ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిబ్రవరి 19న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రారంభించనున్న ప్రధాని
సదస్సు ఇతివృత్తం: సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అంటే అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం
సదస్సు ప్రధానాంశాలు: ప్రజలు, పృథ్వి, ప్రగతి
500 మందికి పైగా అంతర్జాతీయ ఏఐ నిపుణులు, 20కి పైగా దేశాల, ప్రభుత్వాల అధినేతలు, 60 మంది మంత్రులు, ఉపమంత్రుల హాజరు
లీడర్స్ ప్లీనరీ, సీఈవో రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026లో వివిధ దేశాల పెవిలియన్లను ఇతర ప్రపంచ నాయకులతో కలసి సందర్శించనున్న పీఎం
ఫిబ్రవరి 18న సదస్సుకు విచ్చేసే నాయకులకు ప్రధాని స్వాగతం
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 3:55PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026 ఫిబ్రవరి 19న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దీనికి ముందుగా ఫిబ్రవరి 18 సాయంత్రం 7 గం.లకు వివిధ దేశాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసే వివిధ దేశాల నాయకులకు స్వాగతం పలుకుతారు. అలాగే.. సదస్సుకు హాజరైన అనేక మంది ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 19న, ఉదయం 9.40 గం.లకు ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రధానితో పాటుగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, ఇతర అంతర్జాతీయ పారిశ్రామిక ప్రముఖులు ప్రసంగిస్తారు.
ఉదయం 11 గంటలకు ఇతర నాయకులతో కలసి ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026లో ఏర్పాటు చేసిన వివిధ దేశాల పెవిలియన్లను సందర్శిస్తారు.
మధ్యాహ్నం 12 గం.ల నుంచి జరిగే లీడర్స్ ప్లీనరీలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పరిపాలన, మౌలిక వసతులు, అంతర్జాతీయ సహకారంతో సహా ఏఐకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాలపై దేశాధిపతులు, మంత్రులు, బహుపాక్షిక సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధులు చర్చిస్తారు.
సాయంత్రం 5.30 గం.లకు జరిగే సీఈవో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. ప్రభుత్వ నాయకత్వంలో అంతర్జాతీయ సాంకేతిక, పారిశ్రామిక సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్లు దీనిలో పాల్గొంటారు. పెట్టుబడులు, పరిశోధనా సహకారం, సరఫరా వ్యవస్థలు, ఏఐ వ్యవస్థల అమలుపై వారు చర్చిస్తారు.
సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనే ఇతివృత్తంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 జరుగుతుంది. అంటే అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం అని అర్థం. ఏఐ రంగంలో భారత్ను అగ్రస్థానానికి చేర్చడం, మానవత్వాన్ని, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించే, మన గ్రహాన్ని రక్షించే ఏఐ భవిష్యత్తును తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ప్రజలు, పృథ్వి, ప్రగతి అనే మూడు ప్రధానాంశాలకు అనుగుణంగా ఏడు వర్కింగు గ్రూపులు ఈ సదస్సును ముందుకు నడిపిస్తాయి. వివిధ రంగాల్లో ఏఐ ప్రభావాన్ని తెలిజేసేలా నిర్ధిష్ట ఫలితాలను అందించడంపై ఈ బృందాలు పనిచేస్తాయి. ఏడు అంశాలు: ఆర్థిక ప్రగతి-సామాజిక ప్రయోజనం కోసం ఏఐ, ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ, సామాజిక సాధికారతకు సమ్మిళిత్వం, సురక్షితమైన, విశ్వసనీయమైన ఏఐ, మానవ మూలధనం, సైన్సు, స్థిరత్వం, ఆవిష్కరణ, సామర్థ్యం.
ఈ సదస్సులో సీఈవోలు/సీఎక్స్వోలతో సహా 500 మందికి పైగా అంతర్జాతీయ ఏఐ నిపుణులు, సుమారుగా 100 మంది సీఈవోలు, వ్యవస్థాపకులు, 150 మంది విద్యావేత్తలు, పరిశోధకులు, 400 మంది సీటీవోలు, వీపీలు, దాతలు పాల్గొంటారు. అలాగే 20కి పైగా దేశాల, ప్రభుత్వాల అధినేతలు, 60 మంది మంత్రులు, ఉప మంత్రులతో సహా100 మందికి పైగా ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
***
(రిలీజ్ ఐడి: 2229720)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
Assamese
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam