వ్యవసాయ మంత్రిత్వ శాఖ
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకం, ఇది భారత ఆర్థిక వ్యవస్థను కొత్త శిఖరాలకు చేర్చడమే కాక వేగిరం చేస్తుంది: శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్
భారత్ విధానం నిబద్ధత కలిగింది.. ఇది రాజీ పడేది కాదు
దౌత్యానికీ, అభివృద్ధికీ, ఆత్మగౌరవానికీ ప్రతీకగా.. వాణిజ్య ఒప్పందం
భారతీయ వ్యవసాయ ఉత్పాదనలకు సున్నా సుంకంతో అందుబాటులోకి రానున్న అమెరికా మార్కెట్
భారతీయ రైతులకు హాని కలిగించే ఏ ఉత్పాదననీ వాణిజ్య ఒప్పందంలో చేర్చలేదు
రైతులు, మహిళలతో పాటు యువత కలలకు కొత్త రెక్కలందించనున్న వాణిజ్య ఒప్పందం
‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’ వైపు అడుగులు వేగంగా వేయడంలో
ఇలాంటి ఒప్పందాల పాత్ర కీలకం: శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్
నాడు పోస్టు చేయడమైనది:
08 FEB 2026 7:34PM by PIB Hyderabad
భారత్, అమెరికాల మధ్య ఇటీవలి వాణిజ్య ఒప్పందం ‘‘చరిత్రాత్మకం, అపూర్వం’’ అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ వర్ణించారు. ఆయన భోపాల్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త వేగాన్ని ఇవ్వడంతో పాటు కొత్త శిఖరాలకు చేరుస్తుందని ఆయన అన్నారు. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాదు, ఇది ప్రపంచంలో పెరుగుతున్న భారత ప్రతిష్ఠకు ఒక సంకేతమన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ఈ ఒప్పందం పటిష్ఠపరచడంతో పాటు కొత్త దిశను కూడా అందిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం పూర్తి ప్రపంచానికి కూడా ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తోందని శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు.

‘‘భారత విధానం నిబద్ధత కలిగిందనీ, రాజీ పడేది కాదనీ ప్రపంచానికి ఈ ఒప్పందం సందేశాన్నిస్తోంది. మేం దేశ హితం కోరి నిర్ణయాల్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో తీసుకుంటాం’’ అని కేంద్ర మంత్రి అన్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ సమతౌల్య ప్రధాన, సకారాత్మక వ్యూహంతో ముందుకు పోతోందని ఆయన వివరించారు. బేరసారాలాడే రాజకీయాలకు మేం పాల్పడం, అంతకన్నా సమతౌల్య వ్యూహాన్ని అనుసరించి, సకారాత్మక చర్చల్ని నమ్ముతాం. ఈ కారణంగానే ఇవాళ భారత్ ప్రపంచ స్థాయిలో ఒక ఆధారపడదగిన, బలమైన భాగస్వామ్య దేశంగా ఎదుగుతోంది’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
దౌత్యం, అభివృద్ధిలతో పాటు ఆత్మగౌరవం
ఈ వాణిజ్య ఒప్పందం దౌత్యం, అభివృద్ధిలతో పాటు ఆత్మగౌరవానికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోందని కేంద్ర మంత్రి శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వీటిలో దౌత్యానికి అర్థం.. దేశానికే అగ్ర ప్రాధాన్యం అనీ, ఈ ఒప్పందంలో భారత జాతీయ ప్రయోజనాలను అన్నిటి కన్నా మిన్నగా చూశారన్నారు. అభివృద్ధి అంటే.. ‘వికసిత్ భారత్’ దిశగా కదం తొక్కడం; ఈ విషయంలో కూడా ఈ ఒప్పందం కీలక పాత్రను పోషిస్తుంది. ఇక ఆత్మగౌరవం అంటే అర్థం.. రైతుల స్వాభిమానమే. మరి ఈ ఒప్పందంలో రైతుల గౌరవం విషయంలో పూర్తి శ్రద్ధను తీసుకోవడం చూసి నేను గర్వపడుతున్నానని మంత్రి అన్నారు. భారతీయ వ్యవసాయం, భారతీయ రైతుల విషయంలో దేశం మనసులో ఉన్న ఆందోళనలపై ఈ వాణిజ్య ఒప్పందంలో పరిష్కారాల్ని సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం మన రైతుల్ని పూర్తి సురక్షితంగా ఉంచుతుందన్నారు. ఈ డీల్ ఒక్క భద్రతకు మాత్రమే పరిమితం కాదనీ, ఇది కొత్త అవకాశాల్ని కూడా అందిస్తుందనీ శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందం మన వ్యవసాయ ఉత్పాదనలకు ప్రపంచ మార్కెటులో కొత్త అవకాశాలను అందిస్తుంది. ఇది రైతులకు ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్రను పోషిస్తుందన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘వికసిత్ భారత్’లకు ఇది బలమైన పునాదిని వేస్తుందని మంత్రి అన్నారు.
అమెరికాలో భారతీయ వ్యవసాయ ఉత్పాదనలకు సున్నా సుంకాలు
భారతీయ రైతులకు చెందిన అనేక వ్యవసాయ ఉత్పాదనలకు ఇక అమెరికాకు సున్నా సుంకంపై ఎగుమతి చేయవచ్చని కేంద్ర మంత్రి తెలిపారు. ఏమైనా, అమెరికా రైతుల వ్యవసాయ ఉత్పాదనలను భారతీయ మార్కెటులో ఈ రాయితీ అందబోదన్నారు. భారత వ్యవసాయ, పాడి రంగ ప్రయోజనాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయన్నారు. అమెరికా వ్యవసాయ రంగంలో అనేక ఉత్పాదనలకు టారిఫ్లో చెప్పుకోదగ్గ కోతలను అనుమతించిందన్నారు. అనేక వ్యవసాయ ఉత్పాదనలపై టారిఫ్లు ఇదివరకు 50 శాతం వరకూ ఉండగా వాటిని అమెరికా తగ్గించి, సున్నా స్థాయికి తీసుకు వచ్చిందని ఆయన చెప్పారు. వీటిలో మసాలాలు, టీ, కాఫీ, కొబ్బరికాయ, కొబ్బరి నూనె, వక్క, జీడిపప్పు, వెజిటబుల్ వ్యాక్స్, ఎవకాడో, అరటి, జామ, మామిడి, కీవీ, బొప్పాయి, అనాస, పుట్టగొడుగులతో పాటు కొన్ని రకాల గింజలు కూడా ఉన్నాయన్నారు. భారత వ్యవసాయ ఎగుమతులు 2024-25 సంవత్సరంలో 4.45 బిలియన్ అమెరికా డాలర్ల స్థాయికి చేరుకొన్నాయనీ, మసాలాల ఎగుమతిలో 88 శాతం వృద్ధి నమోదైందన్నారు. ప్రస్తుతం ఈ వాణిజ్య ఒప్పందం తరువాత, మన మసాలాలకు అమెరికాలో కూడా కొత్త మార్కెట్లు పెద్ద స్థాయిలో అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు.
ప్రపంచ మసాలా మార్కెట్టులో భారత్ ఇప్పటికే బలమైన స్థితిలో ఉందని శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 ప్రాంతాలకు మసాలాల్నీ, మసాలా ఉత్పాదనల్నీ భారత్ ఎగుమతి చేస్తోందని తెలిపారు. ఈ ఒప్పందంతో మసాలాలు, ఇతర వ్యవసాయ ఉత్పాదనల ఎగుమతులకు మరింత వేగం జతపడుతుందని ఆయన చెప్పారు. భారతీయ మార్కెటు భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావు ఇవ్వలేదని స్పష్టం చేశారు. విదేశీ వ్యవసాయ ఉత్పాదనలు భారత వ్యవసాయ మార్కెట్టులోకి ప్రవేశించాయంటే, అవి సుంకాలను చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారు. మన రైతులకు పూర్తి స్వేచ్ఛ ఉందనీ, పూర్తి రక్షణ లభిస్తుందనీ తెలిపారు. ఇదే ఈ వాణిజ్య ఒప్పందంలో అన్నిటి కన్నా గొప్ప బలం అని ఆయన వివరించారు.
కీలక వస్తువులన్నిటికీ ఒప్పందం నుంచి మినహాయింపు
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయం, వ్యవసాయ ఉత్పాదనల విషయంలో భారతీయ రైతుల ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి రాజీకీ ఆస్కారం ఇవ్వలేదనీ, రైతులకు నష్టం వాటిల్లే ఎలాంటి ఉత్పాదననీ ఒప్పందంలో చేర్చలేదనీ కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కీలక వస్తువులను ఒప్పందం పరిధికి బయటే ఉంచారన్నారు. సోయాబీన్, మక్కలు, బియ్యం, గోధుమ, చక్కెర, ముతక ధాన్యాలు, పౌల్ట్రీ, పాడి, అరటి, స్ట్రాబెరీ, చెరీ, పుల్లని పండ్లు, పచ్చి బఠాణీలు, కాబూలీ శనగలు, పెసర్లు, నూనెగింజలు, ఇథనాల్లతో పాటు పొగాకు వంటి ఉత్పాదనలపై ఎలాంటి టారిఫ్ రాయితీలనూ ఇవ్వలేదన్నారు. మన దేశ ప్రధాన ధాన్యాల విషయంలోనే అతి పెద్ద ఆందోళన నెలకొందని ఆయన గుర్తుచేశారు. మన ప్రధాన ధాన్యాలపై ఆందోళన వ్యక్తం కాగా, వాటిని అన్నిటినీ పూర్తి సురక్షితంగా ఉంచారని నేను గర్వంగా చెబుతున్నానని మంత్రి అన్నారు. ప్రధాన ధాన్యాలు, ప్రధాన పండ్లతో పాటు పాడి ఉత్పాదనల విషయంలో అమెరికాకు తలుపులు తెరవడం జరగలేదని ఆయన వివరించారు.
అమెరికాకు చెందిన అనేక వ్యవసాయ ఉత్పాదనలు ఏవీ కూడా భారతీయ మార్కెటులోకి అడుగు పెట్టజాలవని శ్రీ శివ్రాజ్ సింగ్ ఉద్ఘాటించారు. పొట్టు తీసిన ధాన్యం, పిండి, గోధుమ, మక్కలు, బియ్యం, సిరిధాన్యాలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బీన్స్, దోసకాయ, పుట్టగొడుగులు, పప్పులు, ఘనీభూత ఖాద్య వస్తువులు, నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ, స్ట్రాబెరీతో పాటు డబ్బాల్లో వచ్చే మిక్స్డ్ వెజిటబుల్స్ భారత్కు రావని ఆయన స్పష్టం చేశారు. పాడి ఉత్పాదనల గురించి ఆయన చెబుతూ, లిక్విడ్ మిల్క్, పొడి, క్రీమ్, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, బటర్ ఆయిల్, పనీర్, జున్ను.. వీటిలో దేనిని అయినా సరే, భారత్లోకి రానివ్వరని తెలిపారు. వ్యవసాయం, పాడి రంగాలకు తోడు.. అమెరికా నుంచి మిరియాలు, లవంగాలు, పచ్చి మిరప ఒరుగులు, సినమన్ (దాల్చీనీ), ధనియాలు, జీలకర్ర, ఇంగువ, అల్లం, పసుపు, అజ్వాయిన్, మెంతులు, కేసియా, ఆవాలు, ఆవాలు, ధాన్యపు పొట్టు, ఇంకా ఇతర పౌడర్ మసాలాల్ని భారత్ రావని వివరించారు. అర్థం స్పష్టంగా ఉంది.. మన మసాలాలు, మన రైతులూ పూర్తిగా సురక్షితం అని ఆయన చెప్పారు.
HK0G.jpeg)
రైతులు, మహిళలు, యువతకు అవకాశాలు
ఈ ఒప్పందం భారతీయ రైతులకు, మహిళలకు, ప్రత్యేకించి యువతకు ముందుకు వెళ్లడానికి కొత్త అవకాశాల్ని అందిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. జౌళి వంటి మన అనేక రంగాల్లో ప్రస్తుతం, పోటీదారు దేశాలతో పోలిస్తే మన సుంకాలను చెప్పుకోదగినంతగా దాదాపు 18 శాతానికి తగ్గించారని ఆయన అన్నారు. దీంతో జౌళి ఎగుమతులకు కొత్త వేగంతో పాటు కొత్త దిశ లభిస్తుందన్నారు. జౌళి ఎగుమతుల నేరు ప్రయోజనాలు మన రైతులకు కూడా కలుగుతాయని కేంద్ర వ్యవసాయ మంత్రి అన్నారు. జౌళి అంటే అర్థం రైతులకు లాభం.. మరీముఖ్యంగా పత్తి పంటను పండించే రైతులకు. దీంతో పాటు, రత్నాభరణాలు, వాహన విడిభాగాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఎమ్ఎస్ఎమ్ఈల వంటి శరవేగంగా పురోగమిస్తున్న రంగాల్లో కొత్త వ్యాపార అవకాశాలు అనేకం లభిస్తాయని ఆయన వివరించారు. మన స్వయంసహాయక బృందాల్లోని సోదరీమణుల జీవితాలు ఈ ఒప్పందంతో సమృద్ధం అవుతాయనీ, అనేక ఉత్పాదనల విషయంలో ముఖ్యపాత్రను వారు పోషిస్తుండడమే దీనికి కారణమనీ మంత్రి చెప్పారు. ఈ ఒప్పందం వారి శ్రమకూ, ప్రతిభకూ ప్రపంచ వ్యాప్త గుర్తింపును తీసుకువస్తుందని శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇంతవరకు తొమ్మిది ఎఫ్టీఏలు పూర్తి అయ్యాయని శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అమెరికా, ఒమన్, న్యూజీలాండ్, యూకేలతో కలిపి మొత్తం 27 దేశాలతో ఎఫ్టీఏలపై సంతకాలు అయ్యాయన్నారు. ఇతర దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఒప్పందాలన్నిటితో దేశానికి విస్తృత ప్రయోజనాలు దక్కుతాయని వివరించారు. ఈ ఒప్పందాల లాభాలు భారత ఆర్థిక వ్యవస్థ, రైతులు, కార్మికులు, పేదలు, ఎగుమతిదారులు, తయారీదారులకు అందుతాయన్నారు. ఈ మాధ్యమం ద్వారా, మనం 2047 కల్లా వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చుకోగలుగుతామని వివరించారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్లను నిర్మించడంలో ఈ ఒప్పందంతో పాటు ఇలాంటి అన్ని ఒప్పందాలు కీలక పాత్రను పోషిస్తాయన్నారు. దీనికి గాను నేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని శ్రీ శివ్రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2225570)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14