కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
బెంగళూరులో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ) ఆధ్వర్యంలో “నివేశక్ శిబిరం”
प्रविष्टि तिथि:
06 JAN 2026 12:48PM by PIB Hyderabad
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ), భారత సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ), మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ (ఎంఐఐఎస్)తో కలిసి 2026 జనవరి 3న బెంగళూరులో “నివేశక్ శిబిరం” కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం కర్ణాటక బెంగళూరులోని యశ్వంత్పూర్ గోపాల్ థియేటర్ సమీపంలో ఉన్న శ్రీ వై. మునిస్వామప్ప కళ్యాణ మండపం 17 వద్ద జరిగింది. పెట్టుబడిదారులు తమకు సంబంధించిన క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లు, పెండింగ్లో ఉన్న ఐఈపీఎఫ్ఏ క్లెయిమ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు సమగ్ర వేదికగా ఈ శిబిరం నిలిచింది.

ఈ ఒక్కరోజు శిబిరానికి కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిది. ఫిర్యాదుల పరిష్కారం, క్లెయిమ్ల సదుపాయం, పెట్టుబడిదారుల సేవల సహాయానికి ఒకే చోట పరిష్కార వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఐఈపీఎఫ్ఏ, సెబీ, ఎంఐఐలు, రిజిస్ట్రార్లు, ట్రాన్స్ఫర్ ఏజెంట్ల (ఆర్టీఏలు) నుంచి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐఈపీఎఫ్ఏ సీఈఓ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త సెక్రటరీ శ్రీమతి అనితా షా అకెల్లా, సెబీ చీఫ్ జనర్ మేనేజర్ శ్రీ కృష్ణానంద్ రాఘవన్, సెబీ జనరల్ మేనేజర్ శ్రీ వినోద్ శర్మ, ఐఈపీఎఫ్ఏ జనరల్ మేనేజర్ లెఫ్టినెంట్ కల్నల్ ఆదిత్య సిన్హా, సీడీఎస్ఎల్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సీఎస్ హరీషా, బీఎస్ఈ ప్రతినిధి శ్రీ వినయ్ కుమార్ తోపాటు సెబీ, ఐఈపీఎఫ్ఏ, ఎంఐఐ, ఆర్ టీఏకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.

పెట్టుబడిదారుల్లో అవగాహనను పెంపొందించి, క్లెయిమ్లను సులభంగా, వేగంగా పరిష్కరించేందుకు “ఐఈపీఎఫ్ఏ క్లెయిమ్స్, పెట్టుబడిదారుల సేవలకు పూర్తి మార్గదర్శి’’ పేరుతో ఓ వివరణాత్మక పుస్తకాన్ని ఐఈపీఎఫ్ఏ ఈ సందర్భంగా విడుదల చేసింది.
బెంగళూరు, సమీప ప్రాంతాల నుంచి 900కు పైగా పెట్టుబడిదారులు, క్లెయిమ్దారులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. ప్రత్యక్ష సౌకర్యం, అక్కడికక్కడే సహాయం అందించడం ద్వారా పెట్టుబడిదారుల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ శిబిరం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.

పుణే, హైదరాబాద్, జైపూర్, అమృత్సర్లలో విజయవంతంగా నిర్వహించిన తర్వాత పెట్టుబడిదారులే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చిన తదుపరి నగరంగా బెంగళూరు నిలిచింది. దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా, పారదర్శకంగా సులభంగా అందుబాటులో ఉండే ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ఐఈపీఎఫ్ఏ నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది.
నివేశక్ శిబిరం ద్వారా ఆరు నుంచి ఏడు సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్న క్లెయిమ్ చేయని డివిడెండ్లు, షేర్లను ప్రత్యక్షంగా సులభతరం చేసింది. అలాగే అక్కడికక్కడే కేవైసీ, నామినేషన్ అప్డేట్లను పూర్తి చేయడంతోపాటు, పెండింగ్లో ఉన్న ఐఈపీఎఫ్ఏ క్లెయిమ్ సమస్యలను పరిష్కరించింది. పెట్టుబడిదారులు నేరుగా అధికారులను సంప్రదించేందుకు, మధ్యవర్తులను తొలగిచేందుకు వాటాదారుల సంస్థలు, ఆర్ టీఏలు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశాయి.
కంపెనీ ప్రతినిధులు, ఆర్ టీఏలు, ఐఈపీఎఫ్ఏ, సెబీ అధికారులతో ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా వందలాది మంది లబ్ధి పొందారు. సాధారణంగా నెలలు పట్టే ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా అందించిన ఈ కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రశంసలు లభించాయి.
దేశ వ్యాప్తంగా క్లెయిమ్ చేయని పెట్టుబడులు అధికంగా ఉన్న నగరాలను కేంద్రంగా చేసుకుని ఐఈపీఎఫ్ఏ చేపట్టిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా బెంగళూరులో నివేశక్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాలు పెట్టుబడిదారుల్లో అవగాహనను పెంపొందించడం, వారి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడం, దేశ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం, పారదర్శకతను బలోపేతం చేయడంలో ఐఈపీఎఫ్ఏ చేస్తున్న నిరంతర కృషికి నిదర్శనం.
కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఐఈపీఎఫ్ఏ).. నిరంతర ప్రచార కార్యక్రమాలు, విద్య, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా పెట్టుబడిదారుల అవగాహన, రక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2211932)
आगंतुक पटल : 12