యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
57వ ఫిట్ ఇండియా ఆదివారం సైకిల్ యాత్రలో
గోండాల్ నుంచి హైదరాబాద్ వరకు ఐక్యంగా పాల్గొన్న దేశ ప్రజలు
గుజరాత్ లో సైకిల్ తొక్కిన కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
హైదారాబాద్ లో క్రీడాకారులు పీ గోపీచంద్, దీప్తి జీవన్ జీ, ఇషా సింగ్ తో కలిసి
సైకిల్ యాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి
प्रविष्टि तिथि:
18 JAN 2026 4:47PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 57వ ఫిట్ ఇండియా ఆదివారం సైకిల్ ర్యాలీ ఈ రోజు ఉదయం ఉత్సాహంగా సాగింది. రాజ్కోట్ సమీపంలోని గోండాల్లో కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించగా, హైదరాబాద్లో వెయ్యి మందికి పైగా సైక్లిస్టులతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు.
గోండాల్లో నిర్వహించిన సైకిల్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. సుమారు 250 మంది సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొని, శారీరక దృఢత్వం, ఆరోగ్యవంతమైన జీవన విధాన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
భారత్ను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఆదివారం సైకిల్ యాత్రలో పాల్గొనాలని సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ పై చేసిన పోస్టులో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ.. "అన్ని వయసుల వారికి సైక్లింగ్ అత్యుత్తమ వ్యాయామం. ఇది కర్బన ఉద్గారాల తగ్గింపునకు కూడా తోడ్పడుతుంది. మనమంతా కలిసికట్టుగా క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయాలి. ఎంతో మందితో కలిసి సైక్లింగ్ చేయడం నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఇది మనందరిలో సామాజిక చైతన్యాన్ని, ఐక్యతను పెంపొందిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ప్రతి ఆదివారం తమ నగరాల్లో జరిగే ఈ సైకిల్ యాత్రల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు. 'ఫిట్ ఇండియా ఆదివారం సైకిల్' కార్యక్రమంలో డాక్టర్ మాండవీయ క్రమం తప్పకుండా పాల్గొంటుండటం గమనార్హం.
శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రముఖంగా చెబుతూ, “ఒక దేశం బలం దాని ప్రజల బలంపైనే ఆధారపడి ఉంటుంది. మన వికసిత భారత్ కల సాకారం కావాలంటే ప్రతి భారతీయుడు శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. అప్పుడే దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించగలరు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్ష కూడా ఇదే." అని శ్రీ మాండవీయ అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారితో కేంద్ర మంత్రి ముచ్చటించిన సందర్భంగా సామాజిక అనుబంధాలను బలపరిచేందుకు సైక్లింగ్ ఏ విధంగా దోహదపడుతుందో తెలిపే పలు ఆసక్తికర కథనాలు వెలుగులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా ప్రజా ఆరోగ్య ఉద్యమంగా మారిన మారిన ఫిట్ ఇండియా సైకిల్ ఆదివారం కార్యక్రమాన్ని ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా ప్రాంతాల్లో నిర్వహించగా, 22 లక్షల మందికి పైగా ప్రజలు భాగస్వాములయ్యారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరుతున్న ‘ఫిట్నెస్ కీ డోస్.. ఆధా ఘంటా రోజ్’ (రోజుకు అరగంట వ్యాయామం) స్ఫూర్తితో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. స్థూలకాయంపై పోరాటంతో పాటు సుస్థిర, కాలుష్య రహిత జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ బృహత్తర కార్యక్రమం సాగుతోంది.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నిర్వహించిన భారీ సైకిల్ ర్యాలీలో. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, పాల్గొన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్, అర్జున అవార్డు గ్రహీత ఇషా సింగ్, పారాలింపిక్ కాంస్య పతక విజేత దీప్తి జీవంజి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ రెడ్డి ఇతర ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఫిట్నెస్ సందేశాన్ని చాటిచెప్పడంలో కీలక పాత్ర పోషించిన క్రీడాకారులు, ఫిట్ ఇండియా అంబాసిడర్లు, సైక్లింగ్ ప్రతినిధులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నిత్య జీవితంలో ఫిట్నెస్ ఒక భాగంగా మారాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన, చురుకైన సమాజాన్ని నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయానికి 'సండేస్ ఆన్ సైకిల్' వంటి కార్యక్రమాలు అద్దం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
"ఆరోగ్య భారతాన్ని నిర్మించడమే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతిమ లక్ష్యం. ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తుతున్న ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ‘ఫిట్ ఇండియా మిషన్’ ద్వారా కృషి చేస్తున్నాం. ప్రస్తుత ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ మార్పులు వంటివి స్థూలకాయం, మానసిక ఒత్తిడి పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ సమస్యల నివారణకు వంట నూనె వినియోగాన్ని తగ్గించాలని కూడా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. సాంకేతికత వల్ల జీవితం సులువుగా మారినప్పటికీ, మునుపటి తరాలను ఆరోగ్యంగా ఉంచిన శారీరక శ్రమ క్రమంగా తగ్గుతోంది. ఈ విషయాన్ని మనం విస్మరించకూడదు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో శారీరక కదలికలకు ప్రాధాన్యం ఇవ్వాలి” అని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, క్రీడల్లో రాణించడానికే కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి నిరంతర శారీరక శ్రమ ఎంతో అవసరమని చెప్పారు.
ప్రజల దైనందిన జీవితంలో ఫిట్నెస్ను ఒక భాగంగా మార్చాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 29న గౌరవ ప్రధానమంత్రి 'ఫిట్ ఇండియా' ఉద్యమాన్ని ప్రారంభించారు.




***
(रिलीज़ आईडी: 2215879)
आगंतुक पटल : 6