వ్యవసాయ మంత్రిత్వ శాఖ
స్వయం సమృద్ధి గ్రామాలకు పునాది వేయనున్న వికసిత్ భారత్- జీ రామ్ జీ చట్టం
ఈరోడ్ లో రైతులు, కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
కార్మికులు, శ్రామికులకు ఉద్దేశించిన నిధులను ఎవరూ దుర్వినియోగం చేయడానికి అనుమతించబోం: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఎరోడ్లో పసుపు పరీక్షల కోసం ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని ఐసీఏఆర్కు ఆదేశం
प्रविष्टि तिथि:
05 JAN 2026 7:04PM by PIB Hyderabad
తమిళనాడులోని ఈరోడ్ లో సోమవారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సమృద్ధి గ్రామాలను నిర్మించడంలో ‘వికసిత్ భారత్ – జీ రామ్ జీ’ కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఈ ప్రతిష్ఠాత్మక పథకంలోని వివిధ నిబంధనలను కేంద్రమంత్రి వివరించారు. ఈ చట్టం ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పనను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాలను విస్తరించడం, స్వయం సమృద్ధిని ప్రోత్సహించడానికి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అభివృద్ధి చెందిన, సంపన్న గ్రామాల లక్ష్యం నెరవేరుతుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు.
గతంలో అమలులో ఉన్న ఎంజీఎన్ఆర్ఈఏ పథకం 100 రోజుల ఉపాధికి హామీ ఇచ్చిందని.. కానీ చాలా చోట్ల రైతులకు, కార్మికులకు సమయానికి పని దొరికేది కాదని కేంద్రమంత్రి విమర్శించారు. పని చేసిన తర్వాత వేతనాలు చెల్లించడంలో కూడా తీవ్రమైన జాప్యం జరిగేదని పేర్కొన్నారు. దీనిని తీవ్రమైన సమస్యగా పేర్కొంటూ.. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి, అవినీతిని నిర్మూలించడానికి ప్రభుత్వం ‘వికసిత్ భారత్ -జీ రామ్ జీ’ చట్టం ద్వారా కీలక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.
కొత్త చట్టం ద్వారా కార్మికుల హక్కులను కాపాడటమే కాకుండా, వారి ఆర్థిక భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి వివరించారు. ఉపాధి హామీ పని దినాలను ఏడాదికి 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు చెప్పారు. నిర్ణీత కాలపరిమితిలోగా పని కల్పించలేకపోతే, కార్మికులకు నిరుద్యోగ భృతి లభిస్తుందన్నారు. వేతనాల చెల్లింపులో 15 రోజుల కంటే ఎక్కువ జాప్యం జరిగితే కార్మికులకు అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బందికి జీతాలు సకాలంలో అందేలా, వ్యవస్థను బలోపేతం చేయడం కోసం పరిపాలనా వ్యయాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచినట్లు శ్రీ చౌహాన్ పేర్కొన్నారు.
కొత్త చట్టం కింద గ్రామాలకు పూర్తి స్వేచ్ఛను కల్పించినట్లు, గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో గ్రామసభలే స్వయంగా నిర్ణయిస్తాయని కేంద్రమంత్రి అన్నారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ఇకపై చెన్నైలోనో లేదా ఢిల్లీలోనో కాకుండా.. గ్రామ స్థాయిలోనే తీసుకుంటారని స్పష్టం చేశారు.
కొందరు ఈ పథకం గురించి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కార్మికులకు, కూలీలకు అందాల్సిన డబ్బు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమవుతాయని తెలిపారు. అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఉండేలా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ పథకంలో మార్పులు తీసుకువచ్చారని ఆయన పేర్కొన్నారు.
ఈరోడ్లో పసుపు నాణ్యత పరీక్షా ప్రయోగశాల ఏర్పాటు
ఈరోడ్లోని ప్రసిద్ధ పసుపు మార్కెట్ను సందర్శించిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్.. అక్కడ పుసుపు పండించే రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పసుపు నాణ్యతను పరీక్షించడానికి ‘పసుపు నగరం’లో ఓ అత్యాధునిక పరీక్షా ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి తక్షణ చర్యలు చేపట్టాలని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కు తగినన ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రయోగశాల ద్వారా పసుపు నాణ్యత పరీక్షలు, ధ్రువీకరణ, అందుబాటులోకి వస్తాయని.. దీనివల్ల రైతులకు తమ పంటకు మార్కెట్లో మెరుగైన ధర లభిస్తుందని చెప్పారు.
ఈరోడ్లో జాతీయ పసుపు బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. నిజానికి పసుపు బోర్డు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చినప్పటికీ.. వ్యవసాయశాఖ మంత్రిగా తాను వ్యక్తిగతంగా ఈ విషయంలో చొరవ తీసుకొని సంబంధిత శాఖతో మాట్లాడి ఈ కార్యాలయం ఏర్పాటయ్యేలా చూస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. దీనివల్ల పసుపు రైతులకు విధానపరమైన మద్దతు, మెరుగైన మార్కెట్ సౌకర్యం, కొత్త ఎగుమతి అవకాశాలు లభిస్తాయని అన్నారు.
ఈరోడ్ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ అవసరమని కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వీటిని ఏర్పాటు చేయవచ్చని, ఇందుకోసం ఆర్కేవీయూ (రాష్ట్రీయ కృషి వికాస్ యోజన) నిధులను వినియోగించుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. అక్రమ మార్గాల్లో వస్తున్న పసుపును అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పసుపు రైతుల సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారాలు కనుగొనడానికి ఢిల్లీలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయానికి నాణ్యమైన విత్తనమే పునాది అని పేర్కొంటూ.. ఐసీఏఆర్ ద్వారా మెరుగైన విత్తన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని తెలిపారు.
మహిళా రైతులతో ముఖాముఖి
వ్యవసాయ రంగంలో జరుగుతున్న ఆవిష్కరణలను కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించే 100 కి పైగా స్టాళ్లను ఆయన సందర్శించారు. వారి ఉత్పత్తుల నాణ్యత, భవిష్యత్తు అవకాశాల గురించి రైతులు, పారిశ్రామికవేత్తలతో సంభాషించారు. సుమారు 1,000 మందికి పైగా మహిళా రైతులు, వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను, అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలలో కూడా ఆయన పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 2211642)
आगंतुक पटल : 43