ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
వాస్తవ ప్రపంచంపై ప్రభావం చూపేలా ఎడ్జ్ ఏఐ పరిష్కారాలకు నాయకత్వం వహించనున్న భారత్: శ్రీ అశ్వినీ వైష్ణవ్
కృత్రిమ మేధ ప్రభావంపై ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో పరిశోధనా సదస్సు
సురక్షితమైన, మార్పుదాయక మేధ భవిష్యత్తు గురించి సమగ్రంగా చర్చించిన ప్రపంచ ఏఐ దార్శనికులు
శక్తిమంతమైన, నమ్మదగిన, మానవీయ విలువలకు అనుగుణంగా ఉండే
ఏఐ వ్యవస్థల కోసం పిలుపునిచ్చిన సదస్సు
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 8:04PM by PIB Hyderabad
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా, మూడవ రోజైన 2026 ఫిబ్రవరి 18న కృత్రిమ మేధ - దాని ప్రభావంపై పరిశోధనా సదస్సు నిర్వహించారు. సైన్స్, పరిపాలన, పరిశ్రమల రంగాల్లో కృత్రిమ మేధ పరివర్తనాత్మక పాత్రను అన్వేషించడానికి ప్రముఖ పరిశోధకులు, విధానకర్తలు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమల నాయకులను ఈ కార్యక్రమం ఒక వేదికపై చేర్చింది. అత్యాధునిక పరిశోధనలకు, వాస్తవ ప్రపంచ ఆచరణకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే ఒక వేదికగా ఈ సదస్సుకు రూపకల్పన చేశారు. ప్రజల ప్రయోజనాలు, భద్రత, సమ్మిళిత వృద్ధికి అనుగుణంగా ఉంటూనే, ఏఐ ఏ విధంగా శాస్త్రీయ ఆవిష్కరణలను నడిపించగలదనే అంశాన్ని ఈ సదస్సు లోతుగా చర్చించింది.
కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ తన ప్రత్యేక ప్రసంగంలో…. భారత ఏఐ ప్రయాణాన్ని ఆచరణాత్మక వినియోగం, కోట్లాది మందిపై ప్రభావం అనే అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. “ప్రస్తుతం జరుగుతున్న ఏఐ ఎక్స్పో లో వేలాది మంది యువతతో సంభాషిస్తున్నప్పుడు, భవిష్యత్తు పట్ల వారికున్న సానుకూల దృక్పథం నన్ను ఆశ్చర్యపరిచింది. ఆ నమ్మకం మన దేశానికి, ప్రపంచానికి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందనే ఆశను నాలో కలిగించింది. భారతదేశంలో, మా దృష్టి అంతా ఎడ్జ్ ఏఐ పైనే ఉంది. అంటే వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే ఏఐ, సంస్థల ఉత్పాదకతను పెంచే ఏఐ, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణ మార్పుల వంటి రంగాలలో భారీ జనాభా ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే ఏఐ. ఈ భవిష్యత్తును బాధ్యతాయుతంగా తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు ఒక చక్కని అవకాశం. ఏఐని సురక్షితంగా, మానవాళికి నిజంగా ప్రయోజనకరంగా ఎలా మార్చాలో ఆచరణాత్మకమైన ఆలోచనలను పంచుకోవాలని ఇక్కడి నాయకులను నేను కోరుతున్నాను" అని మంత్రి పిలుపునిచ్చారు.
గూగుల్ డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సర్ డెమిస్ హసాబిస్ సైన్స్, వైద్య రంగాలను ముందుకు తీసుకెళ్లడంలో ఏఐ సామర్థ్యాన్ని ప్రముఖంగా పేర్కొంటూ... "మనం ఒక కీలకమైన మలుపులో ఉన్నాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) మన కళ్లముందే సాక్షాత్కరించబోతోంది. మానవ చరిత్రలోనే అత్యంత పరివర్తనాత్మక సాంకేతికతలలో ఏఐ ఒకటి కాబోతోంది. సైన్స్, మెడిసిన్, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దీనికి అసాధారణమైన సామర్థ్యం ఉంది. అయితే అదే సమయంలో ఇందులో వాస్తవమైన ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఈ సాంకేతికత ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి, దీని ప్రయోజనాలు అందరికీ అందేలా చూడటానికి, దీని వల్ల కలిగే ప్రమాదాలను బాధ్యతాయుతంగా నిర్వహించడానికి అంతర్జాతీయ చర్చలు, సహకారం అత్యవసరం” అని పేర్కొన్నారు.
ఐఐఐటి హైదరాబాద్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.జె. నారాయణన్ విద్యాపరమైన సందర్భాన్ని వివరిస్తూ, ప్రపంచ శాస్త్రీయ చర్చల్లో ఏఐ సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని, అవకాశాలు, ప్రమాదాల పట్ల విభిన్న దృక్పథాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. సదస్సు ఉద్దేశాన్ని వివరిస్తూ, ప్రధాన ప్రసంగాలు, అత్యాధునిక ఏఐ ప్రశ్నలపై పరిశోధనా సంభాషణలు, గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల)పై దృష్టి సారించిన ప్యానెల్ చర్చలు ప్రముఖ అంతర్జాతీయ పరిశోధకుల పోస్టర్ ప్రదర్శనలు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వేదికను " ఏఐ పరిశోధనల తదుపరి సరిహద్దులు, వాటి సామాజిక ప్రభావంపై చర్చలు, సంభాషణలను ప్రోత్సహించడానికి రూపొందించిన వేదిక" గా ఆయన అభివర్ణించారు.
మొత్తంగా, ఈ ప్రారంభ ఉపన్యాసాలు ఏఐ పరిణామక్రమంలో అత్యంత కీలకమైన మలుపుగా శాస్త్రీయ కచ్చితత్వం, అంతర్జాతీయ సహకారం, బాధ్యతాయుతమైన ఆవిష్కరణల పునాదులపై ఈ సదస్సుకు దిశానిర్దేశం చేశాయి.
సర్ డెమిస్ హసాబిస్ తన ప్రధాన ప్రసంగంలో, 2010లో డీప్మైండ్ను స్థాపించినప్పటి నుంచి ఏఐ సాధించిన అద్భుతమైన పురోగతిని గుర్తుచేసుకున్నారు. అయితే, అసలైన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) సాధించడం అనేది ఇంకా కొనసాగుతున్న ప్రక్రియగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. శాస్త్రీయ ఆవిష్కరణల కొత్త యుగానికి ఏఐ నాంది పలుకుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే, ప్రస్తుత సాంకేతికతలో ఉన్న కొన్ని కీలకమైన లోటుపాట్లను వివరించారు: అప్రమత్తంతో కూడిన ఆశావాదం సందేశంతో ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తూ, సాంకేతిక సవాళ్లను ఆవిష్కరణల ద్వారా పరిష్కరించవచ్చని, అయితే ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ అందాలన్నా, దాని ప్రమాదాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నా అంతర్జాతీయ సహకారం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
రెండవ ప్రధాన సెషన్లో, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ డేమ్ వెండి హాల్, పరిపాలన, సమ్మిళితం, శ్రామిక శక్తి మార్పు కోణంలో కృత్రిమ మేధ భవిష్యత్తును విశ్లేషించారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ నేపథ్యంలో మాట్లాడుతూ, ఏఐ వ్యవస్థలు మానవాళి కోసం అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. అవి భద్రతా చట్రాలు సమానమైన లభ్యత, సార్వభౌమ సామర్థ్యం వంటి పునాదులపై ఆధారపడి ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఏఐ వ్యూహాలు కచ్చితంగా జాతీయ ప్రాధాన్యతలు, భాషా వైవిధ్యం, స్థానిక డేటా వ్యవస్థలను ప్రతిబింబించాలని ఆమె చెప్పారు. దీర్ఘకాలిక సామాజిక ప్రయోజనాలను నిర్ధారించే సమగ్ర అభివృద్ధి నమూనాల (ప్రాముఖ్యతను ఆమె వివరించారు. జాగ్రత్తతో కూడిన ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వాలు, పరిశోధకులు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలోని యువ ఆవిష్కర్తలు ఏఐని స్థానికంగా బలంగా, ప్రపంచంతో అనుసంధానమై మౌలికంగా సమ్మిళితంగా ఉండేలా తీర్చిదిద్దాలని కోరారు.
యూనివర్సిటీ మాంట్రియల్ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ యోషువా బెంజియో తన కీలకోపన్యాసంలో, మరింత శక్తిమంతంగా స్వయంప్రతిపత్తితో మారుతున్న ఏఐ వ్యవస్థల వల్ల తలెత్తుతున్న ముప్పులపై దృష్టి సారించారు. ముఖ్యంగా మానవ లక్ష్యాలకు భిన్నంగా పని చేయడం, వంచనాత్మక ప్రవర్తన, అసంపూర్ణమైన రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న వేగంతో పోలిస్తే, వాటిని అంచనా వేసే, రక్షించే యంత్రాంగాలు వెనుకబడి ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఏఐ సామర్థ్యాలలో ఇటీవలి ధోరణులు ప్రస్తుతం ఉన్న అంచనా, రక్షణ యంత్రాంగాలను మించిపోతున్నాయని ఆయన హెచ్చరించారు; అతిగా అనుకూలత , పక్షపాతం, జైల్బ్రేక్స్ , సైబర్ దుర్వినియోగం, స్వీయ రక్షణ స్వభావం ప్రదర్శించే వ్యవస్థలు వంటి అంశాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుత శిక్షణ పద్ధతుల్లో అనుకోకుండా తలెత్తే దుష్ప్రభావాల వల్లే అలైన్మెంట్ సవాళ్లు ఉత్పన్నమవుతాయని చెబుతూ, ఏఐ రూపకల్పనలో ప్రాథమిక మార్పు రావాలని ప్రొఫెసర్ బెంజియో పిలుపునిచ్చారు. లక్ష్య ఆధారిత, మనుషులను అనుకరించే వ్యవస్థల నుంచి వైదొలగి, శాస్త్రీయ తర్కంపై ఆధారపడిన నమూనాల వైపు మళ్లాలని ఆయన సూచించారు.
చివరగా, ఏఎంఐ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ యాన్ లెక్సన్ తన కీలకోపన్యాసంలో, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ప్రస్తుతం ఉన్న వాదనలను సవాలు చేశారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తో సహా ప్రస్తుత ఏఐ వ్యవస్థలు , మానవ స్థాయి మేధస్సుకు ఇంకా చాలా దూరంలో ఉన్నాయని ఆయన వాదించారు. భాష, పరిమిత రంగాల్లో వాటి పనితీరు ఆకట్టుకున్నప్పటికీ, వాటిలో భౌతిక ప్రపంచంపై అవగాహన లేకపోవడం, స్థిరమైన జ్ఞాపకశక్తి లేకపోవడం, బలహీనమైన దీర్ఘకాలిక ప్రణాళిక, దుర్బలమైన భద్రతా నియంత్రణలు వంటి పరిమితులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ పరిమితులను అధిగమించడానికి, చర్యలకు అనుగుణంగా పరిసరాలు ఎలా మారుతాయో అనుకరించగల సామర్థ్యం ఉన్న "వరల్డ్ మోడల్స్" అనే ప్రిడిక్టివ్ వ్యవస్థల అభివృద్ధి వైపు మళ్లాలని డాక్టర్ లెకన్ ప్రతిపాదించారు. ఇటువంటి వ్యవస్థలు, పరిణామాలను ముందే ఊహించడానికి, సమర్థవంతంగా ప్రణాళికలు రచించడానికి, నిర్దేశిత భద్రతా పరిధులలో పనిచేయడానికి ఏఐకి వీలు కల్పిస్తాయని, తద్వారా అవి మరింత నియంత్రణలో ఉండటమే కాకుండా మానవ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన వాదించారు.
ఏఐ, దాని ప్రభావంపై జరిగిన ఈ పరిశోధనా సదస్సులోని చర్చలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న వేగవంతమైన పురోగతితో పాటు ఉండే అసాధారణమైన అవకాశాలను, లోతైన బాధ్యతను ప్రతిబింబించాయి. శాస్త్రీయ ఆవిష్కరణలు, గ్లోబల్ గవర్నెన్స్ మొదలుకొని అలైన్మెంట్, భద్రత, తదుపరి తరం ఆర్కిటెక్చర్ల వరకు, ఏఐ వ్యవస్థలను కేవలం శక్తి మంతమైనవిగా మాత్రమే కాకుండా, నమ్మదగినవిగా, అందరినీ కలుపుకుని పోయేవిగా, మానవ విలువలకు కట్టుబడి ఉండేలా తీర్చిదిద్దడం అత్యవసరమని ఈ సదస్సు ఒక ఉమ్మడి లక్ష్యాన్ని నిర్దేశించింది.
***
(రిలీజ్ ఐడి: 2230171)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4