ప్రధాన మంత్రి కార్యాలయం
17వ భారత సహకార సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
प्रविष्टि तिथि:
01 JUL 2023 2:46PM by PIB Hyderabad
కేబినెట్ సహచరులు శ్రీ అమిత్ షా, జాతీయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీ దిలీప్ సంఘాని, డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్, దేశ నలుమూలల నుంచి విచ్చేసిన సహకార సంఘాల సభ్యులందరూ, రైతు సోదరీసోదరులు, ఇతర ప్రముఖులు, మహిళలు, పెద్దలందరికీ నమస్కారం! 17వ భారత సహకార సదస్సు సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు! ఈ సదస్సుకు మీకు సాదర స్వాగతం!
మిత్రులారా,
నేడు మన దేశం అభివృద్ధి చెందిన, స్వావలంబన భారత్ లక్ష్యం దిశగా పయనిస్తోంది. మన లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని నేను ఎర్రకోట నుంచి ప్రకటించాను. సమష్టి కృషి అనే సందేశాన్ని సహకార స్ఫూర్తి చాటి చెబుతుంది. పాల ఉత్పత్తిలో ఇవాళ మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండటానికి, డైరీ సహకార సంఘాలు ఎంతో కృషి చేశాయి. ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి. ఇందులోనూ సహకార సంఘాల పాత్ర కీలకమైనది. దేశవ్యాప్తంగా చిన్న రైతులకు సహకార సంఘాలు ప్రధానంగా ఊతమిచ్చాయి. ముఖ్యంగా డైరీ వంటి సహకార రంగాల్లో మన తల్లులు, అక్కాచెల్లెళ్ల భాగస్వామ్యం సుమారు 60 శాతం ఉంది. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు సహకార రంగానికి ప్రాధాన్యతనివ్వాలని మేం నిర్ణయించుకున్నాం. అమిత్ షా చెప్పినట్లుగా మొదటిసారిగా మేం సహకార శాఖకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, బడ్జెట్ను కేటాయించాం. కార్పొరేట్ రంగానికి అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలు, వేదికలు సహకార సంఘాలకూ కల్పిస్తున్నాం. సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు పన్ను రేట్లను తగ్గించాం. ఈ రంగంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నాం. సహకార బ్యాంకులను కూడా మా ప్రభుత్వం బలోపేతం చేసింది. ఈ బ్యాంకులు కొత్త శాఖలను ప్రారంభించటానికి, ప్రజలకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించటానికి వీలుగా నిబంధనలను సరళతరం చేశాం.
మిత్రులారా,
ఈ కార్యక్రమంలో మన రైతు సోదరీసోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 9 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణల ద్వారా వచ్చిన మార్పులను మీరు ప్రత్యక్షంగా గమనిస్తున్నారు. 2014 కంటే ముందు రైతులు ఎదుర్కొన్న సమస్యలు, చేసిన డిమాండ్లు మీకు గుర్తుండే ఉంటాయి. అప్పట్లో ప్రభుత్వాల నుంచి అందే సాయం చాలా తక్కువని, అది కూడా మధ్యవర్తుల పాలవుతోందని రైతులు ఫిర్యాదు చేసేవారు. దేశంలోని చిన్న, మధ్యకారు రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేవి కాదు. కానీ, 9 ఏళ్లలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇవాళ కోట్ల మంది చిన్న రైతులకు నేరుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందుతోంది. ఇప్పుడు మధ్యవర్తుల ప్రమేయమే కాదు.. నకిలీ లబ్దిదారులకు తావు లేదు! గత నాలుగేళ్లలో ఈ పథకం కింద రూ. 2.5 లక్షల కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశాం. మీరంతా సహకార రంగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ గణాంకాలను మీరు నిశితంగా గమనిస్తారని ఆశిస్తున్నాను. మరో గణాంకంతో దీన్ని పోల్చి చెబితే, ఇది ఎంత పెద్ద మొత్తమో మీకు అర్థమవుతుంది. 2014కు ముందు ఐదేళ్ల మొత్తం వ్యవసాయ బడ్జెట్ రూ. 90 వేల కోట్ల కంటే తక్కువే! అప్పట్లో వ్యవసాయ సంబంధిత వ్యవస్థపై దేశం ఖర్చు చేసిన దానికంటే దాదాపు 3 రెట్లు ఎక్కువ మొత్తాన్ని కేవలం ఒకే ఒక్క పథకం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి మేం ఖర్చు చేశాం.
మిత్రులారా,
ప్రపంచవ్యాప్తంగా ఎరువులు, రసాయనాల ధరలు పెరుగుతున్నప్పటికీ, మన రైతులపై ఆ భారం పడకుండా చూస్తామని మోదీ హామీ ఇస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీకు ఈ గ్యారెంటీ ఇచ్చింది. మన రైతులకు ఈరోజు ఒక బస్తా యూరియా రూ. 270 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. అదే బస్తా యూరియా బంగ్లాదేశ్లో రూ. 720, పాకిస్తాన్లో రూ. 800, చైనాలో రూ. 2100 ధర పలుకుతోంది. సోదరీసోదరులారా, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలోనూ యూరియా బస్తాను రైతులు రూ. 3,000పైగా వెచ్చించి కొంటున్నారు. బహుశా నేను చెప్పే విషయం మీకు అర్థం కావడం లేదనుకుంటాను. ఈ తేడాను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. అసలు గ్యారెంటీ అంటే ఏమిటి? రైతు జీవితాన్ని మార్చటానికి ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో ఇది తెలియజేస్తుంది. గత 9 ఏళ్లలో కేవలం ఎరువుల సబ్సిడీ కోసమే బీజేపీ ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. దీనికంటే పెద్ద గ్యారెంటీ మరొకటి ఉంటుందా?
మిత్రులారా,
మొదట్నుంచి పంటలకు గిట్టుబాటు ధర అందించాలని మా ప్రభుత్వం భావించింది. గత 9 ఏళ్లలో ఎంఎస్పీ పెంచడం ద్వారా రూ.15 లక్షల కోట్లకు పైగా రైతులకు లబ్ధి చేకూరింది. మీరు లెక్కించి చూస్తే, కేంద్ర ప్రభుత్వం ఏటా వ్యవసాయానికి, రైతులకు రూ. 6.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. అంటే ప్రభుత్వం ఏటా, ప్రతి రైతుకు ఏదో ఒక రూపంలో సగటున రూ. 50 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. బీజేపీ ప్రభుత్వంలో రైతులకు ఏటా పలు మార్గాల ద్వారా రూ. 50 వేలు అందుతాయనే గ్యారెంటీ ఉంది. ఇది మోదీ గ్యారెంటీ. ఇవి కేవలం వాగ్దానాలు కాదు.. ఇప్పటికే మేం చేసి, చూపిించిన వాటి గురించి నేను మాట్లాడుతున్నా.
మిత్రులారా,
రైతులకు అనుకూల విధానాల్లో భాగంగా కొన్ని రోజుల కిందట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 3,70,000 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. చెరకు రైతులకు గిట్టుబాటు ధరను రికార్డు స్థాయిలో క్వింటాలుకు రూ. 315కు పెంచింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికిపైగా చెరుకు రైతులకు, చక్కెర మిల్లుల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది.
మిత్రులారా,
దేశంలోని గ్రామాలు, రైతుల సామర్థ్యాన్ని మరింత పెంపొందించటానికి అమృత కాలంలో సహకార రంగం కీలక పాత్ర పోషించనుంది. అభివృద్ధి చెందిన భారత్, స్వావలంబన భారత్ తీర్మానానికి ప్రభుత్వం, సహకార రంగాలు కలిసి రెట్టింపు శక్తినిస్తాయి. డిజిటల్ ఇండియా ద్వారా పారదర్శకతను పెంచి, ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం నేరుగా ప్రయోజనాలను అందించింది. ఉన్నత స్థాయిల్లో అవినీతి, బంధుప్రీతి అంతమయ్యాయని దేశంలోని నిరుపేదలు సైతం నమ్ముతున్నారు. సహకార రంగానికి ప్రోత్సాహం లభిస్తున్న తరుణంలో సామాన్యులు, రైతులు, పశుపోషకులు కూడా దైనందిన జీవితంలో ఈ మార్పులను గమనించి, విశ్వసించాల్సిన అవసరం ఉంది. పారదర్శకతకు, అవినీతి రహిత పాలనకు సహకార రంగం ఒక నమూనాగా మారడం అత్యవసరం. దేశంలోని సహకార సంస్థలపై సాధారణ పౌరులకు నమ్మకం మరింత బలపడాలి. అది సాధ్యం కావాలంటే సహకార రంగంలో డిజిటల్ వ్యవస్థను వీలైనంత ఎక్కువగా ప్రోత్సహించాలి. నగదు లావాదేవీలపై ఆధారపడటాన్ని తగ్గించాలి. దీనికోసం సహకార రంగం ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలి. మీ కోసం నేను ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, కీలకమైన పనిని పూర్తి చేశాను. ఇప్పుడు మీరు కూడా డిజిటల్, నగదు రహిత లావాదేవీల ద్వారా పూర్తి పారదర్శకతతో అంతే కీలకమైన బాధ్యతను నిర్వర్తించండి. మనమంతా కలిసి కృషి చేస్తే, ఖచ్చితంగా అతి త్వరలోనే విజయం సాధిస్తాం. డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచ గుర్తింపును పొందింది. ఈ నేపథ్యంలో సహకార సంఘాలు, సహకార బ్యాంకులు కూడా ముందుండాలి. దీనివల్ల పారదర్శకతతో పాటు మార్కెట్లో మీ పనితీరు మెరుగుపడి, పోటీని ఎదుర్కోవటం సాధ్యమవుతుంది.
మిత్రులారా,
ప్రాథమిక స్థాయి సహకార సంఘాలలో అత్యంత కీలకమైన పీఏసీఎస్.. ఇకపై పారదర్శకతకు, ఆధునికతకు నమూనాగా మారనున్నాయి. ఇప్పటివరకు 60 వేలకు పైగా పీఏసీఎస్ల కంప్యూటరీకరణ పూర్తయింది. ఇందుకు నా అభినందనలు. సహకార సంఘాలు కూడా తమ పనితీరును మెరుగుపరుచుకోవటం, సాంకేతిక పరిజ్ఞానం వాడకంపై దృష్టి సారించటం ఎంతో ముఖ్యం. సహకార సంఘాలు అన్ని స్థాయిల్లో కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను అవలంబించినప్పుడు, సభ్యులందరూ 100 శాతం ఆన్లైన్ లావాదేవీలను నిర్వహించిప్పుడు, దేశానికి ఎంతో మేలు జరుగుతుంది.
మిత్రులారా,
ఎగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డులను సృష్టించటం మీరు చూస్తున్నారు. మేక్ ఇన్ ఇండియాపై నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఎగుమతుల రంగంలో సహకార సంఘాల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ లక్ష్యంతోనే ప్రత్యేకంగా తయారీ రంగానికి సంబంధించిన సహకార సంఘాలను మేం ప్రోత్సహిస్తున్నాం. వాటిపై ఉండే పన్నులను కూడా చాలావరకు తగ్గించాం. ఎగుమతులను పెంచడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా పాల ఉత్పత్తి రంగంలో సహకార సంఘాలు ప్రశంసనీయమైన పనితీరును కనబరుస్తున్నాయి. పాలపొడి, వెన్న, నెయ్యి భారీ పరిమాణంలో ఎగుమతి అవుతున్నాయి. తేనె ఉత్పత్తి రంగంలోనూ సహకార సంఘాలు ప్రారంభమవుతున్నాయి. గ్రామాలు, గ్రామీణ ప్రాంతాల్లో శక్తికి కొదవ లేదు. కానీ దృఢ నిశ్చయంతో మనం ముందుకు సాగాలి. భారతదేశంలో తృణధాన్యాలు, ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ అన్న'గా గుర్తింపు పొందిన మిల్లెట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వీటి కోసం ప్రపంచవ్యాప్తంగా కొత్త మార్కెట్ తయారవుతోంది. ఇటీవల నేను అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి అధ్యక్షుడు ఇచ్చిన విందులో కూడా వివిధ రకాల 'శ్రీ అన్న' వంటకాలున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నాం. సహకార సంఘాల మిత్రులు మన దేశ ఆహార ధాన్యాలను ప్రపంచ మార్కెట్కు తీసుకెళ్లేందుకు కృషి చేయలేరా? దీనివల్ల చిన్న రైతులకు ఆదాయ వనరు లభిస్తుంది. పోషక విలువలతో కూడిన ఆహారం విషయంలో ఒక కొత్త సంప్రదాయానికి ఇది నాంది పలుకుతుంది. ప్రభుత్వ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ మీరు దిశగా కృషి చేయాలి.
మిత్రులారా,
సంకల్ప బలంతో ఎంత పెద్ద సవాళ్లనైనా ఎదుర్కోవచ్చని కొన్నేళ్లుగా మనం నిరూపించాం. ఉదాహరణకు, చెరకు సహకార సంఘాల గురించే మాట్లాడుకుందాం. ఒకప్పుడు చెరుకు రైతులకు తక్కువ ఆదాయం వచ్చేది. పైగా ఆ డబ్బు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండేది. చెరకు ఉత్పత్తి పెరిగినా, తగ్గినా రైతులకు కష్టమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. దీంతో సహకార సంఘాలపై చెరకు రైతులకు నమ్మకం సన్నగిల్లింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించటంపై మేం దృష్టి సారించాం. చెరకు రైతుల పాత బకాయిలను చెల్లించటానికి చక్కెర మిల్లులకు రూ. 20 వేల కోట్ల ప్యాకేజీని మేం అందించాం. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసి, పెట్రోల్లో ఇథనాల్ను కలపటంపై మేం ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఒక్కసారి ఊహించండి. గత 9 ఏళ్లలో చక్కెర మిల్లుల నుంచి రూ.70 వేల కోట్ల విలువైన ఇథనాల్ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇది రైతులకు చక్కెర మిల్లులు సకాలంలో చెల్లింపులు చేసేందుకు సహాయపడింది. గతంలో చెరకుకు ధర ఎక్కువగా చెల్లిస్తే పన్ను విధించేవారు. మా ప్రభుత్వం ఆ పన్నును రద్దు చేసింది. దీనివల్ల దశాబ్దాలుగా ఉన్న పన్ను సంబంధిత సమస్యలు పరిష్కారమయ్యాయి. ఈ ఏడాది బడ్జెట్లోనూ పాత క్లెయిమ్లను పరిష్కరించుకోవటానికి సహకార చక్కెర మిల్లులకు రూ. 10,000 కోట్ల ప్రత్యేక సాయాన్ని అందించాం. ఈ ప్రయత్నాలన్నీ శాశ్వత మార్పులను తీసుకొస్తూ, చెరకు రంగంలోని సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నాయి.
మిత్రులారా,
మనం ఎగుమతులను పెంచుకుంటూనే, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి. ఆహార ధాన్యాల విషయంలో భారతదేశం స్వయంసమృద్ధిని సాధించిందని మనం తరచుగా చెబుతుంటాం. కానీ వాస్తవమేంటి? కేవలం గోధుమలు, వరి, చక్కెరలో స్వయంసమృద్ధి సాధిస్తే సరిపోదు. మనం ఆహార భద్రత గురించి మాట్లాడేటప్పుడు కేవలం గోధుమలు, బియ్యానికే పరిమితం కాకూడదు. మీకు కొన్ని విషయాలను గుర్తు చేయాలనుకుంటున్నాను. రైతు సోదరీసోదరులారా, మనం మేల్కోవాలి! మీకు ఒక విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. వంట నూనెలు, పప్పుధాన్యాలు, చేపల ఆహారం, ఆహార రంగంలోని ఇతర ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల దిగుమతికి ఏటా రూ. 2 నుంచి 2.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ డబ్బు విదేశాలకు వెళ్తోంది. ఇంత మొత్తాన్ని మనం విదేశాలకు పంపాల్సి వస్తోంది. వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన భారతదేశానికి ఇది సరైనదేనా? ఇంతటి అపారమైన అవకాశాలున్న సహకార రంగానికి నాయకత్వం వహిస్తున్న వారంతా నా ముందున్నారు. మనం ఒక విప్లవాత్మక దిశగా అడుగులు వేయాలని ఆశిస్తున్నాను. ఈ డబ్బు భారతీయ రైతుల జేబుల్లోకి వెళ్లాలా? లేక విదేశాలకు వెళ్లాలా?
మిత్రులారా,
మనదేశంలో అపారమైన చమురు లభ్యత లేకపోవటం వల్ల పెట్రోల్, డీజిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అది మనకు ఒక అనివార్యత. వంట నూనెల విషయంలో మాత్రం మనం స్వయంసమృద్ధి సాధించవచ్చు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ పామ్ ఆయిల్ వంటి కార్యక్రమాలతో మిషన్ మోడ్లో పనిచేస్తోందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. మనం పామాయిల్ సాగును ప్రోత్సహించాం. తద్వారా మనమే నూనెను ఉత్పత్తి చేసుకోవచ్చు. నూనెగింజల సాగును పెంచటానికి అనేక చర్యలు చేపడుతున్నాం. దేశంలోని సహకార సంస్థలు ఈ బాధ్యతను తీసుకుంటే అతి త్వరలోనే మనం వంట నూనెల విషయంలో స్వయంసమృద్ధి సాధించగలమని విశ్వసిస్తున్నాను. రైతుల్లో అవగాహన కల్పించటం నుంచి ప్లాంటేషన్, సాంకేతికత, కొనుగోలుకు సంబంధించిన సమాచారం, సౌకర్యాలను అందించే వరకు మీరు ఎన్నో పనులను చేయవచ్చు.
మిత్రులారా,
మత్స్య రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక ముఖ్యమైన పథకాన్ని ప్రారంభించింది. పీఎం మత్స్య సంపద యోజన ద్వారా చేపల ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నదులు, చిన్న చెరువుల ద్వారా గ్రామస్తులు, రైతులు ఈ పథకంతో అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ పథకం ద్వారా స్థానిక స్థాయిలోనే చేపల కోసం ఆహార ఉత్పత్తికి కూడా సహాయం అందిస్తున్నారు. ఇవాళ మత్స్య రంగంలో 25 వేలకు పైగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఫలితంగా చేపల ప్రాసెసింగ్, ఎండబెట్టటం, నిల్వ చేయటం, నిల్వ కేంద్రాలు, డబ్బాల్లో ప్యాక్ చేయటం, రవాణా వంటి కార్యకలాపాలన్నీ వ్యవస్థీకృత పద్ధతిలో బలోపేతమయ్యాయి. ఇది మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే కాక ఉపాధిని కూడా పెంచింది. గత 9 ఏళ్లలో స్థానిక మత్స్య సంపద రెట్టింపైంది. ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినప్పుడు ఎలాగైతే కొత్త శక్తి పుట్టుకొచ్చిందో, అలాగే మత్స్య రంగానికీ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలనే డిమాండ్ చాలా కాలంగా ఉండేది. మేం ఆ శాఖను కూడా ఏర్పాటు చేశాం. దానికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాం. దీని ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని సహకార రంగం ఎలా విస్తరించగలదో, ఆలోచించేందుకు మీరంతా ముందుకు రావాలి. నేను మీ నుంచి దీన్ని ఆశిస్తున్నాను. పాత పద్ధతులను దాటి సహకార రంగం కొత్తగా ఏదైనా చేయాల్సి ఉంది. తన వంతుగా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు చేపల పెంపకం వంటి అనేక రంగాల్లో పీఏసీఎస్ పాత్ర పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2 లక్షల కొత్త బహుళ ప్రయోజన సహకారం సంఘాలను సృష్టించే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. అమిత్ షా చెప్పినట్లుగా, అన్ని పంచాయతీలను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. దీనివల్ల ప్రస్తుతం ఈ వ్యవస్థ లేని గ్రామాలకు, పంచాయతీలకూ సహకార శక్తి చేరుతుంది.
మిత్రులారా,
గత కొన్నేళ్లుగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు.. ఎఫ్పీఓల ఏర్పాటుపైనా మేం ప్రత్యేక దృష్టి సారించాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,000 కొత్త ఎఫ్పీఓలను సృష్టించే పని కొనసాగుతోంది. ఇప్పటికే ఏర్పాటైన దాదాపు 5,000 సంఘాలు ఏర్పాటయ్యాయి. ఈ ఎఫ్పీఓలు చిన్న రైతులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తాయి. చిన్న రైతులను మార్కెట్లో ఒక పెద్ద శక్తిగా మార్చటానికి ఇవి ఒక సాధనం. విత్తనం నాటినప్పటి నుంచి పంటను మార్కెట్లో విక్రయించే వరకు ప్రతి వ్యవస్థనూ చిన్న రైతుకు అనుకూలంగా మార్చుకునేలా, మార్కెట్ శక్తులను సవాలు చేసేలా ఈ ప్రచారం భరోసానిస్తుంది. పీఏసీఎస్ ద్వారా కూడా ఎఫ్పీఓలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఈ రంగంలో సహకార సంఘాలకు అపారమైన అవకాశాలున్నాయి.
మిత్రులారా,
రైతులకు ఇతర ఆదాయ వనరులను కల్పించే విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలకు సహకార రంగం మరింత బలాన్ని చేకూర్చగలదు. తేనె ఉత్పత్తి కావచ్చు. సేంద్రీయ ఆహారం కావచ్చు. పొలాల్లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, విద్యుత్తును ఉత్పత్తి చేసే కార్యక్రమం కావచ్చు లేదా భూసార పరీక్ష కావచ్చు.. వీటన్నింటిలో సహకార రంగం తోడ్పాటు అత్యంత అవసరం.
మిత్రులారా,
రసాయన రహిత, ప్రకృతి వ్యవసాయం ఇవాళ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన అంశాలు. మన హృదయాలను కదిలించిన ఢిల్లీకి చెందిన ఆడబిడ్డలను అభినందిస్తున్నా. "నన్ను చంపవద్దు" అని భూమాత రోదిస్తూ చెబుతున్న మాటలను నాటక ప్రదర్శన ద్వారా చక్కగా వివరించి, ప్రజలను మేల్కొల్పే ప్రయత్నం చేశారు. ఇలాంటి బృందాన్ని ప్రతి సహకార సంస్థ ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ బృందాలు ప్రతి గ్రామంలోనూ ప్రదర్శనలిచ్చి ప్రజల్లో అవగాహన కల్పించి, చైతన్యపరచాలి. ఇటీవలే పీఎం-ప్రణామ్ భారీ పథకానికి ఆమోదం లభించింది. వీలైనంత ఎక్కువ మంది రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని చేసేలా ప్రోత్సహించటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. దీనిద్వారా ప్రత్యామ్నాయ ఎరువులు, సేంద్రీయ ఎరువుల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించటం వల్ల నేల సురక్షితంగా ఉండటమే కాక, రైతులకు సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇందుకోసం సహకార సంస్థల తోడ్పాటు చాలా కీలకం. ఈ ప్రచారంలో వీలైనంత ఎక్కువ సహకార సంస్థలు భాగస్వాములు కావాలని కోరుతున్నా. మీ జిల్లాలోని కనీసం 5 గ్రామాల్లో 100 శాతం రసాయన రహిత వ్యవసాయం జరిగేలా, ఆ 5 గ్రామాల్లోని ఏ పొలంలోనూ ఒక్క గ్రాము రసాయనం కూడా వాడకుండా చూడాలి. దీనివల్ల జిల్లావ్యాప్తంగా అవగాహన పెరిగి, అందరి కృషి కూడా రెట్టింపు అవుతుంది.
మిత్రులారా,
రసాయన రహిత వ్యవసాయాన్ని, రైతులకు అదనపు ఆదాయాన్నితెచ్చిపెట్టే మరొక ముఖ్యమైన మిషన్ ఉంది. అదే గోవర్ధన్ యోజన. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపదను సృష్టిస్తున్నారు. ఆవు పేడ, ఇతర వ్యర్థాల నుంచి విద్యుత్తును, సేంద్రీయ ఎరువులను తయారుచేయటానికి ఇదొక గొప్ప మార్గమైంది. ఇలాంటి ప్లాంట్ల భారీ వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే అనేక పెద్ద కంపెనీలు దేశంలో 50కి పైగా బయో-గ్యాస్ ప్లాంట్లను నిర్మించాయి. ఈ గోవర్ధన్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకార సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల పశుపోషకులకు తప్పకుండా లాభం చేకూరుతుంది. అదే సమయంలో రోడ్లపై వదిలివేసిన పశువుల వల్ల కూడా ప్రయోజనం పొందవచ్చు.
మిత్రులారా,
మీరంతా పాడి పరిశ్రమ, పశుసంవర్ధక రంగాల్లో విస్తృతంగా పనిచేస్తున్నారు. సహకార ఉద్యమంతో పెద్ద సంఖ్యలో పశుపోషకులు ముడిపడి ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిందే. జంతువులకు వచ్చే వ్యాధులు రైతును ఎంతటి చిక్కుల్లో పడేస్తాయో మీకు బాగా తెలుసు. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి చాలా కాలంగా పశువులకు తీవ్రమైన బాధను కలిగిస్తోంది. ఈ వ్యాధి కారణంగా పశుపోషకులు ఏటా వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నారు. మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దీని నివారణకు ఉచిత టీకా ప్రచారాన్ని ప్రారంభించింది. మనకు కోవిడ్ సమయంలో అందించిన ఉచిత వ్యాక్సిన్ బాగా గుర్తుంది. అదే తరహాలో పశువులకు ఉచిత టీకాలు అందించేందుకు ఈ భారీ కార్యక్రమం కొనసాగుతోంది. దీనిద్వారా ఇప్పటికే 24 కోట్ల పశువులకు టీకాలు వేశారు. అయినప్పటికీ గాలికుంటు వ్యాధి నిర్మూలన పూర్తిగా జరగలేదు. టీకా ప్రచారమైనా, పశువుల గుర్తింపైనా, సహకార సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. పాడి పరిశ్రమలో కేవలం పశుపోషకులు మాత్రమే భాగస్వాములు కాదని గుర్తుంచుకోవాలి. మిత్రులారా, నా భావాలను గౌరవించండి. పాడి పరిశ్రమలో పశుపోషకులు మాత్రమే కాదు.. పశువులు కూడా సమాన భాగస్వాములే. కాబట్టి ఈ పనిని బాధ్యతగా భావించి, మన వంతు కృషి చేయాలి.
మిత్రులారా,
ప్రభుత్వ లక్ష్యాలను విజయపథంలో నడిపించేందుకు సహకార సంస్థలకున్న శక్తి సామర్థ్యాలపై నాకు ఎటువంటి సందేహం లేదు. నా సొంత రాష్ట్రంలో సహకార రంగ ప్రభావాన్ని స్వయంగా చూశాను. స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా సహకార సంస్థలు కీలక పాత్ర పోషించాయి. అందుకే, మరో ముఖ్యమైన కార్యంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని కోరుతున్నాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలను నిర్మించాలని పిలుపునిచ్చాను. ఆ తర్వాత ఏడాదిలోపు దేశవ్యాప్తంగా సుమారు 60 వేల అమృత్ సరోవరాల నిర్మాణం జరిగింది. గత 9 ఏళ్లుగా ప్రతి ఇంటికి, ప్రతి పొలానికి తాగు, సాగు నీరు అందించటానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది కొనసాగింపు కార్యక్రమం. రైతులు, పశువులకు నీటి కొరత లేకుండా వనరులను పెంచుకోవటానికి ఇది ఉత్తమ మార్గం. అందుకే సహకార రంగంలోని మిత్రులందరూ ఈ పవిత్రమైన ఉద్యమంలో చేరాలి. మీరు సహకార రంగంలో ఏ విభాగంలో ఉన్నా, మీ శక్తి సామర్థ్యాల మేరకు ఎన్ని చెరువులు నిర్మించాలో నిర్ణయించుకోండి. అది ఒకటి, రెండు లేదా పది కావచ్చు. కానీ నీటి సంరక్షణ దిశగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయండి. ప్రతి గ్రామంలో అమృత్ సరోవరం నిర్మిస్తే, రాబోయే తరాలు మనల్ని ఎంతో కృతజ్ఞతతో గుర్తుంచుకుంటాయి. తమకు లభిస్తున్న నీరు పూర్వీకుల శ్రమ ఫలితమని గర్విస్తారు. భవిష్యత్తు తరాల కోసం మనం ఏదో ఒకటి మిగిల్చి వెళ్లాలి. నీటి సంరక్షణకు మరో ముఖ్యమైన ప్రచార కార్యక్రమం పర్ డ్రాప్ మోర్ క్రాప్. స్మార్ట్ ఇరిగేషన్పై రైతులకు అవగాహన కల్పించటం ఎంతో ముఖ్యం. ఎక్కువ నీరు ఉంటేనే ఎక్కువ పంట పండుతుందని అనుకోవడం పొరపాటు. ప్రతి గ్రామంలో సూక్ష్మ నీటి పారుదల విస్తరణకు సహకార సంఘాలు కీలక పాత్ర పోషించాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను, ప్రోత్సాహకాలను అందిస్తోంది.
మిత్రులారా,
నిల్వ సౌకర్యం కూడా ఒక ప్రధాన సమస్య. దీని గురించి అమిత్ షా సవివరంగా చెప్పారు. సరైన నిల్వ వసతులు లేకపోవటం వల్ల ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయి. ఇది దీర్ఘకాలంలో ఆహార భద్రతకు, రైతులకు ముప్పుగా పరిణమించింది. ప్రస్తుతం భారతదేశంలో పండించే ఆహార ధాన్యాల్లో 50 శాతం కంటే తక్కువ మాత్రమే నిల్వ చేయగలిగే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ పథకాన్ని తీసుకువచ్చింది. దశాబ్దాలుగా దేశంలో జరిగిన కృషి ఫలితంగా ప్రస్తుతం మన వద్ద 1400 లక్షల టన్నులకు పైగా నిల్వ సామర్థ్యం ఉంది. రాబోయే 5 ఏళ్లలో దీనికి అదనంగా మరో 50 శాతం, అంటే సుమారు 700 లక్షల టన్నుల కొత్త నిల్వ సామర్థ్యాన్ని నిర్మించాలని మేం సంకల్పించాం. ఇదొక భగీరథ ప్రయత్నం. ఇది దేశంలోని రైతుల సామర్థ్యాన్ని పెంచడమే కాక, గ్రామాల్లో నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. మొదటిసారిగా మన ప్రభుత్వం, గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత మౌలిక సదుపాయాలకు లక్ష కోట్ల రూపాయల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. గత 3 ఏళ్లలోనే దీనిద్వారా రూ. 40,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. ఇందులో సహకార సంఘాలు, పీఏసీఎస్ వాటా చాలా ఎక్కువ. వ్యవసాయ క్షేత్రాల వద్దే మౌలిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్ వంటి వ్యవస్థల నిర్మాణంలో సహకార రంగం మరిన్ని ప్రయత్నాలు చేయాలి.
మిత్రులారా,
నవ భారతంలో సహకార సంఘాలు దేశ ఆర్థిక వ్యవస్థలో శక్తివంతంగా మారతాయని నేను విశ్వసిస్తున్నాను. సహకార నమూనాను అనుసరిస్తూ, స్వయంసమృద్ధి సాధించే గ్రామాల నిర్మాణ దిశగా మనం అడుగులు వేయాలి. ఈ పరివర్తనను మరింత మెరుగుపరచాలన్న అంశంపై మీ చర్చలు అత్యంత కీలకం కానున్నాయి. సహకార సంఘాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించటంపై కూడా మనం చర్చించాలి. సహకార సంఘాలు రాజకీయ వేదికలు కాకుండా.. సామాజిక, జాతీయ విధానాలకు ప్రతిరూపాలుగా మారాలి. మీ సూచనలు దేశంలోని సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయని, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని చేరుకోవడంలో తోడ్పడతాయని నమ్ముతున్నా. మరోసారి మీ అందరి మధ్యకు వచ్చే అవకాశం లభించటాన్ని గౌరవంగా భావిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు!
ధన్యవాదాలు!
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది స్వేచ్ఛానువాదం.
***
(रिलीज़ आईडी: 2206325)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
Marathi
,
हिन्दी
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Assamese
,
Manipuri
,
Odia
,
English
,
Bengali
,
Malayalam