రక్షణ మంత్రిత్వ శాఖ
గణతంత్ర దినోత్సవాలు-2026: వీర్ గాథ 5.0లో రికార్డు స్థాయిలో పాల్గొన్న 1.92 కోట్ల మంది విద్యార్థులు
తొలిసారిగా, 18 దేశాల్లో సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న 91 పాఠశాలల నుంచి పాల్గొన్న 28,000 మందికి పైగా విద్యార్థులు
కర్తవ్యపథ్లో జరిగే కవాతులో ప్రత్యేక అతిథులుగా పాల్గొనేందుకు జాతీయ స్థాయిలో 100 మంది సూపర్ విజేతల ఎంపిక
प्रविष्टि तिथि:
08 JAN 2026 3:51PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ప్రాజెక్ట్ వీర గాథ 5.0కు విశేష స్పందన లభించింది. ఈ ఏడాది దాదాపు 1.90 లక్షల పాఠశాలల నుంచి సుమారుగా 1.92 కోట్ల మంది విద్యార్థులు పాల్గొన్నారు. 2021లో ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నారు. జాతీయస్థాయిలో 100 మంది విజేతలుగా ఎంపికయ్యారు. ప్రాథమిక దశ (3 నుంచి 5 గ్రేడ్లు) నుంచి 25 మంది, మాధ్యమిక దశ (6 నుంచి 8 గ్రేడ్లు) నుంచి 25 మంది, సెకండరీ స్థాయి (9 నుంచి 10, 11 నుంచి 12 గ్రేడ్ల వరకు సమాన ప్రాతినిధ్యం) నుంచి 50 మంది విజేతలుగా నిలిచారు. సూపర్-100 విజేతల వివరాలు దిగువ లింక్లో ఉన్నాయి.
(వీర్ గాథ 5.0 – సూపర్-100 విజేతలు)
విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు వినూత్న కార్యక్రమాలను వీర్ గాథ 5.0 ప్రారంభించింది. ఈ కార్యక్రమం 2025 సెప్టెంబర్ 8న ప్రారంభమైంది. వీడియోగ్రఫీ, యాంకరింగ్, రిపోర్టింగ్, స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో మొదటిసారి షార్ట్-వీడియో విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది భారతీయ సైనిక సంప్రదాయాలు, వ్యూహాలు, కార్యక్రమాలు, వీరోచిత గాథలతో సహా సమర పరంపరకు సంబంధించిన వీడియోలను రూపొందించేలా విద్యార్థులను ప్రోత్సహించింది.
కళింగ రాజు ఖారవేల, పృథ్వీ రాజ్ చౌహాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్, 1857 యుద్ధ వీరులు, గిరిజన తిరుగుబాటు వీరులతో సహా దేశంలోని గొప్ప యోధుల అజేయ స్ఫూర్తిని, సైనిక వ్యూహాల గురించి అధ్యయనం చేసేలా విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ వైవిధ్యమైన అంశాల ఎంపిక పోటీలకు వచ్చిన ఎంట్రీల నాణ్యతను పెంపొందించింది. అలాగే భారత చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై అవగాహనను పెంచింది.
విదేశాల్లో ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు మొదటిసారి ఈ పోటీల్లో పాల్గొన్నాయి. 18 దేశాల్లో ఉన్న 91 పాఠశాలలకు చెందిన 28,005 మంది విద్యార్థులు తమ ఎంట్రీలను సమర్పించారు. భారత దేశ పరాక్రమాన్ని, జాతీయ స్ఫూర్తి గాథలను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయడంలో, ఈ కార్యక్రమ పరిధిని అంతర్జాతీయ స్థాయికి చేర్చడంలో సాధించిన ముఖ్యమైన విజయాన్ని ఇది సూచిస్తుంది.
ప్రాంతీయ స్థాయి కార్యక్రమాలను పాఠశాలల నిర్వహించగాు, జాతీయ స్థాయి చర్చలను శౌర్య పురస్కార గ్రహీతలు (ఆఫ్లైన్, ఆన్లైన్ రెండింటిలో) చేపట్టారు. మైగవ్ పోర్టల్ ద్వారా ఉత్తమ ఎంట్రీలను సమర్పించారు. 2025 నవంబర్ 10న పాఠశాల స్థాయి పోటీలు పూర్తయ్యాయి. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో మూల్యాంకనం పూర్తయిన అనంతరం దాదాపు 4,020 ఎంట్రీలు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాయి. వాటిలో 100 ఉత్తమ ఎంట్రీలను సూపర్ - 100 విజేతలుగా ఎంపిక చేశారు. గెలుపొందిన వారిని రక్షణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా న్యూఢిల్లీలో సత్కరిస్తాయి. ప్రతి విజేతకు రూ.10,000 నగదు బహుమతితో పాటు విశిష్ట అతిథులుగా కర్తవ్యపథ్లో జరిగే గణతంత్ర దినోత్సవాలు-2026ను వీక్షించే అవకాశం లభిస్తుంది.
ఈ వంద మంది విజేతలతో పాటుగా రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో 8 మందిని (ప్రతి విభాగం నుంచి ఇద్దరు చొప్పున), జిల్లా స్థాయిలో నలుగురిని (విభాగానికి ఒకరు చొప్పున) ఎంపిక చేసి రాష్ట్ర/కేంద్రపాలిత/జిల్లా అధికారులు సత్కరిస్తారు.
75 ఏళ్ల స్వాతంత్ర్యానికి గుర్తుగా నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రాజెక్ట్ వీర్ గాథ కార్యక్రమాన్ని 2021లో ప్రారంభించారు. శౌర్య పురస్కార గ్రహీతలు చేసిన సాహసాలు, వారి జీవిత కథల గురించి అవగాహన కల్పించడమే ప్రధానోద్దేశంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. విద్యార్థుల్లో దేశభక్తి, పౌర విలువలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. మొదటి విడత నుంచి అయిదో విడత వరకు ప్రాజెక్టు వీర గాథ స్ఫూర్తిదాయక ఉద్యమంగా మారింది. విదేశాల్లో ఉన్న భారతీయ పాఠశాలలకు కూడా చేరుకుంది.
ప్రాజెక్టు వీర్ గాథ ప్రారంభమైన నాటి నుంచి గణనీయమైన వృద్ధిని సాధించింది. మొదటి రెండు సంచికల్లో 25 మంది చొప్పున జాతీయ విజేతలను ఎంపిక చేశారు. మొదటి సంచికలో సుమారు 8 లక్షల మంది విద్యార్థులు పాల్గొనగా రెండో సంచికలో దాదాపు 19 లక్షల మంది పాల్గొన్నారు. మూడో సంచికలో 100 మంది జాతీయ విజేతలను ఎంపిక చేయగా 1.36 కోట్ల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీర్ గాథ 4.0 నాటికి ఈ సంఖ్య 1.76 కోట్లకు చేరుకుంది.
***
(रिलीज़ आईडी: 2212669)
आगंतुक पटल : 16