వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
రెస్టారెంట్లు నిర్బంధ సర్వీస్ ఛార్జీ విధించడం వినియోగదారు చట్టం ఉల్లంఘనే: సీసీపీఏ
· సర్వీస్ ఛార్జీని ఆటోమేటిక్గా జోడించడం అనుచిత వ్యాపార పద్ధతి
· రూ. 50,000 వరకు జరిమానాలు.. సర్వీస్ ఛార్జీని తిరిగి చెల్లించాలని, బిల్లింగ్ వ్యవస్థలను సవరించాలని రెస్టారెంట్లకు ఆదేశాలు
· జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్లో నమోదైన ఫిర్యాదులు, వాటికి ఆధారంగా సమర్పించిన ఇన్వాయిస్ల మేరకు సీసీపీఏ చర్యలు
प्रविष्टि तिथि:
10 JAN 2026 4:05PM by PIB Hyderabad
సర్వీస్ ఛార్జీని నిర్బంధంగా వసూలు చేయడం ద్వారా వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడంతోపాటు.. వినియోగదారుల పరిరక్షణ చట్టం- 2019లోని సెక్షన్ 2(47) కింద అనుచిత వాణిజ్య పద్ధతులకు పాల్పడినందుకు గాను దేశవ్యాప్తంగా ఉన్న 27 రెస్టారెంట్లపై కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) సుమోటోగా చర్యలు తీసుకుంది.
రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీని వసూలు చేయడంపై సీసీపీఏ జారీ చేసిన మార్గదర్శకాలను సమర్థిస్తూ.. 2025 మార్చి 28న గౌరవ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి సీసీపీఏ ఈ చర్యలు తీసుకుంది. రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీని వసూలు చేయడం చట్టవిరుద్ధమని న్యాయస్థానం పేర్కొన్నది. అన్ని రెస్టారెంట్ సంస్థలు సీసీపీఏ మార్గదర్శకాలను తప్పక పాటించాలని ఆదేశించింది. చట్టానికి అనుగుణంగా తన మార్గదర్శకాలను అమలు చేయడానికి సీసీపీఏకు పూర్తి అధికారం ఉందని కోర్టు స్పష్టం చేసింది.
2022 జూలై 4న కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) జారీ చేసిన ‘హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల వసూళ్లకు సంబంధించి అనుచిత వాణిజ్య పద్ధతుల నివారణ, వినియోగదారు ప్రయోజనాల రక్షణ మార్గదర్శకాలు’లోని నిబంధనలు కింది విధంగా ఉన్నాయి:
1. ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కూడా ఆహార బిల్లులో సర్వీస్ ఛార్జీని జోడించకూడదు.
2. మరే ఇతర పేరుతోనూ సర్వీస్ ఛార్జీ వసూలు చేయరాదు.
3. సర్వీస్ ఛార్జీ చెల్లించమని వినియోగదారులను బలవంతం చేయకూడదు. అది స్వచ్ఛందం, ఐచ్ఛికం అని వారికి స్పష్టంగా తెలియజేయాలి.
4. సర్వీస్ ఛార్జీ చెల్లించడానికి నిరాకరిస్తే.. ప్రవేశంపైనా లేదా సేవల కల్పనలోనూ ఎలాంటి ఆంక్షలు విధించరాదు.
5. సర్వీస్ ఛార్జీని బిల్లుకు జోడించకూడదు. దానిపై జీఎస్టీ విధించరాదు.
పాట్నాలోని కేఫ్ బ్లూ బాటిల్, ముంబయిలోని చైనా గేట్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (బోరా బోరా) సహా అనేక రెస్టారెంట్లు.. వినియోగదారుల రక్షణ చట్టం- 2019, గౌరవ ఢిల్లీ హైకోర్టు సమర్థించిన సీసీపీఏ మార్గదర్శకాలను స్పష్టంగా ఉల్లంఘిస్తూ 10 శాతం సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తున్నట్టు విచారణలో వెల్లడైంది.
జాతీయ వినియోగదారు హెల్ప్లైన్ (ఎన్సీహెచ్)లో నమోదైన ఫిర్యాదులు, అలాగే వాటికి ఆధారంగా సమర్పించిన ఇన్వాయిస్లలో సర్వీస్ ఛార్జీని జోడించినట్లు స్పష్టమవుతుండడంతో సీసీపీఏ చర్యలు తీసుకుంది. ఈ చర్యలు చట్టంలోని సెక్షన్ 2(47) ప్రకారం అనుచిత వాణిజ్య పద్ధతిగా వివరణాత్మక విచారణ ద్వారా నిర్ధారించింది.
పట్నాలోని కేఫ్ బ్లూ బాటిల్ విషయంలో.. ఆ రెస్టారెంట్ను సీసీపీఏ కింది విధంగా ఆదేశించింది:
· సర్వీస్ ఛార్జి పూర్తి మొత్తాన్ని వినియోగదారునికి వాపసు చేయాలి.
· సర్వీస్ ఛార్జీ వసూలు చేసే పద్ధతిని తక్షణమే నిలిపివేయాలి.
· రూ. 30,000 జరిమానా చెల్లించాలి.
ముంబయిలోని చైనా గేట్ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (బోరా బోరా) విషయంలో.. విచారణ సమయంలోనే ఆ రెస్టారెంట్ సర్వీస్ ఛార్జీని తిరిగి చెల్లించింది. సీసీపీఏ ఆ రెస్టారెంట్కు కింది విధంగా ఆదేశాలు జారీ చేసింది:
· సాఫ్ట్వేర్ ద్వారా బిల్లింగ్ వ్యవస్థను సవరించి.. సర్వీస్ ఛార్జిగానీ, ఆ రకమైన ఇతర ఛార్జీలనుగానీ ఇకపై అప్రమేయంగా జోడించకూడదు.
· వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, అనుచిత వాణిజ్య చర్యలకు గాను రూ. 50,000 జరిమానా చెల్లించాలి.
· చట్టం ప్రకారం, వినియోగదారుల ఫిర్యాదుల సమర్థ పరిష్కారం కోసం.. బహిరంగ వేదికలపై అందుబాటులో తమ ఇ- మెయిల్ ఐడీలు ఎప్పుడూ క్రియాశీలకంగా, పని చేసే స్థితిలో ఉండేలా చూసుకోవాలి.
సర్వీస్ ఛార్జి విధించడంపై జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు వచ్చే ఫిర్యాదులను కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. వినియోగదారుల హక్కుల రక్షణ, అనుచిత వాణిజ్య పద్ధతులను నిరోధించడం కోసం.. నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై కఠిన చర్యలను కొనసాగిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2213644)
आगंतुक पटल : 7