మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పీఎం-యువ 3.0 ఫలితాల ప్రకటన: ఇంగ్లీషుతో సహా 22 భారతీయ భాషల్లో 43 మంది యువ రచయితల ఎంపిక
प्रविष्टि तिथि:
30 DEC 2025 3:10PM by PIB Hyderabad
విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ బుక్ ట్రస్టు, ఇండియా అమలు చేసిన యువ రచయితలకు మార్గదర్శకత్వం అందించే ప్రధానమంత్రి పథకం (పీఎం-యువ 3.0) ఫలితాలు ఎన్బీటీ-ఇండియా వెబ్సైట్లో విడుదలయ్యాయి. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020కు అనుగుణంగా.. తమ రచనలు, ఆలోచనలతో దేశ నిర్మాణానికి సహకారం అందించేలా యువ రచయితలను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం.
దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల ద్వారా 30 ఏళ్లు లోపు వయసున్న 43 మంది యువ రచయితల పుస్తక ప్రతిపాదనలను ఈ సంచికలో ఎంపిక చేశారు. ఇంగ్లీషుతో సహా 22 భారతీయ భాషల్లో ఈ పోటీలను నిర్వహించారు. అవి అస్సామీస్, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, మలయాళం, మణిపురి, మరాఠీ, మైథిలీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సంతాలీ, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ. దేశవ్యాప్తంగా సమగ్ర సాహిత్యాభివృద్ధిని ప్రోత్సహించాలన్న ఈ పథకం లక్ష్యాన్ని ఈ విస్తృత భాషా భాగస్వామ్యం తెలియజేస్తుంది. ఎంపికైన 43 మంది రచయితల్లో 19 మంది మహిళలు, 24 మంది పురుషులు ఉన్నారు.
ఎంపిక చేసిన ప్రతిపాదనలను ప్రముఖ విద్యావేత్తల మార్గదర్శకత్వంలో ఆరు నెలల వ్యవధిలో పుస్తకాలుగా అభివృద్ధి చేయాలి. ఎంపికైన రచయితకు నెలకు రూ.50,000 చొప్పున ఉపకార వేతనం లభిస్తుంది. ప్రచురితమైన వారి పుస్తకానికి 10 శాతం జీవితకాలం రాయల్టీ లభిస్తుంది.
పీఎం-యువ 3.0 ఇతివృత్తాలు: దేశ నిర్మాణానికి భారతీయ సంతతి అందిస్తున్న సహకారం, భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఆధునిక భారత నిర్మాతలు (1950-2025). చరిత్ర, సంస్కృతి, సైన్సు, ఫిలాసఫీ, పాలన, సామాజిక సంస్కరణ, అంతర్జాతీయంగా భారత భాగస్వామ్యం ద్వారా దేశం గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును ఈ నాన్-ఫిక్షన్ రచనలు ప్రతిబింబిస్తాయి.
త్వరలో నిర్వహించబోయే న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ (2026 జనవరి 10-18)లో ఎంపికైన రచయితలతో జాతీయ శిబిరాన్ని నిర్వహిస్తారు. పీఎం-యువ 3.0 ద్వారా తొలిసారిగా రూపొందించే పుస్తకాలను వచ్చే ఏడాది ప్రచురిస్తారు. దేశ విదేశాల్లో భారతీయ సాహిత్యానికి, ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త తరం రచయితలను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం.
***
(रिलीज़ आईडी: 2209835)
आगंतुक पटल : 3