ఉప రాష్ట్రపతి సచివాలయం
న్యూఢిల్లీలో టూరిజమ్ లీడర్షిప్ సమ్మిట్-2026ను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి
పర్యటన రంగం సంస్కృతుల మధ్య ఓ వంతెన, ఆర్థిక అవకాశాలకు చోదక శక్తి,
అంతేకాక సామరస్య దౌత్యానికి ఓ శక్తిమంతమైన సాధనం కూడా: ఉపరాష్ట్రపతి
పర్యటన రంగ వృద్ధి పర్యావరణ సంబంధిత లక్ష్యాలకు అనుగుణంగా ఉండితీరాలి: ఉపరాష్ట్రపతి
పర్యటనానుభవాలను మెరుగుపరచడానికి కృత్రిమ మేధ వంటి
సరికొత్త సాంకేతికతల ఏకీకరణ ముఖ్యమని స్పష్టం చేసిన ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 3:25PM by PIB Hyderabad
సాంకలా ఫౌండేషన్ సహకారంతో యూఎస్-ఇండియా పార్ట్నర్షిప్ ఫోరమ్ న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన టూరిజమ్ లీడర్షిప్ సమ్మిట్-2026ను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు ప్రసంగించారు.
పర్యటన రంగ ఆశలను ఉత్సవంలా జరుపుకోవడం ఒక్కటే కాకుండా ప్రయాణ, ఆతిథ్య రంగంలో భారత్-అమెరికా ఆర్థిక కారిడార్ను పటిష్ఠపరచడానికి ఒక వ్యూహాత్మక మార్గసూచీని కూడా ఆవిష్కరిస్తున్న ఓ వేదికను నిర్వాహకులు అందుబాటులోకి తీసుకు వచ్చారంటూ ఉపరాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు.
పర్యటన రంగం కేవలం ఒక పరిశ్రమ కాదు... అంతకు మించిందని శ్రీ సి.పి. రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. అది సంస్కృతుల మధ్య వారధిలా పనిచేస్తోందనీ, ఆర్థిక అవకాశాల్ని కల్పిస్తోందనీ, సామరస్యపూర్వక దౌత్యానికి ఒక శక్తిమంతమైన సాధనంగా ఉంటోందనీ వర్ణించారు.
భారత్, అమెరికాల పర్యటన రంగాలు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు, ఉమ్మడి విలువలు, ఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తిలతో పాటు భారతీయ ప్రవాసీ సముదాయం చైతన్యాన్ని కూడా చాటిచెబుతున్నాయని ఆయన అన్నారు.
భారత్ అమలుచేస్తున్న దూరదృష్టి కలిగిన కార్యక్రమాల్ని గురించి ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ‘టూరిజమ్ విజన్-2029’ని భారత్ ప్రకటించిన సంగతిని గుర్తుకు తెచ్చారు. ప్రతి రాష్ట్రంలో పటిష్ఠ మౌలిక సదుపాయాల్నీ, ప్రపంచ స్థాయి పర్యటన స్థలాల్నీ అభివృద్ధి చేయడమే ఈ విజన్ ఉద్దేశమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం ఒక్క సౌందర్యీకరణకే పరిమితం కాదనీ, ఇది నిరంతరాయ సంధానం, ఆధునిక సౌకర్యాలు, భద్రత, స్థిరత్వం, డిజిటల్ ఏకీకరణలతో పాటు సమృద్ధ పర్యటక అనుభవాలతో కూడిన సమగ్ర పర్యటన అనుబంధ విస్తారిత వ్యవస్థలను ఏర్పాటు చేయడంపై శ్రద్ధ వహిస్తుందనీ ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.
భారత నాగరికతా సంబంధ వారసత్వం, వైవిధ్యపూరిత భౌగోళిక స్వరూపం, జనాభాలో పని చేసే వయసున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఉపరాష్ట్రపతి వెల్లడిస్తూ, ప్రపంచ స్థాయిలో పర్యటన రంగానికి కొత్త నిర్వచనాన్ని ఇవ్వడానికి దేశం సిద్ధంగా ఉందన్నారు. ఉన్నత శ్రేణికి చెందిన పర్యాటక సౌకర్యాలు, వ్యాఖ్యాకేంద్రాలు, చివరి బిందువు వరకూ సంధాన సదుపాయం, మన్నిక కలిగిన పద్దతులు, డిజిటల్ మాధ్యమం సాయంతో కథలను చెప్పే సౌలభ్యం వంటి వాటి ద్వారా భారత్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల పరిరక్షణ, ప్రపంచ స్థాయి అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
పర్యావరణ సంబంధిత లక్ష్యాలకు అనుగుణంగా పర్యటన రంగ అభివృద్ధి ఉండాలని శ్రీ సి.పి. రాధాకృష్ణన్ సూచించారు. భిన్న వాతావరణ స్థితులకు తట్టుకొని నిలిచే మౌలిక సదుపాయాలు, సమాజమే సారథ్యాన్ని వహించే పర్యటన నమూనాలతో పాటు ప్రాకృతిక వారసత్వ, సాంస్కృతిక వారసత్వాల పరిరక్షణ ఎంతయినా అవసరం అని ఆయన అన్నారు.
అంతరిక్షం, డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకొంటూ సేవలను ప్రజల అందుబాటులోకి తీసుకు రావడం, పునరుత్పాదక ఇంధనం, ఉన్నత శ్రేణికి చెందిన తయారీ సామర్థ్యం.. వీటిలో భారత్ సాధించిన విజయాలను కళ్లకు కట్టే సరికొత్త యుగపు పర్యటన స్థలాల్ని అభివృద్ధి పరచడంపైన దృష్టిని కేంద్రీకరించడం ముఖ్యమని కూడా ఆయన వివరించారు. పర్యటనానుభూతిని మెరుగుపరచడానికి కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతికతలను ఏకీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఉపాధి అవకాశాల కల్పనకు అతి పెద్ద వనరుల్లో పర్యటన రంగం ఒకటని ఉపరాష్ట్రపతి చెప్పారు. సమ్మిళితత్వంతో కూడిన, సమాజమే చోదక శక్తిగా ఉంటూ అభివృద్ధి చోటుచేసుకొనేటట్లు చూడటానికి శిక్షణలోనూ, ఔత్సాహిక పారిశ్రామికత్వంలోనూ, మహిళల సారథ్యంలో పనిచేసే వాణిజ్య వ్యవస్థల్లోనూ మరిన్ని పెట్టుబడులను పెట్టాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.
ఈ శిఖరాగ్ర సదస్సు భారత్-అమెరికా సహకారంలో స్థిరత్వం, నవకల్పన, సమ్మిళిత్వంతో పాటు ఉమ్మడి సమృద్ధికి కూడా వీలు కల్పించే ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్న ఆశాభావాన్ని శ్రీ సి.పి. రాధాకృష్ణన్ వ్యక్తం చేస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.
***
(రిలీజ్ ఐడి: 2232308)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11