యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జాతీయ క్రీడా విధానం
నాడు పోస్టు చేయడమైనది:
06 FEB 2026 9:28AM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం 10.07.2025న 'ఖేలో భారత్ నీతి-2025'ని ఆవిష్కరించింది. భారతదేశంలో బలమైన, సమగ్రమైన, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడా వ్యవస్థను నిర్మించడమే ఈ విధానానికి ఉన్న ప్రధాన లక్ష్యం. 'దేశ నిర్మాణానికి క్రీడలు- దేశ సమగ్ర అభివృద్ధి కోసం క్రీడల శక్తిని వినియోగించడం' అనేది ఈ విధానం దార్శనికత. ఈ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఖేలో భారత్ నీతి పలు కీలక అంశాలపై దృష్టి సారించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్లో https://yas.nic.in/sites/default/files/Khelo-Bharat-Niti2025_0.pdf. అందుబాటులో ఉన్నాయి.
ఖేలో భారత్ నీతి-2025లో క్రీడా అవకాశాలను విస్తృతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, పట్టణ - గ్రామీణ ప్రాంతాల్లో బాల్యంలోనే ప్రతిభను గుర్తించే వ్యవస్థను ప్రోత్సహించడం వంటి అంశాలను చేర్చారు. ఈ విధానం గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాన్ని తొలగించేలా.. ప్రాథమిక శిక్షణ సౌకర్యాలు, ప్రత్యేక క్రీడా మౌలిక సదుపాయాలు, పోటీ వేదికలను అందుబాటులోకి తెస్తుంది. తద్వారా మహిళలు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని విభాగాలకు చెందిన అథ్లెట్లకు సమాన అవకాశాలు కల్పించాలన్నది దీని లక్ష్యం. పాఠశాల విద్యతో క్రీడలను అనుసంధానం చేయడం, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, క్రీడల్లో పాల్గొనేందుకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి వివిధ భాగస్వామ్య పక్షాల మధ్య సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలను ఈ విధానం ప్రధానంగా తెలియజేస్తోంది. ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు, క్రమబద్ధమైన శిక్షణ వ్యవస్థల్లో పెట్టుబడులను పెంచడంతో పాటు అథ్లెట్ల సన్నద్ధత విషయంలో నాణ్యతను పెంపొందించే లక్ష్యంతో ఉన్నత స్థాయి శిక్షణ కేంద్రాలను అభివృద్ధి చేసే ప్రణాళికలను కూడా ఈ విధానం వివరిస్తోంది.
క్రీడలు అనేది రాష్ట్ర పరిధిలోని అంశం కావడంతో క్రీడల ప్రోత్సాహం, అభివృద్ధికి సంబంధించిన ప్రాథమిక బాధ్యత ప్రధానంగా ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలపైనే ఉంటుంది. జాతీయ క్రీడా విధానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన ప్రస్తుత పథకాలు, కార్యక్రమాల ద్వారా ఈ ప్రయత్నాలకు అదనపు మద్దతును అందిస్తుంది. ఈ పథకాలు నిర్దేశించిన మార్గదర్శకాలు, నివేదికల చట్రం ప్రకారం అమలుకానున్నాయి. వీటి పనితీరు, ప్రభావాన్ని వ్యయ విభాగం జారీ చేసిన మూల్యాంకన మార్గదర్శకాలకు అనుగుణంగా తృతీయ పక్షం ద్వారా స్వతంత్రంగా మూల్యాంకనం చేసి అంచనా వేస్తారు.
ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.
***
(రిలీజ్ ఐడి: 2224756)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4