వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారత్-జీసీసీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విషయంలో నియమావళిపై సంతకాలు
నాడు పోస్టు చేయడమైనది:
05 FEB 2026 5:07PM by PIB Hyderabad
భారత్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్టీఏ) సంబంధించిన 'నియమావళి’పై (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్- టీఓఆర్) 2026 ఫిబ్రవరి 5న ఢిల్లీలోని వాణిజ్య భవన్లో భారత ప్రధాన సంప్రదింపుల అధికారి అయిన వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అజయ్ భాదూ.. జీసీసీ ప్రధాన సంప్రదింపుల అధికారి అయిన జీసీసీ సెక్రటేరియట్ జనరల్ డాక్టర్ రాజా అల్ మర్జూఖీ సంతకాలు చేశారు. కేంద్ర వాణిజ్య- పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద, వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
జీసీసీ-భారత్ ఎఫ్టీఏ పరిధి, విధివిధానాలను ఈ నియమావళి (టీఓఆర్) నిర్దేశిస్తోంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఈ ఎఫ్టీఏ ప్రపంచ శ్రేయస్సు కోసం ఒక గొప్ప చోదక శక్తిగా పనిచేస్తుందని చెప్పారు. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలలో స్పష్టత, స్థిరత్వాన్ని తీసుకువస్తుందని.. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఆయన పేర్కొన్నారు. వస్తు సేవల నిరంతర సరఫరా, పెట్టుబడుల ఆకర్షణకు ఈ ఎఫ్టీఏ దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనితో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు ఆహార, ఇంధన భద్రతను పెంపొందిస్తూ మన మధ్య ఉన్న ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాన సంప్రదింపుల అధికారి అయిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సెక్రటేరియట్ జనరల్ డాక్టర్ అల్ మర్జూఖీ మాట్లాడుతూ.. భారత్, జీసీసీ దేశాల మధ్య చారిత్రక వాణిజ్య సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ టీఓఆర్పై సంతకాలు చేయడం ద్వారా ఇరుపక్షాలకు ప్రయోజనకరమైన ఎఫ్టీఏ దిశగా చర్చలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ అనిశ్చితుల నేపథ్యంలో ఈ ఒప్పందం భారత్-జీసీసీ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన ప్రధానంగా చెప్పారు.
ఈ పర్యటనలో భాగంగా భారత వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్తో డాక్టర్ రాజా అల్ మర్జూఖీ సమావేశమయ్యారు. భారత్, జీసీసీ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం.. పరస్పర ఆసక్తి ఉన్న అంశాలలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఈ చర్చలు దృష్టి సారించాయి.
భారత్కు చారిత్రక వాణిజ్య సంబంధాలు ఉన్న కీలకమైన గల్ఫ్ ప్రాంతంతో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి భారత్-జీసీసీ ఎఫ్టీఏ గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-జీసీసీ మధ్య మొత్తం వాణిజ్యం 178.56 బిలియన్ డాలర్లుగా నమోదైంది (ఎగుమతులు: 56.87 బిలియన్ డాలర్లు, దిగుమతులు: 121.68 బిలియన్ డాలర్లు). ఇది భారత్కు సంబంధించిన మొత్తం విదేశీ వాణిజ్యంలో 15.42 శాతానికి సమానం. గత ఐదేళ్లలో జీసీసీతో దేశ వాణిజ్యం స్థిరంగా వృద్ధి చెందుతూ సగటున ఏడాదికి 15.3 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది.
భారత్ నుంచి జీసీసీ దేశాలకు ప్రధానంగా ఇంజనీరింగ్ వస్తువులు, బియ్యం, వస్త్రాలు, యంత్రాలు, రత్నాలు, ఆభరణాలు ఎగుమతి అవుతున్నాయి. జీసీసీ నుంచి భారత్కు ప్రధానంగా ముడి చమురు, ఎల్ఎన్జీ, పెట్రోకెమికల్స్, బంగారం వంటి విలువైన లోహాలను దిగుమతి చేసుకుంటోంది. మొత్తంగా చూస్తే 2024 నాటికి 61.5 మిలియన్ల జనాభా కలిగిన జీసీసీ దేశాలు.. ప్రస్తుత ధరల ప్రకారం 2.3 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా 9వ స్థానంలో ఉంది. అంతేకాకుండా భారత్కు ఎఫ్డీఐ అందించడంలో జీసీసీ ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఉంది. సెప్టెంబర్ 2025 నాటికి ఈ దేశాల నుంచి వచ్చిన మొత్తం పెట్టుబడులు 31.14 బిలియన్ డాలర్లు దాటాయి.
జీసీసీ ప్రాంతంలో దాదాపు కోటి మంది భారతీయులకు నివసిస్తున్నారు. అక్కడ ఉన్న అనేక భారతీయ కంపెనీలు.. ఇరు ప్రాంతాల మధ్య ఉన్న ఈ బలమైన, చిరకాల ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2224193)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12