సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026 లోని వేవ్స్ క్రియేటర్స్ కార్నర్లో
కృత్రిమ మేధ సంబంధిత నవకల్పనల్ని ప్రదర్శించనున్న 51 అంకుర సంస్థలు
భారత నవ తరం మీడియా టెక్ నూతన ఆవిష్కర్తల ప్రతిభకు వేదికను అందించిన వేవ్స్ క్రియేటర్స్ కార్నర్
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 4:21PM by PIB Hyderabad
భారత్లో శరవేగంతో దూసుకుపోతున్న ప్రసార మాధ్యమాలు, వినోద రంగ సంబంధిత వినూత్న అనుబంధ విస్తారిత వ్యవస్థకు అనువైన వేదిక అందుబాటులోకి వచ్చింది. ఏవీజీసీ-ఎక్స్ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ)తో పాటు మీడియా టెక్ రంగంలోని 51 ప్రతిభాన్విత అంకుర సంస్థలు తమ ఉత్పాదనలనీ, సాంకేతికతలనీ ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో-2026 లోని వేవ్స్ క్రియేటర్స్ కార్నర్లో ప్రదర్శించబోతున్నాయి. ఈ వేవ్స్ క్రియేటర్స్ కార్నర్కు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సారధ్యం వహిస్తోంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026 ఫిబ్రవరి 16న మొదలైన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోను ఫిబ్రవరి 20 వరకూ నిర్వహించనున్నారు.
భారత్లో నూతన ఆవిష్కరణలకు ఆలంబనగా ఉన్న సృజన ప్రధాన ఆర్థిక వ్యవస్థను వేవ్ఎక్స్ బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలోనే, పైన ప్రస్తావించిన అంకుర సంస్థలకు వేవ్ఎక్స్ మద్దతునిచ్చి, ఎక్స్పోలో పాలుపంచుకొనేందుకు మార్గాన్ని సుగమం చేసింది. వేవ్స్ క్రియేటర్స్ కార్నర్ ఒక చైతన్య వేదిక.. దీనిని కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సేవలనీ, శ్రోతలు లీనమైపోయేలా కథల్ని చెప్పే సంవిధానాలనీ, గేమింగ్లో నూతన ఆవిష్కరణల్నీ, వర్చువల్ ప్రొడక్షన్ టూల్స్నీ, అతి వినూత్న కంటెంట్ సాంకేతికతలనీ పరిశ్రమ రంగ ప్రముఖులకీ, పెట్టుబడిదారులకీ, విధాన రూపకర్తల తో పాటు, ఈ రంగమంటే ఆసక్తిని కనబరుస్తున్న వివిధ దేశాల వర్గాల కళ్లెదుట నిలిపేందుకు అంకుర సంస్థలకు ఒక చక్కని వేదికగా ఈ కార్నర్ ఉపయోగపడనుంది.
ఎంపిక చేసిన ఈ అంకుర సంస్థలు భారత్లో శరవేగంగా ఎదుగుతున్న ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలోని వివిధ అంశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఏఐ ఆధారిత యానిమేషన్ పైప్ లైన్లు, రియల్-టైమ్ రెండరింగ్ ఇంజిన్ల మొదలు ఆకర్షణీయ ఎక్స్ఆర్ అనుభూతులూ, గేమిఫైడ్ లెర్నింగ్ ప్లాట్ఫారాల వరకూ, ప్రదర్శనకు నడుం బిగించిన అంకుర సంస్థలు కంటెంట్ సృజననీ, పంపిణీనీ, ప్రేక్షకవర్గాలతో అనుబంధాన్నీ పునర్ నిర్వచించడంలో కృత్రిమ మేధకున్న పరివర్తన ప్రధాన సామర్థ్యానికి అద్దం పట్టనున్నాయి.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో వేవ్స్ క్రియేటర్స్ కార్నర్ వినూత్న ఉపాయాలను ‘‘ఐడియాస్ ఫర్ ఇండియా ఏఐ’’ వేదికపై ఆవిష్కరించనుంది. ప్రసార మాధ్యమాల నవకల్పనలతో సందర్శకులు మమేకం అయ్యేందుకు ‘‘ఐడియాస్ ఫర్ ఇండియా ఏఐ’’ వేదిక అవకాశాలను అందిస్తుంది. ఇక అంకుర సంస్థలూ, టెక్ డెవలపర్లూ కలిసి ‘‘జీరో-టచ్ అటానమస్ న్యూస్రూమ్’’ను నిర్వహిస్తున్నారు. ఇది ఇదివరకు ఎరుగని ఒక అపూర్వ వ్యవస్థ అని చెప్పాలి. ఇది తాజా సంఘటనల ప్రసారాల్ని మానవ ప్రమేయం లేకుండానే హిందీ, ఇంగ్లిషు, తమిళ భాషల్లోకి మార్చి ‘‘తాజా వార్తల’’ బులిటెన్లుగా వినిపిస్తుంది. ఇదే కార్నర్లో మరో ఆకర్షణగా ‘‘ది భాషా వాల్’’ నిలుస్తోంది. ఇది ఒక విస్తృత వీడియో గ్రిడ్. ఇది ఏఐ సాంకేతిక భాషా అవతారంతో ఎనిమిది భారతీయ భాషల్లో వాస్తవ సమయంలో లిప్- సింక్ డబ్బింగును ప్రదర్శిస్తుంది.
సందర్శకులలో ఇంటరాక్టివ్ అనుభూతులను పొందాలనుకొనే వారు ‘‘సంవాద్ సేతు’’లోకి ప్రవేశించి లబ్ధప్రతిష్ఠులతో మాట్లాడవచ్చు. ‘‘డైరెక్టర్స్ చైర్’’ నుంచి ఆదేశాలిస్తూ, చలనచిత్ర దృశ్యాల్లో మార్పు చేర్పులు చేయొచ్చు. ఇవి కాకపోతే, ‘‘స్వర్ సంగమ్’’ సాయంతో కొన్ని క్షణాల వ్యవధిలో ప్రసార యోగ్యత కలిగిన గీతాలను రచించవచ్చును. ఇతర ముఖ్య ఆకర్షణల్లో.. వాస్తవ కాల ప్రాతిపదికన వివిధ భాషల్లో ముఖాముఖిని నిర్వహించడానికి వీలు కల్పించే ఏఐ ఆధారిత పాడ్కాస్ట్ స్టుడియో, కబురులాడే ఏఐ హ్యూమనాయిడ్ రోబో, స్వరాన్ని అనుకరించే కేంద్రం వంటివి ఉన్నాయి. వాయిస్ క్లోనింగ్ స్టేషన్లోకి అడుగు పెట్టే వారు వివిధ భారతీయ భాషల్లో తాము గడగడా మాట్లాడటాన్ని స్వయంగా వినవచ్చును.
దీనికి అదనంగా, భాషాసేతు, కళాసేతు చాలెంజుల్లో విజేతలుగా నిలిచిన అంకుర సంస్థలు కూడా ఎక్స్పోలో పాల్గొని, వాటి ఉత్పాదనలను ప్రదర్శిస్తాయి. ఈ చాలెంజుల్లో భాషా సాంకేతికతలలో వినూత్న సేవలతో పాటు సాంస్కృతిక-సాంకేతికత ప్రధాన సేవలను ఆవిష్కరించిన అంకుర సంస్థలను విజేతలుగా గుర్తించారు. ఈ సంస్థలు కృత్రిమ మేధ ఆధారిత ఉపకరణాలను ఎక్స్పోలో ప్రదర్శించనున్నాయి. ఈ ఉపకరణాలు భాషాపరమైన సౌలభ్యాన్ని పెంచుతూ, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు భారతీయ సృజనాత్మక కంటెంటును అనేక దేశాల వారి చెంతకు చేరవేస్తాయి.
వేవ్ఎక్స్ను గురించి
సమాచార, ప్రసార శాఖ నిర్వహిస్తున్న వేవ్స్ కార్యక్రమంలో వేవ్ఎక్స్ ఓ భాగం. అంకుర సంస్థలకు ప్రోత్సాహాన్ని అందించడం దీని ప్రధానోద్దేశం. ప్రసార మాధ్యమాలు, వినోదం, భాషా సాంకేతికత సంబంధి అనుబంధ విస్తారిత వ్యవస్థ.. ఈ మూడింటిలో నవకల్పనను పెంపొందించడంపైన వేవ్స్ దృష్టిని కేంద్రీకరిస్తోంది. భారత నవ తరపు సృజనశీల, సాంకేతికత ప్రధాన అంకుర సంస్థలకు వెన్నుదన్నుగా నిలవడానికే వేవ్ఎక్స్ను ప్రారంభించారు. ఇది నూతన ఆవిష్కర్తలు, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ ప్రముఖులకు మధ్య ఒక వారధిగా నిలుస్తోంది. హ్యాకథాన్లు, ప్రధానంగా ప్రోత్సాహాన్ని అందించేందుకే నిర్వహించే కార్యక్రమాలు, మార్గదర్శకత్వం, జాతీయ వేదికలతో ఏకీకరణ సదుపాయం.. ఈ మార్గాలలో వేవ్ఎక్స్ విభిన్న ఆలోచనలను సమర్ధిస్తుంది. అండదండలందించే అనుబంధ విస్తారిత వ్యవస్థ పక్కాగానూ, నిరంతరాయంగానూ వర్ధిల్లేలా చూడటానికి హైదరాబాద్లోని టి-హబ్తోనూ, ఢిల్లీలోని ఐఐటీతోనూ భాగస్వామ్యాన్ని వేవ్ఎక్స్ నెలకొల్పుకొని, దేశవ్యాప్తంగా తొమ్మిది ఇన్క్యూబేషన్ కేంద్రాల్ని నిర్వహిస్తోంది. ఈ తొమ్మిది కేంద్రాల్నీ ఐఐసీటీ- ముంబయి, ఎఫ్టీఐఐ- పుణే, ఎస్ఆర్ఎఫ్టీఐ- కోల్కతా, ఐఐఎంసీ- ఢిల్లీ, ఐఐఎంసీ- ఐజ్వాల్, ఐఐఎంసీ- అమరావతి, ఐఐఎంసీ- డెంకనల్, ఐఐఎంసీ- కోటయం, ఐఐఎంసీ- జమ్మూలలో ఏర్పాటు చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2228936)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4