ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
20 FEB 2026 10:13PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్చంద్ర రాంగులాంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. 2025 సెప్టెంబర్ తర్వాత ప్రధానమంత్రి రాంగులాం పదవీ కాలంలో.. భారత్ పర్యటనకు రావటం ఇది రెండో సారి. 09 ఫిబ్రవరి 2026న వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ తర్వాత ఈ భేటీ జరిగింది.
ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతిపై ఇద్దరు నేతలు చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సముద్రయాన భద్రత, ఆరోగ్యం, విద్య, డిజిటల్ సహకారం వంటి రంగాల్లో బహుముఖ భాగస్వామ్యంపై చర్చించారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ప్రాముఖ్యతను గుర్తిస్తూనే ప్రయోజనకరమైన, స్థిరమైన వృద్ధిని సాధించేందుకు కృత్రిమ మేధ, వినూత్న ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారంపై అభిప్రాయాలను పంచుకున్నారు.
మారిషస్ అభివృద్ధి ప్రాధాన్యతలకు మద్దతుగా భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలు తీరును ఇరుదేశాల నేతలు సమీక్షించారు. భారతదేశ అభివృద్ధి భాగస్వామ్యానికి మారిషస్ ఆదర్శమని.. పరస్పర విశ్వాసం, పురోగతి పట్ల ఇరుదేశాలకున్న ఉమ్మడి నిబద్ధతకు ప్రతిబింబమని ప్రధానమంత్రి మోదీ అన్నారు.
విజన్ మహాసాగర్, పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యత వంటి భారత్ విధానాల ద్వారా ఇండియా-మారిషస్ భాగస్వామ్యం కీలకమని ప్రధానమంత్రులు ఇద్దరూ స్పష్టం చేశారు. ఈ ద్వైపాక్షిక సంబంధం ఇరుదేశాల పరస్పర సుసంపన్నతకు తోడ్పడటమే కాక, గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లటంలో కీలక పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు.
ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయటానికి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సంపన్నతకు దోహదపడటానికి సమన్వయంతో ముందుకు సాగాలని ఇరుదేశాల నేతలు అంగీకరించారు.
***
(రిలీజ్ ఐడి: 2231323)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2