ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయెల్ అధ్యక్షునితో భారత ప్రధానమంత్రి సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
26 FEB 2026 9:00PM by PIB Hyderabad
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జెరూసలేం లో ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తో సమావేశమయ్యారు.
2017లో తాను ఇజ్రాయెల్లో పర్యటించినప్పుడు, అలాగే 2023లో దుబాయ్లో సమావేశాల సందర్భంగా అధ్యక్షుడు హెర్జోగ్తో జరిపిన భేటీలను శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భారత్ - ఇజ్రాయెల్ సంబంధాలను శాంతి, ఆవిష్కరణ, అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం అనేది ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కొత్త ఆరంభమని ఇరువురు నేతలు పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢమైన నమ్మకానికి, పంచుకున్న ప్రజాస్వామ్య విలువలకు, విశిష్టమైన స్నేహానికి నిదర్శనమని వారు అభివర్ణించారు. వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణలు, సంస్థలు, రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటి రంగాలలో ప్రస్తుతం కొనసాగుతున్న సహకారం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.
పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంశాలపై కూడా వారు చర్చించారు. గాజా శాంతి ప్రణాళికకు తన మద్దతును తెలుపుతూ, పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత్వాన్ని సాధించే దిశగా ఈ చొరవతో జరుగుతున్న పురోగతి పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
పర్యావరణాన్ని సంరక్షించాలనే ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతకు ప్రతిబింబంగా, ఒక ప్రత్యేక గౌరవంగా, ఇజ్రాయెల్ అధ్యక్షుడు హెర్జోగ్, ప్రథమ మహిళతో కలిసి అధ్యక్ష భవనంలోని తోటలో 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరుతో ఒక మొక్క) ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక మొక్కను నాటారు.
అధ్యక్షుడు హెర్జోగ్ చూపిన ఆదరాభిమానాలు, ఆతిథ్యానికి, అలాగే భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యానికి ఆయన అందిస్తున్న మద్దతుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2233360)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4