ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇజ్రాయెల్ పార్లమెంట్ - నెసెట్ ను ఉద్దేశించి ప్రసంగించిన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

నాడు పోస్టు చేయడమైనది: 25 FEB 2026 10:41PM by PIB Hyderabad

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు  జెరూసలేంలోని నెసెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) ప్రత్యేక ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు. 

నెసెట్ కు చేరుకున్న ప్రధానమంత్రికి ఆ దేశ స్పీకర్ అమీర్ ఓహానా ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి ప్రసంగానికి ముందు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెన్యామిన్ నెతన్యాహు, ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్, స్పీకర్ ఓహానా ప్లీనరీలో మాట్లాడారు. భారత్ - ఇజ్రాయెల్ సంబంధాలకు అక్కడి అన్ని రాజకీయ పక్షాల నుంచి  పూర్తి మద్దతు ఉంటుందని వారు పేర్కొన్నారు.

తనకు దక్కిన ఈ ప్రత్యేక గౌరవానికి స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి ప్రసంగం ప్రారంభించారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న బలమైన స్నేహ బంధాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.ఇరు దేశాల ప్రజల మధ్య ప్రాచీన నాగరికత సంబంధాలతో పాటు సాంకేతికత, ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వ్యూహాత్మక అంశాలపై ఆధారపడిన దృఢమైన సమకాలీన భాగస్వామ్యం ఉందని ఆయన పేర్కొన్నారు.  వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటి యాజమాన్యం, స్థిరత్వం,  వ్యవస్థాపక రంగాలలో సహకారంపై ఆధారపడిన ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, ఈ బంధానికి ఒక ప్రగతిశీల దృక్పథాన్ని అందించాయని ఆయన అన్నారు.  ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను, ప్రజల రాకపోకలను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఇజ్రాయెల్‌లోని భారతీయ సమాజం, అలాగే భారత్ లోని యూదుల సమూహం రెండు దేశాల పురోగతికి గణనీయమైన కృషి చేశాయని ఆయన పేర్కొన్నారు.

ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం ఉపేక్షించని ఇరు దేశాల రాజీలేని విధానాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. అక్టోబర్ 7న జరిగిన ఉగ్రవాద దాడిపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ, ఇటువంటి క్రూరత్వానికి ఎటువంటి సమర్థన ఉండదని స్పష్టం చేశారు  ప్రాంతంలో సుస్థిర శాంతి, స్థిరత్వానికి తోడ్పడే అన్ని ప్రయత్నాలకు భారత్ తరపున  మద్దతును ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన 'గాజా శాంతి చొరవ'కు భారత్ అందిస్తున్న దృఢమైన మద్దతును ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  బహుపాక్షిక వేదికలపై భారత్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని ప్రస్తావిస్తూ, భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎంఈసీ),  I2యూ2 రంగాల్లో ఇరు దేశాల మధ్య మరింత లోతైన పరస్పర చర్యలు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.  

భారతదేశ వృద్ధి ప్రయాణాన్ని ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, హరిత వృద్ధి, స్టార్టప్‌లు, డిజిటల్ పరిష్కారాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఇరు దేశాల మధ్య మరింత ద్వైపాక్షిక సహకారం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తద్వారా యువతలోని సృజనాత్మకతను, నూతన ఆవిష్కరణలను వెలికితీయవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు కావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా, ఇరు దేశాల మధ్య ఇంకా వినియోగించుకోని వాణిజ్య సామర్థ్యాన్ని వెలికితీసేందుకు, ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశంలో ఇటీవలే ఏర్పాటు చేసిన 'ఇజ్రాయెల్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్'ను ఉపయోగించుకుంటూ, ఈ రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాల మధ్య పార్లమెంటరీ సమన్వయం మరింత పెరగాలని ప్రధానమంత్రి కోరారు.
ఇరు నాగరికతల మూలాల మధ్య ఉన్న సారూప్యతలను ప్రస్తావిస్తూ, భారత 'వసుదైక కుటుంబం‘ సిద్ధాంతానికి, ఇజ్రాయెల్ 'టిక్కున్ ఓలాం' (ప్రపంచాన్ని ఉద్ధరించడం/నయం చేయడం) సిద్ధాంతానికి మధ్య ఉన్న సారూప్యతను ప్రధానమంత్రి గుర్తుచేశారు. సామరస్యపూర్వక సమాజం పట్ల ఈ రెండు దేశాలకు ఉన్న ఉమ్మడి దృక్పథాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారత్, ఇజ్రాయెల్ సంబంధాల కోసం నెసెట్ సభ్యులు చేసిన కృషికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, త్వరలో రాబోతున్న 'పురీమ్'  పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రసంగం అనంతరం, నెసెట్ స్పీకర్ అమీర్ ఓహానా ప్రధానమంత్రికి "మెడల్ ఆఫ్ ద నెసెట్" బహుకరించారు. ఈ గౌరవాన్ని భారత్,  ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న చెక్కుచెదరని స్నేహానికి ప్రధానమంత్రి అంకితం చేశారు. 

ప్రధానమంత్రి పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ [లింక్] చూడవచ్చు.

 

***


(రిలీజ్ ఐడి: 2233286) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Gujarati , Kannada , Malayalam