయని వారు పేర్కొన్నారు. అలాగే, భారత ప్రతిభావంతమైన మానవ వనరులను,  ఇజ్రాయెల్ ఆవిష్కరణా సామర్థ్యాన్ని అనుసంధానిస్తూ  కృత్రిమ మేధ, సెమీకండక్టర్లు, క్వాంటం, ఇతర అత్యాధునిక సాంకేతిక రంగాలలో మరింత గొప్ప సహకారం అవసరమని వారు పిలుపునిచ్చారు.

పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ,  ప్రపంచవ్యాప్త అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. గాజా శాంతి ప్రణాళికకు  ప్రధానమంత్రి తన మద్దతును తెలియజేశారు ఈ చొరవ ఆ ప్రాంతంలో శాంతిని, సుస్థిరతను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఐఎంఈసీ (భారత్-మధ్యప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్),   ఐ2యూ2 (భారత్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) వంటి అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం ఉండాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై జరుగుతున్న అంతర్జాతీయ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ దృఢ సంకల్పాన్ని ఇరువురు నేతలు వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటంలో ఇజ్రాయెల్ అందిస్తున్న మద్దతుకు గాను ప్రధానమంత్రి  ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ధన్యవాదాలు తెలిపారు.

చర్చల అనంతరం, పలు ఒప్పందాలు అవగాహన ఒప్పందాలను పరస్పరం మార్చుకున్నారు. భారత ప్రధాని అధికార పర్యటన సందర్భంగా, ద్వైపాక్షిక భాగస్వామ్యం భవిష్యత్తు కార్యాచరణను వివరించే ఉమ్మడి ప్రకటనను ఆమోదించారు.

తనకు లభించిన ఆత్మీయతకు,  ఆతిథ్యానికి గాను శ్రీ నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు ధన్యవాదాలు తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2233361) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Gujarati