జాతీయ మానవ హక్కుల కమిషన్
‘యాచనపై పునరాలోచన: విధానం, ఆచరణాత్మకత, గౌరవం.. వీటి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటం’ అంశంపై బహిరంగ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్హెచ్ఆర్సీ, ఇండియా
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు న్యాయమూర్తి (డాక్టర్) బిద్యుత్ రంజన్ సారంగీ.. భిక్షమడగడాన్ని సమాప్తం చేయాలంటే సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయానికి సంబంధించి రాజ్యాంగంలో ఇచ్చిన హామీలపై ఆధారపడిన హక్కులూ, పునరావాస ప్రధాన దృష్టికోణం ఎంతయినా అవసరమన్న డాక్టర్ సారంగీ
బిచ్చమెత్తే మాఫియా, మనుషుల చట్టవిరుద్ధ తరలింపు నెట్వర్కులపై స్వల్ప కాలిక, తాత్కాలిక చర్యల కన్నా కఠిన చర్యలు ముఖ్యమని పిలుపునిచ్చిన ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు శ్రీమతి విజయ భారతీ సయానీ
బిచ్చగాళ్లను గుర్తించి, వారిని సంక్షేమ పథకాలతో జోడించే ప్రయత్నాల్ని పెంచాల్సిన
అవసరం ఉందని స్పష్టం చేసిన సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్
సభలో అనేక సలహాల ప్రస్తావన.. వివిధ ఆసక్తిదారుల మధ్య చర్చల్లో భిక్షకులకు గౌరవాన్విత జీవనానికీ, దీర్ఘకాలిక పునరావాస కల్పనకూ హక్కులపై ఆధారపడ్డ, డేటా చోదకశక్తిగా ఉండే, సమన్వయపూర్వక జాతీయ వ్యూహ రచన అవసరమని ఉద్ఘాటన
నాడు పోస్టు చేయడమైనది:
25 FEB 2026 12:19PM by PIB Hyderabad
‘బిచ్చమడగటంపై పునరాలోచన: విధానం, ఆచరణాత్మకత, గౌరవం.. వీటి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చటం’ అంశంపై భారత జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ, ఇండియా) ఒక అరమరికలు లేని చర్చా కార్యక్రమాన్ని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు న్యాయమూర్తి (డాక్టర్) బిద్యుత్ రంజన్ సారంగీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఎన్హెచ్ఆర్సీ, ఇండియా సభ్యురాలు శ్రీమతి విజయ భారతీ సయానీ, సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, డీజీ (ఐ) శ్రీమతి అనుపమా నీలేకర్ చంద్ర, రిజిస్ట్రార్ (లా) శ్రీ జోగిందర్ సింగ్, సంయుక్త కార్యదర్శులు శ్రీ సమీర్ కుమార్, శ్రీమతి సైదింగ్పుయీ ఛక్ఛువక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సీనియర్ ప్రభుత్వాధికారులు, వివిధ రంగాల నిపుణులు ఉన్నారు.

యాచించడం ఒక సామాజిక దురాచారమనీ, దేశానికి ఇది ఒక గంభీరమైన ఆందోళనకర విషయంగా మారిపోయిందనీ న్యాయమూర్తి శ్రీ సారంగి అన్నారు. ప్రపంచలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన దేశంలో కూడా బిచ్చమెత్తుకోవడం ఒక తీవ్రమైన వ్యవస్థాగత, సామాజిక సవాలులా మారిందనీ, దీని విషయంలో తక్షణ, నిరంతర ప్రాతిపదికలతో శ్రద్ధ తీసుకోవాల్సి ఉందనీ ఆయన అన్నారు. బిచ్చమడగటం ఓ ఆర్థిక అంశం మాత్రమే కాదు, అది ఒక సామాజిక జాడ్యం.. అది సమాజాన్ని బలహీన వర్గాల వారి ఆత్మగౌరవంతో పాటు రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కుల్ని కూడా ప్రభావితం చేస్తోంది అంటూ ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు.

రాజ్యాంగ 14వ అధికరణంలో భాగంగా ఉన్న ‘చట్టం దృష్టిలో అందరూ సమానమే’ అనే వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆయన అన్నారు. దీన్లోని అందరూ అనే మాటలో.. బిచ్చమెత్తుకొనే వాళ్లు కూడా కలిసి ఉన్నారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికీ భద్రంగానూ, గౌరవంతోనూ బతికే హక్కు ఉంది అని ఆయన అన్నారు. బిచ్చమెత్తుకొనే సమస్యను పరిష్కరించడానికి అనేక రాష్ట్రాల్లో చట్టాలు చేశారు.. ఏమైనా, అలాంటి చట్టాల వల్ల సాధించిన వాస్తవ ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని అంచనా వేయనిదే.. ప్రత్యేకించి పునరావాసం, పునరేకీకరణ, క్షేత్ర స్థాయిలో కనిపించే సంస్కరణల పరంగా ఒక అంచనాకు రానిదే.. చట్టపూర్వక ఏర్పాట్లున్నంత మాత్రాననే సరిపోదని ఆయన స్పష్టం చేశారు.

న్యాయమూర్తి శ్రీ సారంగి మాట్లాడుతూ, యాచనతో పొట్టపోసుకొనే పేదలు, చదువుకోని పిల్లలు, మహిళలూ, దివ్యాంగజనుల సంరక్షణకీ, పునరావాసానికీ సంబంధించిన ఎన్హెచ్ఆర్సీ సలహా (2024), భారత ప్రభుత్వ స్మైల్-బీ (‘సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్’.. జీవనోపాధి, వాణిజ్య వ్యవస్థల దృష్ట్యా ఆదరణకు నోచుకోని వర్గాలకు సాయాన్ని అందించడం)లో చెప్పుకొన్న లక్ష్యాలతో అర్థవంతమైన పరివర్తన వచ్చిందో, రాలేదో పరిశీలించాలన్నారు. ఈ చర్యల ప్రగతిని సమీక్షించడంతో పాటు, అమలులోని లోటుపాటులను గుర్తించాలని కూడా ఆయన కోరారు. భిక్ష అడగటాన్ని తగ్గిస్తూ, చివరకు దానిని సమాప్తం చేయడానికి సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక రక్షణలకు సంబంధించిన రాజ్యాంగ విలువలపై ఆధారపడ్డ హక్కుల ఆధారిత, పునరావాస ప్రధాన వ్యూహాన్ని అవలంబించాలి అని ఆయన అన్నారు.
బిచ్చమడుక్కొనే సందర్భంలో మహిళలు, బాలలు, శ్రమకు సంబంధించిన సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడానికి స్పష్టమైన కాలరేఖలూ, జవాబుదారుతనం కలిగివుండే వ్యవస్థలతో ఓ విస్తృత జాతీయ వ్యూహాన్ని రూపొందించాల్సిన తక్షణావసరం ఉందని ఎన్హెచ్ఆర్సీ, ఇండియా సభ్యురాలు శ్రీమతి విజయ భారతీ సయానీ స్పష్టం చేశారు. జాతీయ స్థాయి పోర్టల్ను అభివృద్ధిపరచాలనీ, సమగ్ర డేటా సర్వేను చేపట్టాలనీ కోరారు. నమ్మదగిన డేటా లేనిదే ప్రభావవంతమైన విధానాన్ని సిద్ధం చేయడం సాధ్యం కాదన్నారు. బిచ్చమెత్తుకొనే మాఫియాలూ, మనుషులను చట్టం కళ్లు కప్పి మరీ తరలించే నెట్వర్కులకు వ్యతిరేకంగా కఠిన చర్యల్ని తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. స్వల్పకాలిక, తాత్కాలిక చర్యల కన్న దీర్ఘకాలిక పునరావాస కల్పనకు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఉద్ఘాటించారు.

ఎన్హెచ్ఆర్సీ, ఇండియా సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్ తన ప్రసంగంలో, భారత్ బలమైన చట్ట ప్రణాళికతో పాటు రాజ్యాంగ విలువలకు ప్రసిద్ది చెందిందన్నారు. ఇవి పౌరులందరికీ ఆత్మగౌరవంతో పాటు హక్కులు దక్కేటట్లు పూచీపడే దిశగా ఒక పటిష్ఠ పునాదిని అందిస్తున్నాయని ఆయన చెప్పారు. ఏమైనా, ప్రభుత్వ అధికారులు ఒక్కరే ఈ లక్ష్యాన్ని సాధించ జాలరనీ, వారు ప్రభుత్వేతర సంస్థల (ఎన్జీఓస్)తో పాటు పౌర సమాజ సంస్థలతో కూడా కలిసి పనిచేయాలన్నారు. ప్రభుత్వం తరచుగా రంగాల వారీ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ పనులను పూర్తి చేస్తుంటుందనీ, అయినప్పటికీ క్షేత్ర స్థాయికి మించి.. అంటే ఇక్కడ, సామాజిక సమ్మిళితత్వ విస్తృత ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సమయంలో ఒక రంగం సమస్యల చొప్పున పరిష్కరిస్తూ పోయే.. దృష్టిని అలవరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ విషయాన్ని ప్రచార ఉద్యమ సరళిలో ముందుకు తీసుకు పోవాలని శ్రీ లాల్ స్పష్టం చేశారు. సమ్మిళిత భారత్లో ఎవరినీ వెనుక పట్టున వదలివేయ కూడదని ఆయన చెప్పారు. ప్రజలు ఆధార్ కార్డుల్ని తీసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించాలని ఆశించే కన్నా, అధికారులే స్వయంగా ప్రజల చెంతకు చేరుకోవాలని ఆయన సూచించారు. బిచ్చమడుక్కొనే వారిని గుర్తించాలనీ, తరువాత వారిని సంక్షేమ పథకాలకు లబ్ధిదారులుగా చేయాల్సిన అవసరం ఉందనీ ఆయన తెలిపారు. భిక్షకులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్ని గుర్తించి, వాటిపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఉద్ఘాటించారు.
భిక్ష అడిగే వారికి సంబంధించిన 2011 జనగణన సమాచారాన్ని గురించి సామాజిక న్యాయం, సాధికారిత శాఖకు చెందిన సీనియర్ ఆర్థిక సలహాదారు శ్రీమతి యోగితా స్వరూప్ సభలో ప్రస్తావించారు. భిక్ష అడిగే వారికి పునరావాస కల్పన, చదువు చెప్పించడం, నైపుణ్యాభివృద్ధి కోసం స్మైల్ పథకంతో పాటు ఇతర కీలక కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్న సంగతిని తెలిపారు. బిచ్చమెత్తుకొనే వారికి సంబంధించిన వ్యవహారాల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేస్తోందనీ, ‘‘యాచన ఆనవాళ్లే ఉండని భారత్’’ను ఆవిష్కరించడం ప్రధానమన్న దార్శనికతను పునరుద్ఘాటించారు. ఆత్మగౌరవంతో పాటు నిరంతర పునరేకీకరణపై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోందని ఆమె అన్నారు.

అనాథ వ్యక్తులకు, విశేషించి బాలలు, దివ్యాంగజనులకు ఆధార్ సంఖ్యను ఇచ్చి, తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించడానికి యూఐడీఏఐ అమలు చేస్తున్న కార్యక్రమాల్ని గురించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ శైలేంద్ర సింగ్ వివరించారు. ఆధార్ వ్యవస్థలో భర్తీ చేసుకొనే ప్రక్రియను సువ్యవస్థితం చేయడానికి మహిళలు, బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖతోనూ, సామాజిక న్యాయం, సాధికారిత శాఖతోనూ సంప్రదింపులు జరిపి జారీ చేసిన రెండు ప్రామాణిక కార్యనిర్వహణ విధానాల (ఎస్ఓపీస్)ను శ్రీ సింగ్ సభలో పాలుపంచుకున్న వారి దృష్టికి తీసుకు వచ్చారు. ఆశ్రయ గృహాల్లో యూఐడీఏఐ చైతన్య శిబిరాలను నిర్వహించడం సహా ఈ విధానాలను మరింతగా ప్రచారంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన అన్నారు.
యాచకులతో వ్యవహరించడంలో ప్రభుత్వ అధికారులు అనుసరిస్తున్న తీరు మారవలసిన అవసరం ఉందని కోశిశ్ ట్రస్టు వ్యవస్థాపకుడు శ్రీ మొహమ్మద్ తారిఖ్ అన్నారు. విషయాల్ని మరింత సూక్ష్మంగా గ్రహించ గలిగిన, ఫలితాలను ప్రసాదించ గలిగిన దృష్టికోణాన్ని అలవరచడం కోసం అధికారులకు శిక్షణనివ్వాల్సిన, వారి సామర్థ్యాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతకు ముందు, సమావేశంలో ఎన్హెచ్ఆర్సీ ఇండియా సంయుక్త కార్యదర్శి శ్రీమతి సైదింగ్పుయీ ఛక్ఛువక్ చర్చాంశాలను ఖరారు చేస్తూ మూడు సాంకేతిక కార్యక్రమాలను గురించి వెల్లడించారు. వాటిలో.. ‘బిచ్చమెత్తుకోవడంలో సవాళ్లనీ, పరిధినీ పరిశీలించడం’, ‘సమాచారం, నివేదిక రూపకల్పన, క్షేత్ర వాస్తవాలు’ అంశంతో పాటు ‘పునరావాసం, ఉపాధికల్పన, దీర్ఘకాలిక పరిష్కారాలు’ అనే అంశం కూడా ఉంది.
కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఢిల్లీ పోలీస్ ప్రత్యేక కమిషనరు శ్రీ అజయ్ చౌధరి, యూఐడీఏఐ డిప్యూటీ డీజీ శ్రీ శైలేంద్ర సింగ్, కేరళ ప్రభుత్వంలో కోజికోడ్ జిల్లా కలెక్టరు శ్రీ స్నేహిల్ కుమార్ సింగ్, యూఐడీఏఐ డైరెక్టరు కల్నల్ నిఖిల్ సిన్హా, ఎన్ఐఎస్డీ డైరెక్టరు (టీ అండ్ బీ) డాక్టర్ ఆర్. గిరి రాజ్, రాజస్థాన్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ అదనపు డైరెక్టరు రీనా శర్మ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టరు శ్రీమతి సునీతా యాదవ్, సోషల్ డిఫెన్స్ సూపరింటెండెంటు శ్రీ జాకీర్ హుస్సేన్, మహారాష్ట్ర డబ్ల్యూసీడీ జాయింట్ కమిషనరు శ్రీ రాహుల్ మోరే, ఎన్హెచ్ఆర్సీ న్యాయవాది శ్రీ ఫౌజన్ అల్వీ, టాటా సోషల్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి ప్రొఫెసర్ విజయ్ రాఘవన్, బెగ్గర్స్ కార్పొరేషన్ డైరెక్టరు శ్రీ చంద్ర మిశ్రా, కోశిశ్ ట్రస్టు వ్యవస్థాపకుడు శ్రీ మొహమ్మద్ తారిఖ్, గ్రామీణ్ ఏవమ్ నగర్ వికాస్ పరిషద్ వ్యవస్థాపకుడు శ్రీ రామ్ కిశోర్, అచ్చయమ్ ట్రస్టు డైరెక్టరు శ్రీ నవీన్ కుమార్, బద్లావ్ వ్యవస్థాపకుడు శ్రీ శరద్ పటేల్, ఎన్ఐఎస్డీ కన్సల్టెంటు శ్వేతా సెహ్గల్ ఉన్నారు.

చర్చల్లో వచ్చిన మరికొన్ని సలహాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
• శిక్షకు సంబంధించిన నిబంధనల నుంచి దృష్టిని మళ్లించి అపరాధ నిర్మూలనపైనా, సామాజిక పరిరక్షణపైనా శ్రద్ధ వహించేలా జోక్యాలు ఉండాలి.
• ఇప్పుడు అమలులో ఉన్న చట్టాలు, పథకాల వల్ల ఇంతకాలంలో ప్రసరించిన ప్రభావం ఏమిటన్నది తరచుగా అంచనా వేస్తూ ముందుకు సాగాలి.
• యాచన సమస్య పరిష్కారానికో జాతీయ వ్యూహాన్ని రూపొందించాలి. దాన్లో.. నిర్దిష్ట కాలరేఖలు, పాత్రలు, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో పాటు గుర్తించదగిన ఫలితాలను పొందుపరచాలి.
• బిచ్చమెత్తడంపై ఒక జాతీయ పోర్టల్ను ఏర్పాటు చేయాలి. దాన్లో.. గుర్తింపు, సేవల అందజేత, పునరావాస ఫలితాల పర్యవేక్షణలకు చోటివ్వాలి.
• మహిళలు, పురుషులు, వయస్సు, దివ్యాంగత్వం, ప్రాంతం.. వీటి ఆధారంగా ముక్కచెక్కలుగా ఉన్న, వాస్తవ కాల సమాచారాన్ని సేకరించడానికి దేశవ్యాప్తంగా ఓ సర్వేను నిర్వహించాలి. సమస్య ఎక్కువగా ఉన్న ప్రధాన ప్రాంతాల్ని (హాట్స్పాట్స్) గుర్తించే పనిని కూడా పూర్తి చేయాలి.
• ఆశ్రయ స్థలాలు, హాట్స్పాట్స్లో శిబిరాల ఆధారిత ప్రజాచైతన్య కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఆధార్ జాబితాలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలి. ఈ ప్రక్రియలో బాలలనీ, దివ్యాంగ జనుల్నీ భాగస్వాముల్ని చేసేటట్లు శ్రద్ధ తీసుకోవాలి.
• సురక్షిత డిజిటల్ కేంద్రీకరణ అండతో ఎంపిక చేసిన వ్యక్తులను సంక్షేమ చర్యల అమలుకు ఉద్దేశించిన ప్రధాన సమాచార నిధి (డేటాబేస్)తో సంధానించాలి.
• నిర్దిష్ట కాల పరిమితిని విధించిన లక్ష్యాలతో పాటు, వ్యూహాల్ని ఉద్యమ పద్దతిలో అమలు చేయాలి.
• ‘స్మైల్-బీ’ని స్పష్టమైన పునరావాస మార్గాలతో జతపరిచి, బలోపేతం చేయాలి.
• బిచ్చమడిగే వ్యవస్థీకృత ముఠాలు, మానవుల అక్రమ తరలింపు నెట్వర్కులకు వ్యతిరేకంగా కఠిన చర్యలను తీసుకోవడం మొదలుపెట్టాలి.
• పోలీసులు, పురపాలక సంస్థల అధికారులు, సమాజ సంక్షేమ అధికారులతో పాటు ఆశ్రయ స్థలాల సిబ్బందికి శిక్షణనివ్వడాన్నీ, వారికి నిర్వహించే సామర్థ్య పెంపు కార్యక్రమాలనీ సంస్థాగతీకరించాలి. ఇలా చేసినందువల్ల, దండనాత్మక దృష్టికోణానికి బదులు ఆత్మగౌరవ ప్రధానమైన వైఖరిని అవలంబించేందుకు ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు,
• లబ్ధిదారుల్లో చివరి వ్యక్తిని గుర్తించడం, లబ్ధిదారుల చెంతకు చేరుకోవడం, సలహాలు ఇవ్వడం, సేవల అందజేత..వీటి కోసం ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీఓ)లతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలి.
***
(రిలీజ్ ఐడి: 2232871)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9